భాగ్యనగరం మెచ్చిన జలస్మరణీయుడు సుభాష్

భాగ్యనగరం మెచ్చిన జలస్మరణీయుడు సుభాష్

Saturday July 15, 2017,

2 min Read

భూమి మనకు చాలా నీరిచ్చింది. మనం కూడా దానికి ఎంతో కొంత ఇవ్వాలి. లేకపోతే లాసైపోతాం. భవిష్యత్ తరాలను హెచ్చరించేందుకు ఈ మాటొక్కటి చాలు. ధరిత్రి నుంచి నీళ్లు తీసుకోవడమే గానీ, తిరిగిఇవ్వడం తెలియని మనిషికి అంత తేలిగ్గా ఈ లాజిక్ అర్ధం కాదు. విడమరిచి చెప్పాలి. వివరంగా తెలియజేయాలి. ప్రాక్టికల్ గా చూపించాలి. అలాంటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నాడు హైదరాబాదుకి చెందిన సుభాష్.

image


ఇంకుడు గుంత ఒక్కటి చాలు ఇంకేం అక్కర్లేదన్న నిప్పులాంటి మాటను పిడికిట పట్టుకుని తిరుగుతున్న సుభాష్ ని చూస్తే.. నీళ్లంటే అతనికి ఎంత అభిమానమో అర్ధమవుతంది. హైదరాబాదులో చిన్నాపాటి వానకురిసి, అదంతా క్షణాల్లో మురుగు కాల్వలో పడి ప్రవహిస్తుంటే అతని మనసు చివుక్కుమంటుంది. రెండు మూడు సెంటీమీటర్ల వానకే నీళ్లన్నీ డ్రైనేజీలో పడిపోతుంటూ గుండెలు బాదుకుంటాడు. ఇక 10-15 సెంటీమీటర్ల వానపడి నీళ్లన్నీ రోడ్లమీద చెరువుల్లా మారి, ఆపై మురికికాల్వలో పడిపోతే అతను ఎంత తల్లడిల్లిపోతాడో ఊహించుకోవచ్చు.

హైదరాబాదులో వరదలొస్తే ఎంత దారుణంగా ఉంటుందో, నీటి కరువొచ్చినా అంతే ఘోరంగా ఉంటుంది. నానాటికీ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారుతుంటే భూగర్భ జలాలు అంతకంతకూ మొహం చాటేస్తున్నాయి. వెయ్యి-రెండువేల ఫీట్ల లోతున బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి. లక్షలు, కోట్లు గుమ్మరించి ఇటాలియన్ మార్బుల్ తో ఇల్లు కట్టుకుంటారు గానీ కాసింత జాగాలో ఇంకుడు గుంత మాత్రం తీయరు. జనంలో ఇలాంటి మైండ్ సెట్ మారాలనే లక్ష్యంతో 1997లో స్మరణ్ అనే ఎన్జీవోని స్థాపించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నాడు.

image


ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేసి బీఎస్ఎన్ఎల్ చేసిన సుభాష్ గొప్ప మానవతావాది. ప్రకృతి ప్రేమికుడు. సామాజిక కార్యకర్త. నిత్యం నీళ్లకోసం తపించే జలస్మరణీయుడుగా మారి 2003 నుంచి హైదరాబాదులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద అవగాహన తెస్తూ గల్లీగల్లీ తిరుగుతున్నాడు. అంతకుముందు ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు వాటర్ షెడ్స్ అంటే ఏంటో తెలియజేశాడు. చదివిన చదుకు చేస్తున్న పనికి సంబంధం లేదు. అయినా నీళ్ల మీద ఇంట్రస్ట్ అన్నీ తెలిసేలా చేసింది. ఎందరో నిపుణులను కలిశాడు. వాళ్లకు తన లక్ష్యమేంటో వివరించాడు. వాళ్ల ద్వారా కొంత నాలెడ్జ్ సంపాదించి నలుగురికీ పంచుతున్నాడు.

గత ఇరవై ఏళ్లుగా చూసుకుంటే హైదరాబాద్ నగరం ఎంతో మారిపోయింది. రోడ్లు, ఫ్లయ్ ఓవర్లు, ఆకాశ హార్మ్యాలు, భవంతులు వెలిశాయి. ఖాళీ ప్రదేశం అన్నదే లేకుండా పోయింది. చెట్లు సమతూకం తగ్గింది. వర్షపాతంలో కూడా గణనీయమైన మార్పొచ్చింది. వేల ఫీట్ల లోతు తవ్వినా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ ఒకటే పరిష్కారం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వాననీటిని వీలైనంత ఒడిసి పట్టుకుంటే నీళ్ల బాధే వుండదు.

image


స్మరణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నగరంలోని అనేక అపార్టుమెంట్లు, కార్పొరేట్ సంస్థల్లో వాన నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. స్ట్రక్చర్లు వేసిన చోట ప్రతీ చోటా భూగర్భ జలాల స్థాయి పెరిగింది. మాదాపూర్ నిఫ్ట్ అందుకు ఉదాహరణ. నేచర్ క్యూర్ హాస్పిటల్, సెయింట్ థెరిస్సా స్కూల్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్ లో కొన్ని వర్క్స్ చేశారు. హైదరాబాద్లో ఉన్న రాక్ సాయిల్ వల్ల రీఛార్జ్ పిట్స్ పనిచేయవు. అందుకే ఎక్కువగా ఇన్వర్స్ బోర్వెల్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిని అనుసరించారు. అలా చేసిన ప్రతీ చోటా వందశాతం మంచి ఫలితాలు వచ్చాయి.

వర్షం నీరు డ్రైనేజీలోకి వృథాగా పోతుంటే చూస్తాం తప్ప ఆ నీటి విలువేంటో తెలసుకోం. ఆ గొప్పతనం సుభాష్ లాంటి మట్టి మనుషులకే తెలుసు. ఆయన దృష్టిలో భూమి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్. ఇన్నాళ్లూ దాన్నుంచి కావాల్సినన్ని నీళ్లు వాడుకున్నాం. ఇప్పుడా ట్యాంకర్ ఎండిపోతోంది. దాన్ని మళ్లీ నీటితో నింపాలి. అదే సంకల్పంతో సుభాష్ వందలాది మందితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.