రెడ్ సిగ్నల్ ఎన్నడూ చూడని రెడ్ బస్.. !
ఆ ఏడు మలుపులే రెడ్ బస్ సక్సెస్ సీక్రెట్ !ప్రత్యర్థులతో పోటీ పడ్తూనే ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది ? నిధుల సమీకరణలోనూ ఎలా విజయం సాధించింది ? ఫణీంద్ర సామా చెప్పిన విశేషాలు.. యువర్ స్టోరీ ప్రత్యేకం
Wednesday April 01, 2015,
4 min Read
రెడ్ బస్.. ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ చిరపరిచితమైన పేరు. ప్రైవేట్, ఆర్టీసీ అనే బేధం లేకుండా.. రాష్ట్రమూ, రూటుతో సంబంధం లేకుండా.... బస్ ప్రయాణించగలిగే ప్రతీ మార్గంలోనూ తనదైన ముద్రవేసుకుంది ఈ రెడ్ బస్. ఆరేడేళ్లుగా కొన్ని లక్షల మందికి సేవలు అందిస్తూ బస్ టికెటింగ్ రంగానికే ఒక దిక్సూచిలా మారింది. ఆన్ లైన్ను ప్రజలు నమ్ముతారా, ఇది సక్సెస్ అవుతుందా అని జనాలు ఆలోచిస్తున్న ఆ రోజుల్లోనే భవిష్యత్తుపై భరోసాతో మొదలైన సంస్థ రెడ్ బస్. అలాంటి కంపెనీని తెలుగువాళ్లు ప్రారంభించారంటే మనకు ఇంకాస్త గర్వకారణం. కంపెనీ ఏర్పాటు ఆలోచన ఎలా వచ్చింది ? బిట్స్ పిలానీలో చదివి ఈ ఎర్ర బస్సును ఎందుకు నమ్ముకున్నారనే విషయాలు గత కొన్నేళ్లుగా చాలా సార్లు వినే ఉంటాం. అందుకే కాస్త భిన్నంగా రెడ్బస్ విజయం వెనుక ఉన్న టర్నింగ్ పాయింట్స్ ఏంటో చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు మనకు తెలుస్తాయి.
ముగ్గురు యువకుల కృషి, తపన.. ఏదో ఒకటి చేయాలన్న కోరికే రెడ్ బస్ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇదేదో రాత్రికి రాత్రి జరిగిపోలేదు. మూడు వందల టికెట్ల నుంచి నెలకు మూడు లక్షల టికెట్లు, రూ.600 కోట్లకు పైగా వ్యాపారం.. వందల మంది ఉద్యోగులు.. వంటి సంఖ్యలు వినడానికి హాయిగా ఉన్నా దాని వెనుక వాళ్లు పడిన కష్టాన్ని రెండు, మూడు ముక్కల్లో చెప్పడం కుదరదు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్సులో వచ్చే ప్రయత్నంలో పుట్టిన ఆలోచనకు పదును పెట్టి దానికి ప్రాణం పోసి దీన్ని కూడా ఓ అద్భుత వ్యాపార అవకాశంగా మార్చిన వాళ్ల దార్శనికతను మెచ్చుకుని తీరాల్సిందే... ! ఓ టికెట్ బుకింగ్ కంపెనీని అంత సులువుగా ఐబిబో సంస్థ ఆబగా కొనేయలేదు. అందులో ఎంతో విలువను చూసింది. ఇదే అన్ని వందల కోట్లు పెట్టి (డీల్ విలువ రూ.700-800 కోట్లని మార్కెట్ అంచనా) మరీ సంస్థను కొనేలా చేసింది.
ఇంత భారీ డీల్ తర్వాత రెడ్ బస్ సహ వ్యవస్థాపకులు ఫణీంద్ర సామ... టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయారు. స్టార్టప్ ఎకో సిస్టంకు మరోసారి కొత్త కళ తీసుకువచ్చిన ఫణీంద్ర తన అనుభవాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి అనేక కీలక ఘట్టాలను వివరించారు. అందులో టాప్ సెవెన్ టర్నింగ్ పాయింట్స్ ఇవి. ఆయన మాటల్లోనే...
