షుగర్ పేషెంట్లకు వరంలా దొరికింది!!

చికిత్స, కౌన్సెలింగ్ ఒకేచోట యూఎస్ నుంచి ఇండియాకి వచ్చి సోషల్ ఎంట్రప్రెన్యూరింగ్

షుగర్ పేషెంట్లకు వరంలా దొరికింది!!

Sunday July 05, 2015,

3 min Read

డయాబెటిస్. తియ్యటి శత్రువు. దానికి వయసుతో నిమిత్తం లేదు. ఒంట్లోకి చొరబడిందంటే కుళ్లబొడిచేదాకా వదలదు. వారు వీరు అని తేడాలేదు. ఉన్నోడా లేనోడా అని చూడదు. ఎవరినైనా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఒక్కసారి మధుమేహం బారిన పడ్డామంటే అంతే సంగతులు! ఖరీదైన మందులు. క్రమం తప్పని ఇంజెక్షన్లు. లేకుంటే బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. బ్లడ్‌లో గ్లూకోసం పర్సెంటేజీ పెరుగుతుంది. పాదాల నుంచి గుండె వరకు ఎప్పుడేం వినాల్సి వస్తుందో అని భయంతో బతకాలి.

బెంగళూరులోని క్యాంప్ లోఎరిన్ లిటిల్

బెంగళూరులోని క్యాంప్ లోఎరిన్ లిటిల్


ఎంతమందికి షుగర్ వ్యాధిపై అవగాహన ఉంది?

విశ్వ వ్యాప్తంగా కలవరపెడుతున్న వ్యాధి మధుమేహం. ప్రపంచంలో 8 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు. అందులో మనదేశం రికార్డుస్థాయిలో ఉంది. మరి దీనికి చికిత్సామార్గం ఏంటి? ఎంతమందికి షుగర్ వ్యాధిపై అవగాహన ఉంది? ఎంతమందికి మందులు అందుబాటులో ఉంటున్నాయి? ఇంజెక్షన్ కొనే స్థోమతలేక ఎంతమంది శరీరాన్ని శిథిలం చేసుకుంటున్నారు? డబ్బున్నవాళ్ల సంగతి సరే! కనీసం ఒకపూట తిండికి కూడా నోచుకోని వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికోసమే ఎరిన్ లిటిల్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది.

ఎవరీ ఎరిన్ లిటిల్?

సుక్ర్ బ్లూ. దీని గురించి తెలుసుకునే ముందు- ఎరిన్ గురించి కొంత ఇంట్రడక్షన్ అవసరం. అప్పుడామెకు పదేళ్లు. అమెరికా మిస్సోరిలోని ఓ చర్చి క్యాంపులో ఉండేది. షుగర్ ఎటాక్ అయింది. కానీ హాస్పిటల్ వెళ్లేందుకు పరిస్థితులు సహకరించలేదు. అలా పదకొండేళ్లు గడిచాక గానీ- ఓ స్పెషలిస్టు డాక్టర్‌ని కలవలేకపోయింది. ఇది ఒక్క ఎరిన్ వ్యథే కాదు. తనలాంటి వాళ్లు ఆరుకోట్ల మంది ఉన్నారు. ఒకపక్క డయాబెటీస్‌తో పోరాడుతూనే- అమెరికాతో పాటు అనేక దేశాల్లో పరిశోధన చేసింది. రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య ఎంత పెద్దదో అర్ధమైందామెకు. ఇండియా, చైనా దేశాల్లో ఈ ప్రాబ్లమ్ ఎంత సీవియర్‌గా ఉందో తెలుసుకుంది.

మధుమేహం ఇక బాధించదు!

సుక్ర్ బ్లూ. లాభాపేక్ష లేని సంస్థ. షుగర్ డయాగ్నసిస్ తో పాటు పేద ప్రజలకు మందులు గోలీలు ఇస్తుంది. వీలైనంత తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తుంది. మొదట బెంగళూరులోని ఓ గ్రామంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. డయాబెటీస్, గుండెకండరాల సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్ లాంటివి ఉన్న నిరుపేదలకు చికిత్స చేయడం ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం. ఎందుకంటే కర్నాటకలో డయాబెటీస్ రేటు 15 శాతం ఉంది. కొన్ని ఊళ్లలో 30 శాతం కూడా ఉంది. అందుకే ప్రాజెక్టు కర్నాటకలో ఆరంభమైంది. ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లో- పేషెంట్లలోనే ఓ వ్యక్తిని లీడర్ గా తీసుకుంటారు. అతనికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అతను ఆసుపత్రి నుంచి తిరిగివచ్చి గ్రామంలో ఉన్న తనలాంటి వారినందరినీ చైతన్య పరుస్తాడు.అదే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనికోసం బెంగళూరులోని జ్ఞాన సంజీవని హాస్పిటల్ తో టై అప్ పెట్టుకుంది సుక్ర్ బ్లూ.

సుక్ర్ బ్లూ అవేర్ నెస్ ప్రోగ్రామ్

సుక్ర్ బ్లూ అవేర్ నెస్ ప్రోగ్రామ్


అనుభవం నేర్పిన పాఠంతో

ఇప్పుడు లోకం పోకడ ఎలా ఉందంటే -ఒంట్లో ఏ రోగమొచ్చినా బయటకి చెప్పుకోవడం లేదు. ఒక్క షుగరనే కాదు.. ఏ వ్యాధి వచ్చినా -అది బైటపడితే నా కూతురుకు పెళ్లవుతుందా? నా కొడుకును సమాజం చేరదీస్తుందా? అని ఆలోచించే తల్లిదండ్రులున్నారు. ఇదే విషయాన్ని ఆవేదనతో చెప్పారు లిటిల్.

గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా

ఒకప్పుడు షుగర్ అనే ఏ హై క్లాస్ వారికో, ఏసీ ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వారికో వస్తుందనే అపోహ ఉండేది. అదంతా ఒకప్పుడుండేది. ఇప్పుడు మధుమేహం గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. నెలకు 5-6 వేలు కూడా సంపాదించ లేనివారికి షుగర్ వస్తే -మందుల కోసం జీతం నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేసే ధైర్యం వారికి ఉంటుందా? డబ్బున్న మారాజులకు ఈ జబ్బొస్తే- వారికి కాస్తో కూస్తో అవగాహన ఉంటుంది. ఎక్సర్ సైజ్ చేయడం, యోగా, మెడిటేషన్ వంటి వాటితో ప్రభావం పడకుండా చూసుకుంటారు. మరి ఏ ఆదెరువూ లేనోళ్లకు వస్తే?

సుక్ర్ బ్లూ కి మొదట్లో అనుకున్నంత ఆదరణ దొరకలేదు. ఓ అంతర్జాతీయ స్థాయి హెల్త్ ఆర్గనైజేషన్‌ గ్రామీణ ప్రాంతాల్లో రన్ చేయడమంటే కొంచెం రిస్కే. ఎందుకంటే స్థానికంగా వనరులేమీ ఉండవు. సపోర్టు దొరకదు. ఈ సవాళ్లు, ఇబ్బందులు పక్కనబెడితే ఎరిన్ మాత్రం లక్ష్యంపైనే దృష్టి పెట్టారు.