విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే 'మేథ'
మన దేశం అవకాశాల పుట్టమేన్ పవర్కి కొరత లేని భారత్ఉద్యోగాలు కూడా కోకొల్లలుచదువుకున్న వారున్నా నైపుణ్యం కొరతే అసలు సవాలువిద్యార్ధులకు స్కూల్, కాలేజ్ రోజుల నుంచే పరిశ్రమ అవసరాలు తెలియాల్సిందే
Wednesday May 13, 2015,
4 min Read
మన దేశంలో చదువుకున్న యువత చాలా ఎక్కువ. కానీ ఇండస్ట్రీ అంచనాలు, అవసరాలకు తగినట్లుగా వీరిలో నైపుణ్యం ఉన్నవారు తక్కువ. అందుకే వీరికి మంచి ఉద్యోగావకాశాలు లభించేలా తగిన శిక్షణ ఇచ్చే సంస్థ మేధ. దీన్ని స్థాపించిన వారు క్రిస్టోఫర్ టురిలో, బ్యోంకేష్ మిశ్రా. "15 ఏళ్ల క్రితం ఓ కాలేజ్ విద్యార్ధిలా ఇండియా వచ్చాను. ఓ టిబెటన్ కుటుంబంతో ధర్మశాలలో ఉండే సమయంలో తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో చిన్న చిన్న రుణాలు కూడా తెస్తున్న సమస్యలు గమనించాను. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేను... భారత్లో మైక్రోఫైనాన్స్ రంగంలో అవకాశాల కోసం చాలా ప్రయత్నించాను. 2005లో హైద్రాబాద్లో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్లో జాయిన్ అయ్యాను. అక్కడే బ్యోంకేష్ను కలిశాను. అప్పట్లో ఎస్కేఎస్ అమిత వేగంగా అభివృద్ధి చెందేది. ప్రతీనెలా 200-300మందిని రిక్రూట్ చేసుకునే వాళ్లం. మా వ్యాపారమంతా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యేది. కేవలం పదో తరగతి చదువుకున్న వారిని తీసుకుని, వారికి అకౌంటింగ్ సంబంధిత రంగాల్లో కొంత శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్గా తీర్చి దిద్దేవాళ్లం. ఒక్కొక్కరు 500-800 మంది క్లయింట్లను నిర్వహిస్తూ... రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ టర్నోవర్ చేసేవారు. సామాజిక, ఆర్ధిక రంగాలపై మా సంస్థ చూపుతున్న ప్రభావం అర్ధం చేసుకున్నాను అప్పుడే. అదే సమయంలో మా సంస్థ చాలా మందికి ఉద్యోగాలిచ్చింది కూడా. రూ. 10వేల కోట్లకు పైగా నికరంగా ఆదాయాన్ని ఇచ్చే రుణాలు ఇచ్చేవారం. ఈ ఆలోచన నా మనసులో తీవ్రంగా నాటుకుపోయిందం"టారు క్రిస్టోఫర్.
మేథకు ఇదే మొదలు
ఆలోచనకు జీవం పోసేందుకే చాలా కాలం పట్టింది. ఎంబీఏ/ఎంఏ పూర్తి చేసేందుకు క్రిస్టోఫర్ మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్లలో కోర్స్లు చేశారు. ఈ సమయంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఫౌండేషన్ తలపెట్టిన ఆర్ధిక సమ్మేళనం కోసం బ్యోంకేష్ ఉత్తర భారతానికి షిఫ్ట్ అయ్యారు. కొన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. 2009లో వీరిద్దరూ కలిసి ఉద్యోగావకాశాలకు శిక్షణావకాశాలపై ఓ రిపోర్ట్ తయారు చేశారు. “ గ్రాడ్యుయేట్ స్కూల్లో ఉన్నపుడు ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ, సీక్వియా కేపిటల్, నవభరాత్ జాగృతి కేంద్రాలతో ఇంటర్న్షిప్ చేసి ఉండడంతో... పరిశ్రమ అవసరాలు, లోటుపై సమగ్ర అవగాహన ఏర్పడింది. ఆర్ధిక వ్యవస్థపై ఉన్న ప్రభావం కూడా తెలుసుకున్నాను. నిధుల మంజూరు వంటి విషయంలో కూడా స్టడీ చేశాను. మా పరిశోధన మొత్తాన్ని విశ్లేషిస్తే... స్కిల్ డెవలప్మెంట్లో మూడు సవాళ్లు ఎదురయ్యాయి మాకు ”అంటారు క్రిస్టోఫర్.
