సోలో ట్రావెల్ సో బెటర్.. !

ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన స్ట్రాంగ్ విమెన్

సోలో ట్రావెల్ సో బెటర్.. !

Monday March 14, 2016,

3 min Read

బ్యాగ్స్ అన్నీ ప్యాక్ అయ్యాయి. టూర్‌లో ఏ సామాన్లు అవసరమవుతాయో.. అంటూ కావాల్సినవి, అవసరం లేనివన్నింటినీ బ్యాగుల్లో కుక్కేస్తున్నారు. టూర్‌ ఎలా అవుతుందో అనే చిన్న ఆందోళన ఒకవైపు, కొత్త ప్రదేశాలని చూడబోతున్నామనే ఉత్సుకత మరోవైపు. ఈ ఆదుర్దాలో ఉండగానే.. ఓ ఫ్రెండ్ నుంచి ఫోన్..ఉన్నట్టుండి ఏదో ఇబ్బంది వచ్చినట్టు.. ! అంతే ఒక్కసారిగా వేసుకున్న ప్లాన్‌లన్నీ ఫ్లాప్ ! అయితే అలా అయ్యో అంటూ కుమిలిపోయే రోజులు పోయాయ్ ! ఎవరు వచ్చినా రాకున్నా.. సింగిల్‌గా వెళ్లిపోయే ట్రెండ్ మొదలైంది. అమ్మాయైనా.. అబ్బాయైనా.. ఇప్పుడు ఎవరూ.. ఇతరుల కోసం వేచిచూడకుండా హ్యాపీగా తమకు తాము బైక్ ఎక్కేసి తుర్రుమనే రోజులు వచ్చేశాయి.

ఒకప్పటి మాదిరి ఫ్యామిలీ ట్రిప్స్, ఎక్స్‌కర్షన్స్, గ్రూప్ ట్రావెల్, హనీమూన్ ట్రావెల్‌కే పరిమితమైన టూరిజం.. ఇప్పుడిప్పుడు సోలో ట్రావెల్‌కు కూడా సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని హాలిడేఐక్యూ సంస్థ నిర్వహించిన ట్రావెల్ ట్రెండ్ ఫోర్‌కాస్ట్ 2016 కూడా సూచిస్తోంది. గతంతో పోలిస్తే సోలో ట్రావెల్స్ గణనీయంగా పెరిగినట్టు సంస్థ నిర్వాహకులు చెబ్తున్నారు.

''నేను ఒంటరిగా వెళ్లినప్పుడు ఎప్పుడూ భయపడలేదు. జనాలే నా దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారు. నా ప్రయాణం గురించి తెలుసుకుని ప్రోత్సహించేవారు. ఇంకొందరైతే తమ ఇళ్లకు వచ్చి కాసేపు సేదతీరి, తమ మహిళల్లో ధైర్యం నింపాలని కోరేవారు'' అంటారు సోలో ట్రావెలర్, సైక్లిస్ట్ అయిన ప్రిస్లియా మదన్.

ఈమెలానే ఎంతో మంది ఈ సోలో ట్రావెల్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. వాడ్రోబ్స్ సంగతి చూడకుండా జస్ట్.. బ్యాక్ ప్యాక్‌లో నాలుగు బట్టలు పడేసుకుని అలా దేశాన్ని చుట్టేసిన వాళ్ల గురించి వింటే మీరూ థ్రిల్ ఫీలవుతారు.

గౌరి జయరాం 

image


సైకిల్‌ కోసం హోండా సిటీని అమ్మేసి అప్పట్లో అందరూ అవాక్కయ్యేలా చేశారు. యాక్టివ్ హాలిడే అనే సంస్థకు గౌరీ వ్యవస్థాపకురాలు. సెల్ఫై గైడెడ్ అడ్వెంచర్ హాలిడేస్‌లో పేరు తెచ్చుకున్న ఓ అంతర్జాతీయ సంస్థే ఈ యాక్టివ్ హాలిడే. ఒక దశలో పనిలో బోర్ ఫీలవుతూ.. జీవితంలో ఏమీ సాధించలేకపోయాననే నిట్టూర్పుతో ఉన్న గౌరీ.. ఆ అడ్డంకులను అధిగమించారు. ఇల్లూ, ఆఫీసూ వదిలేసి బయటకూడా ఓ ప్రపంచం ఉందనే విషయాన్నే గమనించేందుకు మారథాన్ రేసుల్లో పాల్గొంటూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

2. రుతవీ మెహతా

image


రుతవీ ఓ హోటలియర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్, ఇంటర్నెట్ మార్కెటర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే ఆమెకు ట్రావెలింగ్‌పై మక్కువ ఎక్కువ. రుతవీ ఓ పాపులర్ ట్రావెల్ బ్లాగర్. రాయల్ ఎన్‌ఫీల్డ్, ది బికెర్నీ, కేరళా బ్లాగ్ ఎక్స్‌ప్రెస్, ఎవరెస్ట్ ఛాలెంజ్ వంటి ప్రాజెక్టుల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇన్నీ ఎన్డీ టీవీ గుడ్ టైమ్స్‌లో ప్లే అయ్యాయి.

3. స్వాతి జైన్

image


తనకు ఇష్టమైన, తన మనస్సు మెచ్చే ట్రావెలింగ్ కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఇప్పుడు ఓ స్వతంత్ర పీఆర్ కన్సల్టెంట్‌గా, ట్రావెల్ బ్లాగర్‌గా అందరికీ పరిచితమమయ్యారు స్వాతి జైన్.

''ప్రయాణమనేది ఓ సవాల్ లాంటిది. కంఫర్ట్ జోన్ నుంచి ఏ మేరకు బయటపడగలవు అని మనల్ని అది ప్రశ్నిస్తుంది'' అంటారు స్వాతి. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను చుట్టేసిన ఆమె ఇప్పటివరకూ 20 రాష్ట్రాలనూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలను నుంచి ఎంతో నేర్చుకున్నారు. అది కూడా కేవలం ఏడాదిన్నర కాలంలోనే. లడఖ్‌లోని మారుమూల ప్రాంతమైన జన్‌స్కార్ వ్యాలీ మొదలు బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను ఒంటరిగా చుట్టేశారు.

4. ప్రిస్లియా మదన్

image


ముంబై సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేస్తున్నారు ఈ 22 ఏళ్ల అడ్వెంచరిస్ట్. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్వేల్ నుంచి ఏకంగా కన్యాకుమరికి సైకిల్‌పై వెళ్లిన సాహసి. అది కూడా ఎలాంటి ప్రణాళికా లేకుండానే ! ఏ ప్రాంతంలో ఎవరు తనకు సహాయపడగలరు అనే ఒకే ఒక్క పాయింట్ తప్ప ఆమెకు ఇక ఏ ఆలోచనా లేదు. 1,800 కిమీ సైకిల్ ప్రయాణంలో ఆమె 18 రోజుల వివిధ ప్రాంతాల్లో బస చేశారు. వాళ్లంతా కొత్త వాళ్లు... గతంలో ఎప్పుడూ మొహం కూడా చూసి ఎరుగని వాళ్లు. తన 19 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒంటరి, సుదీర్ఘ ప్రయాణాలు సాగించినప్పటికీ.. ఏ రోజూ తన భయపడిన సందర్భాలు లేవని చెప్తారు మదన్.

5. పర్వీందర్ చావ్లా

image


పదిహేనేళ్ల వయస్సప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని డాక్టర్లు తేల్చేశారు. స్పోర్ట్స్, కథక్ డ్యాన్సింగ్‌లో అప్పుడప్పుడే ప్రావీణ్యం పెంచుకుంటున్న పర్వీందర్.. ఆ దెబ్బతో వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. తన జబ్బు శరీరాన్ని కట్టడి చేసిందేమో కానీ మనసు మాత్రం రెక్కల గుర్రంకంటే వేగంగా పరిగెత్తింది. ఇప్పుడామెకు 46 ఏళ్లు. వీల్‌చైర్‌పైనే ఒంటరిగా ఆమె ఎన్నో దేశాలు తిరిగారు. యూఎస్, జకార్తా, బాలీ వంటి 11 దేశాల్లో ఆమె ఒంటరిపోరు సాగించారు.

6. పింట్జ్ గుజ్జర్ 

image


ఆమె ఓ తల్లి, బైకర్, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే స్ట్రాంగ్ లేడీ. 2011లో మొట్టమొదటిసారి గుజరాత్‌ తీర ప్రాంతాన్నంతా బైక్‌పై చుట్టారు. సముద్ర తీర ప్రాంతాల్లో కాలుష్యంపై అవగాహన పెంచేందుకు ఆమె 1650 కిమీ ప్రయాణాన్ని చేపట్టారు. కచ్‌లోని లఖ్‌పత్ ప్రాంతం నుంచి ముంబైలోని ఉంబర్‌గావ్‌ వరకూ సాగిన ఈ ఒంటరి ప్రయాణంలో ఎన్నో అనుభవాలను ఆమె పొందారు. హిమాలయాలు, ఉత్తరాఖండ్‌లోనూ సోలో ట్రెకింగ్ చేశారు. భారత దేశ మొట్టమొదటి ఫిమేల్ బైకర్స్ అసోసియేషన్ - బికర్నీలోనూ గుజ్జర్ పాల్గొన్నారు. ఆమె చేసిన ఎన్నో ప్రయాణాలు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చేరాయి.

మరి మీ ప్రయాణం ఎక్కడికి ? మీకు కూడా ఇలాంటి గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నాయా.. ? అయితే మాతో పంచుకోండి. టైమ్‌లైన్‌పై మీ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోండి !