నేరస్థుల నిగ్గుతేల్చేందుకు పోలీసులకు 'క్రైమాట్రిక్స్' సాయం
నేర పరిశోధనలో పోలీసులకు సహకరిస్తున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ గువాహటి నగరంలో పాత నేరాలు, హోట్సల్ అతిథుల వివరాలు సేకరణ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ రికార్డులను మెంటైన్ చేస్తున్న క్రైమాట్రిక్స్నెలలో 300-350 కేసుల వివరాలు క్రైమాట్రిక్స్లో నమోదు
Monday August 24, 2015,
4 min Read
ప్రపంచవ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక పెద్ద నగరాల్లోనైతే పరిస్థితి మరీ దారుణం. ఘటన జరిగిన చాలా సేపటి వరకూ పోలీసులకే సమాచారం అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఇద్దరు గువాహటి కుర్రాళ్లు. నేరాలను మానిటర్ చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రైమాట్రిక్స్ను రూపొందించారు. గ్లోమిడ్జ్ స్టార్టప్ ద్వారా గువాహటిలో క్రైమ్ డీటైల్స్ను, పాత నేరగాళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెడుతూ పోలీసుల విచారణకు సాయం చేస్తున్నారు.
గువాహటిలో 2012లో జరిగిన సంఘటనలు, నేరాలతో ఉలిక్కిపడ్డ సర్ఫరాజ్ హసన్, సైఫుర్ రెహ్మాన్ అందరి పౌరుల్లా సాధారణంగా కూర్చోలేకపోయారు. సమాజంలో మార్పు తేవాలనుకున్నారు. మరింత మెరుగైన సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకుని, సమాజ నిర్మాణానికి తమ వంతు సాయమందిస్తామని అప్పటి అసోం డీజీపీకి లేఖ రాశారు సర్ఫరాజ్. వీరి ఆలోచనలు నచ్చిన పోలీసులు బాసులు వారిని ప్రశంసించడంతోపాటు క్రైమ్బ్రాంచ్కు అటాచ్ చేశారు. దీంతో నేరాలు, పాత నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించే ప్లాట్ఫామ్ను రూపొందించారు. క్రైమాట్రిక్స్ సాఫ్ట్వేర్ అండ్ గ్లోమిడ్జ్ సొల్యూషన్స్ పేరిట సంస్థను ఏర్పాటు ఓ సాఫ్ట్వేర్ను రూపొందించారు.
గువాహటిలో పరిస్థితులను సర్ఫరాజ్ ఇలా వివరించారు.
‘‘ఈశాన్య రాష్ట్రాలకు గువాహటి హబ్గా మారింది. వందలాది వాహనాలు రోడ్లపై 24 గంటలూ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో టూ, ఫోర్ వీలర్ల దొంగతనం సహజమైపోయాయి. అలాగే పల్టాన్ బజార్లో ఉన్న ఒక్కో హోటల్కే 15 వేలమందికిపైగా కస్టమర్లు రోజూ వచ్చి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథుల రాకకు సంబంధించిన రికార్డును మ్యానువల్గా రూపొందించడం చాలా కష్టం’’ అని ఆయన చెప్పారు.
గువాహటి పోలీసులకు దొంగతనాలు పెద్ద సమస్యగా మారాయి. దీంతో రోజూ జరుగుతున్న దొంగతనాల వివరాలు, అలాగే నగరంలో వివిధ హోటళ్లలో బసచేస్తున్న అతిథుల వివరాలను క్రైమాట్రిక్స్ ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. పోలీసులతోపాటు సాధారణ ప్రజల నుంచి కూడా నేరాల వివరాలను సేకరిస్తున్నదీ సంస్థ. ఎవరిదైనా వాహనం చోరీకి గురైతే వారు నేరుగా క్రైమాట్రిక్స్కు ఫోన్ చేసి తమ వాహనం మిస్సయిందని చెప్తూ, దాని వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నారు. 2013లో అమెరికాకు చెందిన కంప్సాఫ్ట్ సొల్యూషన్ స్ఫూర్తిగా క్రైమాట్రిక్స్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. తమ సాఫ్ట్వేర్ అమలు తీరును సర్ఫరాజ్ వివరించారు.
‘‘గ్రౌండ్ స్థాయిలో వివరాలు తెలుసుకునే సబ్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్స్-ఇన్-చార్జ్లతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా టెక్నాలజీని అందరూ ఉపయోగించుకునేలా సింపుల్గా రూపొందించాం. ఎందుకంటే చాలమంది అధికారులకు కంప్యూటర్ల వినియోగం పెద్దగా తెలియదు. మా వద్ద ఉన్న స్టాటిస్టిక్స్ నిజ జీవితంలో ప్రజలకు ఉపయోగపడాలన్నదే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి ప్రజలకు ముందే హెచ్చరికలను పంపే అలర్ట్స్ సదుపాయం కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉన్నది. ప్రస్తుతానికైతే పైలెట్ ప్రాజెక్ట్గానే దీన్ని అమలు చేస్తున్నారు. అసోం పోలీసుల నుంచి దీర్ఘకాల సహకారాన్ని వీరు కోరుతున్నారు. అప్పటివరకు పైలెట్ ప్రాజెక్ట్గానే కొనసాగించనున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సాఫ్ట్వేర్ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజస్థాన్, ఒడిశా, మణిపూర్, మేఘాలయా అధికారులతో సర్ఫరాజ్, హసన్ సంప్రదింపులు చేస్తున్నారు.
