అసలైన హీరోలను ప్రపంచానికి చూపిస్తున్న మహేశ్ భట్

విజయం కొందరినే వరిస్తుంది. కానీ ఆ విజయం వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉన్నా.. గుర్తింపు దక్కేది మాత్రం కొందరికే. అలాగే సమాజ సేవ చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నా.. ప్రపంచానికి తెలిసినవారు మాత్రం అతికొద్ది మందే. జనాలు గుర్తించని ఈ అన్‌ సంగ్ హీరోల గురించి వివరించే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు ఫొటో గ్రాఫర్ మహేశ్ భట్.

అసలైన హీరోలను ప్రపంచానికి చూపిస్తున్న మహేశ్ భట్

Saturday September 19, 2015,

4 min Read

కశ్మీర్ రాష్ట్రంలోని లేహ్‌లో మంచు నుంచి రక్షణ కోసం కృత్రిమ గ్లేసరీలను తయారు చేస్తున్న ‘గ్లేసియర్ మ్యాన్’ చెవాంగ్ నోర్‌ఫెల్ గురించి మీరెప్పుడైనా విన్నారా ? నిరుపేద ముస్లిం యువతులకు రాజ్యాంగ, మతపర హక్కులపై సాయం చేస్తున్న మృదుస్వభావి హస్నత్ మన్సూర్ ఎవరో మీకు తెలుసా ? డబ్బులు లేని కారణంగా వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించడంతో భర్తను కోల్పోయిన సుభాషిణి మిస్త్రీ, నిరుపేదల కోసం ఆస్పత్రిలు కట్టించి సేవలందిస్తున్నారు ? ఈమె పేరెప్పుడైనా మీరు విన్నారా ?

ఇలాంటి గుర్తింపునకు నోచుకోని హీరోల కథలను మనకు అందిస్తున్నారు మహేశ్ భట్. తన పుస్తకం ‘‘అన్‌సంగ్’’ (UNSUNG) లో వీరి గురించి వివరిస్తున్నారు.

వీరంతా మనమధ్యే జీవిస్తున్నారు. సమాజంలో ఉన్న అస్పృశ్యతలను రూపు మాపేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మన సమస్యలను మనం పట్టించుకోకపోయినా, వారు మాత్రం ఆ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు.

మహేశ్ భట్ ఓ ఫొటోగ్రాఫర్, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల మేగజైన్లు, పబ్లికేషన్లకు ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. ఫార్చ్యూన్, న్యూస్ వీక్, మేరీ క్లారీ, న్యూయార్క్ టైమ్స్ మేగజైన్, ది గార్డియన్ వంటి అంతర్జాతీయ మేగజైన్లకు ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు.

అనుకోకుండా పుస్తక రచన..

అన్ సంగ్ హీరోలను వెలుగులో తెచ్చేందుకు మహేశ్ సిద్ధమవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని సంఘటనలు ఆయనను ఈ దిశగా నడిపించాయి.

అన్ సంగ్  పుస్తక రచయిత మహేశ్ భట్

అన్ సంగ్ పుస్తక రచయిత మహేశ్ భట్


అది 1986వ సంవత్సరం, అక్టోబర్ మాసం. అప్పుడు కాలేజీలో చదువుకుంటున్న మహేశ్ తాను తీసిన ఫొటోలను సీనియర్ ఫొటోగ్రాఫర్లు రఘురాయ్, టీఎస్ సత్యన్, ఎస్ పాల్ వంటి వారికి చూపించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. నాగపూర్ స్టేషన్‌లో ఓ మహిళ చిన్న పాపతో సెకండ్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది. ఎలాంటి రిజర్వేషన్ లేకుండా కేవలం టికెట్ మాత్రమే కొనుగోలు చేసి ఆమె రెండో తరగతి కంపార్ట్‌మెంట్ లోకి ప్రవేశించింది. ఆ సమయంలో పెద్ద గొడవే జరిగింది. కొందరు ప్రయాణికులు ఆమెను రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్‌ లోంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అయితే చిన్న పాప ఉండటంతో ఆమెను అక్కడే ఉండేందుకు అంగీకరించాలని మరికొందరు వాదించారు. స్వభావసిద్ధంగా జర్నలిస్ట్ అయిన మహేశ్ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆమె రిజర్వేషన్ లేకుండా రిజర్వ్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎందుకు ఎక్కిందో తెలుసుకునేందుకు ఆమెతో మాటలు కలిపారు. ఆ మహిళది విషాద గాథ. ఆ కుటుంబం మొత్తం భోపాల్ గ్యాస్ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారు. ఆ మహిళ తల్లి చనిపోగా, తండ్రి మృత్యువుతో పోరాడుతున్నారు. మరణపు టంచుల్లో ఉన్న తండ్రిని చూసేందుకే ఆమె బయల్దేరారు. భోపాల్ గ్యాస్ బాధితులకు ప్రభుత్వం రూ.10 వేలు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ అందులో సగం, అధికారులు మింగేశారని ఆమె తన గోడును మహేశ్ ముందు వెళ్లగక్కారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పుడే మహేశ్‌కు తెలిసింది.

