విద్యారంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తున్న విల్‌గ్రో

ప‌ట్ట‌ణ‌ ప్రాంతాల్లో విద్యా రంగ అభివృద్ధికి విల్ గ్రో చేయూత‌సామాజిక సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న విల్‌గ్రోనిరుపేద యువ‌కుల‌కు నైపుణ్యాభివృద్ధిలో శిక్ష‌ణ‌విద్యారంగంలో సేవ చేస్తున్న సంస్థ‌ల‌కు విల్ గ్రో ఆర్థిక సాయం

విద్యారంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తున్న విల్‌గ్రో

Thursday June 11, 2015,

5 min Read

భార‌త్‌.. ప్ర‌పంచంలోనే అత్యంత నాణ్య‌త క‌లిగిన మాన‌వ వ‌న‌రులున్న దేశం. దేశ జ‌నాభా 125 కోట్లు దాటింది. అయినా ఇంకా ఎన్నో రంగాల్లో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూనే ఉంది. అందుకు కార‌ణం నిమ్న‌స్థాయిలో స‌రైన శిక్ష‌ణ లేక‌పోవ‌డ‌మే. దేశంలో ఎక్కువ సంఖ్య‌లో ఉన్న పేద‌లకు స‌రైన విద్య అంద‌క‌పోవ‌డ‌మే. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు సామాజిక సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ది విల్ గ్రో. ఆ సంస్థ కార్యకలాపాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు వ్యవస్థాపకురాలు కవితా రాజగోపాలన్.

"దేశ విద్యారంగంలో గొప్ప మార్పున‌కు ఇదే స‌రైన స‌మ‌యం. ఈ రంగంలో ఉన్న స‌మ‌స్య‌లు అంద‌రికీ తెలిసిన‌వే. వాటిని విస్తృతంగా డాక్యుమెంటేష‌న్ కూడా చేశారు. ఈ మార్పుల‌ను అవ‌కాశంగా మ‌ల్చుకునేందుకు కొత్త సంస్థ‌లు ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి" అని యువర్ స్టోరీలో భాగమైన సోష‌ల్ స్టోరీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె వివ‌రించారు. 

విద్యారంగంపై రెండు ప్ర‌ధాన పోక‌డ‌లు ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని సంస్థ‌లు కంటెంట్‌ను ప్ర‌భావ‌వంతంగా విద్యార్థుల‌కు వివ‌రించ‌డంతోపాటు టీచ‌ర్ల నాణ్యత‌ను కూడా మెరుగుపరుస్తున్నాయి. మ‌రి కొన్ని కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్‌తో పార‌ద‌ర్శ‌క ప్ర‌భావాన్నిచూపుతున్నాయ‌ని ఆమె అంటున్నారు. "నాణ్య‌త‌ను మెరుగుప‌ర్చ‌డం, మెరుగైన అభ్యాస‌న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డం, పేద‌ కుటుంబాల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేవిధంగా ఫ‌లితాలు ఉండాల‌న్న‌దే నా ఆశ‌" అని అంటారామె.

విద్యార్థుల‌తో విల్‌గ్రో వ్య‌వ‌స్థాప‌కురాలు క‌వితా రాజ‌గోపాల‌న్‌

విద్యార్థుల‌తో విల్‌గ్రో వ్య‌వ‌స్థాప‌కురాలు క‌వితా రాజ‌గోపాల‌న్‌


విద్యారంగం అభివృద్ధిపై దృష్టి..

పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేసే సామాజిక సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తుంది విల్‌గ్రో. పేద‌ల అభివృద్ధి కోసం అవ‌స‌ర‌మైన సాయాన్ని కూడా అందిస్తున్న‌ది. ముఖ్యంగా నిరుపేద‌ల్లో విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న‌ది. కిండ‌ర్‌గార్టెన్ నుంచి ట్వెల్త్ స్టాండ‌ర్డ్ (K-12) వ‌ర‌కు విద్యా రంగాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్షంగా నిర్దేశించుకుంది. విద్య‌, స్కూల్ ట్రైనింగ్ సెగ్మెంట్‌ల‌లో ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో సేవ‌చేసే సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తోంది. విద్యారంగంలో ఉన్న కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌మ ఉత్ప‌త్తులు, సేవ‌లు, వ్యాపార ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకొస్తున్న‌ సంస్థ‌ల కోసం విల్ గ్రో అన్వేష‌ణ సాగిస్తోంది. రెండు విష‌యాల ఆధారంగా సామాజిక సంస్థ‌ల‌ను అంచ‌నా వేస్తుంది విల్‌గ్రో.

