ఆన్లైన్లో దూరవిద్యా కోర్సులను అందిస్తూ దూసుకుపోతున్న 'స్కూల్ గురు'
స్కూల్గురు పేరుతో ఈ లెర్నింగ్ ప్లాట్ఫాం..డిస్టెన్స్ ఎడ్యుకేషన్పై దృష్టిపెట్టిన ఏకైక స్టార్టప్..మూడేళ్లలో ₹20 కోట్ల టర్నోవర్..లక్ష దాటిపోయిన విద్యార్ధుల సంఖ్య..
Monday September 21, 2015,
4 min Read
అంతర్జాతీయంగా ఈ-లెర్నింగ్ మార్కెట్ ఎంతో తెలుసా? ఆరు బిలియన్ల యూఎస్ డాలర్లు. మన దేశ అక్షరాలా 39 వేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని వెంచర్ కేపిటల్ సంస్థ డొసెబే చెబ్తోంది. టెక్నావియో వెల్లడించిన గణంకాల ప్రకారం... మన దేశంలో ఈ మార్కెట్ 2014-19 మధ్య... ఏటా 17.5 శాతం క్రమానుగత వృద్ధి రేటు(CAGR) సాధించనుంది. ప్రపంచం మొత్తం మీద మన దేశంలో ఈ-లెర్నింగ్ ఎక్కువ వృద్ధి నమోదు చేస్తోంది.
దేశంలో విద్యపై వెచ్చిస్తున్న మొత్తంలో దాదాపు సగం మొత్తాన్ని...కేవలం ఉన్నత చదువుల కోసమే ఖర్చు చేస్తున్నారు. 2012లో 'స్కూల్ గురు'ను ప్రారంభించేందుకు ఈ సంస్థ సహ వ్యవస్థాపకులను ప్రేరేపించినది ఈ గణాంకాలే. విద్యావ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వాలు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. అయితే.. భౌతికంగా మౌలిక వసతులు ఈ స్థాయిలో పెరిగే అవకాశం లేదనే విషయం స్కూల్గురు వ్యవస్థాపకులకు బాగానే తెలుసు.
అందుకే ఓ సమస్యకి పరిష్కారంగా మొదలై... మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్న దూర విద్యను ఎంచుకున్నారు వీరు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ని మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేలా... స్కూల్ గురు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ తరహా కోర్సులు చేస్తున్నవారికి సహాయపడేలా తమ వెంచర్ని డిజైన్ చేశారు.
కో-ఫౌండర్ శంతను రాజ్కి.. ఈ రంగం కొత్తేమీ కాదు. గత 18 ఏళ్లుగా ఆంట్రప్రెన్యూర్గా ఉన్న ఈయన.. పారాడైన్తో తన ప్రయాణం ప్రారంభించారు. తర్వాత బ్రాడ్లిన్ అంటూ.. పలు కాలేజ్లు, విద్యాసంస్థలకు ఈఆర్పీ(ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్)సేవలను అందిస్తున్నారు.
తన రెండు వెంచర్లను గ్లోడైన్ టెక్నోసర్వ్కు విక్రయించేశారు శంతన్. అక్కడ 20 ఏళ్లుగా ఆంట్రప్రెన్యూర్గా ఉంటూ కొమట్ టెక్నాలజీస్ను గ్లోడైన్కే విక్రయించిన రవి రంగన్తో శంతన్కి పరిచయం అయింది.
వీరికి అప్పటికే విద్యా సాంకేతికతపై పట్టు, వ్యాపార రంగంలో అపార అనుభవం ఉండడంతో.. చిన్నపాటి ఏర్పాట్లతో కొద్ది సమయంలోనే స్కూల్గురుకు నాంది పలికారు. తనకి బాగా తెలిసిన విద్యావేత్త అనిల్ భట్ను తమ టీం ఆహ్వానించారు శంతన్. మొదటి ఏడాదిన్నరపాటు సొంత నిధులతోనే నడిచిన ఈ వెంచర్.. 2014లో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో 2 మిలియన్ డాలర్లను అందుకుంది.
స్కూల్గురు ఏం చేస్తాడు ?
