తెలంగాణ పిలుస్తోంది.. పెట్టుబడులతో రండి- సీఎం కేసీఆర్

ఐటి, స్టార్టప్ పాలసీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ పిలుస్తోంది.. పెట్టుబడులతో రండి- సీఎం కేసీఆర్

Monday April 04, 2016,

2 min Read


తెలంగాణ పిలుస్తోంది.. రండి.. పెట్టుబడులు పెట్టండి అని సీఎం కేసీఆర్ ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. సరికొత్త ఐటీ పాలసీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం మరోసారి పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే హెచ్ఐసీసీ హాల్లో సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుడి పారిశ్రామికవేత్తలు చెప్పులరిగేలా తిరిగే ప్రయాస లేకుండా15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం అన్నారు. ఇప్పటిదాకా సింగిల్ విండో సిస్టం ద్వారా 1691 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని.. అందులో 883 కంపెనీలు ఇప్పటికే ప్రొడక్షన్ మొదలు పెట్టాయని తెలిపారు. ఎలాంటి కరప్షన్ కి తావు లేకుండా తమ పాలసీని అమలు చేస్తున్నామని అన్నారాయన.

తాజాగా ప్రకటించిన ఐటీ పాలసీ కూడా ప్రపంచం మెచ్చేలా ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. భౌగోళికంగా చూసినా, కల్చర్ పరంగా చూసినా, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలను బేరీజు వేసుకున్నా.. అన్ని రకాలుగా తెలంగాణ ఐటీ రంగానికి అనువైన ప్రదేశమని సీఎం తెలిపారు. 20 నెలల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం.. అనుకున్న ప్రగతి సాధించడానికి అహర్శిశలు కష్టపడుతోందని అన్నారు. దానికి అందరి సహకారం కావాలని సీఎం కేసీఆర్ కోరారు. 

image


ఈఎస్ఎల్ నరసింహన్, గవర్నర్

గ్రామీణ ప్రాంతాల్లో ఐటి సేవలను విస్తరించేలా పాలసీలు తెలపడం గొప్ప విషయం అన్నారు గవర్నర్ నరసింహన్. పల్లెలను డిజిటల్ విప్లవంలో కలుపకుండా పూర్తిస్థాయి డెవలప్ మెంట్ ని ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయం అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులతో పాటు టెక్నాలజీ కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటీ పాలసీ భావి తరాల భివిష్యత్ కు నిచ్చెనలు పరిచే ఉంటుందని అభినందించారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వంతో చేతలు కలపాలని ఆయన వ్యాపార వేత్తలకు పిలుపునిచ్చారు.

image


వీకే సారస్వత్, నీతి అయోగ్ ఉపాధ్యక్షులు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ ఒక కీలక ముందడుగు అని నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు వీకే సారస్వత్‌ కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్‌ పాలసీ కేంద్ర ప్రభుత్వ పాలసీకి చాలా అనుకూలంగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎలక్ట్రానిక్‌ దిగుమతులు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని సారస్వత్ మనస్ఫూర్తిగా అభినందించారు. 

రాజీవ్‌ శర్మ, చీఫ్‌ సెక్రెటరీ

రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగం కీ రోల్ పోషిస్తుందని తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ రాజీవ్‌ శర్మ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం బిజినెస్‌ ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు. వ్యాపారాలను ప్రోత్సహించే వ్యవస్థ ఉండటం నిజంగా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు ఆయన స్వాగతం పలికారు.