36 ఏళ్లపాటు జీతం డబ్బులు విరాళం! రూ. 30 కోట్లు పేదలకు దానం చేసిన మహానుభావుడు !

36 ఏళ్లపాటు జీతం డబ్బులు విరాళం! రూ. 30 కోట్లు పేదలకు దానం చేసిన మహానుభావుడు !

Monday January 11, 2016,

2 min Read

ఎవరైనా తనకు ఉన్నదాంట్లో కొంత దానం చేస్తారు! కానీ ఉన్నదంతా దానం చేసేవాళ్లు ఎంతమంది వుంటారు చెప్పండి?! అలాంటి ఉత్తమోత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు. కల్యాణ సుందరం జీవితం అలాంటిదే! అతని గొప్పతనం గురించి వింటే నిజంగా వళ్లు పులకరిస్తుంది! అతనలా నడిచొస్తుంటే మూర్తీభవించిన మానవత్వం ఖద్దరు చొక్కా వేసుకుని ఎదురుపడ్డట్టే ఉంటుంది. అతని గురించి తెలుసుకున్నా కొద్దీ ఇంకా వినాలనే తపన పుడుతుంది. అర్జెంటుగా కలుసుకోవాలనిపిస్తుంది.

image


నేను నిలబడటమే కాదు.. పక్కవాడు కూడా నిలబడాలి! ఇంత గొప్ప ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కల్యాణ సుందరం! తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఊహ తెలియకముందే తండ్రి కన్నుమూశాడు. అమ్మ లాలన తప్ప, తండ్రి ప్రేమ తెలియదు. ఉన్నదాంట్లో సాయం చేయాలనే తల్లి గుణమే సుందరానికి అబ్బింది. కష్టపడి చదివాడు. లిటరేచర్‌ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్టు. లైబ్రేరియన్ గా జీవితం మొదలుపెట్టాడు. మొదటి నెల నుంచే విరాళాల పరంపర కొనసాగింది. లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే, ఒక హోటల్లో సర్వర్‌ గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేశాడు. జీతంలో ప్రతీ పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశాడు. చివరికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు.

కల్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు అమెరికా ‘మ్యాన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్ధ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఆయనను 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది.

ఇంకో విషయం ఏంటంటే కల్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే, వన్స్ పెళ్లయితే అప్పుడు ప్రియారిటీస్ మారిపోతాయి. రిలేషన్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అవుతాయి. ఇదంతా కల్యాణ సుందరం ముందే ఊహించాడు. అందేకే జీవిత పుస్తకంలో పెళ్లి అనే పేజీని తొలగించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులేవో సమాజానికి పెడతానంటాడు. పెళ్లి చేసుకోవా అని సన్నిహితులు ఎవరైనా అడిగితే.. పేరులో కల్యాణం ఉంది కదా ఇంకెందుకు అని జోక్ చేస్తాడు.

ఇంతటి పేరు ప్రఖ్యాతులున్నా కల్యాణ సుందరం చాలా సాదాసీదాగా ఉంటారు. ఆడంబరం నచ్చదు. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయనిది డబ్బొక్కటే అంటాడు. అందుకే దాన్ని నలుగురికీ పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నాడు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం. ఏదీ తన ఆస్తి అనుకోలేదు కాబట్టే చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే సంపాదించిన ప్రతి రూపాయినీ దానం చేయగలిగాడు. స్వార్ధం రాజ్యమేలే ఈ సమాజంలో నిస్వార్ధంగా బతుకుతూ, నాలుగు డబ్బులు సంపాదించడం కాదు..చస్తే మోయడానికి నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి అని చాటిచెప్పిన కల్యాణ సుందరం నిజంగా స్ఫూర్తి ప్రదాత.