వారానికి 20 శాతం వృద్ధితో దూసుకుపోతున్న 'రోడ్‌ రన్నర్'

వారానికి 20 శాతం వృద్ధితో దూసుకుపోతున్న 'రోడ్‌ రన్నర్'

Tuesday October 20, 2015,

5 min Read

సాయంత్రం 5.15 అయితే చాలు.. రోడ్‌రన్నర్ ఆఫీస్‌ బేస్‌మెంట్‌లో హడావిడి మొదలైపోతుంది. దాదాపు వందమంది డెలివరీ బాయ్స్ కుర్చీల్లో కూర్చుని సిద్ధంగా ఉంటారు. బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) హైపర్ లోకల్ లాజిస్టిక్ స్టార్టప్ సర్వీసుల్లో భాగం కావడానికి ఉద్యుక్తులవుతూ ఉంటారు. అయితే.. ఈ హడావిడి కేవలం బేస్‌మెంట్‌కి మాత్రమే పరిమితం కాదు. ఆ కార్యాలయంలోని ప్రతీ అంతస్తులోనూ ఇది కనిపిస్తుంది. ఇంతగా పరుగులు పెడుతున్న ఈ ఆఫీస్ నిర్వహణను చూస్తే.. రోడ్‌రన్నర్ ప్రారంభమై ఆరు నెలలే అయిందంటే అసలు నమ్మబుద్ధి కాదు.

ఈ తక్కువ సమయంలోనే అనేక మైలు రాళ్లను అధిగమించింది రోడ్‌రన్నర్. “ఇక్కడ ప్రతీ విషయమూ కొత్తదే. అయితే.. పూర్తి చేయాల్సిన పనులు మాత్రం చాలా ఉన్నాయి” అంటున్నారు బీన్ బ్యాగ్‌పై విలాసంగా కూర్చున్న రోడ్‌రన్నర్ సహ వ్యవస్థాపకుడు మోహిత్ కుమార్. తాజాగా ఈ సంస్థకు సెకోయా కేపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, బ్లూమ్ వెంచర్స్ నుంచి 11 మిలియన్ల యూఎస్ డాలర్ల ఫండింగ్ అందింది. కానీ ఈ కథ ఇక్కడితో ప్రారంభం కాదు.. అలాగని ఇక్కడితోనే అంతమయేది కూడా కాదు.

సమస్యతో మొదలైన రోడ్‌రన్నర్ గేమ్

2014 డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన మొబైల్ హ్యాకథాన్‌ దగ్గర ఈ స్టోరీ ప్రారంభమైంది. అర్పిత్ దేవ్, మోహిత్‌లు కొలీగ్స్ మాత్రమే కాదు.. ఒకే టీంలో సభ్యులు కూడా. రవాణా సదుపాయాలను ఏ కంపెనీ అయినా.. ఎందుకు అధిక ఖర్చుతో కూడిన వ్యవహారంగా భావిస్తుందనే ఆలోచన చేశారు వీళ్లిద్దరూ.

“ ఓలా, ఉబెర్‌ల రాక ముందు ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ఖరీదైన వ్యవహారం. మధ్యవర్తులను తొలగించి, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుని డిమాండ్ తగ్గట్లుగా సప్లై ఉండేలా చర్యలు చేపట్టాయి ఆ సంస్థలు. అంటే వస్తు రవాణా రంగంలో కూడా ఇలాంటి మోడల్ అవసరం ఉంద”న్నారు అర్పిత్.

వస్తు రవాణా రంగం అనేక భాగాలుగా విడిపోయిందనే విషయం..హ్యాకథాన్ సమయంలో వీరిద్దరు అర్ధం చేసుకున్నారు. డిమాండ్, సప్లైలను ఒకచోటకు చేరుస్తూ.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఈ-కామర్స్ రంగంలో సంచలనం సృష్టించినట్లుగానే.. వస్తు రవాణా రంగంలోనూ ఇలాంటి విప్లవం సృష్టించవచ్చనే ఆలోచన వచ్చింది వీరికి.

నగరంలోనే సరుకులు అందించేందుకు కూడా.. ఇంటర్ సిటీ తరహా మోడల్‌నే రవాణా రంగంలోని కంపెనీలు అనుసరిస్తున్నాయనే విషయం వీరు తెలుసుకున్నారు. ఈ మోడల్ చాలా పాత విధానాలను అనుసరించి నిర్వహిస్తున్నారంటారు ఈ ద్వయం.

