ఆడుతూపాడుతూ అధినేత స్థాయికి..!
కొంతమంది జీవితాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసేవారు ఒక్కసారిగా అత్యున్నత స్థాయికి ఎదిగిపోతుంటారు. అలాంటివారిలో మోహిత్ సక్సేనా ఒకరు.. ఇంతకూ అతని జీవిత ప్రస్థానం ఏంటో మీరో చదవండి..
Wednesday May 06, 2015,
4 min Read
మోహిత్ సక్సేనా- క్షణం తీరకలేని వ్యక్తుల్లో ఒకరు. C++ స్టాఫ్ట్ వేర్ ఇన్వెంటర్ బ్జార్నే స్టౌస్ట్రప్ని ఇంటర్వ్యూ చేయడం తేలికేమో గాని మోహిత్తో కాసేపు మాట్లాడడం కష్టం. ఎందుకంటే మోహిత్ ఇంటర్వ్యూకి ముందు నాలుగు సార్లు అతని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. చివరగా సెస్నా బిజినెస్ పార్క్లోని అలాఫ్ట్లో లంచ్ చేస్తూ ఆయన్ని కలిశాం. అక్కడే ఇన్-మొబీ సహ వ్యవస్థాపకుడు, వైస్ ప్రెసిడెంట్ అయిన మోహిత్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను ఆ ఇంటర్వ్యూ చాలా విలువైంది.. ఎన్ని గంటలైనా వేచి తీసుకోవాల్సిందని..
ఉడాన్...
లక్నోకి చెందిన మోహిత్ చిన్నతనమంతా క్రికెట్, గోళీ ఆటలతో సరదాగా గడిచింది. 80వ దశకం మోహిత్ జీవితంలో సంతోషకరమైన రోజులు. క్రికెట్ కోసం పిచ్చిగా ఎక్కడెక్కడికో వెళ్లేవారు.. అలా చాలా ప్రదేశాలు తిరగడంతో మంచి అనుభవం సంపాదించారు. ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్నా కొన్నింటిలో చిరస్మరణీయ విజయాలు కూడా సాధించారు. మోహిత్ తండ్రి ఉత్తర్ప్రదేశ్లోని హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. ఉద్యోగరీత్యా ఆయన ఊళ్లు తిరగాల్సివచ్చేది. దీంతో మోహిత్కి తల్లితో సాన్నిహిత్యం పెరిగింది. అందుకే అతనిపై ఆమె ప్రభావం ఎంతగానో ఉంది. బాల్యం నుంచే ఇంజినీర్ కావాలన్నది మోహిత్ కల. అయితే ఎందులో స్పెషలైజేషన్ చేయాలన్నది తనే తేల్చుకోలేకపోయేవారు.
చిన్నతనంలో తన ఇంజినీరింగ్ సాహసాలను అప్పుడప్పుడు మోహిత్ గుర్తు చేసుకుంటారు. ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు ఒకసారి తన సైకిల్ని విప్పేశారు. అయితే దాన్ని మళ్లీ బిగించడం రాక విడిభాగాలన్నీ ఓ బెడ్ షీట్ లో చుట్టుకెళ్లి మెకానిక్ ముందుంచారు. ఆ విషయం ఇప్పటీకీ తన తల్లికి తెలియకుండా రహస్యంగా ఉంచారు మోహిత్ .
ఐఐటీ డైలమా
JEE పాసైన తర్వాత ఐఐటీ రూర్కెలా , ఐఐటీ భూవనేశ్వర్కి సెలక్ట్ అయ్యారు. అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ వంటి మంచి కోర్సులో సీట్ దొరకలేదు. దీంతో రూర్కేలా ఐఐటీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్సెస్ ఇంజినీరింగ్లో చేరారు. మొదటి సంవత్సరమంతా చప్పగా సాగిపోయినా ఆ తర్వాతే చాలా ఆసక్తికరమైన మలుపులు చోటుచేసుకున్నాయి.
మోహిత్ స్నేహితులు చాలామంది కంప్యూటర్ సైన్స్, ఐటీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. వాళ్లతో కలిసిపోయేందుకు సెకండియర్లో C++ సబ్జెక్స్ని ఎంపికచేసుకున్నారు మోహిత్. కొత్తగా నిర్మించిన భననంలో కంప్యూటర్ ల్యాబ్ ఉండేది .. ఏసీ కూడా ఉండడంతో చక్కగా నిద్రపోయేందుకు సౌకర్యంగానూ ఉండేది. అదే ఆయన్ని కట్టిపడేసింది. ఆ సమయమే తనను తాను ఆత్మవిమర్శ చేసుకులా.. భవిష్యత్ గురించి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కల్గించింది.
అమెరికన్ కల..
ఇంజినీరింగ్ తర్వాత టాటా స్టీల్ కంపెనీలో మోహిత్కి ఉద్యోగం వచ్చింది. ఏదో ఉద్యోగం చేసుకుంటూ కాలం గడిపేయడం నచ్చలేదు. దీంతో అదే కంపెనీలో తనకు నచ్చిన కంప్యూటర్ డిపార్ట్మెంట్లో చేరారు. ఉన్న వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నడిపించేందుకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే ఆటోమెషన్తో తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందని కార్మిక సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తొమ్మిది నెలల టాటా స్టీల్ ఉద్యోగంలో ఈ ఎపిసోడ్ మంచి అనుభవాన్నే మోహిత్కి నేర్పింది. ఆ తరవాత AT&T ప్యాక్ బెల్ ల్యాబ్లో మోహిత్ చేరారు. 1998లో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు తొలిసారి అమెరికాలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పదేళ్లకుగాని తాను అమెరికా నుంచి బయటకు వెళ్లనని అప్పుడతను ఊహించి ఉండరు. AT&T లో మోహిత్ లైఫ్ హ్యాపీగా గడిచిపోయింది. అదృష్టవశాత్తు అప్పట్లో ప్రపంచాన్ని భయపెట్టిన Y2K ప్రభావం కూడా తను పనిచేస్తున్న టెలికామ్ సెక్టార్పై పడలేదు. ఆ తర్వాత AT&T నుంచి వర్జిన్ మొబైల్కి మారారు ఆయన. వర్జిన్ .. అప్పుడే యూఎస్ మార్కెట్లోకి ప్రవేశించడంతో అంతా కొత్త.. ! AT&Tలా కాకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. మొదట్లో వర్జిన్ మొబైల్ టీమ్ చాలా చిన్నది దాంతో మోహిత్ ఆపరేషన్స్ టీమ్ని లీడ్ చేసేవారు. ఆ అనుభవం ఇన్మొబీని నడపడంలో ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఇన్మొబి తొలి అడుగులు
అది 2007 సంవత్సరం.. మోహిత్... నవీన్ తివారి, అమిత్ గుప్తా, అభయ్ సింఘల్ని కలిసిన ఏడాది. అందరూ కలిసి మొబైల్ మార్కెట్లో ఓ వెంచర్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. కంపెనీకి ఎమ్ ఖోజ్ అని పేరు పెట్టారు. మొబైల్ అప్లికేషన్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని గ్రహించి అనతికాలంలోనే మొబైల్ ప్రకటన సేవల వైపు మళ్లారు.
కలల ప్రాజెక్ట్ని ప్రారంభించేందుకు మోహిత్ ముంబైకి వచ్చారు. అమెరికా నుంచి ముంబైకి షిప్ట్ అవ్వడానికి మోహిత్ కి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత అతని టీమ్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత కొత్త ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందేందుకు బెంగళూరులో మంచి అవకాశాలున్నాయని గ్రహించి అక్కడ ఆఫీస్ తెరిచారు.