1. బాస్ టు రెడ్బస్
మా వేదికలో మగ్గురు భాగస్వాములు ఉన్నారు. బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు, కస్టమర్లు. అందుకే ఒకొక్కరికి సరిపోయే విధంగా మూడు ప్రొడక్టులను రూపొందించాం. బాస్, సీట్ సెల్లర్, రెడ్ బస్ ఉన్నాయి. BOSS పేరుతో మొదటి ప్రొడక్ట్ రూపొందింది. ఒకసారి ఈ సాఫ్ట్వేర్ను బస్ ఆపరేటర్లకు ఇచ్చి వాళ్ల ఇన్వెంటరీని తెలుసుకుంటే ఆ తర్వాత ఏజెంట్లు, కస్టమర్లకు సులువుగా చేరుకోవచ్చని అనుకున్నాం.
మా సాప్ట్వేర్తో బస్ ఆపరేట్లను కలిశాం. కానీ ఎవరూ దీన్ని కొనేందుకు ముందుకు రాలేదు. మాకు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. బస్సులే లేకపోతే ఏజెంట్లు, కస్టమర్లు ఎవరూ మా సైట్కు వచ్చే అవకాశమే లేదని విస్తుపోయాం. ఇక అంతా అయిపోయిందేమోననే భయం ఒక్కసారిగా మమ్మల్ని ఆందోళనలోకి నెట్టేసింది.
ఆ సమయంలోనే టై (ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంట్రపెన్యూర్స్) లోని మా మెంటార్స్ను కలిశాం. అప్పుడు వాళ్లు ఇచ్చిన సలహాతోనే BOSS ను పక్కకుపెట్టి రెడ్ బస్పై పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించాం. అదే మొదటి టర్నింగ్ పాయింట్. బస్ ఆపరేటర్ల నుంచి కొన్ని సీట్లు తీసుకోవడం మొదలుపెట్టాం. ఇవి అమ్మితే మరిన్ని అడిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ట్రావెల్ సంస్థ మొత్తం సీట్లన్నీ అమ్మాల్సి వస్తే మా దగ్గర మిగిలి ఉన్న వాటిని తీసేసుకునేది. ఇది కష్టతరమైన మ్యాన్యువల్ పని కావడం వల్ల కాస్త ఇబ్బందులు పడినా మెల్లిగా జనాల మావైపు చూడడం మొదలుపెట్టారు.
మరోవైపు మా పోటీదార్లు మాత్రం బస్ ఆపరేటర్లకు సాఫ్ట్వేర్ అమ్మకానికే పరిమితమయ్యారు. వాళ్లు ఆలోచన మార్చుకునే లోపు మేము ఈ రంగంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించాం.
2. మొదటి రౌండ్ నిధుల సమీకరణ
మొదటి సీడ్ ఫండ్ను చాలా త్వరగా సమీకరించాం. అదే మాలో ఒత్తిడిని పూర్తిస్థాయిలో దూరం చేసింది. నిధుల కటకట గురించి ఆలోచించకుండా వ్యాపార వృద్ధిపై దృష్టి కేంద్రీకరించేందుకు దోహదపడింది.
ఇదే మాకూ, మా పోటీదారులకు మధ్య మరో ప్రధాన తేడా. వాళ్లు బాగానే చేస్తున్నప్పటికీ, నిధుల ఇబ్బంది మాత్రం ఎదుర్కొన్నారు.
3. ప్రచారం కోసం పోటీపడొద్దనే నిర్ణయం
ఇదే చాలా ప్రధానమైన ఆలోచన. మొదట్లో మేం మాస్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఉంటే ఇంకా త్వరగా వ్యాపార వృద్ధి ఉండేది. అయితే మరింత విస్తృతంగా పెరిగేందుకు ఉన్న అవకాశాల అన్వేషణ మాత్రం ఆగిపోయేది. అందుకే అడ్వర్టైజింగ్కు దూరంగా ఉంటూ కస్టమర్ల సేవలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. కన్వర్షన్ రేట్, కస్టమర్ల సంతృప్తి, ధృడమైన టెక్నాలజీ రూపకల్పనకు మా మొత్తం సమయాన్ని కేటాయించాం. అదే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది. ఆ మేధో సంపత్తే(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్) రెడ్ బస్కు బలమైన పునాది వేసింది.
