చిన్న సంస్థలకు రుణమిచ్చే మండీ ఇది !

దేశంలో చిన్నా, మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్ధిక సాయం అందించే అంశంపై మనీష్ కుమార్, అనురాగ్ జైన్ చేసిన పరిశోధనలో చాలా ఆసక్తి కర విషయాలు బయటపడ్డాయి.

చిన్న సంస్థలకు రుణమిచ్చే మండీ ఇది !

Friday April 24, 2015,

4 min Read

ఐఐటి, కాన్పూర్‌లో చదువుకుని బ్యాంకర్లుగా వున్న మనీష్, అనురాగ్‌లు చేసిన ఈ పరిశోధనలో అర్హులై వుండీ, కొద్ది పాటి సాయం అందిస్తే, అద్భుతమైన ఫలితాలు సాధించగలిగే పరిశ్రమలకు కూడా ఏమాత్రం ఆర్ధిక సాయం అందడం లేదని తేలింది. ఎప్పుడూ అప్పులు ఎగవేయని కొన్ని సంస్థలు 40 నుంచి 50 శాతం వడ్డీలు కడుతూ అష్ట కష్టాలు పడుతున్నాయి. కొన్ని మూత పడుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నా మధ్య తరగతి పరిశ్రమల మనుగడకు ఆర్ధిక సాయం అందకపోవడమే అతి పెద్దసమస్య. ఈ మధ్య ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన పరిశోధన లో కూడా ఇదే విషయం తేలింది. భారీ సంస్థలకు ఇచ్చే రుణాలలో సగం కూడా బ్యాంకులు మధ్యతరహా పరిశ్రమలకు ఇవ్వవు. ఇంక చిన్నతరహా పరిశ్రమలకైతే మూడో వంతుకు మించవు. లీజులు వంటి ఇతరత్రా ఫైనాన్స్ సదుపాయాలు కూడా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువనే చెప్పాలి.

image


ఈ లోటునే అవకాశంగా మార్చుకోవాలనుకుంది.. బెంగళూరులోని 'మండి' సంస్థ. చెల్లించని ఇన్వాయిస్‌లను, ఫైనాన్సర్స్ ఇచ్చిన పోస్ట్ డేటడ్ చెక్కులను నగదుగా మార్చుకునే అవకాశాన్ని ఈ మండి కల్పిస్తుంది. దీనివల్ల రుణ గ్రహీతలు తమ నగదు నిర్వాహరణా వ్యవస్థను పూర్తిగా థర్డ్ పార్ట్ చేతల్లో పెట్టాల్సిన అవసరం వుండదు.

అన్నింటికీ గ్యారెంటీ కావాల్సిందేనా ?

మనీష్, అనురాగ్ లు ఇద్దరూ, సొంత కంపెనీల నిర్వహణ లోనే బిజినెస్ లో తొలిపాఠాలను నేర్చుకున్నారు. అప్పటి వరకు చేస్తున్న బిజినెస్ లో రాబడి బాగానే వున్నా.. ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకోవడం వల్ల లాభాలు కనిపించేవి కావు. ‘‘చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీలకు రుణాలు పొందడం ఇండియాలో అసాధ్యమని అర్ధమైంది. ఒకవైపు వడ్డీ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా గ్యారంటీలు ఇవ్వాలి. పైగా విపరీతమైన జాప్యం. ఒక లోను రావాలన్నా.. రద్దు చేసుకోవాలన్నా..కనీసం మడు నెలలు పడుతుంది.’’ అని తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు మనీష్.

అందుకే మండి మొదలైంది. మండీ అంటే హిందీలో మార్కెట్ అని అర్ధం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రుణాలు అవసరమైన కొన్ని ఎంపిక చేసిన చిన్న,మధ్యతరగతి సంస్థల లిస్టు మండీలో వుంటుంది. దీని నుంచి ఫైనాన్సియర్లు వారు రుణం ఇవ్వాలనుకున్న కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించుకుని తమ రిస్కును కూడా తగ్గించుకోవచ్చు.

‘‘ఇటు రుణాలు కావాలనుకునే వాళ్ళు కూడా ఫైనాన్షియర్ల దగ్గరకి వెళ్ళక్కర్లేదు. బయట వడ్డీ వ్యాపారుల కంటే, తక్కువ వడ్డీ రేటుకే రుణాలు దొరుకుతాయి. మొత్తం మీద ఫైనాన్సింగ్ కి సంబంధించినంత వరకు మా కంపెనీ కూడా మార్కెట్ ప్లేస్‌లాగే పని చేస్తుంది కాబట్టీ దీనికి మండి అని పేరు పెట్టాం. ఫైనాన్సియర్లయినా, రుణాలు కావాలనుకునే కంపెనీలైనా ఈ మండికి వచ్చి, వాళ్ళకు అనువైన బేరాలు చేసుకోవచ్చు’’ అంటారు మనీష్.

ఇండియాలో MSME ఫైనాన్సింగ్ ‍‍‍!

రుణాల కోసం ప్రయత్నించడంలోనే ఇండియాలో MSMEల పుణ్యకాలం కాస్త పూర్తయిపోతోంది. ఇక వాళ్ళ కంపెనీలను ఎలా పెంచి పెద్దవి చేయాలనేది ఎప్పుడు ఆలోచిస్తారు. ముఖ్యంగా చెల్లింపులు జరగని ఇన్వాయిస్‌లు ఈ కంపెనీలకు పెద్ద సమస్య అని మనీష్ గుర్తించారు.

‘‘ ఇన్వాయిస్‌లన్నీ నగదుగా మారితే, చిన్న సంస్థల లాభాలు 20 నుంచి 25 శాతం పెరుగుతాయని RBI కూడా చెప్తోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే రుణాలు ఎగవేయడంతో చిన్న కంపెనీలకు రుణాలివ్వడం ఇంకా ఎక్కువ రిస్కనుకుంటున్నారు. అయితే ఇది తప్పు. నిజానికి చిన్న సంస్థలు ఎక్కువ వడ్డీ రేట్లు చెల్లించడానికి ఒప్పుకుంటాయి కనుక వాటికి రుణాలివ్వడంలో చాలా తక్కువ రిస్కుంటుంది.’’
మనీష్ కుమార్, మండీ సహ వ్యవస్థాపకుడు

మనీష్ కుమార్, మండీ సహ వ్యవస్థాపకుడు


నిజానికి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది. అయితే, ప్రైవేటు సంస్థలు పూనుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ‘‘ ఇండియాలో MSME ఫైనాన్సింగ్‌లో దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర లోటు వుందని మాకనిపిస్తోంది. ఈ లోటును బ్యాంకులు పూడ్చలేవు. వాస్తవాలు, స్టాటిస్టిక్స్, ఆధారంగా ఫైనాన్సియర్లు నిర్ణయాలు తీసుకోవాలి. అలా అని మళ్ళీ మేం మరో ఎన్ బి ఎఫ్ సి ( NBFC) కాదల్చుకోలేదు. అందుకే బిడ్డింగ్ ద్వారా రుణాలు ఇచ్చే/ పొందే సౌకర్యం కల్పించగల ఒక మార్కెట్ ప్లేస్ గానే వుండదలిచాం. ’’ అంటారు మనీష్..

మండీకి లాభాలెలా వస్తాయి

‘‘మండి ఒక బ్రోకరేజి సంస్థ లాంటిది. ఈ వేదిక ద్వారా ఎంత ట్రేడ్ జరిగితే, సంస్థకు అంత లాభం. ఇటు ఫైనాన్సియర్, అటు రుణగ్రహీత మండీకి ఒక నిర్దిష్ట పర్సెంటేజీని బ్రొకరేజ్ ఛార్జిగా వసూలు చేస్తుంది. వడ్డీ రేటు ఎంతుండాలనేది మండి నిర్ణయించదు. మార్కెట్ హెచ్చుతగ్గులు, సప్లయి, డిమాండ్ లాంటి అంశాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ఒక సారి ట్రేడ్ ఖరారయ్యాక రెండు పార్టీలూ, మండికి బ్రోకరేజి ఫీ చెల్లించాలి.’’ అని తమ సంస్థ పనిచేసే తీరును వివరించారు మనీష్.

image


మండి భవిష్యత్తు

ప్రస్తుతానికి మండి ద్వారా రుణాలు పొందేందుకు 500 మంది MSME లు సిద్ధంగా వున్నారు. వచ్చే ఏడాదిన్నర లోపు 30 కోట్లు పెట్టుబడులు సమీకరించేందుకు మనీష్, అనురాగ్‌లు ఏర్పాట్లు చేసుకున్నారు. వచ్చే కొన్ని వారాల్లో ఈ మొత్తాన్ని70 నుంచి వంద కోట్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయమైన వాటికే మండిలో చోటు కల్పించాలని మనీష్, అనురాగ్‌ల ఆలోచన. మొదటి సంవత్సరం 40 కోట్ల వరకు గ్రాస్ ట్రేడ్ వాల్యూ సాధించాలని మండి లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే అయిదేళ్ళలో ఏడాదికి 200 శాతం (సగటు వార్షిక వృద్ధి రేటు) CAGR వుండాలని వీరి ప్రణాళిక. ‘‘కనీస పక్షం చూసుకున్నా.. మా లక్ష్యాన్ని చాలా తేలికగా దాటుతామని’’ మనీష్ ధైర్యంగా వున్నారు.

అనుభవమే పెట్టుబడి

ఐఐటి కాన్పూర్ లో అనురాగ్, మనీష్ సహావిద్యార్ధులు. టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల్లో ఇద్దరికీ అపార అనుభవం వుంది. సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బిసి, క్యాపిటల్ వన్ లాంటి సంస్థల్లో రకరకాల హోదాల్లో దాదాపు పన్నెండేళ్ళు పనిచేసిన అనుభవం మనీష్‌కు ఉంది. మార్కెటింగ్, సిఆర్ఎం, ఫైనాన్స్ అండ్ కలెక్షన్‌తో పాటు, లక్షలాది డాలర్ల పోర్ట్‌ఫోలియోస్ మేనేజ్ చేసిన అనుభవం ఆయనది.

ప్రస్తుతం అనురాగ్ కొలకత్తాలో వుండి ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో కంపెనీ విస్తరణ పనులు చూస్తున్నారు. మనీష్, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో సంస్థ వ్యవహారాలు చూస్తున్నారు.

అనురాగ్ జైన్, మండీ సహ వ్యవస్థాపకుడు

అనురాగ్ జైన్, మండీ సహ వ్యవస్థాపకుడు


పడుతూ, లేస్తూ..

ఏ వ్యాపారమైనా... మంచి, చెడు అనుభవాల సమ్మేళనమే. మనీష్ అనురాగ్‌ల విషయం లోనూ అదే జరిగింది. ఈ కాన్సెప్ట్ గురించి విన్న ఇన్వెస్టర్లంతా ముందు ఇది సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఏంటని అడిగారు. ఫైనాన్సింగ్‌లో రిస్క్ ఎక్కువుంటందనే భావన వల్ల పెట్టుబడులు రాబట్టడం అంత తేలిక కాదు.

‘‘డబ్బున్న జనాన్ని/ వ్యాపార సంస్థల్ని, డబ్బు అవసరమైన జనం/పరిశ్రమల దగ్గరకు తేవడమే మా పని. దీనికి టెక్నాలజీని ఒక వారధిగా వాడుతున్నాం. వీరిద్దరి మధ్య వున్న దూరాన్ని పదిశాతం తగ్గింగలిగినా.. మా క్రుషి ఫలించినట్టే భావిస్తాం’’.. అంటారు మనీష్..