“ నగరాలు, పట్టణాల్లో అంతర్గతంగా రవాణా చేసేందుకు మధ్యవర్తులు, ప్రాసెసింగ్ హబ్‌ల అవసరమేంటి ? వ్యాపారి దగ్గర నుంచి తీసుకోవడం, కస్టమర్ దగ్గరు చేర్చడం అంతే కదా పని ” అంటూ విశ్లేషిస్తారు మోహిత్. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించడం మొదలుపెట్టి.. ఓ అంచనాకు రాగానే దానినో వ్యాపారంగా మార్చేసింది ఈ స్నేహద్వయం.

image


15 రోజుల్లోనే మారిపోయిన పరిస్థితులు

కొన్ని నెలల మేధోమధనం తర్వాత ఇద్దరూ కలిసి 2015 ఫిబ్రవరిలో రోడ్‌రన్నర్‌ను ప్రారంభించారు. మొదలుపెట్టిన అనతికాలంలోనే హైపర్‌ లోకల్ కామర్స్‌కు ఎంత ఎక్కువగా డిమాండ్ ఉందో వీరిద్దరూ అర్ధం చేసుకున్నారు. ముందు సొంతగానే అంతా నిర్వహిద్దామని భావించినా.. అది సాధ్యం కాదనే విషయం అర్ధమైంది.

“వ్యాపారులు మన విధానాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటే.. అందులో వారికి ప్రతిఫలం కనిపించాలి. ఈ సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యం” అంటారు అర్పిత్.

ప్రస్తుతం ఆహార సంబంధిత వ్యాపారాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రంగంలో ఎన్నో కొత్త కంపెనీలు వచ్చినా నిలబడగలుగుతున్నాయి. క్లయింట్ల అవసరాలు తీర్చడం చాలా ముఖ్యం. ఆర్డర్ల సంఖ్య పెరగాంటే.. ఎక్కువమంది క్లయింట్స్ కావాలి. ఇందుకోసం వీలైనంత ఎక్కువగా భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అయితే వివిధ రకాల వ్యాపారాలకు అనుగుణంగా వారి అవసరాలు తీర్చేలా నిర్వహించగలగడం కొంత సమస్యను సృష్టించే అంశం.

పూర్తి స్థాయిలో వ్యాపార నిర్వహణకు సిద్ధమై, ప్లాట్‌ఫాంను లాంఛ్ చేసేందుకు వారం ముందు వారికి ఇది లాభదాయకతను సంతరించుకోవడం కష్టమనే విషయం అర్ధమైంది. “దీంతో బీ2బీ మోడల్‌లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చింది ” అన్నారు అర్పిత్.

మార్కెట్‌లోకి త్వరగా రావడం

తాము పూర్తిగా సిద్ధం కాకుండానే ప్రొడక్ట్ లాంఛ్ చేస్తున్నామనే విషయం ఈ ఇద్దరు వ్యవస్థాపకులకు బాగానే తెలుసు. కనీస గిట్టుబాటు ఉత్పత్తి(ఎంవీపీ) అని అర్ధం కాగానే మార్కెట్‌లోకి ప్రవేశించారు. ఈ రంగంలోకి ఎంటర్ అయేపుడు తమ దగ్గర పూర్తిస్థాయిలో సిద్ధమైన ప్రొడక్ట్ లేదనే విషయం తమకు తెలుసంటారు అర్పిత్. అయినా సరే టెక్నాలజీ ఆధారం మొదటి ఆర్డర్‌ను పొందడంలో విజయం సాధించినట్లు చెబ్తారాయన.

ఏం చేయకూడదో ఇలా తెలుసుకున్నారు

“విక్రయాలు చేయగలగడం ఓ విభిన్నమైన వ్యవహారం” అంటున్నారు అర్పిత్. ప్రారంభ రోజుల్లో రోడ్‌రన్నర్‌ను వ్యతిరేకించినవారే ఎక్కువ. ప్రస్తుతం ఈకామర్స్, హైపర్ లోకల్, ఫుడ్ టెక్నాలజీ వ్యాపారాలు వారి క్లయింట్స్‌గా ఉన్నారు. వీరి ఆలోచనను ఎవరూ స్వీకరించలేదు. అయితే.. సాంకేతిక రంగం నుంచి వచ్చిన వీరిద్దరూ.. తమ ఆలోచనను, ప్రోడక్ట్‌ను విక్రయించలేదు. మరింత సమర్ధంగా ఎలా నిర్మించగలమనే ఆలోచనకే కట్టుబడ్డారు.

