వ్యవసాయానికి మొబైల్ సాయం

దేశంలో ఏడువేల మంది చిన్న సన్నకారు రైతులున్నారు. వీరు రోజుకు 250 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో కూడు గుడ్డకు కూడా కనాకష్టంగా బతుకుతున్నారు. మరి వీరికి మొబైల్ ఫోన్లు అవసరమా.. వాటి వల్ల వీరి బతుకులు మెరుగుపడతాయా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తోంది వొడాఫోన్ కంపెనీ. ఈ మధ్య ఈ సంస్థ కనెక్టడ్ ఫామింగ్ ఇన్ ఇండియా పేరుతో ఓ రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. అయిదేళ్ళలో రైతుల ఆదాయాన్ని 56వేల కోట్లకు పెంచాలంటే, మొబైల్ ఫోన్ల వల్లే అది సాధ్యమనేది ఈ రిపోర్ట్ సారాంశం.

వ్యవసాయానికి మొబైల్ సాయం

Saturday June 27, 2015,

4 min Read

వొడాఫోన్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో యాక్సెంచర్ స్ట్రాటజీ సంస్థ చేసిన ఈ అధ్యయనం.. కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టింది. ఇప్పడున్న దేశంలో ఏడు కోట్ల మంది రైతులుంటే, అందులో కనీసం రెండింట మూడువంతుల మందికి ఏడాదికి కనీసం 8 వేలరూపాయల ఆదాయాన్ని అదనంగా అందించడానికి మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని ఈ నివేదిక చెప్తోంది.

Pic courtesy - Flickr

Pic courtesy - Flickr


ఇందుకు ఉపయోగపడే మొబైల్ సర్వీసుల గురించి ఇప్పుడు చూద్దాం

1. వ్యవసాయ సమాచారం - వాతావరణ మార్పుల గురించి ముందుగానే హెచ్చరించడం, నాట్లు వేయడానికి అనువైన సమయాన్ని సూచించడం, అధిక దిగుబడికి అవసరమైన మెళకువలను అందించడం ద్వారా దాదాపు ఆరుకోట్ల మంది రైతుల వార్షికాదాయాన్ని వచ్చే అయిదేళ్లలో సగటున 89డాలర్ల చొప్పున పెంచవచ్చని ఈ రిపోర్టు చెప్తోంది.

2. రుణసదుపాయాలు - చెల్లింపులు వొడాఫోన్ అందించే ఎమ్ పెసా (M-Pesa) లాంటి మొబైల్ మనీ పేమెంట్ సిస్టమ్స్ గురించి రైతులకు వివరించడం, తక్కువ వడ్డీకి దొరికే మైక్రోఫైనాన్స్ సదుపాయాల గురించి వివరాలు అందించడం ద్వారా అనేక మంది రైతులకు వచ్చే అయిదేళ్లలో సంవత్సరానికి 690డాలర్ల అధిక ఆదాయాన్ని అందించగలం. ఇది వారి సగటు ఆదాయం కంటే 39శాతం ఎక్కువ.

3. రసీదు సేవలు - రోజువారీ సరుకుల కొనుగోలు, అమ్మకాలలో మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్, రిసీప్ట్ సేవలు అందించ వచ్చు. దీని వల్ల వారి లావాదేవీల్లో మరింత పారదర్శకత పెరిగి, మోసానికి తావుండదు. పైగా అనవసర ఖర్చులు కూడా నిరోధించవచ్చు.

4. ఫీల్డ్ ఆడిట్ - పేపర్ రికార్డుల స్థానంలో టాబ్స్, మొబైల్ డాలా ద్వారా ఎలక్ట్రానిక్ రిపోర్టింగ్ ను ప్రోత్సహించాలి. దీని ద్వారా నాణ్యత, సామర్థ్యం పెరిగి వార్షిక ఆదాయం దాదాపు 612 డాలర్లు పెరుగుతుంది.

5. స్థానిక సప్లయి చైన్ - మొబైల్ మనీ సిస్టమ్స్ ద్వారా స్థానిక సన్నకారు రైతులతో స్థానిక కో ఆపరేటివ్ సంస్థలకు వ్యాపార సంబంధాలను పెంచడం. దీని వల్ల రైతుల ఆదాయం 2020 నాటికి ఏడాదికి 271 డాలర్లు పెరుగుతుంది. ప్రస్తుత ఆదాయంతో పోలిస్తే, ఇది 50శాతం ఎక్కువ.

6. స్మార్ట్ ఫోన్ ఆధారిత సేవలు- సాధారణ SMS, వాయిస్ మెయిల్స్‌కు మించిన సేవలు అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా స్మార్ట్ ఫోన్ల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే వుంది. అయితే, ఏటేటా స్మార్ట్ ఫోన్ ల ధరలు తగ్గుతున్నాయి కనుక, వీటి వినియోగం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగితే, వ్యవసాయ ఆదాయం కూడా మరో 675 డాలర్లు పెరుగుతుంది.

‘‘ఇప్పటికీ భారతదేశంలోని 58శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. దీన్ని బట్టీ దేశం ప్రగతి బాటలో నడవాలంటే వ్యవసాయరంగం లాభసాటిగా మారాలి. దాని ప్రయోజనాలు చిన్న, సన్నకారు రైతులకు దక్కాలి. అందుకే రైతులను సమాచార విప్లవంలో భాగం చేయాలి. సాంకేతికంగా వస్తున్న మార్పులు రైతుల పొలాల్లోకి వాళ్ళ చేతుల్లోకి కూడా వెళ్ళాలి. వోడాఫోన్ సంస్థ దేశంలో మారుమూలల్లో విస్తరించింది. మార్కెట్ కు అనుగుణంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రయోజనాలను దేశంలో వ్యవసాయరంగానికి సైతం అందించడానికి ఆ సంస్థ ముందుకు రావడం చాలా సంతోషం. దేశ వ్యవసాయ రంగానికి మొబైల్ టెక్నాలజీ వల్ల వచ్చే లాభాలను వివరిస్తూ ఈ రిపోర్ట్ తీసుకురావడానికి అసోచం, వొడాఫోన్ కలిసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను '' - ఈ నివేదిక విడుదల సందర్భంగా ఏర్పాటయిన సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్ భాయ్ కల్యాణ్ జీ భాయ్ కుంద్రియా చెప్పిన మాటలు.

ఈ నివేదికను ఆవిష్కరించిన రాఘవ చంద్ర ‘‘ఈ..క్రాంతి(e-kranti) ద్వారానే డిజిటల్ ఇండియా కల సాకారమవుతుంది. రైతులకు సాంకేతిక విజ్నానం అందించడం కూడా ఈక్రాంతి పథకంలో భాగమే. డిజిటల్ సేవలని పొలం దాకా తీసుకుపోవడం మీదనే భవిష్యత్ వ్యవసాయ ప్రగతి ఆధారపడివుంది. ఈ ప్రగతి సాధనలో మొబైల్ సర్వీసెస్ పాత్ర చాలా వుందని చెప్పాలి. విజయవంతమైన ఎమ్..కిసాన్ కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ. ది కనెక్టడ్ ఫామింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ అంశాన్ని కూలంకషంగా చర్చించింది. ఈ నివేదిక ద్వారా వ్యవసాయరంగప్రగతికి ఆధారంగా మారిన అంశాలను అసోచమ్, వోడాఫోన్ చర్చకు తీసుకొచ్చి చాలా మంచి పనిచేసాయి.’’ అని అన్నారు.

ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తి రంగంలో ఇండియా రెండో స్థానంలో వుంది. ఇక్కడ వ్యవసాయ రంగంమీద ఆధారపడి దాదాపు 20 కోట్ల మంది బతుకుతున్నారు. ఇందులో పదికోట్ల మంది రైతులు కాగా, వ్యవసాయాధారిత రంగాల్లో పనేస్తున్న వారు మరో పది కోట్ల మంది వుంటారు. ఈ రైతుల్లో దాదాపు 62 శాతం మందికి కనీసం ఒక హెక్టార్ పొలం కూడా వుండదు. దీని వల్ల పంట నష్టం, పురుగు, చీడ పీడల సమస్యలు, ధరలు పడిపోవడం వంటి కష్టాలు వీరికే ఎక్కువ.

ఇండియాలోని కిసాన్ మిత్ర తో పాటు, ఘన, కెన్యా, న్యూజిలాండ్, టాన్జానియా లాంటి దేశాల్లో అమలవుతున్న అటువంటి కార్యక్రమాలకు తమ ఫార్మర్స్ క్లబ్ సేవలను విస్తరించనున్నట్టు వోడఫోన్ చెప్తోంది. టర్కీలో ఈ కార్యక్రమం 2009 నుంచి అమలవుతూ, ఇప్పటికే పన్నెండు లక్షల మంది రైతులకు లాభసాటిగా మారింది. వారి పంట దిగుబడిని పెంచి తద్వారా ఆదాయం పెరిగేలా ఉపయోగపడుతోంది. సోషల్ బిజినెస్ మోడల్ లో పనిచేసే వోడాఫోన్ ఫార్మర్స్ క్లబ్ ..రైతులకు ఉపయోగపడే అనేక మొబైల్ సర్వీసెస్ ను అందిస్తుంది. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ మొబైల్ సర్వీసెస్ లో రైతులకు అవసరమైన సమాచారం తోపాటు, వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఒక వర్చువల్ మార్కెట్ ప్లేస్ కూడ వుంటుంది. ఇది కాక రుణాలు లాంటి ఆర్ధిక అవసరాల కోసం మొబైల్ మనీ ఫైనాన్స్ సేవలు కూడా అందిస్తున్నారు.

ఈ ఫార్మర్స్ క్లబ్ ప్రతిపాదనను ఆవిష్కరించే సందర్భంలో వోడాఫోన్ గ్రూప్ రీజనల్ చీఫ్ ఎక్జిక్యూటివ్ (ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు) సెర్పిల్ తిమురే మాట్లాడుతూ..‘‘ 50 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులు ప్రపంచంలో మూడో వంతు జనాభా కడుపునింపుతున్నారు. అందుకే వ్యవసాయ రాబడిని పెంచి, నిరుపేద రైతుల జీవనప్రమాణాలు మెరుగుపరచడంలో మొబైల్ ఫోన్ల పాత్ర ఎంతో వుంది. మొబైల సేవలతో రైతుల రాబడి పెరిగి, స్వావలంబన కలిగిన రైతు సమాజాల నిర్మాణానికి మొబైల్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని టర్కీలో మా ప్రయోగం నిరూపించింది. ప్రపంచ జనాభా అంతకంతకూ పెరుగుతూనే వుంది. వీరందరి కడుపు నింపాలంటే, తక్కువ నేలలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే విధానాలు రావాలి. వోడాఫోన్ ఫార్మర్స్ క్లబ్ లాంటి స్మార్ట్ ఆలోచనలు ఈ దిశగా చాలా దోహదపడతాయి. ’’ అన్నారు.

వోడాఫోన్ కిసాన్ మిత్ర గురించి వోడాఫోన్ ఇండియా ఎమ్ డి, సి ఇ వో సునీల్ సూద్ మాట్లాడుతూ ‘‘ ఇండియాలో మరో హరిత విప్లవం అంటే, అది నాలెడ్జి విప్లవమే. ఈ విప్లవం విజయవంతం కావాడంలో, మొబైల్ టెక్నాలజీ పాత్ర గణనీయంగా వుంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 46 శాతం మందికి మొబైల్ ఫోన్లు అందుబాటులో వున్నాయి. మిగిలిన వారు కూడా వేగంగా మొబైల్ కి దగ్గరవుతున్నారు. దీనివల్ల వ్యవసాయాన్ని.. దాంతో పాటు గ్రామీణ సమాజాన్ని సాంకేతిక మార్గం పట్టించే అవకాశాలు మెరుగుపడ్డాయి. వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మొత్తం వ్యవస్థకు లాభం చేకూర్చేలా సరికొత్త బిజినెస్ మోడల్స్ ను రూపొందించేందుకు మేం అహర్నిశలూ క్రుషి చేస్తాం.. ఈ దిశగా కిసాన్ మిత్ర తొలి ముందడుగు’’ అన్నారు.