సోషల్ ఇంపాక్ట్
ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే గ్లోమిడ్జ్ సొల్యూషన్స్కు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. సగటును ప్రతిరోజు క్రైమాటిక్స్ వద్ద కనీసం పది కేసులు నమోదవుతాయి. నెలలో 300-350 కేసుల వరకు నమోదవుతున్నాయి. దీని గురించి సర్ఫరాజ్ ఇలా అంటారు.
‘‘తమ వాహనాలు మిస్సయిన వెంటనే బాధితులు మాకు ఫోన్ చేసి వివరాలు అందిస్తారు. మే ప్రారంభించిన ప్రయత్నం గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తుందనడానికి ఈ కాల్సే సాక్ష్యం. ఏదైనా వాహనం చోరికి గురైతే గతంలో 24 గంటల వరకు ఫిర్యాదు చేసేవారు కాదు. మా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆ సమయం రెండు గంటలకు తగ్గింది. ఈ సమయాన్ని మరింత తగ్గించాలనుకుంటున్నాం’’ అని ఆయన వివరించారు.
క్రైమాట్రిక్స్ సాఫ్ట్వేర్ అండ్ గ్లోమిడ్జ్ సొల్యూషన్స్ ఏర్పాటైనప్పటి నుంచి డీసీపీ (క్రైమ్) అమితవ సిన్హా ఈ ప్రాజెక్ట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దానిపై ఆయన ఇలా అంటారు.
‘‘హోటళ్లు, గెస్ట్ హౌజ్లకు చెందిన రోజువారీ ఆన్లైన్ డేటా బేస్ను పరిశీలించి/వెతికే టూల్ మాకు నేర విచారణలో ఎంతగానో ఉపయోగపడుతున్నది. కుటుంబ కలహాల కారణంగా అదృశ్యమ్యే వ్యక్తులు సాధారణంగా హోటల్స్లో బస చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు మిస్సయినట్టు జిల్లాల్లో కేసులు నమోదవుతుంటాయి. అలాగే ప్రేమ పేరుతో లేచిపోయే యువ జంటల వివరాలు కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. వారిని వారి గార్డియన్స్కు అప్పగిస్తున్నాం. గ్లోమిడ్జ్ యువ బృందం మరిన్ని కొత్త ఆవిష్కరణలతో ప్రస్తుతమున్న టూల్ కంటే ప్రభావవంతమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలి’’ అని ఆయన వివరించారు.
గట్టి పోటీ
క్రైమాట్రిక్స్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తవేమీ కావు. అయితే ఆ సాఫ్ట్వేర్లను తయారుచేసిన కంపెనీలకు, క్రైమాట్రిక్స్ను రూపొందించిన గ్లోమిడ్జ్ సంస్థకు కొన్ని వ్యత్యాసాలున్నాయి.
‘‘మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్లున్నాయి. అయితే వాటిని రూపొందించిన వ్యక్తులకు పోలీసులతో సంబంధాలు ఉండవు. వారు కేవలం సాఫ్ట్వేర్ రూపొందించి పోలీసులకు అందజేస్తారు. కాని మేం మాత్రం పోలీసులతో సన్నిహితంగా మెలుగుతూ, సాఫ్ట్వేర్ ద్వారా నేరాలను అరికట్టేందుకు సహకరిస్తున్నాం. అలాగే ఇతర సాఫ్ట్వేర్లు మన దేశ పరిస్థితులకు అనువుగా ఉండవు. అమెరికాలాంటి దేశాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారుచేసినవే ఎక్కువగా ఉంటాయి’’ అని సర్ఫరాజ్ వివరించారు.
క్రైమాట్రిక్స్ ప్రధానంగా పోటీ వస్తున్న ప్రాజెక్ట్.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల పోలీసుల కోసం ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ను రూపొందించింది.
సీసీటీఎన్ఎస్ ప్రాజెక్ట్ కేంద్ర, రాష్ట్రాల మోడల్స్లో పనిచేస్తుంది. తమ సొంత మోడల్స్లో పనిచేసుకునేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రం. దీంతో తమ సొంత మోడ్యూల్స్తో తమ మార్క్ కనబడేలా చూసుకుంటున్నారు రాష్ట్ర పోలీసులు. అయితే ఈ సాఫ్ట్వేర్తో పోలిస్తే తమ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు సర్ఫరాజ్. మిగతావాటి కంటే విభిన్నంగా ఉండేలా రూపొందించామని చెప్తున్నారు.
‘‘మన పనిలో తేడా చూపాలి అనుకున్నప్పుడు చేసి చూపాలి. సరైన మార్గంలో ప్రభుత్వాలు/ అధికారులతో కలిసి పయనించినప్పుడే మా తేడాను చూపగలుగుతాం’’ అని వివరించారు.
మరిన్ని వివరాలకుః http://crimatrix.com