అసలీ ప్రొడక్ట్ ఇన్నాళ్లు నిలబడుతుందనే ఎవరూ నమ్మలేదంటారు మోహిత్. అసలు ఇలాంటి వ్యాపారాన్ని నిజంగానే ప్రారంభిస్తారా అని అనుమానం వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. “ప్రతీ ఒక్కరు బిజినెస్2 కస్టమర్ విభాగంపై దృష్టి పెట్టిన సమయంలో.. బీ2బీ విభాగంలో రవాణా రంగానికే మేం కట్టుబడ్డాం” అన్నారు మోహిత్.

ఎక్సెల్ షీట్లపై వ్యాపారాలు నడుస్తాయా ?

రోడ్‌రన్నర్‌కి సంబంధించిన ఆలోచన రాగానే.. అనేక ఎక్సెల్ షీట్లపై కసరత్తులు చేశారు అర్పిత్, మోహిత్‌లు. తమ దగ్గరున్న పొదుపు చేసిన అతి కొద్ది నిధులతో ఈ వ్యాపారం నిర్వహించగలమా అని ఆలోచించారు. కొన్నాళ్లకే.. ఎక్సెల్ షీట్లలో ప్రణాళికలకు.. నిజమైన వ్యాపారాలకు చాలా వ్యత్యాసం ఉంటుందనే విషయం బోధపడింది.

తమ సొంత నిధులతో కనీసం 3 నెలల పాటు వ్యాపారాన్ని నిర్వహించగలమని భావించారు ఈ ఇద్దరు భాగస్వాములు. అయితే.. కార్యకలాపాలపై నిధులు వెచ్చించడం ప్రారంభం కాగానే.. వారు అనుకున్నదానికంటే వేగంగా డబ్బులు కరిగిపోయాయి.

మోహిత్ కుమార్-అర్పిత్ దేవ్, రోడ్ రన్నర్ వ్యవస్థాపకులు(ఎడమ-కుడి)

మోహిత్ కుమార్-అర్పిత్ దేవ్, రోడ్ రన్నర్ వ్యవస్థాపకులు(ఎడమ-కుడి)


డెలివరీ బాయ్స్ రిక్రూట్‌మెంట్

మొదట వీరు డెలివరీ బాయ్స్‌గా రిక్రూట్ చేసుకున్నవారు.. వీరి పరిసరాల్లో కనిపించేవారే. ఏదైనా ఫుడ్‌ను ఆర్డర్ చేయడం, తమ దగ్గరకు వచ్చిన వారిని సంస్థలో జాయిన్ అవుతారా అని అడగడం చేసేవారు. వీరికి మోహిత్ ఇంట్లోనే ట్రైనింగ్ ఇచ్చేవారు. “వీరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వీక్లీ పేమెంట్స్ ఇవ్వడం ప్రారంభించాం” అని చెప్పారు మోహిత్. ఆ తర్వాత ప్లాట్‌ఫాంను టెస్టింగ్ చేయడం ప్రారంభించారు. డమ్మీ ఆర్డర్లను రన్ చేయడంతో పాటు కొంత క్షేత్ర స్థాయి పరిశోధన కూడా నిర్వహించారు.

రోడ్‌రన్నర్‌కి మొదటి క్లయింట్ కోరమంగళలోని ఓ రెస్టారెంట్. మొదటి రోజు 15 ఆర్డర్స్ తీసుకోగా.. కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య 5కు తగ్గిపోయింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు క్లయింట్‌ను సంప్రదించగా.. ఫోన్స్ డెడ్ అయ్యాయనే విషయం అర్ధమైంది. అందుకే కొత్త ఆర్డర్లు తీసుకోవడం సాధ్యపడలేదు. “ఫోన్ సమస్యను పరిష్కరించుకున్నాక.. కొత్త క్లయింట్లను తెచ్చుకోగలగమనే నమ్మకం కుదిరింది. ఆ తర్వాత అర్వింద్‌ను బోర్డ్‌లోకి తీసుకున్నాం. మరిన్ని రెస్టారెంట్లను నిర్వహించే బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాం" అన్నారు మోహిత్.

