బ్లాక్‌మనీతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు

బ్లాక్‌మనీతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు

Wednesday May 04, 2016,

4 min Read


బ్లాక్‌మనీ.. ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. పనామా పేపర్స్ బయటపెట్టిన రహస్యాలతో అన్ని దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తమకు చెందాల్సిన డబ్బు కొందరు పెద్దలు ఎలా దాచుకుంటున్నారో తెలిసి ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు బ్లాక్‌మనీ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? ప్రజలపై భారాన్ని ఎలా పెంచుతుంది? ఒకసారి చూద్దాం..

భారత్ సుసంపన్న దేశం. వనరులు, ఖనిజాలు, నైపుణ్యం కలగలిసిన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని వనరులు మనదేశంలో ఉన్నాయి. మానవ వనరులు కావొచ్చు, టాలెంట్ కావొచ్చు. అన్ని దేశాల కంటే భారత్ కాస్త ముందుంది. అయినా ఆర్థిక వృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉంది. అందుకు కారణం నల్లడబ్బు, అవినీతి. ఈ రెండు భారత్‌ను జలగల్లా పట్టిపీడిస్తున్నాయి. ఈ రెండింటిని అంతం చేస్తేనే భారత్ అమెరికా, చైనాల్లాంటి దేశాలకు పోటీ ఇవ్వగలుగుతుంది.

ద్రవ్య పరపతిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపేందుకు ప్రతి నెలలో రెండుసార్లు రిజర్వ్ బ్యాంక్ మీడియా సమావేశం నిర్వహిస్తుంది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ రంగరాజన్ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు తాము తీసుకోబోయే చర్యలను వివరించారు. ప్రస్తుత ద్రవ్యపరపతి విధానంపై ఉర్జిత్ పటేల్ కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో రంగరాజన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న బ్లాక్‌మనీ గురించి కూడా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు.

image


బ్యాంకుల నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ(ఎన్‌డీటీఎల్)లో ఒక శాతాన్ని ద్రవ్యాన్ని కేంద్ర బ్యాంక్ తమ దగ్గర ఉంచుకుంటుంది. సమయానుగుణంగా, అవసరాలను బట్టి ఆ డబ్బును విడుదల చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో 90 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ఎప్పుడనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ‘‘మార్కెట్ పరిస్థితి, ప్రవాహం ఆధారంగా నిధులను విడుదల చేస్తాం’’ అని రాజన్ పేర్కొన్నారు.

అయితే ప్రజల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు చెలామణి అవుతున్న నేపథ్యంలో, ద్రవ్యపరపతిని తగ్గించేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపుగా 60 వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. ఇది అసాధారణమని ఆర్బీఐ కూడా అంగీకరిస్తోంది.

‘‘ద్రవ్యపరపతిని తగ్గించేందుకు మరికొన్ని మార్గాలను అన్వేషించాలి. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఓవైపు ప్రభుత్వ నిధులు పెరిగిపోతుండగా, మరోవైపు ప్రజల వద్ద డబ్బు కూడా పెరిగిపోతోంది. ఎన్నికల సమయంలో ప్రజల వద్ద డబ్బులు పెరిగిపోతాయి. కారణాలు ఏంటో అందరికీ తెలుసు’’ ’’ అని రాజన్ చెప్పారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డబ్బు మరింత ఎక్కువగా చేతులు మారుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 225 మిలియన్ల ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల వేళ.. ధన ప్రవాహం

రీసెంట్‌గా ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం మార్చి 18న ముగిసిన వారంలో నోట్ల చెలామణీ 48% పెరిగి 2 ట్రిలియన్లకు చేరింది. ఈ నేపథ్యంలో డబ్బు చెలామణిపై ఆర్బీఐ దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఓవైపు ప్రజలవద్ద డబ్బు పెరిగిపోతుండగా, మరోవైపు బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి రేటు కూడా 9.9కి పడిపోయింది. గత 53 ఏళ్లలో కనిష్ట స్థాయికి డిపాజిట్ల రేటు పడిపోవడం ఇదే తొలిసారి. 

అయితే, ఒక్కసారిగా ప్రజల చేతిలో డబ్బు పెరిగిపోవడానికి, బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి రేటు అనూహ్యంగా పడిపోవడానికి కారణాలేంటి..?

ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల సమయంలో బ్లాక్‌మనీ చేతులు మారడం చాలా సహజం. ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామిక్స్ (సీఎంఐఈ) 2015లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఒక్కో నియోజకవర్గంలో 10.19 నుంచి 11.33 బిలియన్ డాలర్ల బ్లాక్‌మనీ వెలుగులోకి వస్తుందట.

చట్ట వ్యతిరేకంగా, అనైతిక కార్యకలాపాల ద్వారా సంపాదించి, అధికారులకు తెలియకుండా దాచి, ఎలాంటి లెక్కలు లేకుండా ప్రజల్లో చెలామణీ అయ్యేదే నల్లడబ్బు. ఈ నల్లధనానికి ట్యాక్స్ కూడా కట్టరు. లంచాలు, పన్ను ఎగవేత, డొనేషన్లను దాచి పెట్టడం.. తదితర మార్గాల ద్వారా ఈ నల్ల డబ్బు పోగవుతుంది.

ఆర్థికవేత్తల కలవరం..

నల్లధనం ఏ స్థాయిలో వస్తే అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న ప్రభావాలకు తోడు ఈ నల్లధనం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న మరో వ్యవస్థలాంటిది. ఈ బ్లాక్‌మనీ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొడుతుంది.

కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్ సోర్స్

కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్ సోర్స్


ప్రభుత్వానికి పన్ను రూపంలోనే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే జనాభాలో కేవలం మూడు శాతం మంది మాత్రమే సక్రమంగా పన్ను చెల్లిస్తున్నారు. పన్ను ఎగవేత ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా లోటులో ఉంది. దీనికితోడు ఆదాయంలో కోత. దీంతో ఆర్థిక లోటును పూడ్చేందుకు అవసరమైన నిధులను ఇతరుల నుంచి అప్పుగా తెచ్చుకుంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం, అధిక ధరల వంటివి ఏర్పడతాయి. ఇది ఒక విషవలయం. ఈ లోటును పూరించేందుకు, అప్పు తెచ్చుకోవడంతోపాటు ట్యాక్స్‌లను కూడా ప్రభుత్వం పెంచేస్తుంది. బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోకతప్పదు మరి. 


ఆర్థిక రంగంలో చెలామణి అవుతున్న నల్లధనాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలిస్తే సహజంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ప్రజలపై ప్రభుత్వం మోపే భారం కూడా తగ్గతుంది.

ద్రవ్యోల్బణం ఎలా ప్రభావం చూపుతుంది?

కరెన్సీ విలువకు తగ్గ కొనుగోలు శక్తి లేకపోవడమే ద్రవ్యోల్బణం. అంటే రూపాయి విలువ పడిపోవడం. ఆర్థిక రంగాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే.. కొందరి చేతిలోనే పెద్ద మొత్తంలో డబ్బు పేరుకుపోవడం. కొందరివద్దే డబ్బు నిలువలు పేరుకుపోవడంతో అదే స్థాయిలో ఇతరుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అలాగే అవినీతి కూడా పెరిగిపోతుంది.

అవినీతి, నల్లధనం నాణానికి బొమ్మబొరుసూ వంటివి. లంచాలు, అధికారులకు డబ్బు ఇవ్వడం, కమోడిటీల నిల్వలు, మార్కెట్ ధరకు కాకుండా ఎక్కువ మొత్తానికి విక్రయించడం, పన్ను ఎగవేత వంటి కారణాలతో నల్ల డబ్బు పేరుకుపోతుంది. అవినీతిలో భారత్ ప్రపంచంలోనే 38.38 స్కోరుతో (0-పెద్ద మొత్తంలో అవినీతి, 100-వెరీ క్లీన్) 76వ స్థానంలో ఉంది. 2015లో 168 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడాన్ని ఈ అవినీతి నిరోధిస్తుంది. రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవినీతి మొత్తం సమాజాన్నే ఇబ్బంది పెడుతుంది. వస్తు సేవల నాణ్యతను పెంచాల్సిన ఆర్థిక చట్టాలను డబ్బులున్న కొందరు బడాబాబులు అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా మేనేజ్ చేస్తున్నారు. పాలసీలను, మార్కెట్ మెకానిజాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ ప్రాడక్ట్‌లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అవినీతి కారణంగా సంపద, వనరులు అసహజంగా పంపిణి అవుతాయి.

కోశ, ద్రవ్య విధానాలను రూపొందించే సమయంలో అవినీతి ద్వారా పుట్టిన నల్లధనాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోదు. దీంతో వాస్తవికమైన, ప్రభావవంతమైన విధానాలను ప్రభుత్వం రూపొందంచలేకపోతోంది.

బ్లాక్‌మనీ, అవినీతి ఈ రెండు ఆర్థిక వ్యవస్థను అన్ని వైపుల నుంచి దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి నిలిచిపోతున్నది. దేశ సంపద కొల్లగొట్టబడుతోంది. ఈ కారణాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. వ్యవస్థలోని లొసుగులను గుర్తించి, నల్లధనం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే అవినీతిని నియంత్రించి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలి. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని నిపుణులు అంటున్నారు.