యూనివర్సిటీలు, కోర్సులు నిర్వహించేవారికి.. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత ప్లాట్ఫాంను అందిస్తుంది స్కూల్గురు. అయితే... దీనికోసం ఆయా విద్యాసంస్థలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అడ్మిషన్స్, ఫీజులు, ఎంక్వైరీలకే ఈ సేవలు పరిమితం కాబోవు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం కూడా నిర్వహిస్తుంది స్కూల్గురు. యూనివర్సిటీలకు స్టాఫ్ను అందించడం ద్వారా.. వీటన్నిటినీ డీల్ చేయడం సాధ్యమవుతుంది.
బీఏ, బీసీఏ, ఎంసీఏ వంటి సాధారణ డిగ్రీలను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అందించే రంగంలో సర్వీసులు ఇస్తున్న ఏకైక వెంచర్ తమదే అంటున్నారు స్కూల్గురు నిర్వాహకులు. రెగ్యులర్ కోర్సులతోపాటే.. నైపుణ్యాభివృద్ధి, వొకేషనల్ కోర్స్లను కూడా పరిచయం చేయబోతోందీ స్టార్టప్.
విద్యార్ధులకి ఏంటి ఉపయోగం ?
విద్యార్ధులకు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్తోపాటే.. యాప్ను ఇన్స్టాల్ చేసిన మెమరీ కార్డ్ అందిస్తారు. ఈ యాప్ ద్వారా కంటెంట్ని యాక్సెస్ చేయచ్చు. కోర్స్, యూనివర్సిటీ ఆధారంగా.. కస్టమైజ్డ్ కంటెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏదైనా డౌట్స్ ఉంటే.. యాప్లోని మెసేజిగ్ పోర్టల్ ద్వారా.. సంబంధిత లెక్చరర్తో స్టూడెంట్ ఇంటరాక్ట్ కావచ్చు. ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో పసిగట్టే ఈ అప్లికేషన్.. ఒకవేళ నెట్ కనెక్టివిటీ లేకపోతే.. ఎస్ఎంఎస్ ఇంజిన్ ద్వారా క్వైరీలను పంపుతుంది. అలాగే వచ్చే సమాధానాలు కూడా ఎస్ఎంఎస్లుగానే అందినా.. వాటిని గ్రాఫికల్ విధానంలోకి మార్చి డిస్ప్లే చేయడం ఈ యాప్ ప్రత్యేకత. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం.. విద్యార్ధులకు సమస్య కాబోదనే విషయం అర్ధమవుతుంది.
కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, పశ్చిమబెంగాల్, అస్సాం సహా 8 రాష్ట్రాల్లోని 11 పెద్ద యూనివర్సిటీలతో భాగస్వామ్యం అయింది స్కూల్ గురు. తొమ్మిది భాషల్లో 170 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుండడం విశేషం. మరో నాలుగు రాష్ట్రాల్లోని 4 యూనివర్సిటీలతో చర్చలు నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే వీటితో ఒప్పందాలు ఖరారయ్యే అవకాశముందని చెబ్తున్నారు స్కూల్గురు నిర్వాహకులు.
ఐదుగురు టీంతో మొదలైన ఈ వెంచర్ కోసం.. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో 145 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ప్రతీ రాష్ట్రంలోనూ అతి పెద్ద యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడమే... వీరి మార్కెటింగ్లో ప్రధాన వ్యూహం.
ఆర్ధిక విషయాలు, అభివృద్ధి
ఆన్లైన్ కోర్స్లో విద్యార్ధి ఎన్రోల్ అయ్యాక... చెల్లించిన ఫీజును యూనివర్సిటీ, స్కూల్గురులు ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా పంచుకుటాయి. సాధారణంగా 30 నుంచి 50 శాతం వరకూ స్కూల్గురుకి వాటా ఉంటుంది. ఏటేటా రెన్యువల్ చేసుకునే ఈ మోడల్కి.. 2013లో 1500మంది విద్యార్ధులు ఉండగా... మరుసటి ఏడాదికల్లా 6వేలకు చేరుకోవడం విశేషం.
