కళాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్..

కళాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్..

Saturday March 12, 2016,

3 min Read


సినిమా అనగానే గుర్తుకు వచ్చేవి మూసధోరణిలో నడిచే కమర్షియల్ ఎంటర్ టైనర్లే. కానీ కొందరు అదే సినిమా మాధ్యమాన్ని తమ కళను ప్రదర్శించే సాధనంగా మార్చుకున్నారు. సినిమాకు ఆర్ట్ ను జతచేసి అపురూప కళాఖండాలను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమాలో జీవితాలను ఆవిష్కరించి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ముఖ్యంగా దేశంలో సామాన్యులు, పేదవర్గాలు, మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై స్పందించి ఎందరో దర్శకులు గొప్పగొప్ప సినిమాలు తీశారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.. 

సత్యజిత్ రే..

సత్యజిత్ రే. భారతీయ సినిమాకు చెరగని చిరునామా. ఆస్కార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ పురస్కారం అందుకున్న ఏకైక భారతీయుడు. వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తీయడంలో సత్యజిత్ రేది అందవేసిన చేయి. రే చిత్రాలు సామాన్యుల జీవితాలను తెరపై ఆవిష్కరించాయి. బెంగాల్ లోని గ్రామీణ వాతావరణాన్ని చిత్రీకరిస్తూ సాగిన పథేర్ పాంచాలి చిత్రంలోని దుర్గ, అపు పాత్రలు అప్పటి దుర్భర దారిద్ర్య పరిస్థితులను కళ్ల ముందు కడతాయి. ముఖ్యంగా దేవీ, మహానగర్, చారులత చిత్రాలలో స్త్రీల పాత్రలు కీలకంగా ఉంటాయి.

బిమల్ రాయ్

సామాజిక కథాంశాలను తెరకెక్కించడంలో బిమల్ రాయ్ పెట్టిందిపేరు. దో భీగా జమీన్ చిత్రంలో భూమిలేని నిరుపేదల వెతలను హృద్యంగా ఆవిష్కరించారు. దుర్భర పేదరికంలో ప్రజలు పడే కష్టాలను తెరకెక్కించి విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందాడు. ఆరవై ఏళ్ల క్రితం దేశంలోని పరిస్థితులను బిమల్ తన సినిమాల్లో కథాంశాలుగా తెరకెక్కించారు.

కేతన్ మెహతా..

తనదైన మార్కు చిత్రాలను చిత్రించడంలో కేతన్ మెహతా ఒక చరిత్ర లిఖించారు. ఆయన తీసిన చిత్రాల్లో మిర్చ్ మసాలా పలువురు విమర్శకుల మన్ననలు అందుకుంది. మహిళలు ఎదుర్కొన్న కష్టాలను ఎదిరించిన క్రమాన్ని చక్కగా చిత్రీకరించారు. సినిమాలో ప్రధాన పాత్రధారి స్మితా పాటిల్ విలన్ వేషం వేసిన నసీరుద్దీన్ షాపై దాడి చేసే సీన్ ఎందరినో కదిలించింది. సమాజంలో స్త్రీలు తమ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎదిరించిన తీరును ఈ సినిమాలో చక్కగా చూపించారు.

image


శ్యాం బెనగల్..

దాదా సాహెబ్ పురస్కార గ్రహీత శ్యాం బెనగల్ కెరీర్ ను అడ్వర్టయిజింగ్ ఫీల్డ్ నుంచి మొదలు పెట్టారు. మొదటి సినిమా అంకుర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని భయానక భూస్వామ్య విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ముఖ్యంగా మహిళలపై సాగుతున్న లైంగిక దాడుల నేపథ్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. శ్యాం బెనగల్ తీసిన మరో చిత్రం మంథన్. అందులో కూడా గుజరాత్ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. దేశంలో సహకార సంఘాల ద్వారా మొదలైన పాలవిప్లవం కాన్సెప్ట్ గా ఈ చిత్రం తీశారు. నేడు అందరి నోళ్లలో నానుతున్న అమూల్ పాల ఉత్పత్తుల సంస్థ నేపథ్యంలో ఆ సినిమాను సాగింది. సుమారు ఐదు లక్షల మంది రైతులు తలా రెండు రూపాయల చొప్పున విరాళాలు ఇచ్చి ప్రొడ్యూసర్లుగా మారడం విశేషం.

గోవింద్ నిహలానీ

పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన గోవింద్ నిహలానీ కుటుంబం దేశ విభజన సమయంలో భారత్ కు వలస వచ్చింది. మొదటి సినిమా ఆక్రోశ్ ద్వారా నిహలానీ తన ప్రతిభ చాటుకున్నారు. ఆ తర్వాత తీసిన అర్ధ సత్య, తమస్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

బుద్ధదేబ్ దాస్ గుప్తా

స్వతహాగా కవి అయిన బుద్ధదేబ్ దాస్ గుప్తా కళాత్మక సినిమాలు తీయడంలో ముందుండేవారు. బాగ్ బహదూర్ సినిమా ద్వారా బుద్ధదేబ్ తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ సినిమాలో బుద్దదేబ్ స్వయంగా పులివేషంలో నటించారు. బుద్ధదేబ్ తీసిన మరోసినిమా తాహేదార్ కథ కూడా పలు అవార్డులు గెలుచుకుంది.

రిత్విక్ ఘటక్..

బెంగాలీ సినిమాలో రిత్విక్ ఘటక్ ది విభిన్నమైన శైలి. ఆయన తీసే సినిమాల్లోని పాత్రలు వాస్తవాలకు ప్రతిరూపాలు. దేశ విభజన నేపథ్యంలో రిత్విక్ తీసిన చిత్రాలు అప్పటి పరిస్థితులను మన కళ్లముందు ఉంచుతాయి. రిత్విక్ స్వయంగా విభజన బాధితుడు కావడంతో కథలను అత్యంత హృద్యంగా తెరకెక్కించాడు.

దీపా మెహతా..

మహిళల సమస్యలపై చిత్రాలు తీయడంలో దీపామెహతా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. పంచ భూతాలైన ఫైర్, ఎర్త్, వాటర్ పేరిట చిత్రాలను తీసి దీపా మెహతా పలు ప్రశంసలు అందుకున్నారు. ఫైర్ సినిమాలో ఇద్దరు మహిళల మధ్య చిగురించిన ప్రేమ ఆధారంగా సినిమా నిర్మించగా, ఎర్త్ చిత్రం భారత్ పాకిస్తాన్ విభజన నేపథ్యంలో తీశారు. ఇక వాటర్ సినిమా మాత్ర హిందూమతంలోని వితంతు వ్యవస్థను విమర్శిస్తూ సినిమా కథ సాగుతుంది. ఇలా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీపా మెహతా పలు అంతర్జాతీయ అవార్డులు సాధించారు.

అపర్ణా సేన్..

మహిళల ఇతివృత్తాలను సినిమాలుగా తీస్తూ అపర్ణా సేన్ ఖ్యాతి సంపాదించారు. ముఖ్యంగా 36 చౌరంగీ లేన్ లాంటి సినిమాల్లో మహిళల సమస్యలపై దృష్టి సారించారు. ఈ సినిమాలో సతీ సహగమనం లాంటి సామాజిక దురాచారంపై అపర్ణా అద్భుతమైన చిత్రకథను ప్రదర్శించారు. పరోమితర్ ఏక్ దిన్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యిర్ సినిమాలు అపర్ణా సేన్ ప్రతిభకు నిదర్శనాలు

అదూర్ గోపాలకృష్ణన్

16 జాతీయ అవార్డులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజం అదూర్ గోపాల కృష్ణన్. మలయాళ చిత్ర పరిశ్రమలో అదూర్ ది చెరగని సంతకం. భూస్వామ్య విధానంపై గోపాల కృష్ణన్ సంధించిన అస్త్రం ఇలిపథయం.. సభ్యసమాజాన్ని ఆలోచింపచేసింది. నిళల్ కుత్తు చిత్రంలో ఉరితీసే తలారి ఇతివృత్తాన్ని సెల్యులాయిడ్ పై ఆవిష్కరించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. కమర్షియల్ చిత్రాలతో డబ్బు సంపాదన వేటలో పడిన నేటి తరం దర్శకులు వీరిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది..