గిరిజన తండాల నుంచి ఇటలీ వెళ్లిన ఇద్దరు మహిళల సక్సెస్ స్టోరీ

గిరిజన తండాల నుంచి ఇటలీ వెళ్లిన ఇద్దరు మహిళల సక్సెస్ స్టోరీ

Wednesday November 04, 2015,

4 min Read

మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన మహిళల విజయ గాధలు మీరెప్పుడైనా విన్నారా ? ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయం అదే. సుందరమైన గిరిజన కుగ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన మహిళల గురించి మీరిపుడు చదవబోతున్నారు. తమిళనాడులోనె కొల్లి హిల్స్‌కు చెందిన మల్లిక, జయలలితలని యువర్ స్టోరీ టీం కలిసింది. ఇటలీ నుంచి అప్పుడే వాళ్లిదరూ చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాధన్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్నారు.

image


కొల్లి హిల్స్ టు ఇటలి

వ్యవసాయం పెద్దగా లాభసాటి కాకపోయినా మల్లిక, జయలలితలు ఇద్దరూ 10 ఏళ్లుగా వెనుకడుగువేయకుండా అదే పనిచేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తరతరాలుగా వస్తున్న చిరు ధాన్యాల పంటలను పండించడం మాత్రం మానుకోవద్దని వీరిద్దరు భావించేవారు. వారి ఆశయానికి కొల్లిలో పనిచేస్తున్న ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ సహాయం తోడయింది. పాత పంటలను కాపాడుకోవాలనే ఉన్నతాశయం. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వారిద్దరినీ విదేశాలకు పయనమయ్యేలా చేసింది. అదీ ఇటలీలో నిర్వహించిన బయో విమెన్ కాన్ఫరెన్స్‌లో భారతదేశం తరుఫున వీరిద్దరూ పాల్గొనేలా చేసింది. చిరు ధాన్యాలతో తయారు చేసే 'మురుక్కూ' అనే అల్పాహారాన్ని వీరిద్దరు ఇటలీ వేదికగా ప్రపంచానికి పరిచయం చేశారు.

సంప్రదాయాన్ని పరిరక్షించడం

గత కొన్నేళ్లుగానే చిరు ధాన్యాల్ని సరికొత్తగా చూడడం మొదలుపెట్టారు. మారుతున్న జీవన శైలితో వస్తున్న అనారోగ్య ఆహారపు అలవాట్లు చిరు ధాన్యాల వైపు చూసేలా చేస్తున్నాయి. అయినప్పటికీ, చిరు ధాన్యాల పట్ల డిమాండ్ పెద్దగా పెరగకపోవడంతో మల్లిక, జయలలితలు చిరుధాన్యాల ఉత్పత్తిని తగ్గించేశారు. గ్రామ స్థాయిలో అతి కొద్దిమంది మాత్రమే వీటిని వినియోగించేవారు. కనుమరుగవుతున్న పాత పంటలను కాపాడాలని అనుకున్నా, ఎక్కువ వ్యయ ప్రయాసలుండడంతో వాటి ఉత్పత్తిని తగ్గించారిద్దరు.

ప్రతికూల పరిస్థితులున్నా మొక్కజొన్న, మిరియాలు, కాఫీ బీన్ వంటి ఇతర పంటలు, పైనాపిల్, జామ, అరటి వంటి పండ్ల తోటల్లో చిరుధాన్యాల్ని కొంతమేరకైనా పండించారు. ఆ తర్వాత ఎం.ఎస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ జోక్యం, వారిచ్చిన స్మాల్ స్కేల్ మెషీనరి సహకారంతో పాత పంటల్ని పండించడం సాధ్యమైంది.

image


స్వయం సహాయక బృందాలు

'ఎమ్మెస్సెస్సారెఫ్ అందించిన మెషీనరీ దీవెనలా మారింది. 3 గంటల పాటు చేసే పని 30 నిమిషాల్లోనే పూర్తయ్యేది. ఇది మాకు స్పూర్తినిచ్చి, మా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, చిరు ధాన్యాల్ని ఎక్కువగా పండించేలా చేసింది" అంటారు జయలలిత.

ఈ రోజు కొల్లి హిల్స్‌లోని 109 స్వయం సహాయ బృందాల్లో 1500 మంది సభ్యులున్నారు. అందులో 13 మంది సభ్యులున్న ముల్లై గ్రూపులో మల్లిక, జయలలిత ముందు భాగంలో ఉండి, 6 రకాల చిరు ధాన్యాల్ని పండిస్తున్నారు.

image


జయలలిత లైఫ్ జర్నీ

27 ఏళ్ల జయలలిత గత పదేళ్లుగా తన 4 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. తన భర్తతో కలిసి, ఇతర పంటలైన మొక్కజొన్న, పెప్పర్, కాఫీ, పైనాపిల్, జామ, అరటితో పాటుగా వివిధ రకాల చిరు ధాన్యాల్ని పండిస్తున్నారు.

18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న జయలలితకు 7 ఏళ్లు, 3 ఏళ్లు, 2.5 ఏళ్లున్న ముగ్గురు పిల్లలున్నారు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న జయలలితకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేవు. "2010 లో మల్లికతో కలిసి స్వయం సహాయక బృందంలో చేరాను. ఆ తర్వాత జీవితమే మారిపోయింది. ఎన్నో భయాలతో ఉండే నేను ఆ తర్వాత ఆత్మ విశ్వాసంతో, నాలాంటి చాలా మంది మహిళలకు స్పూర్తిదాయకంగా మారాను. ఢిల్లీలోని ధర్వాడ్, అవినాశి, నమక్కల్ లో జరిగిన శిక్షణా శిబిరాలు నన్ను మార్చేశాయి" అంటారు జయలలిత.