2015 విద్యా సంవత్సరంలో లక్షన్నర మంది విద్యార్ధులు తమ ప్రోడక్ట్ ఉపయోగించుకునే స్థాయికి చేరుకునే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది స్కూల్గురు. అయితే.. ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమైన నాలుగు నెలల్లోనే లక్ష మంది ఎన్రోల్ అవడంతో.. రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు వ్యవస్థాపకులు. మహరాష్ట్రలోని యశ్వంత్రావు చవాన్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్ధులే.. ఈ మైలురాయి లాంటి మార్క్ను చేరుకోగలగడానికి ప్రధాన కారణం.
"ఈ విభాగంలో అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్ధులు యూనివర్సిటీకి వెళ్తారు. స్కూల్గురు కాదనే విషయం గుర్తుంచుకోవాలి. మన దేశంలో ప్రతీ ఏటా 20లక్షల మంది స్టూడెంట్స్... ఈ తరహా కోర్సుల్లో ఎన్రోల్ అవుతున్నారు. కొన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులను తప్పనిసరి చేయబోతున్నాయి. అలాగే విద్యార్ధులకు ఈలెర్నింగ్ క్లాసులు కంపల్సరీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా మరిన్ని కోర్సులు అందించవచ్చనే ఉద్దేశ్యంలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకూ రెండే కోర్సులను అందించే యూనివర్సిటీ కూడా.. 20 కోర్సులను ఆఫర్ చేసే స్థాయికి చేరడంలో స్కూల్గురు పాత్ర చాలా ఉంది. ఇలా కొత్తగా చేరినవారందరూ స్కూల్గురుకి కూడా ఆటోమేటిక్గా ఎన్రోల్ అయిపోతారు" అంటూ.. అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు శంతన్.
2014లో ₹ 3.5 కోట్ల ఆదాయాన్ని గడించిన స్కూల్గురు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹ 20 కోట్లకు చేరనుండడం విశేషం.
ముందుంది రహదారి
రాబోయే రెండేళ్లలో.. 25 యూనివర్సిటీలకు సర్వీసులు అందించాలనే లక్ష్యం ఉంది స్కూల్గురుకి. దీని ద్వారా 10 లక్షలమంది స్టూడెంట్స్ స్థాయికి చేరవచ్చన్నది కంపెనీ ఆలోచన. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లయిన ఆఫ్రికా, మధ్య తూర్పు ఆసియా దేశాల్లోనూ విస్తరించే యోచన కూడా ఉన్నట్లు చెబ్తున్నారు రవి రంగన్.
సాంకేతికత కోసం.. ఐవీ లీగ్ కాలేజ్తో కలిసి ఆన్లైన్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా విద్యార్ధులు తమ ఇంటి నుంచే పరీక్షలను రాయవచ్చు. అది కూడా పూర్తి పర్యవేక్షణతో కూడినది కావడం విశేషం. 2015 డిసెంబర్ నుంచి ఈ విధానం అమలు చేసే అవకాశముంది.
ఆన్లైన్లో పరీక్షల నిర్వహణపై.. ప్రభుత్వం విధాన ప్రకటన చేసే సమయానికి.. తాము ప్రోడక్ట్తో సిద్ధంగా ఉంటామంటోంది స్కూల్గురు. అలాగే ప్రభుత్వం గ్రామపంచాయితీ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి సేవా కేంద్రాలకు ప్రాథమిక సాంకేతిక సహకారం అందించడంపై కూడా... స్కూల్గురు ఒప్పందాలు చేసుకుంటోంది.
సిరీస్ బీ ఫండింగ్ ద్వారా 3 మిలియన్ల అమెరికన్ డాలర్లను త్వరలోనే సమీకరించబోతున్నారు. ఇప్పటివరకూ దేశంలో 40మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను సమీకరించగలగాయి ఎడ్యుకేషన్ స్టార్టప్లు. తాజాగా ఓలిఫన్స్ కేపిటల్ నుంచి సిగ్రిడ్... పెట్టుబడులను ఆకర్షించింది. యునైటెడ్ ఫిన్సెక్ నుంచి ఎడ్యుకార్ట్ కూడా మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. నిధులందించిన జాబితాలో యువరాజ్ సింగ్ వెంచర్ యువుయ్కెన్ కూడా ఉంది.