4. అద్భుతమై టీమ్
మా బృంద సభ్యులే సంస్థకు ప్రాణం. ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో తమ కంపెనీగా భావిస్తూ పనిచేశారు. సమర్థులైన వాళ్లు అంతే సమర్థత ఉన్న వాళ్లను ఎంపిక చేశారు. ఆ సైకిల్ అలానే కొనసాగుతూ వస్తోంది.
5. 2008 సంక్షోభం
అప్పటి ఆర్థిక అనిశ్చితి కారణంగా మాకు నిధుల సేకరణ చాలా కష్టమైంది. కన్వల్ రేఖీ బృందానికి మేం ఎప్పటికీ కృతజ్ఞతులమే ! అప్పటి పరిస్థితుల దృష్ట్యా వేల్యుయేషన్ తక్కువైనప్పటికీ నిధుల సమీకరణ పూర్తైంది. అదే కంపెనీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించింది.
ఆ సమయంలో మా పోటీదార్లు ఎవరూ క్యాపిటల్ రైజ్ చేయలేకపోయారు. దీంతో మెల్లిగా పోటీ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. అప్పుడే మా సైట్కు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. మా 'కస్టమర్ ఎక్స్ పీరియన్స్' వల్ల కొత్త వాళ్లు వచ్చి రిపీటెడ్ బయర్స్లా మారారు.
6. 2009లో లాంచ్ అయిన బాస్
ఈ సమయానికి కస్టమర్లు, బస్ ఆపరేటర్లకు మాపై గురికుదిరింది. ఆన్లైన్ సేల్స్పై నమ్మకం కూడా పెరుగుతూ వచ్చింది. చిన్న ఆపరేటర్ల సౌలభ్యం కోసం BOSS ను లాంఛ్ చేశాం. పెద్ద కస్టమర్ల అవసరాలు, ఆశలు వేరుగా ఉంటాయి వాళ్ల కోసం మళ్లీ ప్రత్యేకమైన డిజైన్ అవసరమవుతుంది. సులువుగా ఉండేందుకు చిన్న కస్టమర్లనే టార్గెట్ చేసుకున్నాం.
పెద్ద కస్టమర్ల దగ్గర ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నా వాళ్ల సంఖ్య తక్కువే. కానీ ఇలాంటి వాళ్లు అధికంగా బేరమాడతారు. అదే చిన్న ఆపరేటర్లు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సాఫ్ట్వేర్ అమ్మకందారుతో గట్టిగా మాట్లాడి బేరమాడే పరిస్థితి ఉండదు.
అదే ఆలోచనతో మేం BOSS లాంచ్ చేసినప్పుడు మొదటి ఏడాదికి 100 మంది ఆపరేటర్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ అనూహ్యంగా 350 మంది చేరారు. ఎన్ని ఎక్కువ సీట్లు మా సైట్లో ఉంచితే అంత ఎక్కువ వ్యాపారాన్ని వాళ్లు పొందేవారు. ఎక్కువ సీట్లు, ఎక్కువ మంది ఆపరేటర్లు ఉంటే కస్టమర్లకు కూడా ఎంపిక (విండో,ఎయిసిల్,గ్రూప్ బుకింగ్... వంటివి) విషయంలో మెరుగైన అవకాశాలు ఉండేవి.
7. రాష్ట్ర రవాణా సంస్థలతో ఒప్పందం
రెడ్ బస్లో గోవా ఆర్టీసీ టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించిన తర్వాత మిగిలిన రాష్ట్ర సంస్థలు కూడా ఆసక్తిని కనబర్చాయి. ఆరు ఆర్టీసీలతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నాం.
ఓ చిన్న సలహా
''మీ కంపెనీల్లో పారదర్శకతను ప్రోత్సహిస్తూ మెరుగైన విధానాలను అనుసరించండి. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కు చాలా ప్రీమియం ఉందని గ్రహించండి''.
ప్రస్తుతం ఫణీంద్ర సామ నెక్స్ట్ జెన్ పిఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్లో డైరెక్టర్గా ఉన్నారు.