సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్న ఓ స్టార్టప్ కథ !
Friday January 22, 2016,
3 min Read
ఒక భయంకరమైన ఉపద్రవం మనల్ని తరుముకొస్తోంది. మనిషి మనుగడకే అది ప్రమాదాన్ని తీసుకురాబోతోంది. జీవనాధారమైన మంచినీరు మెల్లగా తరిగిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా నీటికి కొరత ఏర్పడింది.. రాబోయే రోజుల్లో అంటే.. 2025 నాటికి 180కోట్ల జనాభాకు తాగడానికి కూడా మంచినీరు దొరకదన్న భయం మనల్ని వెంటాడుతోంది. ఒక అధికారిక లెక్క ప్రకారం.. 2040కి కరెంట్ ఉత్పత్తికి, సామాన్య అవసరాలకు నీరు దొరకదని తేలిపోయింది. అసలు వాస్తవం లెక్కలకంటే దారుణంగా ఉందన్న ఊహే భయంగొలిపేలా వుంది.
చాలా ఇళ్లలో నీటిని శుభ్రపర్చడానికి ఆర్ ఓ వాటర్ ప్యూరిఫయర్లు వినియోగిస్తున్నాం. కానీ.. అందులో ప్రతీ లీటర్ వాటర్ ప్యూరిఫై కావడానికి.. మూడులీటర్ల నీరు వేస్ట్ అయిపోతుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇదే కనుక కొనసాగితే.. ఇందాక చెప్పుకున్నట్టు పరిస్థతి మరింత విషమిస్తుంది. ఈ సమస్యను చాలావరకూ అధిగమించడానికే ఆక్వువియో అనే సంస్థ మొదలైంది. తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేయడంతో పాటుగా.. నీటి వ్యర్ధాన్ని వీలైనంతగా అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఆలోచన ఎలా వచ్చింది?
2014లో ఢిల్లీలోని ఓ వాటర్ ప్యూరిఫయర్ కంపెనీలో సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నసమయంలో ఐఐటీ భువనేశ్వర్ గ్రాడ్యుయేట్ నవీన్కుమార్కు ఈ ఆలోచన వచ్చింది. నీరు పెద్దమొత్తంలో వేస్ట్ అవుతోందంటూ ఒక కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అతనిని ఆలోచింపజేసింది. అప్పటిదాకా ఆ స్ధాయిలో నీరు వేస్ట్ అవుతోందన్న నిజాన్ని నవీన్ కుమార్ గుర్తించలేదు. దీని వల్ల రాబోయే కాలంలో దేశంలో నీటి సమస్య అతన్ని భయాందోళనలకు గురిచేసింది. తన బ్యాచ్మేట్ రోహిత్కుమార్ మిట్టల్తో చర్చించి..ఈ ప్రాబ్లంను అధిగమించే ప్రొడక్ట్ తయారుచేయాలని డిసైడయ్యారు. అయితే, అందుకు ఆర్ధిక స్తోమత లేకపోవడంతో ఒక ప్రోటోటైప్ను తయారుచేసి టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేటర్ సదస్సులో ప్రదర్శించారు.
ప్రొడక్ట్ ఇలా డెవలప్ అయింది.
మొదటగా స్కూళ్లు, వ్యాపార సంస్థల్లాంటి పెద్ద పెద్ద చోట అధికమొత్తంలో నీటిని శుద్ధి చేసే ఒక పరికరాన్ని తయారుచేశారు. భువనేశ్వర్ ఐఐటీలో మాజీ డైరక్టర్గా పనిచేసిన ఉపాధ్యాయ్ వాళ్లకు మెంటర్గా వ్యవహరించి.. సపోర్ట్ చేయడంతో మార్కెట్లోకి విడుదలచేసేలా దాన్ని తీర్చిదిద్దారు. గంటకు 100లీటర్ల నీటిని శుద్ధిచేయగలిగే 700 నుంచి 1000 లీటర్ల నీటిని విడుదలచేసే వ్యవస్ధను తయారుచేశారు. ధీరేంద్ర మహిళా కాలేజీ, ఐఐటీ భువనేశ్వర్, ఆర్యా మహిళా పీజీ కాలేజీ, వారణాసిలోని ఆర్యన్ ఇంటర్నేషనల్ స్కూల్లో దాన్ని ఇన్స్టాల్ చేశారు.
“100లీటర్ల కెపాసిటీ ఉన్న ప్రొటోటైప్ను తయారుచేయడానికి దాదాపు 8నెలల సమయం పట్టింది. గతంలో 500లీటర్ల నీటిని శుద్ధి చేయగలిగే అదే ప్రొడక్ట్.. ఇప్పుడు 800లీటర్ల నీటిని శుద్ధి చేస్తోంది. అతి తక్కువగా 50లీటర్ల నీటి వేస్టేజ్తో 84 వాట్స్ కరెంట్ను వినియోగించేలా దాన్ని తయారుచేశాం” - నవీన్.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న RO వాటర్ ప్యూరిఫయర్లో ఒక లీటర్ శుద్ధిచేసిన నీటిని విడుదల చేయాలంటే అటూ ఇటుగా 4 లీటర్ల నీటిని పంపింగ్ చేయాలని అంటున్నారు నవీన్. తమ ఆక్వువియోలో ఒక లీటర్ శుద్ధి చేసిన నీటికి.. 1.5లీటర్ నీటిని పంప్ చేస్తే సరిపోతుందంటున్నారు. ఖనిజాల వినియోగంలో తేడా వల్ల.. అవసరమైన ప్రమాణాలను కూడా తాము పాటిస్తున్నామని చెబుతున్నారు.
ఫ్యూచర్ ప్లాన్స్
MCIIE –TBI.నుంచి ఈ టీం రూ.6.4లక్షల సీడ్ఫండింగ్ దక్కించుకుంది. 2015 జులై, సెప్టెంబర్ మధ్యలో రూ.55 వేలు, అక్టోబర్, డిసెంబర్ మధ్యలో రూ.2, 35,000 సేల్స్ చేసినట్టు టీం చెబుతోంది.ఈ ఏడాది జూన్నాటికి మరో రెండు కొత్త ప్రొడక్ట్స్తో ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లోకి ఎంటరవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. తమ పరికరాలను తయారుచేయడానికి ఒక పరిశ్రమ ఏర్పాటుచేసే పనిలో బిజీగా ఉన్నారు.
యువర్స్టోరీ విశ్లేషణ
సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపించే నీటిసమస్యపై ఒక స్టార్టప్ పోరాడటం నిజంగా అభినందనీయం. అయితే, కేవలం పెద్దపెద్ద ఇన్స్టిట్యూషన్స్ని ఆక్వువియో టార్గెట్ చేస్తుండడంతో.. ఇప్పటికే మార్కెట్లో స్ధిరపడ్డ సీమెన్స్, అయాన్ ఎక్స్ఛేంజ్, మార్ఫ్ ఇండియా, ఆల్ఫా యూవీలాంటి కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్గా స్ధిరపడిపోయిన ఈ కంపెనీలు యూనిట్ తయారీకి తక్కువ ఖర్చుపెడుతుండడం మరో అంశం.
అక్వువియో విస్తరించాలంటే.. దేశవ్యాప్తంగా ఎక్కువమంది కస్టమర్లను సంపాదించుకోవాలి. పరిశ్రమను కూడా స్ధాపించి స్ధిరపడిన కంపెనీలతో పోటీపడగలిగే స్ధాయిలో పెద్దమొత్తంలో ప్రొడక్ట్స్ను తయారుచేయాలి. అయితే, ఇందుకు సేల్స్, మార్కెటింగ్తో పాటు ఫండింగ్పై దృష్టిపెట్టాలి. చివరగా రాబోయే ఫండింగ్పైనే ఆక్వువియో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.