వ్యవస్థాపకులే డెలివరీ బాయ్స్‌గా

ప్రారంభించిన కొన్నాళ్లకే క్లయింట్స్, కంపెనీలకు వర్షాకాలం సమస్య ఎదురైంది. ఈ కాలంలో డెలివరీలు చేయడం కష్టమైంది. హోమ్ డెలివరీ ఆర్డర్లు ఏడాది మొత్తంలోకి.. ఈ కాలంలోనే ఎక్కువగా వస్తాయనే విషయం కూడా అప్పుడే అర్ధమైంది వీరికి. క్లయింట్లకు ఇచ్చిన కమిట్‌మెంట్లను పూర్తి చేసేందుకు.. వీరిద్దరూ రోడ్‌పైకి వళ్లి డెలివరీలు చేయాల్సి వచ్చింది. “ఓ సమయంలో అర్పిత్ రోజుకు 50డెలివరీలు కూడా చేసేవాడ”ని గుర్తు చేసుకున్నారు మోహిత్.



తమ వ్యాపారంలో డెలివరీ విభాగం ఎంత ముఖ్యమో అప్పుడే అర్ధమైంది వీరిక. గ్రౌండ్ లెవెల్‌లో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అప్పుడే అనుభవంలోకి కూడా వచ్చింది. మరోవైపు క్లయింట్లు, వ్యాపారుల అంచనాలను అందుకోవడం కూడా తప్పనిసరి. "ఈ అనుభవం నాలో నెమ్మదితనాన్ని పెంచింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే ఆత్మ స్థైర్యం అలవడింది” అన్నారు అర్పిత్.

డెలివరీ బాయ్స్ టీం @ రోడ్‌రన్నర్

డెలివరీ బాయ్స్ టీం @ రోడ్‌రన్నర్


ఓ కొత్త సంస్కృతి నిర్మాణం

ప్రస్తుతం రోడ్‌రన్నర్‌ పరిస్థితి చాలా ఉన్నత స్థాయిలో ఉంది. ఎవరిదో ఆఫీస్‌ను తీసుకుని, స్పేస్‌ను పంచుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నడిమధ్యలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాము ముందుగా అనుకున్న విలువలకు, విధానాలకు ఇప్పటికీ వాస్తవంగానే కట్టుబడ్డారు అర్పిత్, మోహిత్‌లు. రవాణా రంగంలో స్థిరపడాలంటే.. ప్యాషన్‌తోపాటు చొచ్చుకుపోగల స్వభావం చాలా ముఖ్యమని, అదే సమయంలో సమస్యలను అతి వేగంగా పరిష్కరించుకోగలగాలని చెబ్తున్నారు. అదే సమయంలో మృదు సంభాషణలు కూడా ముఖ్యమే అన్న విషయాన్ని వీరు మర్చిపోలేదు. 


అభివృద్ధితో భవిష్యత్తు

ప్రస్తుతం వారానికి 20శాతం వేగంతో వృద్ధి చెందుతోంది రోడ్‌రన్నర్. అయితే.. ఈ వేగం ఎక్కువ కాలం సాధ్యంకాదనే విషయం వారికి తెలుసు. కానీ తాము ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందనే అంశంపై వారికి స్పష్టత ఉంది. స్థానిక బీ2బీ డెలివరీల విభాగంలో దేశంలోనే అతి పెద్ద వస్తు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది వారి లక్ష్యం.

"మధ్యవర్తులను తొలగించడం ద్వారా.. ఎవరైనా డెలవరీ మ్యాన్, విమెన్‌గా పనిచేసే అవకాశం కల్పించాం. రవాణా రంగంలో చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. బైక్స్ వంటి వాహనాల అవసరం కూడా అంతగా లేదని విశ్వసిస్తాం. ఎలక్ట్రిక్ సైకిల్స్, నడకలతోపాటు మరిన్ని రకాల ప్రయాణాలతోనే ఈ వ్యాపారం నిర్వహించచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు అవకాశమున్న రంగం ఇది” అన్నారు మోహిత్.

వెబ్‌సైట్