సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ.. కాదేదీ అసాధ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల్లో దాగి ఉన్న శక్తులను బయటకు రప్పించి వారిని నవ భారత నిర్మాతలుగా చేసేందుకు ఇద్దరు యువకులు శ్రీకారం చుట్టారు. మహాత్ముడి రైల్ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని రైలు యాత్ర ద్వారా యువకుల్లో దేశం పట్ల ప్రేమను, వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణను అందిస్తున్నది జాగృతి యాత్ర..
దేశవ్యాప్త టూర్తో నవభారత నిర్మాణానికి జాగృతి యాత్ర శ్రీకారం చుట్టింది. ప్రతియేటా 15 రోజులపాటు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం నిర్వహిస్తూ రేపటి తరం పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. కొత్త తరం పారిశ్రామికవేత్తలకు అవసరమైన శిక్షణ ఇస్తూనే, దేశభక్తిని, గౌరవాన్ని పెంపొందించేందుకు నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు 475 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసి తమ లక్ష్యానికి చేరువవుతున్నారు.
బలమైన ఆశయం పెను మార్పులకు నాంది. ఈ మాట అక్షర సత్యం. దీన్ని బలంగా నమ్మిన ఇద్దరు యువకులు ఏకంగా ఓ సంస్థను నెలకొల్పి దేశభక్తిని పెంపొందించడంతోపాటు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నారు.
జాగృతి లేదా మేలుకొలుపు.. ఇదే జాగృతి యాత్ర లక్ష్యం. నవ భారత నిర్మాణం కోసం శశాంక్ మణి, రాజ్ కృష్ణమూర్తి జాగృతి యాత్రను స్థాపించారు.
పారదర్శకత, డిస్కవరీ ద్వారా నవ భారత్ను నిర్మించాలన్నది వీరి ఆశయం. యువత సహకరిస్తే 20 ఏళ్లలో దేశాన్ని మార్చొచ్చని, మరింత సాధికారిక దేశంగా చేయొచ్చని వీరంటున్నారు.
దేశవ్యాప్త యాత్ర..
జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్ర సమర బరిలోకి దిగేముందు దేశవ్యాప్తంగా రైల్ యాత్రను నిర్వహించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహాత్ముడి శత జయంతి జ్ఞాపకార్థం జాగృతి కూడా దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా మహాత్ముడి జ్ఞాపకాలు మరోసారి గుర్తు చేసుకునేలా ప్రత్యేకంగా ఓ కోచ్నే బుక్ చేశారు.
ఎనిమిదో ఎడిషన్..
ఇప్పటివరకూ నిర్వహించిన యాత్రలో విశేషాలు.. ..
- యాత్రలో తొలిసారిగా మహిళా, పురుష సభ్యులు సమాన సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ యాత్రలో దాదాపుగా సగం మంది (42 శాతం) మంది మహిళలు తమ సేవలను అందిస్తున్నారు.
- దేశంలోని 29 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల నుంచే కాదు.. మొత్తం 23 దేశాలకు చెందినవారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతమైతే కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నుంచే ఒక్కరు కూడా పాల్గొనడం లేదు. కానీ నిర్వాహకులు మాత్రం త్వరలోనే ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి కూడా పాల్గొంటారని చెప్తున్నారు.
- యాత్రలో పాల్గొంటున్నవారిలో 33% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 36 % మంది పట్టణ ప్రాంతానికి చెందిన వారు. 31% మాత్రమే నగరాలకు చెందినవారు.
- మొత్తం 17 వేలమంది రిజిస్ట్రేషన్లు చేసుకుంటే 475 మందిని మాత్రమే నిర్వాహకులు ఎంపికచేశారు.
ఈ యాత్ర మధ్యభారతం గుండా సాగుతుంది. గ్రామీణ, వెనుకబడిన గ్రామాలను అభివృద్ధిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శశాంక్ తెలిపారు. అలాగే ‘రియల్ ఇండియా’గా పిలిచే టైర్-3 టౌన్షిప్స్ అభివృద్ధికీ కొద్ది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దేశంలోని జనాభాలో 42.3% మంది, అంటే 550 మిలియన్ల మంది మధ్య భారతంలోనే నివసిస్తున్నారని శశాంక్ వివరించారు.
12 నగరాల గుండా..
ఈ యాత్ర దేశంలోని 12 నగరాల (ముంబై, హుబ్లీ, బెంగళూరు, మధురై, చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, పాట్నా, దియోరియా, ఢిల్లీ, టిలోనియా, అహ్మదాబాద్) గుండా సాగుతుంది. ఈ యాత్రలో పాల్గొంటున్నవారు నేర్చుకునేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మూడు దశలుగా..
ఈ యాత్రను ఒకేసారి కాకుండా మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. లెగ్-1లో ముంబై నుంచి చెన్నై వరకు సాగుతుంది. దీన్ని ఎక్స్ప్లోరేషన్ స్టేజ్గా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ దశలో యాత్రికులు తమ రోల్ మోడల్స్ నుంచి, తమతో ప్రయాణించినవారి నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
లెగ్-2..
ఇక రెండో దశలో చెన్నై నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం సాగుతుంది. దీన్ని యాత్రిలో మ్యాజికల్ పార్ట్గా నిర్వహాకుడు రాజ్ చెప్తున్నారు. దీనికి క్రియేషన్ అని పేరు పెట్టారు.
ఈ యాత్ర ద్వారా ఇంట్రోవర్ట్స్ లబ్ధి పొందుతారు. తమలో ఉన్న బిడియాన్ని వదిలి నిర్భయంగా మాట్లాడే శక్తిని వీరు పొందుతారు. ఎక్స్ట్రోవర్ట్స్ మరింత శ్రద్ధగా ఆలకించే అలవాటును పెంపొందించుకుంటారు.
లెగ్-3
ఇక చివరి దశ ప్రయాణం ఢిల్లీ నుంచి ముంబై వరకు సాగుతుంది. దీన్ని ఇంటిగ్రేషన్ స్టేజ్గా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ దశలో తాము ప్రయాణ సమయంలో నేర్చుకున్న విషయాలను అమలుపర్చేందుకు యాత్రికులు యత్నిస్తారు.
ఈ యాత్ర సందర్భంగా యాత్రికులు కొత్త విషయాలను కొనుగొనడంతోపాటు, తమలో దాగి ఉన్న శక్తులును కూడా తెలుసుకుని ఆత్వవిశ్వాసాన్ని పెంచుకుంటారని రాజ్ చెప్పారు.
15 రోజుల ప్రయాణంలో పార్టిసిపెంట్స్ను ఆరేసి మంది గ్రూపుగా విభజించారు. ఒకరిని ఫెసిలిటేటర్గా నియమించారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, ఎనర్జీ, విద్య, నీటి పారిశుద్ధం, ఆర్ట్స్, కల్చర్, ఉత్పత్తి.. ఇలా వివిధ రంగాలలో సభ్యుల ఇష్టాల ఆధారంగా గ్రూపులను విభజిస్తారు.
ఆ తర్వాత ఆ గ్రూపులను ఒక్కటిగా మార్చి.. సభ్యుల బిజినెస్ ఐడియాలపై బిజ్ జ్ఞాన్ ట్రీ పేరిట పోటీ నిర్వహిస్తారు.
ఈ యాత్రలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ వినూత్నంగా, అందరి సహకారంతో, పారదర్శకంగా ఉంటాయి. సంస్థకు లేదా, పారిశ్రామికవేత్త విజయానికి అవసరమయ్యే కార్యక్రమాలే నిర్వహిస్తారు.
పూర్వ యాత్రికులు.. ప్రస్తుత వ్యవస్థాకులు...
గతంలో ఈ యాత్రలో పాల్గొన్న చాలామంది మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగారు. 2012 యాత్రిలో పాల్గొన్న వడాలాకు చెందిన సవిత ముండే రాజలక్ష్మి సోయా ఫూడ్స్ పేరుతో తమ సొంతగ్రామంలోనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే వ్యాపారం కోసం కోటి రూపాయలను సమీకరించిన సవిత.. ప్రస్తుతం మరో రెసిపీ రైస్ పోహాను కూడా లాంచ్ చేశారు. అంతేకాదు ఆ గ్రామంలో ఇప్పుడు ఆమే గ్రామ్ ప్రధాన్. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆమె ఈ ఘనత సాధించారు. ఇదంతా జాగృతి యాత్ర పుణ్యమేనని సవిత చెప్తారు. సవితలాగే కవిష్, నేహా ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత గాయకులు, రచయితలకు పెద్ద పట్టణాల్లో అవకాశం కల్పించే ఉద్దేశంతో వీరిద్దరూ జుబాన్ పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. స్వయంగా సింగర్ కమ్ రైటర్ అయిన కావిష్, ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహించే నేహా సంయుక్తంగా సంస్థను గ్రామీణ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జాగృతి ఎక్స్ప్రెస్లలో పాల్గొన్న యాత్రికుల్లో 350 మందికిపై సంస్థలను ఏర్పాటు చేశారు. పూర్వ యాత్రికుల్లో 49% మంది దేశ నిర్మాణం కోసం ఏదో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం విశేషం.
యాత్ర ఉత్సాహంతోపాటు కొంత ఆందోళన కూడా కలిగించింది. ‘‘మా యాత్ర ద్వారా మేం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించాం. ఆ ప్రాంతాలు కూడా దేశంలో భాగమే. మేం కాకపోతే మరెవరూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు’’ అని శశాంక్ అంటున్నారు.
ఇప్పుడు యాత్రి ఎక్స్ప్రెస్ నిర్వాహకులు తీసుకున్న చొరవ కారణంగా భవిష్యత్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రారంభమవుతున్నారు. అనుభవాలు, పాఠాలు పంచడంతోతోపాటు దేశంపై తమకున్న ప్రేమను ప్రకటించడం ద్వారా నిర్వాహకులు రేపటి తరం పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు సక్సెస్ కావాలని యువర్స్టోరీ కోరుకుంటోంది.
ఫొటో క్రెడిట్స్: ప్రద్నేశ్ (సాకు)