1. కిందిస్థాయి ప్ర‌జ‌ల‌కు ఈ సామాజిక సంస్థ‌లు ఏవిధఃగా నేరుగా ల‌బ్ధి చేకూరుస్తున్నాయి ?

2. విద్యార్థుల అభ్య‌ాస‌ స్థాయిల‌పై ఈ సంస్థ‌ల సేవ‌లు, ఉత్ప‌త్తులు నేరుగా ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయి? ఉపాధి అవ‌కాశాలు పెంపొందిస్తున్నాయా ? నెల‌వారీ సంపాద‌నలో మెరుగుద‌ల ఉందా? అనే అంశాల‌ను ప‌రిశీలిస్తుంది.

వ్యాపారంతోపాటు సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చే సంస్థ‌ల‌తో ఆరంభ ద‌శ‌ల్లోనే విల్‌గ్రో క‌లిసి ప‌నిచేస్తుంది. ఒక్కోసారి సంస్థ త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను ప్రారంభించ‌క ముందే వారితో ఒప్పందం చేసుకుంటుంది. విలువైన ప్ర‌తిపాద‌న‌ల‌ను మెరుగుప‌రిచేందుకు, ఆదాయ మార్గాలు ఆచ‌ర‌ణీయ‌మైన‌వ‌ని నిరూపించేందుకు మంచి ప్ర‌ణాళిక‌ల‌తో కూడుకున్న చిన్న‌పాటి ప్ర‌యోగాలు చేయాల‌న్న‌దే విల్‌గ్రో స‌హ‌కారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రంగంలోని సంస్థ‌ల‌తో క‌లిసి విశేషంగా ప‌నిచేస్తోంది. సుదీర్ఘ‌కాలంలో విజ‌యం సాధించేందుకు సామాజిక సంస్థ‌ల‌తో క‌లిసి విల్‌గ్రో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ‌ర్లు, మెంట‌ార్లు స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో విద్యా రంగంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ముందుగా గుర్తించ‌డం ముఖ్యం అంటున్నారు విల్‌గ్రో వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత‌. 

స‌మ‌స్య‌ను ముందుగానే గుర్తించి, దాన్ని ప‌రిష్క‌రించేందుకు వ్య‌వ‌స్థ‌కు లోబ‌డే ప‌నిచేయాల‌ని సూచిస్తున్నారు. " స‌మ‌స్య‌కు సంబంధించి ఎక్కువ అవ‌గాహ‌న ఉన్న ప్ర‌జ‌ల‌తో స‌మ‌యాన్ని కేటాయించాలి. టీచ‌ర్లు, ప్రిన్సిప‌ల్స్‌, విద్యార్థులు, త‌ల్లిదండ్రులతో మాట్లాడాలి. స‌మ‌స్య ఏమిటీ అన్న విష‌యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఓ మార్గాన్ని అన్వేషించాలి. కే-12 కంపెనీలు ప్ర‌త్యేకంగా పాఠ‌శాల చ‌క్రాన్ని అవ‌గాహ‌న చేసుకోవ‌డం చాలా ముఖ్యం. ఈ కాల చ‌క్రంలోనే ప్ర‌యోగాలు కానీ, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను కానీ నిర్వ‌హించాలి" అని ఆమె వివ‌రించారు.

దురభిప్రాయాల‌ను రూపుమాపాలి..

విద్య విష‌యంలో ఎన్నో దురభిప్రాయాలున్నాయి. డ‌బ్బులు సంపాదించ‌డం కోస‌మే విద్య నేర్చుకోవాల‌న్న భావ‌న నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డాల‌న్న‌ది విల్‌గ్రో ఉద్దేశం. విద్య అనేది ఓ సంప్ర‌దాయ‌బ‌ద్ద‌మైన‌, ఆదాయం రాన‌టువంటి రంగంగా గుర్తించి, అందుకు త‌గ్గ‌విధంగా త‌మ వ్యూహాల‌ను సిద్ధం చేసుకోవాల‌ని క‌విత చెప్తారు. త‌క్కువ ఖ‌ర్చుతో అత్యుత్త‌మ విద్య అందుబాటులోకి రాదు అన్న భావ‌న కూడా క‌రెక్టు కాదంటారామె. దేశ‌వ్యాప్తంగా చైన్ స్కూల్స్ నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు త‌క్కువ ఫీజుతోనే అత్యుత్త‌మ విద్య‌ను అందిస్తున్న విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ విష‌యాన్ని అంద‌రికీ తెలియ‌జేయాల్సిన అవ‌స‌ర‌ముందంటారు.

