పూర్తి స్థాయి ఈకామర్స్ బిజినెస్ మోడల్ సిద్ధం : షియోమీ ఇండియన్ హెడ్ మను జైన్

మొబైల్ ఈకామర్స్ స్టార్టప్ లకు ఫండింగ్ కు సిద్ధం దేశవ్యాప్తంగా సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు15వందల పట్టణాలకు విస్తరించిన సేవలునిరుడు 61వేల హ్యాండ్ సెట్స్ అమ్మిన ఎంఐఆఫ్ లైన్ స్టోర్ లపై ఆసక్తి చూపుతోన్న షియోమి

పూర్తి స్థాయి ఈకామర్స్ బిజినెస్ మోడల్ సిద్ధం : షియోమీ ఇండియన్ హెడ్ మను జైన్

Friday July 10, 2015,

4 min Read

సొంత ఈకామర్స్ వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు షియోమీ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ప్రకటించారు. ఎంఈ డాట్ కామ్ ద్వారా తమ సేల్స్ పెంచడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారాయన.దక్షిణాదిలో హైదరాబాద్ ఆసక్తికరమైన మార్కెట్ అని చెప్పుకొచ్చారు. భారతీయ ఈకామర్స్ స్పేస్ లో చైనా మొబైల్ జెయింట్ ఎంఐ కు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగంలో తాము మూడో స్థానంలో ఉన్నట్లు మను అంటున్నారు. ఇండియాలోఅమ్మకాలు ప్రారంభించిన పదకొండు నెలల్లో రెండువందల శాతానికి పైగా గ్రోత్ ను సాధించి సరకొత్త రికార్డు నమోదు చేశామని అన్నారాయన. ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, అందులో దక్షిణ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు.

image


ఇప్పటి దాకా ఈకామర్స్ కే పరిమితమైన ఎంఐ మొబైల్స్ మొదటి సారి మీడియా ముందుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసింది. తమకి మీడియా షై లేదని ఎడ్వర్టైజింగ్ షై మాత్రమే ఉందని ఎంఐ భారతీయ అధినేత మనుకుమారు అన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 1500 పట్టణాలకు ఎంఐ సేవలను విస్తరించామని, ఇటీవలే రతన్ టాటా తమ కంపెనీ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారని వివరించారు. చైనాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంఐ, ప్రపంచ వ్యాప్తంగా టాప్ త్రీలో శాంసంగ్‌కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. గూగుల్ సెర్చ్ ఇంజిల్ లో సెవెన్ మోస్ట్ ఫేమస్ సెర్చింగ్ బ్రాండ్‌లలో ఎంఐ ఉంది. భారత దేశంలో మరిన్ని సర్వీసింగ్ సెంటర్లతో విస్తరణ చేపట్టిన ఈ మొబైల్ జెయింట్ మరో నెలరోజుల్లో భారత్‌లో సేల్స్ ప్రారంభించి ఏడాది పూర్తిచేసుకోబోతోంది.

ఇప్పటి వరకూ ప్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సైట్ ల ద్వారా అమ్మకాలు చేస్తోన్న ఈ కంపెనీ భవిష్యత్‌లో మరిన్ని ఈకామర్స్ కంపెనీలతో కలసి పనిచేయనుంది. కొన్ని స్టార్టప్ కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు మను జైన్ చెప్పారు. అవసరం అనుకుంటే ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తాము లిస్టవుట్ చేసిన కంపెనీలన్నీ స్టార్టప్ కంపెనీలే. కానీ అవి ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షించి బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వాటితో టై అప్ పెట్టుకునే బదులు వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సొంత సైట్ ఎంఐ డాట్ కామ్ ద్వారా కూడా భారీగా అమ్మకాలు చేయాలని చూస్తున్నట్లు చెప్పారాయన. తమ కంపెనీయే వేర్ హౌస్ ని ఏర్పాటు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్నారు. రోజూ వేలల్లో వచ్చే ఆర్డర్లతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. అంతే కాకుండా ఇతర డివైజ్ లకు కూడా మొబైల్ ఈకామర్స్ సేవలు అందిస్తామని అన్నారు. పూర్తి స్థాయి ఈకామర్స్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారాయన.

మీడియా ముందు మాట్లాడుతున్న మను జైన్

మీడియా ముందు మాట్లాడుతున్న మను జైన్


పెయిడ్ మార్కెట్‌కు దూరం

మీడియా పబ్లిసిటీకి, కమర్షియల్ యాడ్స్ ఇచ్చి ఖర్చు చేయడానికి తాము సిద్ధంగా లేమని యువర్ స్టోరీతో మాట్లాడుతూ మనుకుమార్ అన్నారు. తమ సైటు ఎంఐ డాట్ కామ్ ప్రమోషన్ కోసం ఎలాంటి బడ్జెట్ విడుదల చేయలేదన్నారు.

