దేశంలోనే మొట్టమొదటి రోబో పోలీస్ తయారుచేసిన హైదరాబాద్ కుర్రాళ్లు

దేశంలోనే మొట్టమొదటి రోబో పోలీస్ తయారుచేసిన హైదరాబాద్ కుర్రాళ్లు

Friday July 07, 2017,

3 min Read

గుర్తుందా? తెలంగాణ ఐటీ పాలసీ లాంఛ్ రోజున ఒక రోబో పేపర్లు పట్టుకుని నడుచుకుంటూ వచ్చి సీఎం కేసీఆర్‌కు, గవర్నర్ కు అందించింది. హైదరాబాదుకి చెందిన హెచ్ బూట్స్ రోబోటిక్స్ సంస్థ దాన్ని తయారుచేసింది. అదే సంస్థ ఇప్పుడు దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోని తయారు చేసింది. అది ఆషామాషీ రోబో కాదు. పక్కా పోలీస్. కంప్లయింట్స్ తీసుకుంటుంది. బాంబ్ డిటెక్ట్ చేస్తుంది. తప్పిపోయిన వ్యక్తుల్ని, వాహనాల్ని పసిగడుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి జూబ్లీహిల్స్ చెక్ దగ్గర పలకరించబోయే రోబో కాప్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం!!

image


హ్యూమనాయిడ్ రోబో ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. ఉపయోగించే అప్లికేషన్ ని బట్టి తేడాలుంటాయి. కొన్ని దేశాల్లో రోబోలను ఎంటర్టైన్ మెంట్ కి ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల హెల్త్ కేర్ లో వాడుతారు. కొన్ని కంట్రీల్లో సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తారు. ఆరు నెలల క్రితం దీనిమీద హెచ్ బూట్స్ రోబోటిక్స్ సంస్థ టీం దీనిమీద వర్క్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో అప్లికేషన్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అదే టైంలో సంస్థ సీఈవో కిషన్ ఒక మీటప్ కోసం సింగపూర్ వెళ్లారు. అక్కడ రోబో కాప్ ని తయారు చేస్తున్న దుబాయ్ సంస్థ వాళ్లు కలిశారు. వాళ్లతో మాట్లాడుతుంటే మనమెందుకు ఇలాంటి రోబోని తయారు చేయకూడదు అనుకున్నారు. అలా మొదలైన ఆలోచన వడివడిగా అడుగులు ముందుకు వేసింది.

రెండు నెలల క్రితం హైదరాబాదులో డిజైన్ సమ్మిట్ అనే ఈవెంట్ జరిగింది. దాంట్లో క్రికెట్లో బాల్ వేయడానికి ఒక రోబో కావాలని అడిగారు. అప్పుడే మానిక్విన్స్ గుర్తొచ్చింది. దాన్నే రోబో కింద కన్వర్ట్ చేశాం. వాటర్ బాటిల్ ఇచ్చినా దాన్ని రోబోలా కన్వర్ట్ చేసే టీం మాకు ఉంది-కిషన్

రోబో కాప్ ప్రత్యేకతలేంటి?

పోలీస్ రోబోకి ఒకటి కాదు.. నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా స్టేషన్‌ కి వెళ్లి కంప్లయింట్ ఇవ్వాలంటే ఇప్పటికీ తటపటాయిస్తుంటారు. మంచిపని కోసం వెళ్లాలనుకున్నా పోలేని పరిస్థితి. స్టేషన్ మెట్లు ఎక్కడం నామూషీగా ఫీలయ్యే రోజులివి. అలాంటి వారికి ఈ రోబో చక్కగా పనిచేసి పెడుతుంది. దారిలో వెళ్తూ వెళ్తూ ఈసేవలో కరెంటు బిల్లు కట్టినంత ఈజీగా కంప్లయింట్ ఇవ్వొచ్చు. చెప్పాలనుకున్న విషయాన్ని రోబోలో ఫీడ్ చేస్తే, అది సర్వర్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్‌ కు చేరవేస్తుంది.

రెండోది- ఏదైనా వస్తువు కొన్ని గంటలపాటు రోబో ఉన్న చుట్టుపక్కల ప్రదేశంలో ఉంటే.. ఇదేదో సస్పీషియస్ ఆబ్జెక్ట్ అనిచెప్పి, దాని ఇమేజ్ ని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌ కు పంపిస్తుంది. ఇదేదో ఉంది వచ్చిచూడండి.. యాక్షన్ తీసుకోండి అని హెచ్చరిస్తుంది.

