బదిర కళాకారుల గొంతుకై నిలిచిన 23 ఏళ్ల స్మృతి

ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న అంటారు మదర్ థెరిసా అంటారు. మానవతా సాయం మనిషిలోని ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేస్తుంది. అదే స్పూర్తితో అతుల్యకళ పనిచేస్తోంది. బదిర కళాకారులకు ఒక వేదికగా నిలబడుతోంది. ప్రేమకు భాష అవసరం లేదంటారు. స్మృతి నాగ్పాల్ పెద్దక్కలు ఇద్దరూ వినికిడి లోపం ఉన్నవారే. అయితే తమ భావాలను పంచుకోవడంలో ముగ్గురి మధ్య ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. స్మృతి సంజ్ఞలు, సంకేతాల భాష నేర్చుకున్నారు. ఇప్పుడు తనే వాళ్లిద్దరికీ మౌత్ పీస్.

బదిర కళాకారుల గొంతుకై నిలిచిన 23 ఏళ్ల స్మృతి

Monday June 22, 2015,

4 min Read

స్మృతి నాగ్పాల్, అతుల్యకళ సిఈఓ

స్మృతి నాగ్పాల్, అతుల్యకళ సిఈఓ


23 ఏళ్ల స్మృతి... అతుల్యకళ వ్యవస్థాపక సీఈఓ. మూగ, చెవిటి కళాకారులకు ఈ సంస్థ సాయం చేస్తుంది. వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. “నా కంటే పదేళ్లు పెద్దయిన అక్కలతో కలిసి పెరిగాను. వారితో కమ్యూనికేట్ చేయాలంటే సంజ్ఞల భాష ఒక్కటే మార్గం. అదే నా మాతృభాష అయిపోయింది. ఆ సంజ్ఞలు నేర్చుకోవడం అనివార్యమైంది. మా తల్లిదండ్రులకు, నా అక్కలకు మధ్య వారధిగా ఉండేందుకు ఉపయోగపడింది” అని చెబ్తారు స్మృతి. దేశంలో లక్షల మంది వినికిడి శక్తి లోపంతో ఉన్నారు. సుమారు తొమ్మిది నుంచి పద్నాలుగు లక్షల మంది ఉండొచ్చని ఓ అంచనా. ప్రపంచంలో ఉండే ప్రతీ ఐదుగురు బదిరుల్లో ఒకరు ఇండియాలో ఉన్నారు. అంగవైకల్యం ఉన్న వారిలోనూ ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారు. సంఖ్య పెరగడంతో పాటు వీరు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చదువు లేకపోవడం వారికి ప్రధాన సమస్యగా పరిణమించింది. వారితో కమ్యూనికేట్ చేయాలంటే రెండు మార్గాలే ఉన్నాయి. రాసి చూపించడం లేదా సంజ్ఞల భాషలో చెప్పడం. ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేక , అవకాశాలు లేక వారు చదవడం, రాయడం అలవాటు చేసుకోలేకపోతున్నారు.

తోబుట్టువులకూ తల్లిదండ్రులకూ మధ్య ఆమె వారధి

తన అక్కలు పడే ఇబ్బందులను స్మృతి అర్థం చేసుకున్నారు. తన పదహారేళ్ల వయస్సులోనే బదిరుల జాతీయ సంఘం (ఎన్.ఏ.డీ)లో వాలంటీరుగా చేరారు. సమాజానికి సేవ చేయాలన్న తపనను అలా తీర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేరారు. అప్పుడే టీవీ చానెల్ నుంచి పిలుపు వచ్చింది. వార్తల కోసం దుబాసీ కావాలని పిలిచారు. స్మృతి ఒక్కరే సరైన అభ్యర్థి అని నిర్ణయించారు. చదువుకునే రోజుల్లోనే దూరదర్శన్ ఉదయం బులెటిన్లలో బదిర వార్తలను అందించారు. ఈ ఉద్యోగం ఎన్నో అవకాశాలనిచ్చింది. బదిర సమాజానికి అంకితభావంతో సేవ చేయాలన్న ఆకాంక్షను నెరవేర్చింది. డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఏడు నెలల తర్వాత తనకు స్పూర్తినిచ్చే ఒక కథ విన్నారామె. “ కళారంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ఒక కళాకారుడిని నేను కలుసుకున్నాను. ఒక ఎన్డీఓలో చిన్న పని చేసుకుంటూ ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయన శ్రమ వృధా అవుతోంది. ఇంటికి వచ్చి ఆలోచించాను. బదిర కళాకారుల సంక్షేమానికి నా వంతుగా ఏదోఒకటి చేయాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాను. నా మిత్రుడు హర్షిత్‌తో కలిసి అతుల్యకళను ప్రారంభించాను. ఎన్జీఓలో కలిసిన కళాకారుడు మా బృందంలో చేరారు” అని స్మృతి వివరించారు. 