- 1. మధ్యవర్తులు : చాలావరకూ శిక్షణ ఇచ్చేవారు.. కేవలం ఇనిస్టిట్యూషన్లకే పరిమితమవుతున్నారు. వారంతా సొంత ఖర్చులతో నిర్వహిస్తుడడంతో... ఇది చాలా భారంగా పరిణమించింది. విద్యార్ధులకు రవాణా సౌకర్యాలు కల్పించడం వంటి తతంగాలతో... వారు వాసి కన్నా రాసికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది.
- 2. ఇండస్ట్రీ అవసరాలు : శిక్షణా రంగంలో సక్సెస్ అయిన వారంతా బూమింగ్ ఇండస్ట్రీని నమ్ముకున్నవారే. కానీ భారత్ లాంటి దేశంలో ఈ బూమ్ ఉండొచ్చు, మారిపోవచ్చు. విద్యార్ధులకు వీటికి అనుగుణంగా తర్ఫీదునివ్వడంలో, తయారు చేయడంలో సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
- 3. క్లాస్రూముల్లోనే శిక్షణ పూర్తి : టాప్ రేంజ్లో ఉన్న కంపెనీలు కూడా... ట్రైనింగ్ను లెక్చర్లతోటే పూర్తి చేసేస్తున్నాయి. వారికి పరిశ్రమల్లోనో, మరోచోటో ఏం జరుగుతోందో అనుభవంలోకి రావడం లేదు. చాలామంది ఉద్యోగాలు సంపాదించాక కూడా విఫలమవడానికి కారణం ఇదే.
శిక్షణా రంగంలో ఈ సమస్యలు గుర్తించాక.. బ్యోంకేష్, క్రిస్టోఫర్లు 2011లో ఓ కార్యక్రమానికి, ప్రణాళికకి రూపకల్పన చేశారు. “ మూడు సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సి వచ్చింది. మొదట ఇప్పుడున్న విధానంలోనే అడుగులు వేయాలని నిర్ణయించాం. అదే సమయంలో ప్రభుత్వ, ఎయిడెడ్, సెమీ ఎయిడెడ్ కాలేజ్లలో కెరీర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలి. రెండో చర్యగా పారిశ్రామిక రంగం నుంచి విద్య, సమాచారం, స్కిల్, వంటి వాటిలో.. ఏ తరహా ఉద్యోగులు కావాలో... తెలుసుకుని ఓ కరిక్యులం తయారు చేశాం. ప్రతీ వారికీ ఇంటర్న్షిప్ తప్పనిసరి అని భావించేలా రియల్ వరల్డ్లో ట్రైనింగ్ ఇచ్చి, వారికో సర్టిఫికెట్ ఇచ్చేలా మూడో చర్య చేపట్టాలని నిర్ణయించామం"టారు క్రిస్టోఫర్.
సవాళ్లు, సమస్యలు
సమగ్ర ప్రణాళిక సిద్ధంగానే ఉన్నా.. ప్రారంభంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి ఏడాది 300 విద్యార్ధులకు ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకుంటే... ఒక కాలేజ్లోని కేవలం 24మంది మాత్రమే ఇవ్వగలిగారు. 25 కాలేజ్లను అప్రోచ్ అయితే... అందులో వీళ్ల ఆలోచనకు అంగీకారం తెలిపింది కేవలం ఒకటే. అది కూడా మధ్యాహ్నం పూట రెండు గంటల సమయం మాత్రమే ఇస్తామన్నారు. విద్యార్ధుల్లో చాలామంది దీనికి అంగీకారం తెలపకుండా వారి రూమ్లకు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపేవారు. అయితే.. ఈ 24మందిలో సగం మందికి ఫుల్ టైం జాబ్ దక్కేలా చేయడంలో మాత్రం మేధ సక్సెస్ అయింది.