ఇటలీ ప్రయాణం గురించి అడిగితే చాలా సంతోషంతో తన ప్రయాణం గురించి చెప్తారు. దాంతోపాటే ఇంటి ఖర్చులు పోను, కుటుంబ పోషణకు అవసరమైన డబ్బుల్ని సమకూర్చుకున్న విషయాన్నీ గర్వంగా చెప్తుంది. "మహిళలు ముందుకు రావాలి. ప్రతీ చిన్న విషయానికి మగవారిపై అధారపడకూడదు" అంటారు జయలలిత.

చిరు ధాన్యాలకు ఆకర్షించే రంగు, రుచి ఉండకపోవడంతో పిల్లలు పెద్దగా ఇష్టపడరు. అయితే శిక్షణా శిబిరాల్లో ఇచ్చిన సలహాలు, సూచనలతో వాటి విలువను గుర్తించడంతో పాటు మార్కెట్ వాల్యూ కూడా పెరిగేలా చేసేందుకు దోహదపడిందంటారు.

image


మల్లిక జర్నీ

గత పదేళ్ల నుంచి మల్లిక కూడా వ్యవసాయం చేస్తున్నారు. తమ గ్రామంలో చదువుకునేందుకు పెద్దగా అవకాశం లేకపోవడంతో ఏడో తరగతి వరకే చదువుకున్నారు. 35 ఏళ్ల మల్లిక తన 19వ ఏటనే పెళ్లిచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తల్లైన ఆమె, చాలా ఆత్మ విశ్వాసంతో తన పిల్లల్ని చదివించి గొప్ప వారిని చేస్తానని అంటోంది.

"చాలా క్లిష్టమైన పరిస్తితులు పాత పంటల వ్యవసాయాన్ని తగ్గించాయి. అయితే ఎంఎస్‌ఆర్‌ఎఫ్‌ కార్యక్రమాలు మకు సహకరించాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనాల్ని సేకరించేలా మేము ఎదిగాము" అంటున్నారు మల్లిక. "విత్తనాలని ఎక్కువ కాలం నిలువ చేసుకోలేకపోయేవాళ్లం. కాని పరిస్థితులు మారాయి. ఇప్పుడు మా దగ్గర సీడ్ బ్యాంక్ ఉంది. దాంతో ఇతర గ్రూప్స్‌లో అవసరమైన వారికి విత్తనాల్ని అందిస్తున్నాం. విలువైన విత్తనాల్ని ఊరికే వదులుకోలేం" అంటారు మల్లిక.

మల్లిక కూడా ఢిల్లీలోని ధార్వాడ్, అవినాశి, నంకల్‌లో శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. కొల్లిమలై అగ్రికల్చర్ సొసైటి ద్వారా తమ విలువైన ఉత్పత్తుల అమ్మకాలు 13 జిల్లాల్లో సాగుతున్నాయని గర్వంగా చెప్తారు మల్లిక. 'మహిళలు తమ టాలెంట్‌ను సానబెట్టుకోవాలి, అప్పుడే స్వతంత్రంగా ముందుంటారు" అంటారు.

తన ఇటలీ ప్రయాణం తర్వాత చేయబోయే ప్లాన్స్ గురించి అడిగితే "ఇంకా ఎన్నో విలువైన ఉత్పత్తుల్ని మరింత మందికి చేరువ చేయాలని భావిస్తున్నా" అంటారు.

ఇద్దరూ చెప్పే మాట ఒక్కటే. " ఆరోగ్యకర జీవితాన్ని అందించే పాత పద్ధతుల్ని ఎప్పటికీ మరుగున పడనివ్వం. మనం వాటిని భద్రంగా కాపాడుకుని, చిరు ధాన్యాల్ని పండించి, వినియోగించుకోవాలి" అని. అంత గట్టిగా చెప్పడానికి కారణం, 'డయాబెటిస్ అనే పదమే వాళ్ల గ్రామంలో వినిపించకపోవడం అంటున్నారిద్దరు.

వారు ఇస్తున్న ఈ సందేశం, ఇటలీ యాత్రతో ప్రపంచం మొత్తానికి పాకింది. కొల్లి గ్రామానికి చెందిన ఈ ఇద్దరే భారత దేశం తరుఫున బయో విమెన్ సదస్సుకు ప్రాతినిధ్యం వహించిన మహిళలు. ఈ సదస్సును బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించింది.

"అక్కడ ఎలాంటి ఆహార పదార్ధాలు వాడకంలో ఉన్నాయో కూడా మాకు తెలియదు. సంప్రదాయంగా వస్తున్న 'మురుకూ అల్పాహారం మాకు అతి పెద్ద అవకాశాన్నిచ్చింది. దాంతో మేము ఎన్నో నేర్చుకో గలిగాం" అంటున్నారిద్దరు. వారిద్దరి మొట్టమొదటి విదేశీ ప్రయాణం వాళ్లలో సంతోషాన్నే కాదు, ఆత్మ విశ్వాసాన్నీ పెంపొందింది.

భారత దేశం నుంచే కాకుండా, వీరి లాగే పాత పంటల కోసం కృషి చేస్తున్న బొలీవియా, మాలె మహిళలు కూడా అక్కడికి వచ్చారు.

మల్లిక, జయలలిత ఇటలీలో తయారు చేసి చూపించిన అల్పాహారం గురించి తెలుసుకోవాలనుందా, ఈ లింక్ చూడండి.