కటకటాల వెనక్కి “ఐఫోన్ కిల్లర్” ప్రమోటర్లు

Sunday March 06, 2016,

2 min Read


ఫ్రీడమ్ 251, మోహిత్ గోయల్ … ఈ పేర్లు ఇటీవలికాలంలో మార్మోగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్లు తయారుచేస్తామంటూ ఆర్డర్లు తీసుకున్నారు రింగింగ్ బెల్స్ కంపెనీ సీఈఓ మోహిత్ గోయల్. ఫ్రీడమ్ 251 పేరుతో స్మార్ట్ ఫోన్ ను 251 రూపాయలకే అందిస్తానంటూ ఊదరగొట్టారు. అంత తక్కువ ధరకు అన్ని హంగులతో స్మార్ట్ ఫోన్ ఇచ్చినా ఇంకా 30 రూపాయలు తమకు లాభమేనంటూ చిన్న సైజు డెమో కూడా ఇచ్చారు మోహిత్. ప్రజల దగ్గరనుంచి డిపాజిట్లు సేకరించడం, ఫిర్యాదులు రావడంతో … రింగింగ్ బెల్స్ కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు తప్పలేదు. నొయిడాలోని కంపెనీ ప్రధాన కార్యాలయం మూతపడింది.

అతి తక్కువ ధరకు ఐఫోన్ బాబులాంటి స్మార్ట్ ఫోన్ తయారుచేస్తామంటూ ప్రచారం చేసుకున్న కేరళ బ్రదర్స్ ఆంటో అగస్టీన్ (32), జోసెకుట్టి అగస్టీన్ (24)లకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. చివరికి కటకటాలు లెక్కించాల్సి వస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లాకుచెందిన వీరిద్దర్నీ బ్రాండ్ ఎం ఐఫోన్ సిరీస్ విడుదల రోజే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంటో అగస్టీన్, జోసెకుట్టి అగస్టీన్ ఎం ఫోన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీస్ పేరుతో కోచిలో సంస్థను ఏర్పాటుచేశారు. “ఐ ఫోన్ కిల్లర్“గా దీనికి ప్రచారం చేసుకున్నారు. ఎం ఫోన్ సిరీస్ పేరుతో 11 వేల రూపాయల నుంచి 40వేల రూపాయల వరకు ఫోన్ ధరలను నిర్ణయించారు. అయితే ఎం ఫోన్ లాంచింగ్ కు జస్ట్ కొన్ని గంటల ముందే ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి … జైల్లో వేశారు. తప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసగించారంటూ కేసు నమోదు చేశారు. బ్యాంక్ కు టోకరా వేసి … ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ సహా పలు బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలు నమోదయ్యాయి.

ఎంఫోన్ సిరీస్ తో పాటు అదే బ్రాండ్ స్మార్ట్ వాచీలు, వైర్ లెస్ ఛార్జర్లు, హెడ్ ఫోన్లు ,పవర్ బ్యాంక్స్ తక్కువ ధరకే అందిస్తామంటూ తమ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ లా… రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని వీరు చెప్పలేదు. దీంతో కంపెనీపై బ్యాంకులు సహా ఎవరికీ అపనమ్మకం ఏర్పడలేదు. పైగా మ్యాంగో బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకోసం ఈ కంపెనీ 35వేల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు … మొబైల్ తయారీలో నాలుగేళ్ల అనుభవం ఉందంటూ ప్రచారం చేసుకున్నారు.

స్మార్ట్ ఫోన్ మాటేమిటోగానీ… ఎం ఫోన్ వెబ్ సైట్ మాత్రం అత్యద్భుతంగా డిజైన్ చేశారు. ఫ్రీడమ్ 251 కన్నా చాలా బాగుంది.వెబ్ సైట్ డొమైన్ 6-06- 16న ప్రారంభమయ్యింది. 16-02-2016న చివరిసారి అప్ డేట్ చేశారు. ఆంటో పేరుతో వెబ్ సైట్ రిజిస్టరై ఉంది. ప్రమోటర్ సోదరులిద్దరూ అరెస్టైనా… ఫోన్ ను కంపెనీ ఛైర్మన్ రోజె ఆగస్టీన్ విడుదల చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కేసు తనకు తెలియదంటున్నారాయన. 

మరోవైపు ఫ్రీడమ్ 251 ఫోన్ పై ఆరోపణలు, సందేహాలు ఎక్కువవ్వడంతో … కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బునువెనక్కి ఇచ్చేయాలని రింగింగ్ బెల్స్ కంపెనీ నిర్ణయించింది. అయితే మ్యాంగో ఫోన్ కస్టమర్ల పరిస్థితి ఏమిటన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. ఎంఫోన్ ప్రమోటర్ల అరెస్టుల వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు రోజె ఆగస్టీన్.