వెబ్ సైట్ హిట్స్ పెంచుకోవడం ఎలా ?

వెబ్ సైట్ హిట్స్ పెంచుకోవడం ఎలా ?

Monday July 20, 2015,

3 min Read

అది 2010, రెండు ల్యాప్‌టాప్‌లు, ఇద్దరు ఉత్సాహవంతులైన ఇంజినీర్లు.. మైస్మార్ట్‌ప్రైస్ మొదలైంది ఇలాగే. 2011లో అశ్విన్ శ్రీకుమార్ ఇందులో మార్కెటింగ్ విభాగంలో మొదటి వ్యక్తిగా జాయిన్ అయ్యారు. అప్పటికే మైస్మార్ట్‌ప్రైస్ సైట్‌కు 20లక్షల మంది విజటర్ ట్రాఫిక్, 500లోపు అలెక్సా ర్యాంక్ ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లలో ఈ పోర్టల్ కోటి మంది విజిటర్లు, 700 కోట్ల మొత్తం వ్యాపార టర్నోవర్(గ్రాస్ మర్కెండైజ్ టర్నోవర్) స్థాయికి చేరుకుంది. ఇంత రేంజ్‌కు ఎదిగిన మైస్మార్ట్‌ప్రేస్.. ఒక్కసారి కూడా టీవీలో ప్రకటన ఇవ్వలేదు, పెద్ద పెద్ద హోర్డింగులలో ప్రకటనలు ఇవ్వలేదు, ప్రచారం కోసం సెలబ్రిటీలపై పెట్టుబడులు చేయలేదు, కనీసం కాంట్రవర్సీల జోలికి కూడా పోలేదు. ఇదంతా వారి గొప్ప కోసం చెప్తున్నాం అనుకునే కంటే.. నిజాయితీగా కష్టపడి, అభివృద్ధి కోసం సరైన చర్యలు చేపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం. 

అయితే అందరికీ, అన్ని కంపెనీలకు ఇలాగే జరగాలని చేయాలని చెప్పడం కాదు.. కానీ ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు అన్నింటిలోనూ కామన్ కనిపించే కొన్ని అంశాలు ఉంటాయి.

సక్సెస్ కోసం రెసిపీ సిద్థం చేసుకోవాలి

సక్సెస్ కోసం రెసిపీ సిద్థం చేసుకోవాలి


SEO వాడకమంటే ఇదీ

మన దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగానూ అనేక స్టార్టప్‌లు, గొప్ప వెబ్‌సైట్లను ప్రోత్సహించింది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్(SEO). ఇప్పుడంటే ఈ పదాన్ని తక్కువ రేటుకే ట్రాఫిక్ తెచ్చేపెట్టే అంశంగా కంటెంట్ కంపెనీలు, కన్సల్టెంట్లు ఉపయోగించుకుంటున్నారు. నిజానికి ఎస్ఈఓ అంటే కళను మించిన ఒక సైన్స్. దీన్ని ఓ ఏజన్సీ చేతికి ఇచ్చేయడమో, అరకొర నాలెడ్జ్‌తో సొంత ఆఫీసులోనే నిర్వహించడమో సాధ్యం కాదు. ఒక బ్లాగ్‌లోని పోస్ట్‌లో పట్టేటంతగా SEO ఉపయోగాలను వివరించడం అసాధ్యం. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మాత్రం.. ఇది మన సైట్‌ను టార్గెట్ కస్టమర్ల దగ్గరకు ఖచ్చితంగా చేర్చుతుంది. ఒక కీవర్డ్‌తో సెర్చ్ చేసినా.. సెర్చ్ ఇంజిన్లలో మొదట డిస్‌ప్లే అయితే.. కస్టమర్ దగ్గరకు మనం చేరినట్లే అంటారు అశ్విన్. సరైన కస్టమర్‌ను పట్టుకునేందుకు... ప్రచారంపై కోట్ల కొద్దీ ఖర్చుపెట్టే కాంపిటీటర్ల కంటే పోటీలో ముందున్నట్లే అని చెబ్తారు.

పోటీ పడే రంగాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు... వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే... అందరికీ ర్యాంకింగ్ సాధ్యం కాదు. అదే కాండిడ్ ఫోటోగ్రాఫర్ అనో, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ బెంగళూర్ అనో... కీడవర్డ్స్ ఇస్తే మాత్రం... అప్పుడు సెర్చ్‌లో లీడర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. SEOఅనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉండాల్సిన సుదీర్ఘ ప్రణాళిక. కానీ ఆంట్రప్రెన్యూర్లకు దీన్ని కొనసాగిస్తూ ఉండడం కష్టసాధ్యమైన విషయం. దీని సహజ గుణగణాల కారణంగానే ఈ రంగం కొంత కష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ పెరగడానికి ఉపయోగపడే వన్ స్టాప్ సొల్యూషన్ ఇది అని భావించడం మాత్రం సరైన విషయం కాదని చెబ్తున్నారు అశ్విన్.

సామాజిక సైట్లే కాదు.. అభిప్రాయాలు కలుపుకోవాలి

కస్టమర్ బేస్ పెంచుకోవడంలో సొంత ప్రచారం కంటే మౌత్ పబ్లిసిటీ, వైరల్‍‌‌ కాన్సెప్ట్స్ ఎక్కువ పాత్ర పోషిస్తాయి. ఉత్పత్తుల గురించి, వాటి ఉపయోగాల గురించి, కంపెనీ గురించి మాత్రమే... ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పోస్ట్ చేస్తే సరిపోదు. కస్టమర్ల అనుభవాలు, అనుభూతులు షేర్ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. అనేక పెద్ద కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు మౌత్ పబ్లిసిటీనే ఎక్కువగా నమ్ముకుంటాయి. ట్విట్టర్ వంటి సైట్లలో... కస్టమర్ల ప్రతీ ప్రశ్నకూ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. వారు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రోత్సాహించాలి. కంపెనీ ప్రయాణాన్ని వివరిస్తూ... ఫేస్‌బుక్ యాడ్ పోస్టులు, కేంపెయిన్స్ కూడా ముఖ్యమైనవే.

పీఆర్‌ను కలిపితే....

న్యూస్ పేపర్స్, బ్లాగ్స్, కొత్త ఔట్‌లెట్స్ ఏర్పాటు, ప్రచారం కూడా వ్యాపారంపై ప్రజల నమ్మకాన్ని పెంచేవే. మేగజైన్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్, టెక్నాలజీ బ్లాగ్స్‌లలో... కంపెనీ గురించి పలుమార్లు చదివితే.. అవసరం వచ్చినపుడు కస్టమర్‌కు మన కంపెనీయే గుర్తొచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. త్వరగా కన్విన్స్ చేసేందుకు కూడా సహకరిస్తాయి. ఈ విభాగాన్ని ఏదైనా కంపెనీకో, ఏజన్సీకో అప్పగించేయడం కంటే... సొంతగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. మనకు కంపెనీ గురించిన తెలిసిన విషయాల కంటే.. మాంచి స్టోరీ రూపంలో జనాలకు చేరేలా చేసేందుకు పీఆర్ విభాగం సహకరిస్తుంది. అయితే కొత్త స్టోరీలు అల్లడం అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అందరూ కాంట్రవర్సీల జోలికి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఫండింగ్ చేసేందుకు... అన్ని కంపెనీలు సిద్ధంగా ఉండపోవచ్చు. ఏది ఏమైనా మన దగ్గరున్న డేటా, ప్రోడక్ట్, ఆవిష్కరణలను.. మంచి స్టోరీల రూపంలో ప్రచారం చేసుకోగలిగితే వ్యాపారం పెరుగుతుంది. అలాగే మార్కెటింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఉద్యోగుల నియామకం వంటి అంశాలతోపాటు.. రోజువారీ కార్యకలాపాల్లోనూ పీఆర్ డిపార్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది.

సొంత వ్యూహాలు ఎంత ముఖ్యమంటే

ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో ఒకే తరహా వ్యూహాలు... అన్ని కంపెనీలకు ఒకే రకమైన ఫలితాలను అందించకపోవచ్చు. టార్గెట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు... మన దగ్గరున్న బలం ఏంటో వినూత్నంగా, విభిన్నంగా చెప్పగలగాలి. ఓ కంపెనీ ఎస్ఈఓ ఆధారంగా రూపొందించిన వ్యూహాలతో విజిటర్లను ఆకట్టుకుంటే.. మరో కంపెనీ సామాజిక సైట్ల ద్వారా లభించిన ప్రచారంతో.. పేరు ప్రఖ్యాతులు సంపాదించొచ్చు. ప్రకటనలు ఇచ్చి పేపర్లలో కనిపించడం కంటే... హెడ్‌లైన్ న్యూస్‌గా మారితే... మరింత సులభంగా పేరు దక్కుతుంది. అందరికీ ఒకే తరహా వ్యూహాలు ఫలితాలను ఇవ్వవు. అందుకే ప్రతీ కంపెనీకి సొంత స్ట్రాటజీ ఉండాల్సిందే. కొన్నిసార్లు ఎస్ఈఓ, ప్రచారం, వార్తలు... అన్నింటినీ అమలు చేయాల్సిందే.

రచయిత గురించి..

ఆంగ్లంలో ఈ ఆర్టికల్‌ను రాసిన వారు అశ్విన్ శ్రీకుమార్ నాయర్. మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నా.. టెక్నాలజీ అంటే మక్కువ ఎక్కువ ఈయనకు. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్ అంటే విపరీతమైన అభిమానం. ప్రస్తుతం మైస్మార్ట్‌ప్రైస్‌ మార్కెటింగ్ హెడ్, పీఆర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఆయా ప్రోడక్టుల ధరలను పోల్చి చూపి, ఎక్కడ తక్కువకు లభిస్తుందో చెప్పేసే సైట్.