అయితే 2012 చివర్లో మేధ సంస్థ ఎదురుచూస్తున్న బ్రేక్ వారికి లభించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శితో మాట్లాడే అవకాశం చిక్కినపుడు ప్రణాళికను వివరిస్తే.. ఉన్నత విద్యా విభాగానికి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. లక్నో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కేంపస్లో కెరీర్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభించింది.
భవిష్యత్తుకు మార్గ నిర్మాణం
2013-14లో మూడు కాలేజీలకు చెందిన 57మందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వగలిగారు. దీంతో సక్సెస్ రేషియో కూడా గణనీయంగా పెరిగింది. “ మేం వెళ్లాలనుకున్న రూట్లో అభివృద్ధిలోనే ఉన్నాం. అయితే ఇది చాలా నెమ్మదిగా ఉందనే విషయం మాకు తెలుసు. ఫలితాలు అనుకూలంగానే ఉన్నా... అనుకున్న స్థాయిలో అభివృద్ధి మాత్రం లభించకపోవడం నిరుత్సాహం కలిగించింది” అంటారు క్రిస్టోఫర్
దీంతో షార్ట్ టెర్మ్ కోర్స్ లాంటివి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కొత్త క్యాంపస్లతో సంప్రదింపులు జరిపారు. ఆఫ్టర్ స్కూల్ నుంచి... ఫుల్ టైం కెరీర్ సెంటర్లుగా మార్పు చేశారు. "ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపింది. 57మంది నుంచి స్టూడెంట్స్ సంఖ్య ఒక్కసారిగా 400కి పెరిగింది. 2014-15లో కాలేజ్ల సంఖ్య కూడా 10కి పెరిగింది. తర్వాతి ఆర్ధిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 15 కాలేజ్లలో(10 డిగ్రీ, 5 పాలిటెక్నిక్) కార్యకలాపాలకు అంగీకరించింది. " - బ్యోంకేష్
వాట్ నెక్స్ట్
తాజాగా మాకు మద్దతిచ్చే సంస్థల సంఖ్య పెరుగుతోంది. మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్, ఎడెల్గివ్ ఫౌండేషన్లు మాకు జతయ్యాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 25 విద్యాసంస్థల్లోని 1,500మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. 2018నాటికి ఈ సంఖ్యను 20 వేల మంది విద్యార్ధులకు పెంచాలన్నది మా లక్ష్యం. భౌగోళికంగా విస్తరించడం కంటే... ఉన్న ప్రాంతాల్లోనే కార్పొరేట్ ఈలెర్నింగ్ వంటి శిక్షణలతో... మరింత చురుకైన, పదునైనా శిక్షణా పద్ధతుల కోసం అన్వేషిస్తున్నామని చెబ్తోంది మేధ. వెనుకబడిన రంగాల్లోని మహిళల స్థాయిలో ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ... సామాజిక, లింగ బేధాలు లేని సమాజం ఏర్పడేవరకూ... అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నది మేధ లక్ష్యం.
భవిష్యత్తు పూల బాట కాదని తెలుసు
“మాకు ముందుముందు చాలా సమస్యలు ఎదురవుతాయని తెలుసు. ఈ ఏడాదే లక్నోని దాటి బయటకు అడుగుపెడుతున్నాం. ఇది మాకు కొత్త అవకాశాన్ని అందించినా... యూపీలోని ఇతర ప్రాంతాల్లో సంస్థల అవసరాలను ఎంతో అర్ధం చేసుకోవాల్సింది ఉంది. దీనికి అదనంగా నియామకం, శిక్షణ, నిర్వహణ వంటివి సవాళ్లుగా మారొచ్చు. అయనా సరే ఈ దేశంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని, ఉద్యోగార్ధాలకు అందించడం చాలా అవసరం. మాలాంటి అభివృద్ధి చెందే సంస్థలనే తీసుకుంటే... ఇప్పుడు వీటి పురోగతి చాలా వేగంగా ఉంది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో మేమిచ్చే ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు చాలా అవసరం. అయినా మేం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఈ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న సహకారం అనిర్వచనీయం " అంటున్నారు క్రిస్టోఫర్