మీరు జస్ట్ టాయిలెట్ వాడుకోండి చాలు.. దానికదే నీళ్లు కొట్టి శుభ్రం చేసుకుంటుంది

మీరు జస్ట్ టాయిలెట్ వాడుకోండి చాలు.. దానికదే నీళ్లు కొట్టి శుభ్రం చేసుకుంటుంది

Thursday April 21, 2016,

3 min Read


ట్యాప్ తిప్పాల్సిన అవసరం లేదు.. ఫ్లష్ కొట్టాల్సిన పనిలేదు. మనుషుల అవసరం రాదు.. మెయింటెనెన్స్ అక్కర్లేదు. శానిటేషన్‌ రంగంలో ఇరమ్ సైంటిఫిక్ సృష్టించిన సరికొత్త విప్లవం స్మార్ట్ టాయిలెట్. దేశంలోని సకల దరిద్రాలు తొలగిపోవడానికి అదొక టెక్నాలజీ మంత్రం.

మా స్కూల్లో టాయిలెట్ లేదు... అందుకే మంచినీళ్లు తాగితే యూరిన్ వస్తుందని వాటర్ తాగడం మానేశా!! 

తీవ్రమైన మూత్ర సంబంధింత వ్యాధికి గురైన ఓ చిన్నారి చెప్పిన సమాధానం విని డాక్టర్ల దిమ్మదిరిగిపోయింది. నిజానికి ఇది ఒక్క అమ్మాయి సమస్య కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రాబ్లం . నీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందోననే పాపభీతితో స్కూల్లో ఉన్నంత సేపు చిన్నారులు నీళ్లు ముట్టడంలేదు. ఇలా కొంత కాలం తర్వాత అమ్మాయిలు కొత్తకొత్త రోగాలపాలవుతున్నారు.

భారతదేశంలో టాయిలెట్ ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు 626 మిలియన్ల మంది ఉంటారని అంచనా. ఎవరైనా మహిళ పని మీద బయటకు వెళితే మూత్రవిసర్జన కోసం మళ్లీ ఇంటికి వచ్చేవరకూ ఆగాల్సిందే. ఇలా సుదీర్ఘ ఎదురుచూపుల వల్ల వీరు యూరినరి ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ వస్తున్నాయి. గంటల తరబడి నీరు తాగకుండా ఉండటం వల్ల దీర్ఘ కాలంలో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయి. కానీ ఏం లాభం? ఒక్క క్షణం కూడా అందులో ఉండలేని పరిస్థితి. దేశంలో పది లక్షల పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే.. వాడకంలో ఉన్నవి పదివేలు మాత్రమే. మిగతావి వాడకంలో లేక తుప్పుపట్టి పోతున్నాయి. చెప్పాలంటే మనదేశంలో శానిటేషన్ అనేది ఓ పట్టించుకోకూడని వ్యవస్థగా మారింది. అందుకే మరుగుదొడ్డి విషయంలో ఇంతవరకూ చెప్పుకోదగిన ఆవిష్కరణలు రాలేదు. టాయిలెట్స్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్న ఒక్క గుర్తుంచుకోదగ్గ కంపెనీ కూడా మన దగ్గర లేదు.

