ఆన్‌లైన్ స్టార్టప్స్‌లో పెట్టుబడికి యువీ ఉత్సాహం

• పెరుగుతున్న ఆన్ లైన్ స్టార్టప్స్ మార్కెట్ వైపు క్రికెటర్ల ఆసక్తి...• 40-50 కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్న క్రికెటర్ యువరాజ్ సింగ్

ఆన్‌లైన్ స్టార్టప్స్‌లో పెట్టుబడికి యువీ ఉత్సాహం

Friday May 01, 2015,

2 min Read

మన దేశంలో రోజు రోజుకు ప్రాధాన్యత పొందుతున్న ఆన్‌లైన్ స్టార్టప్ మార్కెట్ వైపు, బాలీవుడ్ నటుల నుండి క్రికెట్ స్టార్ల వరకు ప్రతీ ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. ఇంటర్నెట్ విస్తృతం కావడం, స్మార్ట్ ఫోన్లతో సుమారు 500 మిలియన్ల భారతీయులను ఈ మార్కెట్ వైపు ఆకర్శిస్తోంది. ఇప్పటికే 1.3 బిలియన్ భారతీయుల్లో 100 మిలియన్లకు పైగా ఆన్‌లైన్ లో లావాదేవీలు చేస్తున్నారు. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం కూడా ఉంది. పెరుగుతున్న స్టార్టప్ బూమ్ చూసి క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాపారాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ ఆలోచనతో పుట్టుకొచ్చిందే ‘యు వి క్యాన్ (YouWeCan) వెంచర్స్’.

image


మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం, స్టార్టప్ మార్కెట్ వైపు మొగ్గుచూపుతున్న‘యువిక్యాన్’ రాబోయే 3 - 5 ఏళ్లలో 40-50 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో స్టార్టప్‌పై సుమారు రూ. 50 లక్షల వరకు పెట్టుబడి ఉండవచ్చని అంచనా ఉన్నా, యువరాజ్ సింగ్ బ్రాండ్ ఆ వ్యాపారానికి బలంగా మారుతుంది.

“మీ దగ్గర ఐడియా ఉండి వాటిని అమలు చేసే సత్తా ఉంటే, యువరాజ్ సింగ్ మీతో ఉన్నారు, తన దగ్గరున్న బ్రాండ్, మార్కెటింగ్, టెక్నాలజీ టీమ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ వంటి ప్రధాన అంశాలతో యువరాజ్ మీ వ్యాపారాన్ని బలపరుస్తారు,” ఇది యువిక్యాన్ వెబ్సైట్ చెబుతున్న సమాచారం.

యు వి కెన్ వెంచర్స్ వెబ్ పేజ్

యు వి కెన్ వెంచర్స్ వెబ్ పేజ్


యువరాజ్ ఇప్టటికే ‘ప్యూమా’, ‘రీబాక్’, ‘హీరో మోటర్స్’, ‘ఓక్లేస్’, ‘ఒలిస్సే నార్డిన్’ వంటి ప్రముఖ బ్రాండ్లతో పని చేస్తున్నారు. ‘మనీ కంట్రోల్’ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన యువి, “కొంత మంది మిత్రులతో ఈ అంశాలపై మాట్లాడాను, అనుకూలమైన వారు వస్తే సుమారు 250-300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు,”

గత కొంత కాలంగా అనేక సమస్యలతో పోరాడుతున్న యువరాజ్ సింగ్, 2011 లో అమెరికా వెళ్లి క్యాన్సర్ చికత్స చేయించుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ, 2012 సెప్టెంబర్ లో మళ్లీ ఆయన కెరీర్ ను ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఇప్పటికే అర్జున అవార్డ్, పద్మ శ్రీ వంటి అవార్డులతో ఆయనను సత్కరించింది.

మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన యువి, సమాజంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే యువ వ్యాపారవేత్తలకు సహాయపడాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును యువి వ్యాపార సలహాదారులు నిశాంత్ సింఘల్ సారధ్యంలో నడుస్తోంది. వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నిశాంత్, పీడబ్లుసీలో 11 ఏళ్ల అనుభవంతో పాటు, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్ , ఐటీ స్ట్రాటజీ కన్సల్టింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో కూడా అనుభవం పొందారు.

ఈ-కామర్స్, హెల్త్ కేర్, మెడికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో యువిక్యాన్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం, ఇంట్రెస్ట్ ఉన్న వారు [email protected] కు తమ ఆలోచనలను పంచుకోవచ్చు.