వృత్తిపరంగా చాలా ప్రాంతాల్లో ప్రయాణించే మహేశ్ వివిధ రకాల మనుషులను కలుస్తుంటారు. ‘‘ కొందరితో ఎలాంటి సంబంధాలు లేకపోయినా వారు మన హృదయాలకు హత్తుకుపోతారు. వారికి ఎప్పుడూ సరైన గుర్తింపు లభించదు. ఆ సమయంలో నేను అడ్వర్టయిజింగ్ పనులు చేస్తుండేవాడిని. రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని ప్రత్యక్షంగా వీక్షించాను ’’ అని అన్ సంగ్ హీరోల గురించి వివరించారు మహేశ్.

‘‘ నేను ఈ పనిని ప్రారంభించిన సమయంలో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమాజం గురించి పోరాడుతున్న వారి గురించి తెలియజేసేందుకు సరైన వేదిక లేదు. ఇప్పుడు కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదు. మోస్ట్ పవర్‌ఫుల్ మెన్/విమెన్ జాబితాల్లో చోటు దక్కించుకుంటున్నవారంతా పెద్ద పెద్ద వ్యాపారులే. తమ వారసుల కోసం పెద్ద ఎత్తున డబ్బు సంపాదించిపెట్టినవారే ’’ అని ఆయన అంటారు.

భోపాల్ గ్యాస్ బాధితుల కోసం క్లినిక్ నిర్వహిస్తున్న సతయు సారంగి

భోపాల్ గ్యాస్ బాధితుల కోసం క్లినిక్ నిర్వహిస్తున్న సతయు సారంగి


భోపాల్ గ్యాస్ బాధితుల కోసం ఓ క్లినిక్ నిర్వహిస్తున్నారు సతయు సారంగి. ఇలాంటి వారి చరిత్రలు పుస్తక పుటల్లోకి ఎక్కాలి.

‘‘ ఓనర్లు మారినా పుస్తకం ఎప్పటికైనా శాశ్వతమే. ఫొటోగ్రఫీకి చెందిన 85 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి’’ అని మహేశ్ వివరించారు. ‘కర్ణాటకకు సంబంధించి 1997లో ఓ పుస్తకం, ఓ సీడీని రూపొందించాను. డిజిటల్ వరల్డ్‌లో టెక్నాలజీ దే భవిష్యత్ అని అంతా అంటున్నా, పుస్తకానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ప్రయాణ సమయాల్లో పుస్తకమే మంచి నేస్తం’’ అని ఆయన అంటారు.

త్వరలో విడుదల కాబోయే ‘‘అన్ సంగ్ ఎక్స్‌ట్రాడినరీ లైవ్స్’’ పుస్తకంలో ఓ పేజీ

త్వరలో విడుదల కాబోయే ‘‘అన్ సంగ్ ఎక్స్‌ట్రాడినరీ లైవ్స్’’ పుస్తకంలో ఓ పేజీ


ఈ పుస్తకాల్లో వివరించిన వ్యక్తులు అంత ఆషామాషీ ఏం కాదు. పది సంవత్సరాల పాటు ఒకే (కాజ్) కారణం కోసం పోరాడిన వారి గురించే ఈ పుస్తకాల్లో వివరించారు మహేశ్. వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి వారు ఎంతో కొంత సాధించారు. వారి ప్రభావం కూడా దేశవ్యాప్తంగా ఉంది.

గొప్ప ప్రయత్నం

సమాజంలో మనతోపాటే జీవిస్తూ, గుర్తింపులేని వారి గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మహేశ్. ‘‘ఈ ప్రయత్నంలో కొన్ని నిధులు కూడా మంచి పనుల కోసం అందుతాయి. నేను రాసిన పుస్తకాల ద్వారా ఇప్పటివరకు 90 లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చినట్టు తెలిసింది ’’ మహేశ్ వివరించారు. ఈ పుస్తకాల్లో సమాజసేవ చేస్తున్నవారి గురించే కాదు, వారి అడ్రస్, ఫోన్ నంబర్లను కూడా పొందుపర్చారు. దీనిద్వారా ఈ అసాధారణ వ్యక్తులను కలుసుకునేందుకు సాధారణ ప్రజలకు వీలవుతుంది. ‘వారెప్పుడు నాతో అంటూ ఉంటారు.. నీ కారణంగానే మా గురించి ప్రజలకు తెలిసింది. దాతలు తమకు డబ్బులు ఇస్తున్నారని’’ అని మహేశ్ చెప్పారు.

సుభాషిణి మిస్త్రీ కుమారుడు అజయ్ నిర్వహిస్తున్న ఆస్పత్రికి 30 లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. మహేశ్ రాసిన పుస్తకం అచ్చయిన తర్వాతే ఈ సాయం లభించిందని అజయ్ అంటుంటారు. అలాగే సత్యమేవ జయతే కూడా దాన్ని గుర్తించింది.

రెండో పుస్తకం: అన్ సంగ్ ఎక్స్‌ట్రాడినరీ లైవ్స్..

అన్ సంగ్ ఎక్స్ ట్రాడినరీ లైవ్స్ కవర్ పేజీ

అన్ సంగ్ ఎక్స్ ట్రాడినరీ లైవ్స్ కవర్ పేజీ


మహేశ్ ఇప్పుడు రెండో పుస్తకాన్ని అచ్చు వేసే ప్రయత్నంలో ఉన్నారు. గతంలోలాగే ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తుల గురించే ఇందులో కూడా వివరించారు. మహేశ్ ఒక్కరే కాదు మరో ఆరుగురు ఫొటోగ్రాఫర్లు, చాలామంది రచయితలు ఈసారి జతకలిశారు.

జావెద్ అహ్మద్ తక్..

జావెద్ అహ్మద్ తక్..


మహేశ్ ఇలా వివరించారు. ‘‘మా పుస్తకంలో ఉన్న హీరోల్లో జావేద్ అహ్మద్ తక్ కూడా ఒకరు.. జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లాకు చెందిన ఈయన ఓ వికలాంగుడు. తన సోదరుడిని కిడ్నాప్ చేసిన సమయంలో టెర్రరిస్టులతో జరిగిన పోరాట సమయంలో ఓ బుల్లెట్ తగలడంతో ఆయన వైకల్యం బారినపడ్డారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత వికలాంగుల కోసం ఓ స్కూలును నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. కంప్యూటర్, లైఫ్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌‌కి ప్రత్యేక హోదా ఇప్పించేందుకు హై కోర్టులో కూడా పోరాడి విజయం సాధించారు జావేద్ ’’ అని మహేశ్ వివరించారు. టెర్రరిస్టు కుమారుడు అని తెలిసినా తన పాఠశాలలో పిల్లాడిని చేర్పించేందుకు జావేద్ వెనుకాడరు. అందుకే అసాధారణ వ్యక్తుల జాబితాలో ఆయన పేరు చేరింది. దీని గురించి మహేశ్ కు జావేద్ ఇలా వివరించారు. ‘‘వారు ఉగ్రవాదులు కాదు. కేవలం చిన్న పిల్లలు మాత్రమే. మంచి జీవితాన్ని ఏర్పర్చుకునేందుకు వారికో అవకాశం ఇవ్వాలి ’’ అని జావేద్ అంటారు. రెండో పుస్తకం కూడా ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. ప్రచురణ కోసం మహేశ్ నిధులను సేకరిస్తున్నారు.

ఎవరైనా చెప్పింది మర్చిపోవచ్చు. కానీ పుస్తకాలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి. తన ప్రయత్నంలో మహేశ్ మరింత విజయం కావాలని యువర్ స్టోరీ కోరుకుంటోంది.

వెబ్ సైట్: Website