ఇలాంటి వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేరళకు చెందిన ఇరమ్ సైంటిఫిక్ అనే సంస్థ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చింది. సుదీర్ఘంగా పరిశోధనలు చేసి టాయిలెట్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఇరమ్ సైంటిఫిక్ టాయిలెట్ అన్నిటిలా రొటీన్ టాయిలెట్ కాదు. అన్ని సమస్యలను దానంతట అదే పరిష్కరించుకుంటుంది. మనిషి అవసరం లేకుండానే దానికదే స్మార్ట్ గా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన సోలార్ పవర్డ్ ఈ-టాయిలెట్. మనుషులెవరూ దీని కోసం ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, వెబ్-మొబైల్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. లోపలకి పోవడం, ఉపయోగించుకోవడం, క్లీనింగ్ లాంటివన్నీ స్మార్ట్ గా చేసుకోవచ్చు. రిమోట్ మానిటరింగ్ కూడా ఉంది. మనం టాయిలెట్ లోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా లైట్ వెలుగుతుంది. వెళ్లిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఆడియో కమాండ్స్ ద్వారా కూడా ఈ-టాయిలెట్ పనిచేస్తుంది. మూడు నిమిషాల కన్నా తక్కువ సేపు టాయిలెట్ యూజ్ చేసుకుంటే ఒకటిన్నర లీటర్ల నీటితో శుభ్రం చేసుకుంటుంది. ఇంకా ఎక్కువ సేపు ఉపయోగిస్తే నాలుగున్నర లీటర్లతో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఐదు లేదా పది మంది ఉపయోగించుకున్న తర్వాత మొత్తం ఓవరాల్ క్లీన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

image


 19 రాష్ట్రాల్లో ఇరమ్ సంస్థకు సర్వీస్ నెట్ వర్క్ ఉంది. మూడు చోట్ల ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నూట యాభై మందితో కూడిన డెడికెటెడ్ టీమ్ పనిచేస్తోంది. బేసిక్ మోడల్ టాయిలెట్ ను రూ.2 లక్షలు, అడ్వాన్సుడ్ స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్ ను రూ.నాలుగున్నర లక్షలకు మార్కెట్ చేస్తున్నారు. ఇన్ స్టాలేషన్ సహా సర్వీస్ మొత్తం చాలా తక్కువ మొత్తానికే చేసి పెడతారు. పైగా దీని నుంచి ఆదాయం వచ్చే ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్స్ లో అడ్వర్టయిజ్ మెంట్స్ కు రెంట్ కు ఇవ్వడం వల్ల అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పటిదాకా 19 రాష్ట్రాల్లో 1400 టాయిలెట్లను నిర్మించారు. అలాగే నాలుగు వందల మురుగునీటి శుద్ధి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇరమ్ సైంటిఫిక్ టాయిలెట్ పనితీరుకు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 40 అవార్డులు కూడా వచ్చాయి. అయిప్పటికీ ఈ-టాయిలెట్ పై జనాల్లో అవగాహన పెంచడం సవాల్ గా మారిదంటారు సంస్థ నిర్వాహకులు.

ప్రస్తుతం ఇరమ్ సైంటిఫిక్ ఈ-టాయిలెట్స్ కి మరింత టెక్నాలజీ జోడించే ప్రయత్నం చేస్తున్నారు. వాటంతట అవే పవర్ ఉత్పత్తి చేసుకుని సెల్ఫ్ సస్టెయినబుల్ గా ఉండేలా ఇరమ్ రీసెర్చ్ బృందం పనిచేస్తోంది. సరైన సీవేజ్ మేనేజ్ మెంట్ ద్వారా పవర్, ఫర్టిలైజర్స్, ఎనర్జీని ఉత్పత్తి చేసే దిశగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, గ్రాంటీస్ లాంటి స్వచ్ఛంత సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. ఈ-టాయిలెట్లకు మరింత మెరుగులు దిద్దేందుకు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూక్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఐఐటీ మద్రాస్ లాంటి విద్యాసంస్థలతో కొలాబరేట్ అయ్యారు. మరికొన్ని రీసెర్చ్ సంస్థలతోనూ ఇరమ్ కలిసి పనిచేస్తోంది. వీలైనంత త్వరలో పూర్తి టచ్ లెస్ టాయిలెట్ ను రెడీ చేయాలనే సంకల్పంతో ఉంది ఇరమ్ సంస్థ. వరకూ ఏ కార్పొరేట్ సంస్థా దృష్టి పెట్టని శానిటేషన్ లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ ప్రయత్నాలు సఫలమైతే.. స్వచ్ఛ భారత్ అభియాన్ కల కూడా నెరవేరుతుంది.