వాటర్ ప్యూరిఫయర్ల అమ్మకాల్లో వండర్లు సృష్టిస్తున్న'శ్రేష్ట్'

బయోటెక్నాలజీ చదివి ప్యూరిఫయర్ వ్యాపారంలోకి దిగిన ఇంజనీర్.. 

వాటర్ ప్యూరిఫయర్ల అమ్మకాల్లో వండర్లు సృష్టిస్తున్న'శ్రేష్ట్'

Monday September 14, 2015,

3 min Read


శుభ్రమైన మంచి నీళ్లు.. దొరకడం ఈ రోజుల్లో అంత సులువైన పనికాదు. నగరాల్లోని చాలా మంది జనాలు.. ఇప్పుడు మున్సిపల్ వాటర్‌కు బదులు వాటర్ క్యాన్స్ ఇంటికి తెప్పించుకునే పరిస్థితి దాపురించింది. నీళ్లు రంగుమయం కావడం, అందులో మురుగు నీరు కలవడం, సరిగ్గా నిల్వచేయకపోవడం వల్ల వాటిల్లో వాసన, క్లోరిన్ కంపు వంటివి ప్రతీ ఒక్కరూ అనుభవించే కష్టాలే. వాటర్ క్యాన్‌కు బదులు.. ఇంట్లో ప్యూరిఫయర్ పెట్టుకునే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే వాటి ధరలు మరీ ఎక్కువగా ఉండడంతో సామాన్యులు, దిగువ మధ్య తరగతి వాళ్లకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ గ్యాప్‌ను ఫిల్ చేద్దామనే ఓ యువకుడు సిద్ధమయ్యాడు. తక్కువ ధరలో ప్యూరిఫయర్లను తయారు చేస్తూ.. ఓ సుస్థిరమైన బ్రాండ్‌ను బిల్డ్ చేస్తున్నాడు. అతనే శ్రేష్ట్ RO ఫౌండర్ గౌతమ్.

గౌతమ్, శ్రేష్ట్ ఆర్ ఓ ఫౌండర్

గౌతమ్, శ్రేష్ట్ ఆర్ ఓ ఫౌండర్


“ నా మొదటి కస్టమర్ మా అమ్మ. వాటర్‌ని ప్యూరిఫై చేసి అందులో ఫంగస్ బయటకు చూపిస్తే... అమ్మ భయపడింది. ఇంత చెత్త నీళ్లు మనం రోజూ తాగుతున్నామా అంటూ ఆందోళనపడింది ” అంటారు గౌతమ్.

ఇది మా అమ్మ మాటే కాదు, మా కస్టమర్ల మాట కూడా. మన రోజువారీ అలవాట్లలో నీరు ఎంత అవసరమో. అంతకంటే అవసరం ఆ నీరు స్వచ్ఛంగా ఉండటం. పెద్ద పెద్ద కంపెనీల వాటర్ బాటిళ్లన్నీ.. మినరల్ వాటర్ కావని.. అవి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్ వాటర్ మాత్రమే అంటున్నారు గౌతమ్. తాము RO (రివర్స్ ఆస్మాసిస్) టెక్నాలజీని ఉపయోగించి నీటిని శుద్ధి చేయడమేకాదు మన శరీరానికి కావల్సిన మినరల్స్‌నీ అందిస్తామంటున్నారు. సాధారణ ట్యాప్ వాటర్‌ని తమ టెక్నాలజీ ద్వారా సమపాళ్లలో శుద్ధి చేస్తామంటున్నారు.

image


ఏంటి ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ?

సాధారణంగా ఎక్కువ ఒత్తిడి ఉన్న ప్రాంతం నుంచి నీరు తక్కువ ఒత్తిడి ఉన్న ప్రాంతానికి చేరుతుంది. దీన్ని ఆస్మాసిస్ అంటారు. అయితే చాలా అరుదుగా మాత్రమే తక్కువ ఒత్తిడి నుంచి ఎక్కువ ఒత్తిడి ప్రాంతానికి నీరు వెళుతుంది. దాదాపు ఇది సాధారణ పరిస్థితుల్లో అసంభవం. దీన్నే మెడికల్ భాషలో రివర్స్ ఆస్మాసిస్‌గా పిలుస్తారు. అధిక కాన్సన్‌ట్రేటెడ్ ప్రెషర్ వాడినప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఈ పద్దతి ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ప్రపంచంలో మొదటగా అమెరికన్ ఆర్మీ.. సబ్ మెరైన్‌లో దీన్ని ఉపయోగించింది. సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగేనీరుగా మార్చడానికి ఈ పద్ధతినే వాడారు. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి. నీటి శుద్ధి విషయంలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. శ్రేష్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌లో కూడా ఇదే పరిజ్ఞానాన్ని అవలంభిస్తున్నారు.

image


పెద్ద కంపెనీలతో పోటాపోటీ

2012లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైనా.. టెక్నాలజీ, ప్రొడక్ట్, క్వాలిటీ విషయంలో రాజీపడలేదని గౌతమ్ చెబ్తున్నారు. సర్వీస్ అవసరమైనప్పుడు థర్ట్ పార్టీ నుంచో లేక మరెక్కడి నుంచో టెక్నీషియన్ రావాల్సిన అవసరం లేదని.. సొంత టీం ఉండడం తమ ప్లస్ పాయింట్ అని కంపెనీ ధీమా. ధర విషయంలో తమకు కాంపిటీషన్ ఎవరూ లేరని శ్రేష్ట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. పెద్ద కంపెనీల ప్యూరిఫైయర్ లతో పోలిస్తే 20 నుంచి 25శాతం తక్కువ ధరకే ప్రొడక్ట్స్ లభించడం వల్ల తమకు ఆదరణ పెరుగుతోందని చెబ్తున్నారు. తాము ఇక్కడే పుట్టి పెరిగిన కంపెనీ కాబట్టి గ్యారంటీ , వ్యారంటీ విషయంలో కొనుగోలుదార్లకు, డీలర్లకు నమ్మకం కుదిరిందని గౌతమ్ వివరిస్తున్నారు.

శ్రేష్ట్ టీం

శ్రేష్ట్ టీంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆ సంస్థ ఫౌండర్ గౌతమ్. వ్యాపార కుటుంబ నేపధ్యం కలిగిన గౌతమ్.. జెఎన్‌టియూ నుంచి బయెటెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం కొన్ని స్టార్టప్ కంపెనీల్లో ఆపరేషన్స్ హెడ్‌గా, మార్కెటింగ్ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేశారు. హెల్త్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకున్న గౌతమ్, స్టార్టప్‌తో దాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే హెల్త్ కేర్ ఖర్చుతో కూడుకోవడంతో వాటర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను మొదలు పెట్టారు. డొమెస్టిక్‌తో పాటు కమర్షియల్ విభాగాల్లో కూడా కంపెనీ మెరుగైన పనితీరునే కనబరుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

మూడేళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నిరుత్సాహపరిచిన వాళ్లే ఉన్నారని గౌతమ్ చెప్తారు. అందరితో పాటు ఇది కూడా ఓ లోకల్ బ్రాండ్.. అని.. ఎక్కువ రోజులు నిలబడదని.. చెప్పిన వాళ్లే తప్ప ప్రోత్సహించిన వాళ్ల తక్కువని పాత రోజులు గుర్తుచేసుకుంటారు. లోకల్ బ్రాండ్.. అయితే క్వాలిటీ ఎందుకు ఇవ్వకూడదు ? అని ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్టు చెబ్తారు. అన్నింటికంటే ముఖ్యంగా సర్వీస్ విషయంలో కస్టమర్లకు త్వరగా రెస్పాండ్ కావడం వల్లే విజయం సాధ్యమైందని వివరిస్తారు గౌతమ్.

కంపెనీ ప్రారంభించినప్పుడు నెలకు 100 యూనిట్లను అమ్మిన శ్రేష్ట్ ఇప్పుడు 3 వేల యూనిట్లను సులువుగా చేరుకుంటోంది. 12 లక్షల రూపాయల టర్నోవర్‌తో ప్రారంభమైన కంపెనీ రెండో ఏడాదిలో 25 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లకు చేరుకోగలమనే నమ్మకంతో ఉంది. ఇప్పుడిప్పుడే డొమెస్టిక్ ఆర్డర్లను కూడా పెంచుకుంటున్న శ్రేష్ట్... ఫండింగ్ వస్తే దక్షిణాది మార్కెట్లో దూసుకుపోతానంటోంది. వచ్చే ఏడాది కల్లా బెంగళూరు సహా కర్నాటకలో పూర్తిగా స్థాయిలో విస్తరించాలని చూస్తోంది. ఇప్పటి వరకూ సొంత నిధులతోనే నడుస్తున్న సంస్థ.. సేల్స్‌లో వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడిగా పెడ్తోంది. వాటర్ ప్యూరిఫికేష్ వ్యవస్థపై జనంలో అవగాహన పెరగడం వల్ల తమ మార్కెట్‌ పరిధి పెంచుకునేందుకు సులువు అవుతుందని గౌతమ్ చెబ్తున్నారు.