'కార్పొరేట్ లా'లో కాకలు తీరిన యోధురాలు -జియా మోడీ
Wednesday July 22, 2015,
4 min Read
జియా మోడీ కార్పొరేట్ లా ఆమెకు కొట్టిన పిండి. ఆ సబ్జెక్టులో తిరుగులేని లీడర్. ఏ జెడ్ బీ సంస్థ ఫౌండర్. ఈ సంస్థ ప్రస్తుతం దేశీయ కార్పోరేట్ ప్రపంచానికి కొత్త మార్గ నిర్దేశాలను సూచిస్తోంది. ఇండియాలో ప్రముఖ న్యాయవేత్త సోలి సొరాబ్జీ కుమార్తే జియా మోడీ. జియో ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు కూడా న్యాయ సంబంధ విషయాలే చర్చించుకుంటారట. అంత ఆస్తకి ఉండబట్టే జియా మోడీ... తన తండ్రి ప్రొఫెషన్నే తన వృత్తిగా మార్చుకున్నారు. సొరాబ్జీయే జియాకు ఆదర్శం.
కొలీగ్స్, క్లైయింట్స్ విషయంలో జియా పక్కా కమిట్మెంట్తో ఉంటారు. లా సంబంధిత విషయాలపై జియా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అయితే ఆమె ప్రొఫెషనల్ జర్నీ మాత్రం అంత ఈజీగా సాగలేదు. హార్డ్వర్క్, నమ్మకం ఉండబట్టే జియా పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దేశంలోని ప్రముఖ లాయర్లలో ఆమె ఒకరిగా నిలిచారు.
చిన్నతనం నుంచే ఆసక్తి
ముంబైలో పాఠశాల విద్య పూర్తయినప్పుడే జియా న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. చిన్నతనంలో వాళ్ల నాన్నే ఆమెకు ఆదర్శమని జియా చెప్పేవారు. సోలీ సొరాబ్జీ న్యాయవాద వృత్తిలో ఉండడంతో రాత్రింబవళ్లూ.. బిజీగానే ఉండేవారు. చివరకు భోజన సమయంలోనూ కేసుల గురించే మాట్లాడేవారు. అలా చిన్నతనం నుంచే లా ప్రొఫెషన్ పై జియాకు ఇష్టత ఏర్పడింది.
జియా 1975లో లా చదవడం కోసం కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి వెళ్లారు. హార్వర్డ్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అప్పట్లో అబ్రాడ్ నుంచి లా పూర్తి చేసిన అతి తక్కువ మంది మహిళల్లో ఈమె కూడా ఒకరు కావడం విశేషం. తల్లి ఒత్తిడితోనే జియా విదేశాలకు వెళ్లి మరీ లా చదివారు.
హార్వర్డ్లో లా పూర్తచేసిన జియా ఇండియా తిరిగి వచ్చి.. ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. తర్వాత మళ్లీ యూఎస్ వెళ్లి బాకర్ అండ్ మెకెన్సీలో జాయిన్ అయ్యారు. న్యూయార్క్లో ఆమె ఐదేళ్లు పనిచేశారు. అక్కడి అనుభవమే ఆమెకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడింది.
ఫ్యామిలీతో మళ్లీ జియో ముంబై చేరుకున్నారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 1984లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి, అతి స్వల్ప వ్యవధిలోనే మంచి గుర్తింపుని పొందారు. ఎన్నో పెద్ద కార్పొరేట్ సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఓ మహిళ కోర్టులో లాయర్ గా పని చేయడం అప్పట్లో అరుదు. మహిళా లాయర్ కేసు అప్పగించేందుకు క్లైంట్లు కూడా ముందుకొచ్చేవారు కాదు. అయితే అవేం పట్టించుకోకుండా కష్టపడి, ఓర్పుతో ఉండి మంచి లాయర్గా స్థిరపడాలని ఆమె సీనియర్లు సూచించేవారు. ఆదే ఆమె విజయరహస్యంగా మారింది.
కార్పొరేట్ న్యాయ సంస్థ ప్రారంభం
జియా 1995లో ఇండియా అతిపెద్ద న్యాయ సలహా సంస్థగా పేరుపొందిన ఏజెడ్బి అండ్ పార్ట్నర్స్ సంస్థకి మేనేజింగ్ పార్ట్నర్గా విధులు ప్రారంభించారు. కార్పొరేట్ లాయర్గా మారిపోయారు. వ్యాపారం అన్నాక ఒప్పందాలు సర్వసాధారణం. అయితే ఆ ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ముఖ్యంగా న్యాయపరమైన సమస్యలు అతి సహజంగా ఏర్పడతాయి. అలాంటి సమస్యలను చిటికెలో తీర్చేసేది తన సంస్థ. ఉద్యోగాలు చేస్తే.. మనం మన సొంతం కాదు. మనం ఎప్పుడూ ఎవరో ఒకరి కింద జూనియర్లమే. కానీ జియా ఏదైనా తన సొంతంగా చేయాలనుకున్నారు.
1990లో కాలంలో ఎన్నో విదేశీ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. అప్పట్లోనే ఇండియా పెద్ద బిజినెస్ వరల్డ్గా మారబోతోందని జియా ఊహించారు. ఏజెడ్బి ప్రారంభించిన మొదట్లో కొద్దిగా అమెరికన్ క్లైయింట్స్ సంప్రదించేవాళ్లు. తర్వాత అమెరికా ఫ్రెండ్స్, అక్కడ పని చేసినప్పటి కొలీగ్స్ ద్వారా క్లైయింట్స్ను ఆకర్షించారు జియా.