ఈ భాష ఎన్నో భావాలను పలికిస్తుంది

ఈ భాష ఎన్నో భావాలను పలికిస్తుంది


బదిర కళాకారులకు అవకాశాలు కల్పిస్తూ, వారు వృద్ధిలోకి వచ్చేందుకు సహాయ పడుతూ, వారంతా గౌరవంగా బతికేందుకు మార్గం సుగమం చేస్తున్న సంస్థే అతుల్యకళ. బదిర కళాకారులు తయారు చేసే కళాత్మక వస్తువులను ఆన్ లైన్లోనూ, విడిగానూ విక్రయిస్తూ ఈ సంస్థ లాభాలను ఆర్జిస్తుంది. ఎన్జీవోలకు, ఈ సంస్థకు చాలా తేడా ఉంది. “ఇంతకాలం వారి సృజనాత్మకత వృధా అవుతోంది. ఒంటరితనం నుంచి బైటకు వచ్చి సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం వారికి ఇస్తున్నాం. దేనికైనా ముందు వారి పేరు వాడతాం. మా బ్రాండ్ ను ప్రచారం చేసుకునేందుకు బదిర కళాకారులను ఉపయోగించుకోము. బదిర కళాకారులకు పేరు వచ్చేందుకు మా బ్రాండ్ సహకరిస్తుంది. వారు తయారు చేసిన ప్రతీ వస్తువు మీద వారి సంతకం ఉంటుంది. స్వశక్తితో పనిచేసిన సంతృప్తి వారికి కలుగుతుంది.” అని స్మృతి వివరించారు.

బదిరుల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం

అతుల్యకళ వేరే ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోంది. “కొన్ని ఉమ్మడి ప్రాజెక్టుల మీద కూడా మేము పనిచేస్తున్నాం. బదిర సమాజం కోసం పాట రాసేందుకు ప్రఖ్యాత సంగీత విద్వాంసులతో కలిసి పనిచేస్తున్నాం. బదిర కళాకారుల సాధికారత కోసం మేము ప్రఖ్యాత కళాకారులతో కలిసి పనిచేస్తున్నాం. కొన్ని నెలల్లో పుస్తకాలు ప్రచురించే ప్రయత్నంలో వున్నాం ,” అని స్మృతి తెలిపారు. బదిర కళాకారుల సేవతో సరిపెట్టాలని ఆమె అనుకోవడం లేదు. బదిర సమాజానికే సేవ చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. “సంజ్ఞ భాషపై అవగాహన పెంచాలనుకుంటున్నాం. తరువాతి తరానికి విద్యా వ్యాప్తితో మార్పు సాధ్యమని నేను నమ్ముతాను. అందుకే విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక వర్క్ షాపులు నిర్వహిస్తున్నాం. సంజ్ఞ భాషను వివరించే కరదీపికలను ముద్రిస్తున్నాం” అని స్మృతి తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. అతుల్యకళ నిర్వహణలో భాగంగా స్మృతి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. “నాకు వాళ్లు చాలా రోజులుగా తెలుసు. ఇంతకాలం వాళ్లతో కలిసి పనిచేయలేకపోయాను. వాళ్లంతా నా స్నేహితులే. వాళ్లతోనే కలిసి పెరిగాను. ఇప్పుడు నా ఆలోచన వేరు. వాళ్లతో కలిసి పనిచేయడం వల్లవాళ్ల సమర్థతను అర్థం చేసుకోగలిగాను. వారిలో ఆత్మవిశ్వాసం తక్కువ. ఈ సమాజమే అందుకు కారణం. వికలాంగుల పట్ల సమాజ వైఖరి వల్లే వాళ్లు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. తాము మైనార్టీలం కాదు అన్న సంగతిని వారు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం నుంచి వారిని వేరు చేయలేరని గుర్తించాలి” అని అంటున్నారు స్మృతి.

image


ఇప్పుడు ఆమె ఎంతో సహనంగా ఓపిగ్గా ఉంటున్నారు. ఆమెకు ఎలాంటి నిరాశ లేదు. బదిరులకు, సమాజానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేందుకే ఆమె పనిచేస్తున్నారు. స్టార్టప్ రంగంలో అతుల్యకళ తొలి అడుగులు వేస్తోంది. పది నెలల క్రితమే ఈ సంస్థ ప్రారంభమైంది. అయినా భవష్యత్తుపై పూర్తి అవగాహనతో వున్నారు. బదిరులే తయారు చేస్తున్న వస్తువులు విక్రయించే సామాజిక మాధ్యమంగా ఉండాలనుకుంటున్నాం. ఈ పని చేయాలంటే శక్తిమంతమైన బ్రాండ్ ఉండాలి. దాన్ని మేము సృష్టించాలి. ఆ బ్రాండ్ ను శక్తిమంతులైన కళాకారులు నిర్వహించాలి. ప్రధాన కళాకారులతో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యం. అప్పుడే బదిర కళాకారుల్లో అభద్రతా భావం పోతుంది” అని అన్నారు స్మృతి . ఆమె చేస్తున్న పనులకు చాలా గుర్తింపు వచ్చింది. టీవీలో ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ పెరేడ్ ను సంజ్ఞల భాషలో వివరించే అవకాశాన్ని ఆమె పొందారు. ఇది బదిరులకు ఎంతగానో ఉ పయోగపడింది. 64 ఏళ్లలో ఇలాంటి ప్రయత్నం ఇంతవరకూ జరగలేదు.

మార్పు కోసం ప్రయత్నించే యువతకు ఆమె ఒక విషయం చెబుతారు. “ మీ ఆకాంక్షలను ఎప్పుడూ వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను కలలు కంటాను. మన వయస్సు వారు కలలు కని వాటిని సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ముందుకు వెళ్లగలం. మనం సమాజం నుంచి ఎన్నో పొందాం. సమాజానికి కూడా సాయపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడే మనం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాం. దానికోసం మీరు సామాజిక వ్యవస్థాపకుడై ఉండాలి. ప్రజల కోసం, సమాజం కోసం రోజూ చిన్నచిన్న పనులు చేసినా సరిపోతుంది. ” అని ముగించారు స్మృతి.