సేమియా తయారీ వ్యాపారంలో ఆమె ఓ సెన్సేషన్

స్వయం ఉపాధితో అంచెలంచెలుగా ఎదిగిన సరోజ..ఉన్నత కుటుంబంలో జన్మించినా, పెళ్లి తర్వాత కష్టాలు.కర్ణాటకలోని షిమోగా జిల్లాలో వెర్మిసెల్లి ఇండస్ట్రీ.అంచలంచెలుగా ఉన్నత స్థాయికి

సేమియా తయారీ వ్యాపారంలో ఆమె ఓ సెన్సేషన్

Monday August 31, 2015,

4 min Read

స్వయంగా ఎదిగిన హెచ్‌ సరోజ కథ వింటుంటే ఓ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఊహాజనితంగా సినిమా ఉంటుంది కానీ.. రియల్ లైప్ మాత్రం భిన్నమైనది. జీవితం కష్టాలు, సుఖాలు కలగలిసిన వాస్తవం.

షిమోగా నుంచి ఆంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన మహిళ సరోజ. ఆమె ప్రస్తుతం 'నంది వెర్మిసెల్లి ఇండస్ట్రీని' నడిపిస్తున్నారు. కర్ణాటకలోని షిమోగా జిల్లా భద్రావతిలో రెండు ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను నిర్వహిస్తున్నారు. ఆమెకిదే తొలి వెంచర్ కాదు. గతంలో బ్యూటీ పార్లర్‌ను నడిపించారు. క్యాండిల్స్ మానుఫాక్చరింగ్, పాపడ్ మేకింగ్, టెక్స్‌టైల్ ఏజెన్సీలతోపాటు డెయిరీ, ఫైర్‌ క్రాకర్ రంగంలోనూ చేతులు పెట్టారు. ఇందులో చాలా రంగాలు కార్మికులపై ఎక్కువగా ఆధారపడేవే. కార్మిక సంబంధిత సమస్యల కారణంగా ఆ సంస్థలను మూసేశారు సరోజ. మరికొన్నింటిలో నష్టాలు రాకపోయినా, ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడం వల్లే మూసేశారు.

ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా అధికారుల నుంచి అవార్డు అందుకుంటున్న సరోజ

ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా అధికారుల నుంచి అవార్డు అందుకుంటున్న సరోజ


వెర్మిసెల్లి ఇండస్ట్రీలో తన భవిష్యత్‌ను వెతుక్కున్నారు సరోజ. ‘‘స్వయం ఉపాధి రంగంలో నా ప్రయాణం 1994లో ప్రారంభమైంది’’ అంటారామె.

ఉన్నత కుటుంబంలోనే జన్మించినప్పటికీ, తన కాళ్లపై తాను స్వతంత్రంగా నిలబడాలన్నదే సరోజ లక్ష్యం. తమ ఇంట్లోనే చాలాకాలంగా ఉంటున్న, బంధువుల అబ్బాయినే పెళ్లి చేసుకున్నారు సరోజ. కానీ పెళ్లయిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇల్లరికంలో సుఖ జీవితానికి అలవాటు భర్త చివరకు వాళ్ల తల్లిదండ్రుల బాధ్యతను కూడా తీసుకోలేదు. దీంతో తల్లిదండ్రుల ఇంటి నుంచి బయటకు వచ్చిన సరోజ అత్తాగారింట్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. జీవితం ఆఖరి మజిలీలో వారికి ఆసరాగా నిలవాలనుకున్నారు. ఆమె నిర్ణయానికి వారి నుంచి కూడా మంచి మద్దతు లభించింది.

మరోవైపు తల్లిగారింటి నుంచి మాత్రం సరోజకు ఎలాంటి సహకారం లభించలేదు. భర్త కూడా తల్లిగారింట్లోనే ఉంటూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. సరోజకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి నైతిక, ఆర్థిక సహకారం లభించలేదు. దీంతో జీవితం ఒక్కసారిగా కష్టలమయంగా మారింది.

‘‘నేను ఒక గృహిణిని మాత్రమే. పెద్దగా చదువుకోలేదు. టెన్త్ కూడా పూర్తి చేయలేదు. కొత్త జీవితాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కాలేదు’’ అని సరోజ పాత రోజులను గుర్తు చేసుకుంటారు.