కష్టపడే తత్వం, ఓర్పు ఆమెకు విజయాలు తెచ్చిపెట్టాయి. ఏజెడ్బిని సరైన సమయంలో జియా ప్రారంభించారు. ఎప్పటికప్పుడు తమ పరిధి విస్తృతం చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు క్లైయింట్లను ఒప్పించడంలో ఆరితేరారు. అలా ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ... ఏజెడ్బిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. దీంతో ఇప్పుడు క్లైంట్లు క్యూ కడుతున్నారు.
జియా యంగ్ లాయర్గా ఉన్నప్పుడు ఆమెపై తన గురువు నార్మెన్ మిల్లర్ ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే ఇప్పుడు కూడా ఆమె యువ లాయర్లనే ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా ఎవరైతే తమ వృత్తిపై మక్కువగా ఉన్నారో కొత్తగా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారో అలాంటి వారి భుజమే తడతారు.
జూనియర్గా ఉన్నప్పుడు ప్రతీ విషయాన్ని అడిగి మరీ క్షుణ్ణంగా తెలుసుకునే వారు. న్యాయవృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన లాయర్లకు సలహాలివ్వడానికే జియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కష్టమే విజయ రహస్యమని ఆమె బలంగా నమ్ముతారు. యువత తాము చేసే పనిపట్ల ఉత్సాహంగా, మానసికంగా ధృడంగా ఉండాలని సూచిస్తారు. అంతేకాదు న్యాయానికే వెన్నుదన్నుగా నిలవాలని చెబ్తారు. క్లైంట్ల వాదనలో నిజంగా న్యాయముంటే వారి తరుపునే పోరాడాలని సూచిస్తారు.
కుటుంబ పాత్రా ఎక్కువ
జియా సక్సెస్ వెనుక ఆమె భర్త పాత్ర చాలా ఉంది. ఆయనతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారు. సాధారణంగా న్యాయవాద వృత్తిలో మహిళ నిలదొక్కుకోవడంమంటే మాటలు కాదు. అది కూడా మనకు ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ సంస్థల్లో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది జియా వాదన. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం సరికాదంటారు. అయితే ఇప్పుడు ఎంతో మంది మహిళలు న్యాయవాద వృత్తిలో స్థిరపడడం చూస్తుంటే.. తనకు సంతోషంగా ఉందని చెబుతారు.
పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. 'నా పిల్లలు చిన్నవాళ్లగా ఉన్నప్పుడు వాళ్లతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ విషయంలో నా భర్త నాకు సపోర్టివ్ గా నిలిచారు. ఇప్పుడు నేను పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు సిద్ధంగా ఉన్నా.... కానీ వాళ్లిప్పుడు బిజీ అయిపోయారు. నా పెద్ద కూతురు ముంబైలో ఫర్నిచర్ డిజైన్ స్టోర్ రన్ చేస్తోంది. తన పేరు జోస్మో. నా రెండో కూతరు లా పూర్తి చేసింది. ఇక మూడో కూతురు క్రూర జంతువుల సంరక్షణ ట్రస్ట్ నిర్వహిస్తోందిని' చెప్తారు.
ప్రొఫెషనల్ లైఫ్లో ఎత్తుపల్లాలు
లీగల్ ప్రొఫెషన్ కు మహిళలు దూరంగా ఉండాలన్న అడ్డ గోడల్ని నేను బద్దలు కొట్టారు. న్యాయవాద వృత్తిలో మహిళలు కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలనని నిరుపించారు. అందుకే 12 మంది లాయర్లతో మొదలైన సంస్థలో ఇప్పుడు 250 లాయర్లు మెంబర్లుగా ఉన్నారు. తనతో మంచి భాగస్వాములు ఉండడం, క్లైంట్లు కూడా మద్దతు ఇవ్వడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని జియా నమ్ముతారు.
కానీ న్యాయవాద వృత్తిలో విజయం సాధించడం కష్టమేనంటారు జియా. చాలాసార్లు ఎందుకీ వృత్తిలో అడుగుపెట్టామా అని బాధపడాల్సి వస్తుందని అంటారు. 'కొన్ని సందర్భాల్లో అలసిపోతాం. అన్నింటినr హ్యాండిల్ చేయడం కష్టతరంగా మారుతుంది. అలాంటి సమయాల్లో ఊపిరి గట్టిగా పీల్చి వదిలేయడమే నా మంత్ర' అంటారు జియా. తెలియక తప్పు చేయడం తప్పు కాదు మళ్లీ అదే తప్పు చేయకూడదంటారు. ఎంత కష్టమైనా ముందడుగే వేయాలి. ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ఒత్తడి పెరిగినప్పుడు డీప్ బ్రీతింగ్, వీకెండ్ రెస్ట్ తీసుకుంటే అంతా కూల్ అని యువతకు సూచిస్తారు.
జియా 30 ఏళ్ల వృత్తిగత జీవితం.. అందరికీ.. ముఖ్యంగా మహిళలకు ఎంతో ఆదర్శం. పనిని ప్రేమించడం, నిబద్ధత తన విజయమంటూ ముగిస్తారు న్యాయ సంచలనం జియో మోడీ.