పేద విద్యార్థుల‌కు నైపుణ్య శిక్ష‌ణ‌..

విద్యా రంగంలో ప‌నిచేస్తున్న చాలా స్టార్ట‌ప్ కంపెనీలు అత్యుత్త‌మ నాణ్య‌త క‌లిగిన స్కూల్స్‌తోనేప‌నిచేస్తున్నాయి. ఎంద‌ుకంటే ఆ స్కూల్స్‌తో ప‌నిచేస్తే లాభాల‌ను ఆర్జించొచ్చ‌న్న ఉద్దేశం వారిది. కానీ చాలామంది భార‌తీయులు కిందిస్థాయి పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుతుంటారు. వారి బాగోగుల‌ను ప‌ట్టించుకునేదెర‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తుంటారు. అయితే విల్‌గ్రో మాత్రం ఇలాంటి ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థుల కోస‌మే ప‌నిచేస్తున్న‌ది. పేద విద్యార్థుల కోసం ప‌నిచేసే సంస్థ‌ల‌కే ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్న‌ది. కిందిస్థాయి ప్రైవేట్ స్కూల్స్‌, ప్ర‌భుత్వ స్కూల్స్‌తోనే విల్‌గ్రో ఒప్పందం చేసుకున్న సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి. పేద‌ విద్యార్థులు, స్కూల్ డ్రాపౌట్స్‌కే నైపుణ్య శిక్ష‌ణ ఇస్తున్నాయి. "ఇది చాలా క్లిష్ట‌మైన రంగం. ఈ రంగంలో విక్ర‌యాలు, ఉత్ప‌త్తుల‌ను అంద‌జేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఐతే ఈ విభాగంలోని విద్యార్థుల నాణ్య‌త పెరిగితే అది పూర్తిగా విద్యారంగంపై మంచి ప్ర‌భావం చూపుతుంది. అందుకే ఇలాంటి రంగాల అభివృద్ధి కోస‌మే విల్‌గ్రో ప‌నిచేస్తున్న‌ది" అని అంటారు క‌విత‌. ఇక విల్‌గ్రో వ్య‌వ‌స్థాప‌కురాలిగా సామాజిక సంస్థ‌లు, సామాజిక బాధ్య‌త‌ల‌తో ప‌నిచేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటారామె. సామాజిక బాధ్య‌తే త‌మ‌ను ఈ ప‌నిచేయిస్తుంద‌ని చెప్తున్నారు. "మా పోర్టుఫోలియాలోకి సంస్థ‌ను తీసుకున్న త‌ర్వాత వాటి పనితీరు అంచ‌నా కోసం కొన్ని పారామీట‌ర్లు నిర్ణ‌యిస్తాం. ప్ర‌త్యేక కాల‌ప‌రిమితిలో వారు సాధించిన ఘ‌న‌త‌ల‌ను ప‌రిశీలిస్తాం. ఉదాహ‌ర‌ణ‌కు, నైపుణ్య శిక్ష‌ణ సంస్థ‌, ఎంత‌మందికి శిక్ష‌ణ ఇచ్చింది.. అందులో కోర్సుల‌ను పూర్తి చేసిన విద్యార్థులెంత మంది? వారు ఎక్క‌డ ఉద్యోగం చేస్తున్నారు, వారి స‌గ‌టు జీత‌మెంత‌? .. వంటి అంశాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకుంటాం. మా ల‌క్ష్యాల‌ను చేరుకుంటున్నామా లేదా అన్న అంశంపై సంస్థ‌ల‌తో క‌లిసి మ‌దింపు చేసుకుంటాం" అని క‌విత వివ‌రించారు.

నాలుగు విధాలుగా సాయం..

విద్యా రంగంలో అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ‌ల‌కు నాలుగు విభాగాల్లో విల్‌గ్రో సాయ‌మందిస్తున్న‌ది. విద్యార్థుల అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డే సేవ‌, ప్రాడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు, బిజినెస్ మోడ‌ల్స్ ప్ర‌యోగాల‌కు సీడ్ ఫండింగ్ అందిస్తుంది. విద్యా రంగంలో సేవ చేసే సంస్థ‌ల‌కు విల్‌గ్రో ఉద్యోగుల‌తోపాటు ఇత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు, విద్యా రంగ నిపుణులు కూడా సాయం చేస్తున్నారు. విల్‌గ్రో ఫెలోషిప్ పేరిట స్కాల‌ర్‌షిప్ అందిస్తున్న‌ది. ఇక త‌మ నెట్‌వ‌ర్క్‌ను పూర్తిగా ఉప‌యోగించుకునేందుకు కూడా సంస్థ‌ల‌కు విల్‌గ్రో అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ది.

విద్యా రంగ అభివృద్ధిలో సాంకేతిక పాత్ర‌..

అన్ని రంగాల్లాగే విద్యా రంగ అభివృద్ధిలో కూడా టెక్నాల‌జీ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ది. వ్యాపారానికి సంబంధించిన విష‌యాల్లో టెక్నాల‌జీని ఎలా ఉపయోగించాల‌న్న అన్న అంశాల‌ను కంపెనీలు ఆలోచించాల‌ని క‌విత అంటున్నారు. టెక్నాల‌జీ సొల్యూష‌న్స్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం కంటే వాటిని ఎలా విస్త‌రించాల‌న్న‌దానిపైనే దృష్టిపెట్టాల‌ని ఆమె అభిప్రాయ‌ప‌డుతున్నారు. " నిర్ధిష్ట‌మైన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొంటున్న స‌మ‌యంలోనే టెక్నాల‌జీ ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న విష‌యంపై కూడా ఆలోచ‌న చేయాలి. ఉత్ప‌త్తి లేదా సేవ మార్కెట్‌లోకి వెళ్లేందుకు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది? స‌ంస్థ అనుకున్న ల‌క్ష్యాన్ని ఎలా సాధిస్తుంది అన్న అంశాల‌ను ప‌రిశీలించాలి" అని ఆమె చెప్పారు.

సంస్థ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు అనేకం..

పేద‌రిక నిర్మూల‌న కోసం కృషి చేస్తున్న సంస్థ‌లు కొన్ని స‌మ‌యాల్లో చాలా స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నాయి. నిరుపేద‌ల‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చి వారికి ఉపాధి క‌ల్పించాల‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ, వాస్త‌వ విష‌యానికొస్తే ప్ర‌జ‌ల నుంచి కొన్ని ర‌కాల వ్య‌తిరేక‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మంచి శిక్ష‌ణ పొందిన ప్లంబ‌ర్లు, తాపీప‌ని చేసే వారి కోసం చాలా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఐతే విద్యార్థుల‌కు మాత్రం ఈ రంగాల‌పై అంత‌గా ఆస‌క్తి లేదు. ఇత‌ర రంగాల్లో శిక్ష‌ణ పొందాల‌ని వారు అనుకుంటున్నారు. ఇలాంటి విష‌యాల‌ను బ్యాలెన్స్ చేసుకోవ‌డం సంస్థ‌ల‌కు క‌ష్టంగా మారుతున్న‌ది. మ‌రోవైపు విద్యా రంగంలోని చాలా విభాగాలు ఇంకా వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని ఆమె అంటారు. "స్కూల్ ప్రోగ్రామ్స్ ముగిసిన త‌ర్వాత, దానికి సంబంధించిన రిమీడియేష‌న్ ప్రోగ్రామ్స్ వంటివి అవ‌స‌రం. ముఖ్యంగా టీచ‌ర్ ట్రైనింగ్‌, స‌ర్టిఫికేష‌న్ వంటి రంగాల్లో ఇది మ‌రింత అవ‌స‌రం. ఈ రంగాలు నేడు ముక్క‌ల‌య్యాయి. నైపుణ్య శిక్ష‌ణ‌లో సాఫ్ట్ స్కిల్స్‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టారు. అలాగే హార్డ్ స్కిల్స్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌) శిక్షణ‌పై కూడా దృష్టిసారించాలి. వీటికి తోడు స‌హాయ‌క రంగాల‌ను కూడా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంది. పాఠ‌శాల‌ల‌కు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఆర్థికంగా సాయం అందించాల్సిన అవ‌స‌ర‌ముంది" అని క‌విత రాజ‌గోపాల్‌ వివ‌రించారు.