బాంబ్ గుర్తించడం దీని మరో ప్రత్యేకత. ఉదాహరణకు రైల్వే స్టేషన్లో బాంబ్ ఉందని ఫోన్ కాల్ వచ్చిందనుకోండి.. అదెక్కడుందో.. ఎలా గాలించాలో అంచనా వేయడానికి సగం టైం గడిచిపోతుంది. అదే ఈ రోబోని స్టేషన్‌ దగ్గరికి తీసుకెళ్లామనుకోండి! రెండే రెండు సెకన్లలో బాంబ్ ఎక్కడుందో చెప్పేస్తుంది!

నాలుగోది.. మిస్సింగ్ కేసులు! వ్యక్తిగానీ, వాహనంగానీ మిస్ అయితే దాని ఫోటోని రోబోలో అప్ లోడ్ చేస్తే చాలు.. ఆ వ్యక్తిగానీ, వెహికిల్ గానీ రోబో ముందు నుంచి వెళ్తే అది వెంటనే దగ్గర్లోని స్టేషన్‌ కు మెసేజ్ పంపిస్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా వెహికిల్ ఇందాకే నా ముందు నుంచి వెళ్లింది అని చెప్తుంది.

దుబాయ్ రోబోకి మన రోబోకి చాలా తేడా ఉంది. వాళ్లు వాళ్ల స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేశారు. మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, మన నేటివిటీ ప్రకారం వీళ్లు డిజైన్ చేశారు. ఇందులో రెండు వేరియేషన్లు ఇచ్చారు. ఒకటి వీల్స్ రోబో. రెండోది వాకింగ్ రోబో. అయితే వాకింగ్ రోబో తయారు చేయడం అంత తేలిక కాదు. పది రోబోలని తయారుచేయడానికి ఎంత ఖర్చవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో ఒక రోబోని వాక్ చేయించడానికి అంత టైం పడుతుంది. అయితే రోబో ఫీల్ రావాలంటే మాత్రం వాకింగ్ మోడలే బెస్ట్ అని కిషన్ అంటున్నారు.

దుబాయ్ రోబోకి టచ్ స్క్రీన్ సౌలభ్యం ఉంది. వీళ్లు తయారుచేసిన దానికి కూడా రెండు ఆప్షన్లు ఇస్తున్నారు. మొదటిది వాయిస్ రికగ్నిషన్. ఒకవేళ నాయిస్ ఎక్కువగా ఉంటే ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఇస్తామంటున్నారు.

మన దేశంలో ప్రతీ మనిషికి రోబో అవసరమొచ్చే రోజు ఇంకా రాలేదు. కాకపోతే రోబోటిక్స్ మీద రీసెర్చ్ ఎప్పటినుంచో జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి రోబో చాలా అవసరం ఉంది. దాంతోపాటు హెల్త్ కేర్, సెక్యూరిటీ. ఈ మూడు అంశాల్లో రోబోల ప్రాధాన్యత ఎంతో ఉందంటున్నారు కిషన్. అందుకే తాము ఏ ప్రాడక్ట్ చేసినా ఈ మూడింటి రిలేటెడ్ గానే చేస్తామంటున్నారు. తమ సంస్థ నుంచి మొట్టమొదటి అగ్రికల్చర్ రోబో సంక్రాంతికి వస్తుందని చెప్తున్నారు. అయితే పోలీస్ రోబోని ఇప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దనుకున్నారు. కానీ ఇంతలోనే దుబాయ్ పరిచయం చేసింది. ఇంకొంచెం ఆగితే ఇంకో దేశం అనౌన్స్ చేస్తుందని తొందరపడి వెల్లడించారు. అట్లీస్ట్ ఇండియా అయినా సెకండ్ కంట్రీ అయినందుకు హాపీగా ఉందంటున్నారు కిషన్.

ఈ మధ్యనే జయేష్ రంజన్ తో పోలీస్ రోబో డిజైన్ లాంఛ్ చేశారు. అక్టోబర్ కల్లా ప్రాడక్ట్ పూర్తవుతుంది. మరో రెండు నెలలు టెస్ట్ చేస్తారు. డిసెంబర్ 31న జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ రోబోని డిప్లాయ్ చేయాలనేది వీరి ప్లాన్.