అయితే పరిస్థితులు మాత్రం ఆమెను రాటు దేల్చాయి. ఏదైనా చేయాలని మనసులో నిర్ణయించుకున్నారు. స్వయం ఉపాధి, స్టార్టప్ స్థాపించాలన్న కలలను నిజం చేసుకునేందుకు మనసు దృఢంగా ఉంచుకోవాలని ఆమె నిర్ణయించారు. తనలాంటి మహిళలకు జీవనోపాధి కల్పించాలన్న ఆశయం కూడా ఆమెను కంపెనీ ప్రారంభించేందుకు ఉత్తేజపరిచింది. కుటుంబం నుంచి సహకారం లేని మహిళలను స్వయం ఉపాధి వైపుగా మళ్లించాలనుకున్నారు.

1994లో ఇద్దరు ఉద్యోగులతో ఓ చిన్న తరహా సంస్థను ప్రారంభించిన సరోజ ప్రయాణం ఇప్పుడు 26 మంది ఉద్యోగులున్న కంపెనీ స్థాయికి ఎదిగింది. నందీ వెర్మీ సెల్లి ప్రొప్రైటర్ అనే హోదా తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని ఆమె చెప్తారు.

తమ సంస్థలో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు, వారి పిల్లల విద్య.. తమ ఉద్యోగుల బాగోగులన్నీతానే చూసుకుంటారు సరోజ.

ఆంట్రప్రెన్యూర్‌గా ఎన్నో సవాళ్లను ఆమె ఎదుర్కొన్నారు. ‘‘మా ప్లాంట్‌లో తయారయ్యే వెర్మిసెల్లి నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మార్కెటింగ్‌లో మాత్రం నేను విఫలమవుతుంటాను. కొత్త కొత్త ఐడియాలు లేకపోవడంతో మార్కెట్‌లో మా ఉత్పత్తికి సరైన స్థానం కల్పించలేకపోయాను’’ అని తాను ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను వివరించారు. మార్కెటింగ్‌లో విఫలమైనా సంస్థ ఉత్పత్తులకు మాత్రం గిరాకీ తగ్గలేదు. పోటీని తట్టుకునేందుకు అందరికంటే తక్కువ ధరకు నాణ్యమైన వెర్మిసెల్లిని అమ్మడంతో మార్కెట్‌లో నంది వెర్మిసెల్లికి మంచి పేరొచ్చింది. మరోవైపు ఆర్డర్లు వచ్చిన సమయంలో కార్మికులతో సమస్యలను ఎదుర్కొన్నారు సరోజ. కార్మికుల నుంచి తరుచుగా సమస్యలు వస్తుండటంతో సెమీ ఆటోమెటిక్ మెషిన్ నుంచి ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్‌కు మారారు.

వెర్మిసెల్లి ప్రాసెసింగ్ యూనిట్

వెర్మిసెల్లి ప్రాసెసింగ్ యూనిట్


పూరి గుడిసెలో జీవితం

ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎలాంటి కుటుంబ సహకారం లేకపోవడంతో ఒంటరిగానే అన్నింటిని నెట్టుకొచ్చారు. సరైన మరుగుదొడ్డి, వసతులు లేనటువంటి చిన్న పూరి గుడిశెలో కొన్నాళ్లపాటు జీవనం సాగించారు. ఎంతో శారీరక శ్రమ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మగాళ్లు చేసే పనులను కూడా ఆమె ఒంటరిగా చక్కబెట్టుకునేవారు.

తల్లిగా పిల్లలకు కావాల్సినవన్నీ అందించేవారు. ఎలాంటి డిగ్రీ లేకపోవడంతో మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో తన పిల్లలను చేర్పించలేపోయారు సరోజ. దీంతో దాన్ని చాలెంజ్‌గా తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకున్నారు. స్కూల్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకుని, వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు ఓ కోచ్‌ను నియమించుకున్నారు.

జీవితంలో ఏదైనా సాధించేవరకు మళ్లీ ఇంటి గడప తొక్కనని తల్లిదండ్రులతో చాలెంజ్ చేసి వచ్చారు సరోజ. ‘‘మా తల్లిదండ్రుల ఇంటికి పదేళ్లపాటు వెళ్లలేదు’’ అని సరోజ చెప్పారు.


ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా

మనోధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొన్న ఆమె ఎన్నో బాధలను కూడా భరించారు. ''చూడచక్కని రూపం ఉండటంతో మగాళ్ల నుంచి పలురకాలుగా వేధింపులకూ గురయ్యేవారు. మార్కెటింగ్‌లో భాగంగా డోర్ టు డోర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు కొందరు మగాళ్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవారు. అలాంటి సందర్భాల్లో తాను ఎందుకంత అందంగా పుట్టానని కూడా బాధపడ్డారామె. అందరికీ నచ్చని విధంగా ఉంటే బాగుండేదని లోలోపల అనేక సార్లు కుంగిపోయాయని'' పాత రోజులను గుర్తుచేసుకుని బాధపడ్తారు.

ఒంటరిగా నివసించిన ఆమె తన సొంత కంటైనర్‌ను ఆమె నడుపుకునేవారు. చాలావరకు ఆమె కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. ‘‘మా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అలాంటి పరిస్థితులు కూడా తలెత్తాయి. కానీ దేవుడి దయవల్ల మళ్లీ నిలబడగలిగాను. అన్ని సమస్యల నుంచి బయటపడ్డాను’’ అని తన కష్టాల జీవితాన్ని గుర్తుచేసుకున్నాను.

ఇప్పుడు సరోజకు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ కూడా ఉంది. ఇలాంటి ఘనత సాధించడంపై ఆమె ఎంతో గర్వంగా ఉన్నారు. పనిని ఆమె ఎప్పుడూ ప్రేమిస్తుంటారు. ఆమెకు ప్రేరణగా నిలిచేది అదే. తన కాళ్లపై తాను నిలబడగలగడమే కాదు. తనలాంటి మహిళలకు ఉపాధి కల్పించడం ఆమెను ఎంతో సంతృప్తి పరుస్తున్నది.

మరోవైపు వ్యాపారంలోనూ పోటీ ఎక్కువవుతున్నప్పటికీ, ఆమె మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ‘‘మార్కెట్‌లోకి కొత్త పోటీ దారు ప్రవేశిస్తే, విజయం వైపు నా ప్రయాణం మరింత ఉత్సాహంగా సాగుతుంది’’ అని సరోజ తన పని గురించి వివరించారు.

తాము తయారుచేసే ఉత్పత్తులకు మంచి ఆర్డర్లు రావడంతో సరోజ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలాగే వివిధరకాల వెర్మిసెల్లిలను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. రాగితో తయారు చేసిన వెర్మిసెల్లికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

విస్తరణ వ్యూహం

ప్రస్తుతానికైతే నంది వెర్మిసెల్లి ఒక్క కర్ణాటకలో మాత్రమే లభిస్తోంది. దీన్ని ఢిల్లీ మార్కెట్‌లో విక్రయించేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. అక్కడ కూడా మంచి స్పందనే వచ్చింది. కానీ కర్ణాటకలో మార్కెట్‌పైనే తన దృష్టంతా కేటాయించాలని ఆమె నిర్ణయించారు. తన జీవిత కాలంలో ఆమె నేర్చుకున్న పాఠం.. ఏ వ్యాపారం కూడా నష్టం తెచ్చేది కాదు అని.

‘‘పట్టించుకోకపోవడం, ముందు చూపులేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే నష్టాలు వస్తాయి’’ అనే పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి

తన విజయ యాత్రను ఇలానే కొనసాగించాలని ఆమె భావిస్తున్నారు. ‘ఉన్నత స్థాయికి ఎదగాలంటే అడుగులు జాగ్రత్తగా వేయాలి. అలాగే ఉన్నతస్థానానికి వెళ్లాలనుకుంటే మన చుట్టూ ఉన్నవారితో కలిసి వెళ్లడం కూడా మర్చిపోవద్దు’’ అని సరోజ వివరించారు. ఎన్నో కష్టాలను ఓర్చి, జీవితాన్ని మార్చుకున్న ఆమె ఎందరికో ఆదర్శనీయం.