“పెయిడ్ మార్కెటింగ్ మా పాలసీ కాదు. ప్రకటనల కోసం ఖర్చు చేయడం మాకు ఇష్టం లేదు. అదే డబ్బుతో వినియోగదారులకు సేవలు అందిచాలనేదే మా అభిమతం. హైదరాబాద్‌తో ప్రారంభమైన మా సేవల పరంపర మరిన్ని నగరాలకు విస్తరించనుంది. దీన్ని ప్రకటించడానికే మొదటి సారి భారత్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం” –మను జైన్

షియోమీ భారత్‌లో దూసుకుపోతోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తోపాటు హైదరాబాద్, చెన్నైలాంటి నగరాల్లో తమ సేల్స్ భారీగా ఉన్నాయని, టూటైర్ సిటీల్లో తమ మొబైల్స్ ప్రాచుర్యంలో ఉన్నాయని, త్రీ టైర్ సిటీల్లోకూడా సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు చేయడంపై ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 స్మార్టెస్ట్ కంపెనీల్లో ఎంఐ కూడా ఒకటని క్లెయిమ్ చేశారు మను.

image


ఎంఐ ఐదేళ్ల ప్రస్థానం

2010లో చైనాలో షియోమీని లీ జన్ ప్రారంభించారు. టెక్నాలజీ అనేది ఖర్చుతో కూడుకున్నది కాదనే సిద్ధాంతాన్ని నమ్మే లీజన్ అందరికీ టెక్నాలజీ చేరవేయాలనుకున్నారు. ఐదేళ్లలో దాదాపు తన విజన్‌ను సాధించడానికి చేరువయ్యారు. చైనాలో మొదలైన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా గుర్తించదగిన గ్రోత్‌ను నమెదు చేసింది. 2014 లో షియోమీ 61 మిలియన్ల హ్యాండ్ సెట్ అమ్మకాలను చేపట్టింది. థైవాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా,ఫిలిప్పైన్స్, ఇండియా, ఇండోనేషియాతో పాటు బ్రెజిల్ లో షియోమీకి నమ్మకమైన వినియోదారులున్నారు. ప్రస్తుతానికిదో గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

భారత్‌లో షియోమీకి మనుజైన్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఐటి ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన మను , ఐఐఎం కోల్కతా నుంచి ఎంబిఏ డిగ్రీ పొందారు. షియోమీలో చేరక ముందు జబాంగ్ డాట్ కామ్‌కు కో ఫౌండర్గా ఉన్నారాయ. 2014 నుంచి షియోమీ బెంగళూరు కేంద్రంగా భారత్‌లో సేవలు ప్రారంభించింది అప్పటి నుంచి ఆయనే హెడ్‌గా కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్ పై ఆసక్తి

భారత్ లో దక్షిణాది మార్కెట్ చాల పెద్దది. ఉత్తర భారతంతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత ఎక్కువ. ఐటి , ఐటి ఆధారిత సంస్థలు అధికం. దీంతో తమలాంటి ఈకామర్స్ కంపెనీల డెస్టినేషన్ ఎప్పుడూ సౌతిండియానే అని మను అంటున్నారు. సౌతిండియాలో హైదారాబాద్ అనేది స్టేబుల్‌గా ఉండే మార్కెట్. తమలాంటి కంపెనీలకు ఇది ఓ ఆసక్తికరమైన మార్కెట్. ఇక్కడ మీడియా కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా భారీగా విస్తరించి ఉంది. మాలాంటి కంపెనీల మార్కెట్ పెరగాలంటే స్థానిక మీడియాలో కవరేజి కంపల్సరీ. ఇక బెంగళూరు, చెన్నైలు మా తర్వాతి డెస్టినేషన్లు. హైదరాబాద్ నుంచి మొదలైన పబ్లిసిటీ సౌతిండియా మొత్తం వ్యాపింప జేస్తామని అన్నారాయన.

భవిష్యత్ ప్రణాళికలు

''ఇప్పటికే ఎయిర్టెల్ నెట్వర్క్ తో కలసి 4G మొబైల్ అమ్మకాలను మొదలు పెట్టాం. తెలుగు, కన్నడ,హిందీతో పాటు మొత్తం 6 భారతీయ భాషలను మా మొబైల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చాం. భవిష్యత్ లో మరిన్ని భారతీయ భాషలను అందుబాటులోకి తెస్తాం. ఇప్పటివరకూ ఈకామర్స్ కే పరిమితమైన మేం ఆఫ్ లైన్ సేల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఆఫ్ లైన్ పార్టనర్‌లతో కలసి జాయింట్ వెంచర్‌లో రిటైల్ మార్కెట్‌లోకి రావాలని ఇప్పట్లో లేకపోయినా భవిష్యత్‌లో అది సాధ్యమే. భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై కూడా తాము ప్రణాళిక రచిస్తున్నాం. చాల రాష్ట్రాల నుంచి మాకు ప్రపోజల్స్ వచ్చాయి, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని'' ముగించారు జైన్.