ఎడారి రాష్ట్రంలో స్టార్టప్ ఒయాసిస్..!!

సకల ప్రోత్సాహకాలతో త్వరలోనే రాజస్థాన్ స్టార్టప్ పాలసీ - 2016

ఎడారి రాష్ట్రంలో స్టార్టప్ ఒయాసిస్..!!

Sunday April 17, 2016,

3 min Read


దేశంలో ఇప్పుడు స్టార్ట‌ప్స్ ట్రెండ్ న‌డుస్తోంది. మేకిన్ ఇండియాలో భాగంగా అన్ని రాష్ట్రాలు స్టార్టప్ ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర్రప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, గోవా, కేర‌ళ ఇప్ప‌టికే స్టార్ట‌ప్ పాల‌సీల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా ఆ జాబితాలోకి రాజ‌స్థాన్ కూడా చేరింది. 2016కు సంబంధించి కొత్త స్టార్ట‌ప్ పాల‌సీని ప్ర‌క‌టించేందుకు ఎడారి రాష్ట్రం సిద్ధ‌మవుతోంది. కొత్త ఐటీ పాల‌సీకి సంబంధించిన అంశాల‌ను రాజ‌స్థాన్ ఐటీ శాఖ మంత్రి అఖిల్ అరోరా యువ‌ర్ స్టోరీతో పంచుకున్నారు. స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హించ‌డానికి వీలుగా రాజ‌స్థాన్ కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేయ‌డం విశేషం. దేశంలో ఎక్క‌డా లేని విధంగా భారీ ప్ర‌భుత్వ ప్రాజెక్టుల్లో స్టార్ట‌ప్ లు కూడా టెండ‌ర్లు వేయ‌డానికి కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇంత‌కూ మిగ‌త రాష్ట్రాల స్టార్ట‌ప్ పాల‌సీల‌కు, రాజ‌స్థాన్ పాలసీకి తేడా ఏంటి? ప్ర‌త్యేక‌త‌లు ఏమున్నాయి?

image


రాజ‌స్థాన్ స్టార్ట‌ప్ పాల‌సీలో కీల‌క అంశాలు..

1. ఐసీటీ సెక్టార్ లో నేరుగా ఐదు ల‌క్ష‌ల మంది ఐటీ నిపుణుల త‌యారీ

2. రాష్ట్రంలో 2 వేల టెక్నాలజీ స్టార్ట‌ప్ ల అభివృద్ధి. ఐటీ, ఐటీఈఎస్, ఈఎస్డీఎమ్ రంగానికి ఊతం

3. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పెట్టుబ‌డులు ప‌ది రెట్ల‌కు పెంపు

4. ఐటీ ఉత్ప‌త్తులు రూ.50 వేల కోట్లకు పెంపు

5. రాష్ట్రం నుంచి రూ.5 వేల కోట్ల ఐటీ ఎగుమ‌తులే ల‌క్ష్యం

6. రాష్ట్రంలో 50 ఇంక్యుబేట‌ర్ల ఏర్పాటు

7. స్టార్ట‌ప్ ల కోసం రూ.500 కోట్ల ఏంజిల్, వెంచ‌ర్ క్యాపిట‌ల్ సేక‌ర‌ణ‌

ఏపీఐ లేదా వెబ్ స‌ర్వీస్ ద్వారా స్టార్ట‌ప్ లు, ఐటీ సంస్థ‌లు అన్ని ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పొంద‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నాం. రాజ్ సేవా ద్వార్ విధానం నుంచి ఈ ర‌క‌మైన‌ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. బ‌హుశా ఇలాంటి విధానం దేశంలో మ‌రెక్క‌డా లేదు- అఖిల్

ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవీ..

1. వంద శాతం వ‌ర‌కు వ్యాట్ మిన‌హాయింపు

2. స్టార్ట‌ప్ ల కోసం క‌స్ట‌మైజ్డ్ బెనిఫిట్స్ ప్యాకేజీ

3. ఐటీ, ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్ డిజైన్, మ్యానుఫ్యాక్చ‌రింగ్ (ఈఎస్డీఎం), రోబొటిక్స్ రంగాల‌కు ప్రాధాన్యం

4. బ్రాడ్ బ్యాండ్ క‌నెక్టివిటీలో స‌బ్సిడీ

5. రాజ‌స్థాన్ వెంచ‌ర్ క్యాపిట‌ల్ ఫండ్, ఎస్ఎంఈ టెక్ ఫండ్ ఆర్వీసీఎఫ్-2కి అవ‌కాశం

6. జోన్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌లు, ల్యాండ్ బ‌ద‌లాయింపుల నుంచి మిన‌హాయింపు

7. వ‌డ్డీ మీద స‌బ్సిడీ

8. పేటెంట్ ఫైలింగ్ కాస్ట్, క్వాలిటీ స‌ర్టిఫికేష‌న్ల‌పై రీయింబ‌ర్స్ మెంట్

9. మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన స్టార్ట‌ప్ ల‌కు అవార్డులు

10. మ్యాన్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ స‌బ్సిడీ

క‌త్తిలాంటి ఫండింగ్, ప‌టిష్ట‌మైన ఈ-గ‌వ‌ర్నెన్స్..

ప్ర‌స్తుతం స్టార్ట‌ప్స్ లో గానీ మ‌ధ్య త‌ర‌హా కంపెనీల్లో గానీ పెట్టుబ‌డులు పెట్టడానికి రెండు ర‌కాల ఫండ్స్ ఉన్నాయి. ఒక‌టి రాజ‌స్థాన్ వెంచ‌ర్ క్యాపిట‌ల్ ఫండ్. రెండోది ఎస్ఎంఈ టెక్ ఫండ్-2. దాదాపు 15 మంది ఇన్వెస్ట‌ర్లు ఈ ఫండ్స్ ను స‌పోర్ట్ చేస్తున్నారు. అందులో స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ), రాజ‌స్థాన్ స్టేట్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేష‌న్ (ఆర్ఐఐసీవో) ప్ర‌ధాన‌మైన‌వి.

రాజస్థాన్ ను దేశానికే ఐటీ హ‌బ్ గా మార్చ‌డానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది ఐటీ ప్రొఫెష‌నల్స్ ఉన్నారు. వీళ్లంతా ఈ-గ‌వ‌ర్నెన్స్ ఆర్కిటెక్చ‌ర్, ఫ్రేమ్ వ‌ర్క్ లో నిపుణులు!

రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఈ-గ‌వ‌ర్నెన్స్ ను ప్రమోట్ చేయ‌డంలో చురుగ్గా ప‌నిచేస్తోంది. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ అండ్ స‌ర్వీసెస్ ను పార‌ద‌ర్శ‌కంగా, స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్న‌ది. ఇక ఇప్పుడు స‌ర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చ‌ర్ దిశ‌గా ముందుకెళ్ల‌డానికి నిర్ణ‌యం తీసుకున్నాం- అఖిల్

రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు ఇవీ..

1. 2020 క‌ల్లా రాష్ట్రంలో ఏడు స్మార్ట్ సిటీల ఏర్పాటు

2. ఐటీ రంగానికి బెస్ట్ డెస్టినేష‌న్ గా రాజ‌స్థాన్ అభివృద్ధి

3. నార్త్, వెస్ట్ ఇండియాలో ఐటీ హ‌బ్ గా జైపూర్ సిటీ

స‌మ‌గ్ర‌, కేంద్రీకృత‌, ఏకీకృత స‌ర్వీస్ డెలివరీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్న తొలి రాష్ట్రం రాజ‌స్థాన్! ప్ర‌భుత్వ సేవ‌లకు టెక్నాల‌జీ జోడించ‌డానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న మ‌రికొన్ని చ‌ర్య‌లివీ..

1. ప్రస్తుత‌, భ‌విష్య‌త్ ఈ-గ‌వ‌ర్నెన్స్, ఎం- గ‌వ‌ర్నెన్స్ ప్రాజెక్టుల అమ‌లు. త‌ద్వారా స‌మాచార హ‌క్కు సేవ‌లు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి.

2. అన్ని ప్ర‌భుత్వ సేవ‌ల్లో ఈ-స‌ర్వీసులు! ద‌ర‌ఖాస్తులు, పేమెంట్లు, అనుమ‌తులు- ఇలా అన్ని ర‌కాల పౌర సేవ‌ల‌ కంప్యూట‌రీక‌ర‌ణ‌. వివిధ ప్ర‌భుత్వ విభాగాలు, ఏజెన్సీల మ‌ధ్య స‌మాచార మార్పిడి కోసం చ‌ర్య‌లు. ఈ-అథెంటికేష‌న్ అమ‌లు.

3. డూప్లికేష‌న్, ఐసోలేష‌న్ వంటి సేవ‌ల‌ కోసం ఐటీ హ‌బ్ లో ఏకీకృత డేటా సెట్ల ఏర్పాటు.

4. ప్ర‌భుత్వ సేవ‌ల్లో కాగిత ర‌హిత విధానం అమ‌లు. అఫిడ‌విట్లు, నోట‌రీల‌కు కాలం చెల్లు! డాక్యుమెంట్ల‌ స్థానంలో డేటా సెట్ల ద్వారా సేవ‌లు.

5. పౌరుల‌కు, సంస్థ‌ల‌కు వ్య‌క్తిగ‌త‌, కుటుంబ‌, ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన ఈ-స్పేస్ క‌ల్ప‌న‌. త‌ద్వారా డాక్యుమెంట్ స్టోరేజీ, షేరింగ్, ఈ-సైన్ త‌ద‌త‌ర స‌ర్వీసుల‌కు అవ‌కాశం.

6. ప్ర‌తీ పౌరుడికి విశిష్ట డిజిట‌ల్ ప్రొఫైల్! వ‌న్ ప‌ర్స‌న్ వ‌న్ ఐడెండిటీ విధానం అమ‌లు.

7. పౌరుల‌కు ఈ-స‌ర్వీసులు అందించ‌డానికి ఎన్ఎఫ్సీ, క్లౌడ్ కంప్యూటింగ్, సోష‌ల్ మీడియా టెక్నాల‌జీకి ప్రోత్సాహం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్స్, కాల్ సెంట‌ర్లు, టీవీ వంటి బ‌హుముఖ మాధ్య‌మాల వినియోగం.

8. మొబైల్ ఫోన్ల ద్వారానే అన్ని ర‌కాల సేవ‌లు. ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఏ నెట్ వ‌ర్క్ అయినా, ఏ డివైజ్ అయినా.. కోరిన వెంట‌నే సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం.

9. రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌యం ఉపాధి సెంట‌ర్ల ఏర్పాటు

10. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో టెక్నాల‌జీ ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌

11. ప్ర‌భుత్వ పోర్ట‌ల్స్ పై ప్ర‌జాభిప్రాయాల సేక‌ర‌ణ‌. వాటికి అనుగుణంగా సేవ‌ల మెరుగు.

12. సాధార‌ణ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వ అధికారుల సౌక‌ర్యార్థం డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటు. గెటిట్ నోటిఫికేష‌న్లు, చ‌ట్టాలు, రూల్స్, క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌లు, స‌ర్క్యుల‌ర్లు, పాల‌సీలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల డాక్యమెంట్లు- ఇలా అన్ని ర‌కాల సేవ‌ల‌కు ఎల‌క్ట్రానిక్ యాక్సెస్ క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది.