డీమానిటైజేషన్ జనం అలవాట్లను ఎలా మార్చిందంటే..?

యువర్ స్టోరీ ఆసక్తికర విశ్లేషణ

డీమానిటైజేషన్ జనం అలవాట్లను ఎలా మార్చిందంటే..?

Monday December 26, 2016,

3 min Read

అది ఒక సూపర్ మార్కెట్..

నూడుల్స్ కొనండి డాడీ- కూతురు అడిగింది.

నూడుల్స్ లేవ్.. గీడుల్స్ లేవ్..! డాడీ కోపంగా చూశాడు.

ఏవండీ పికిల్స్ ఏమేం తీసుకోమంటారు..?- భార్య అమాయక ప్రశ్న

ఈసారికి లైట్ తీస్కో- భర్త సావధానం

హెయిర్ కలర్.. వచ్చేనెల చూద్దాం.. -తనకు తానే రాజీపడటం

డియోడరంట్- ఇప్పడవసరం లేదని పక్కన పెట్టడం

కిలోన్నర కందిపప్పు కిలోకి వచ్చింది.. రెండు కిలోల చక్కెర కిలోన్నరకు తగ్గింది. ఈసారి టీపొడి ఒక్కటే లెక్కలోకి వచ్చింది. కాఫీ పౌడరు బాస్కెట్లో పడలేదు. ఎప్పుడూ షాంపూతో కలిసొచ్చే కండిషనర్‌- కాసేపు పక్కకి తప్పుకుంది. 

ఈపాటికే మీకు అర్ధమైందనుకుంటాను.. ఇదంతా డిమానిటైజేషన్ ఎఫెక్టని.

image


అవును.. పాతనోట్ల రద్దుతో, చిన్న నోట్లు దొరక్క రోజువారి కొనుగోళ్లు అడుగున పడ్డాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే నిత్యావసరాలకే కోతపడింది. ఈ 45 రోజులను ఒక్కసారి నెమరువేసుకుంటే- రిటైల్ ఇకో సిస్టం ఎంత డిస్ట్రబ్ అయిందో కళ్లముందు కనిపిస్తుంది. డిసెంబర్ 31 తర్వాత కూడా సీన్‌లో మార్పు రాకుంటే మాత్రం మొత్తం సప్లయ్ చైన్ సిస్టమే కొల్లాప్స్ అయిపోతుంది.

స్నాప్ బిజ్ వాళ్లు ఆమధ్య ఒక ఆసక్తికర సర్వే చేశారు. డిమానిటైజేషన్ ఏ స్థాయిలో ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేసిందంటే.. నిత్యావసరాల్లో కూడా ప్రియారిటీ, లగ్జరీ లాంటివి బేరీజు వేసుకుని కొన్నారు. హెయిర్ కలర్, ప్యాకేజీ ఫుడ్ లాంటివి పక్కన పెట్టారు. కొనాల్సిన ఐటెమ్స తగ్గించుకుని, అవసరం ఉన్నవాటిని కూడా కొనకుండా రాజీపడ్డారు. దీన్నిబట్టి ఆర్ధిక వ్యవస్థలో ఒక దీర్ఘకాలిక మార్పులాంటిది అల్లంత దూరాన కనపడుతోంది. ప్రజల అలవాట్లు, అభిరుచులు మెల్లిగా ఛేంజ్ అవుతున్నాయి.

కొన్ని వస్తువులు కొనేటప్పుడు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అవలా యధాలాపంగా కొంటునే ఉంటాం. అలాంటి వాటి పట్ల కూడా జనంలో సెకండ్ థాట్ వస్తోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు సెకండరీ గూడ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. అంటే.. చిన్నచిన్న ప్యాకెట్లకు వెళుతున్నారు. ఉదా. షాంపూ డబ్బా కొనేబదులు సాచెట్లు తీసుకుంటున్నారు. కాఫీ పొడి బదులు టీ పౌడర్ లూజ్ కొంటున్నారు.

డిసెంబర్ 31 వరకు ఎంతలేదన్నా రూ. 67వేల కోట్ల క్రెడిట్ డిలే ఉండబోతోంది. ఇది వ్యవసాయ రంగానికి పెద్దదెబ్బ. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీని మార్చుకోవాల్సి వస్తుంది. స్టాకిస్టులు, గిడ్డంగుల్లో చిన్నచిన్న ప్యాకెట్లను పెద్దఎత్తున స్టోర్ చేసే పరిస్థితి తలెత్తుతుంది.

image


గత కొద్దివారాలుగా చూసుకుంటే కొనుగోళ్ల పరిమాణంలో గణనీయమైన మార్పు వచ్చింది. వెరసి కిరాణా స్టోర్ల తీరు మారిపోయింది. జనం డిమాండ్ మేరకు అన్నీ చిన్న ప్యాకెట్లనే సర్దుతున్నారు. ఇక డియోడరెంట్ లాంటి సెకండరీ నీడ్స్ ఊసే లేదు. నగదు సమస్య తీరితే తప్ప వాటికి డిమాండ్ వచ్చేలా కనిపించడం లేదు.

డిమానిటైజేషన్ ప్రకటన తర్వాత చాలా నగరాల్లో నిత్యావసరాలు కాకుండా ఇతర కొనుగోళ్లు 25 నుంచి 30 శాతం పడిపోయాయి. ముఖ్యంగా నాన్ ఎసెన్షియల్ గూడ్స్ అంటే.. చాకొలెట్స్, డ్రై ఫ్రూట్స్, బేకింగ్ ప్రాడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ లాంటి సేల్స్ 30 శాతానికి పైగా పడిపోయాయి. బేబీ ఫుడ్స్, మసాలా, ఓరల్ కేర్, హెయిర్ కేర్ ప్రాడక్టుల అమ్మకాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు.

కొన్ని కేటగిరీల బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లలోనూ మార్పులొచ్చాయి. కాసేపు లేబుల్ పక్కన పెట్టి అన్ బ్రాండెడ్ వస్తువులనే ఎంచుకుంటున్నారు. అందులో స్నాక్స్ వాటా 12 శాతం ఉంటే.. 8 శాతం కుకింగ్ ఆయిల్, 23 శాతం పప్పులు, 11 శాతం మసాలా ఐటెమ్స్, టీ 24 శాతం, ఇంకా తదితర వస్తువులున్నాయి.

డియోడరంట్స్, పికిల్స్, నూడిల్స్, పాస్తా, హెయిర్ కలర్ ప్రాడక్ట్స్ వంటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ పరిస్థితి మెరుగు పడుతుందని రిటైలర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి ఎలా వుందంటే.. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయి. క్యాష్, క్యాష్ లెస్.. ఏదైనా సరే స్టోర్లన్నీ నార్మల్ పొజిషన్ కు వస్తున్నాయి.

డిమానిటైజేషన్ ప్రకటన రాగానే బాస్కెట్ సైజ్ 16 శాతం తగ్గింది. వారం తర్వాత 19కి శాతానికి పడిపోయింది. మూడు వారాల తర్వాత మళ్లీ ఆరు శాతం పుంజుకుంది. అంటే జనం దగ్గరున్న డబ్బు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోందన్నమాట. ఈ పరిస్థితి మరింత మెరుగుపడి బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు పుష్కలంగా ఉంటే- మళ్లీ రిటైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. దాంట్లో డౌటే లేదు.