హైదరాబాదీ స్టార్టప్స్కు మలేషియాలో ఫ్రీ మెంటారింగ్ ఛాన్స్
Friday January 29, 2016,
3 min Read
మలేసియా, సింగపూర్ సహా భారత్లోని ప్రముఖ ఇన్వెస్టర్లు, యాక్సిలరేటర్లంతా ఒక్క చోటికి చేరారు. మార్కెట్ ప్లేస్ రంగంలో ఉన్న స్టార్టప్స్ను ఎంపిక చేసి వాటికి నిధులు సమకూర్చేందుకు 50 మంది వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టింగ్ సంస్థలు హైదరాబాద్ టి-హబ్లో సమావేశమయ్యారు. యాంట్ హిల్ వెంచర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన 25 స్టార్టప్స్ హాజరై.. వాళ్ల ఐడియాలను ఇన్వెస్టర్లతో పంచుకున్నారు.
భారతీయ కంపెనీలకు ఆగ్నేయాసియా దేశాల నుంచి నిధులు సమకూర్చిపెట్టేందుకు, వాళ్లకు అవసరమైన యాక్సిలరేటర్ ప్రోగ్రాం సాయం అందించేందుకు మలేషియా ప్రభుత్వ సంస్థ 'మ్యాజిక్' కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. వీళ్లతో పాటు సింగపూర్కు చెందిన ఫండ్నెల్ సంస్థ కూడా స్టార్టప్స్ను ఎంపిక చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్ కమ్యూనిటీ నుంచి ఎంపిక చేసిన స్టార్టప్స్కు నిధులు సమకూర్చిపెడ్తామని ఫండ్నెల్ చెబ్తోంది.
క్లోజ్డ్ డోర్ మీటింగ్లో దాదాపు 25 స్టార్టప్స్ తమ ఐడియాలను ఇన్వెస్టర్లతో పంచుకున్నారు. వీటిల్లో కొన్ని సీడ్ ఫండింగ్ అందుకుంటే మరికొన్ని ఏ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 300 స్టార్టప్ సంస్థల నుంచి అప్లికేషన్లు సేకరించి వాళ్లలో 25 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశాన్ని కల్పించారు. సత్తా ఉన్న ఔత్సాహిక సంస్థ లేదా ఐడియాకు ఒక మిలియన్ డాలర్ వరకూ నిధులను అందించేందుకు ఇన్వెస్టర్లు సంసిద్ధత కనబరిచారు.
ఏంటీ మ్యాజిక్ ప్రోగ్రాం
మ్యాజిక్ను (MAGIC - మలేసియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ సెంటర్) మలేసియా ప్రభుత్వం ఫండ్ చేస్తోంది. ఆసియా దేశాల్లో ఓ స్టార్టప్ హబ్గా ఎదిగేందుకు అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ఆసియా దేశాల్లోని కొన్ని స్టార్టప్ సంస్థలను ఎంపిక చేసి వాళ్లకు యాక్సిలరేటర్ ప్రోగ్రాం కింద ఉచితంగా శిక్షణనివ్వడం వీళ్ల ప్రధాన ఉద్దేశం. Asean దేశాల్లోని 1000కి పైగా సంస్థల నుంచి అప్లికేషన్లు సేకరించి.. అందులోని 50కి పైగా స్టార్టప్స్, 25కిపైగా సోషల్ ఆంట్రప్రెన్యూర్ సంస్థలను సెలెక్ట్ చేసుకుంటారు.
యాక్సిలరేటర్ ప్రోగ్రాంలో భాగంగా ఎంపిక చేసిన సదరు కంపెనీలకు ఎర్లీ స్టేజ్ ఫండింగ్, భాగస్వామ్యాలు, గ్లోబల్ మార్కెట్లకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై గైడెన్స్ను అందిస్తారు. 60 శాతానికిపైగా మలేసియా సంస్థలు ఉంటే మిగిలిన వాళ్లలో కాంబోడియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ ఉంటారు. మొట్టమొదటిసారి భారత దేశానికి కూడా మ్యాజిక్ సంస్థ వచ్చింది. హైదరాబాద్లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో మ్యాజిక్ సంస్థ ప్రతినిధులు స్టార్టప్ పిచింగ్స్లో పాల్గొన్నారు.
'' యాంట్ హిల్తో కలిసి మొదటిసారి భారత్ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి స్టార్టప్ వ్యవస్థ మేం ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా ఉంది. మా యాక్సిలరేటర్ ప్రోగ్రాంకు కొంత మందిని భారత్ నుంచి ఎంపిక చేయాలని చూస్తున్నాం. అయితే కేవలం ఒక్కరంగానికి మాత్రం పరిమితం కావాలని అనుకోవడంలేదు. సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ను కూడా మేం ప్రోత్సహిస్తున్నాం '' - జోనథన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మ్యాజిక్
ఎవరికి అవకాశం
- ఆసియాన్ దేశాల పౌరులై ఉండాలి
- కనీసం టీంలో 1 - 3 సభ్యుల బృందమై ఉండాలి
- నాలుగు నెలల పాటు ప్రోగ్రాంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు కావాలి
- మార్కెట్ రెడీ ప్రోడక్ట్తో పాటు ఎంతో కొంత ట్రాక్షన్ అవసరం
- వృద్ధి చేసేందుకు, చెందేందుకు అవకాశమున్న రంగం, వ్యాపారమైన ఉండాలి
స్టార్టప్స్కు దక్కేదేంటి
- యాక్సిలరేటర్ ప్రోగ్రాం కోసం కంపెనీల్లో ఎలాంటి ఈక్విటీ తీసుకోకపోవడం ప్లస్ పాయింట్
- ప్రపంచ స్థాయి మెంటార్ల నుంచి శిక్షణ పొందవచ్చు
- వీసా, మంత్లీ స్టైఫండ్, రిటర్న్ ఫ్లైట్స్, అకామిడేషన్, వర్కింగ్ స్పేస్
- రూట్ - టు మార్కెట్ పార్ట్నర్స్ను కలిసే అవకాశం
- 4 లక్షల యూఎస్ డాలర్ల విలువైన స్టార్టప్ బెనిఫిట్స్
''మన దేశ స్టార్టప్స్ ఆసియా స్థాయిలో విస్తరించేందుకు, అక్కడి సంస్థలకు ఇక్కడ ఉన్న అవకాశాలను తెలియజేసేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడ్తుంది. మ్యాజిక్ భారత పర్యటనలో భాగంగా కొంత మంది స్టార్టప్స్ను ఎంపిక చేసి యాక్సిలరేటర్ ప్రోగ్రాంకు తీసుకెళ్తారు. ఫండ్నెల్ సంస్థ సీరీస్ ఏ నిధులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తుంది'' - ప్రసాద్ వంగా, ఫౌండర్ యాంట్హిల్ వెంచర్స్