ఇన్మొబి తొలి యాడ్ సర్వర్ కోసం మోహత్ కోడింగ్ చేశారు. ఇక అప్పటి నుంచి తన ప్రస్థానం దినదిన ప్రవర్థమానమయ్యింది. పెద్ద సంఖ్యలో సంక్లిష్ట ఆర్కిటెక్చర్ నమూనాలు తయారుచేయడంతో మోహిత్ ఎక్స్పర్ట్. ఎవరైనా అతన్ని అలా పిలిస్తే ఒప్పుకోరు. వివిధ విభాగాల్లో సమర్ధవంతంగా పనిచేయగలిగే వ్యక్తిని మాత్రమేనని అంటారు మోహిత్. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేంటంటే ఇది ప్రతీ ఒక్కరికి వర్తించకపోవచ్చు ఎందుకంటే ఏదైనా సంస్థ తొలి రోజుల్లో మూలసిద్ధాంతాలే ముఖ్యం.
ఇక ఇన్మొబిలో టెక్నాలజీ ఉద్యోగాల నియామకాల విషయానికొస్తే.. ఎంపికైన ప్రతీ అభ్యర్ధిని ప్రత్యేకంగా కలవాలని నియమంగా పెట్టుకున్నారు మోహిత్. అంతేకాదు ఉద్యోగ ఎంపిక ప్రక్రియ కూడా ఎనిమిది తొమ్మిది రౌండ్లతో క్లిష్టంగా ఉంటుంది. ఇన్మొబి సహ వ్యవస్థాపకుడు కాకపోయి ఉంటే ఇంత కష్టమైన ఇంటర్వ్యూ ని దాటి ముందుకు వెళ్లలేకపోయేవాడినేమోనని నవ్వుతూ చప్పారు మోహిత్.
మేనేజర్ అవ్వాలనుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ఆలోచనా ధోరణి గురించి మోహిత్ మాట్లాడుతూ “ నేను ఎప్పుడూ ఎంబీఏ చదవాలని అనుకోలేదు. ఎందుకంటే టెక్నాలజీ కోర్స్ చేసి... వ్యవస్థను నిర్మించాలనుకున్నా.! ఒకవేళ ఎప్పుడైనా ఎంబీఏ వ్యక్తితో అవసరం పడితే... ఒకర్ని నియమించి వారి సేవలు వినియోగించుకోవాలనుకున్నా.! మన దగ్గర పన్నేండేళ్లకు పైగా కోడింగ్ చేస్తున్న వ్యక్తులున్నారు. ఇంకా ఎంతో చేయాలన్న తపన వాళ్లలో ఉంది. నా ఉద్దేశ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒక సెలబ్రిటీ కన్నా తక్కువేం కాదు. మంచి ఇంజినీర్ కోసం నేను ఎంతైనా చెల్లించేందుకు సిద్దం.”
ఇన్ మొబీ తర్వాత మోహిత్ క్యాన్సర్ బాధితుల సేవలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. 2012లో తన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ నాల్గో దశలో ఉందని తెలిసినప్పటి నుంచి ఆయన ఈ సేవల వైపునకు మళ్లారు. అదృష్టవశాత్తు పరిస్థితి చేయిదాటకముందే చికిత్స తీసుకోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో తీవ్ర వేదన అనుభవించిన మోహిత్ “ అప్పుడప్పుడు మనం చదువుకున్న మూర్ఖుల్లా వ్యవహరిస్తుంటాం... బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ఉన్నా నేను నా కుటుంబ సభ్యులను క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించలేదు” అని తన నిర్లక్ష్యాన్ని నిందించుకుంటారు. ఇక అప్పటి నుంచి క్యాన్సర్ బాధితులకు క్రమం తప్పకుండా సేవచేస్తుంటారు. ఇన్మొబి సంస్థ తరపున ఎస్వీజీ కేన్సర్ హాస్పిటల్ కి నిధులు సమకూర్చుతుంటారు.
ఇన్ మొబీ భవిష్యత్ గురించి మాట్లాడుతూ ప్రంపచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని మోహిత్ అంటారు. ఆ టార్గెట్ అందుకోవడం కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటారు.