మిలియన్ డాలర్ల అమ్మకాలతో భాగ్యనగర బుక్ ఫెయిర్

మిలియన్ డాలర్ల  అమ్మకాలతో భాగ్యనగర బుక్ ఫెయిర్

Wednesday December 23, 2015,

5 min Read

పుస్తకం! తులసి దళంలాంటిది! తన్మయత్వంతో కళ్లకద్దుకుంటున్నారు! పుస్తకం దేవుడి ప్రతిమలా పవిత్రమైంది! రెండు చేతుల్లో పొదివిపట్టుకుని హృదయానికి హత్తుకుంటున్నారు! కొత్త కారు కొన్న రాత్రి కంటే, మంచి పుస్తకం కొన్న రాత్రే సుఖంగా నిద్రపోతారట! ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది కదా! మనిషికి చావు ఉందేమో కానీ పుస్తకానికి చావులేదు.


భాగ్యనగర బుక్ ఫెయిర్. ఆ పుస్తకహారాన్ని అమాంతం మెడలో వేసుకోవాలన్నంత సంతోషంగా ఉంది. పాఠకులు లేరని.. చదవడం నామూషీ అయిందని- పుస్తకాలకు కాలం చెల్లిందనీ- వినిపించే మాటలకు తెర పడిందని రుజువైంది. కార్లు, బైకులు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌ ఖరాఖండిగా చెప్తోంది. కొత్త పుస్తకం కనిపిస్తే అటువైపు పరుగులు పెట్టి.. చిన్న పిల్లల్లా అక్షరాల్లో అక్షరాలై ప్రవహిస్తున్నారు.

image



వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలను తెలిపే పుస్తకాలవైపు యువత నడుస్తున్నారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి, పిల్లల పెంపకంపై అవగాహన కల్పించుకుని, లలితా సహస్రనామాల దగ్గర ఆగుతున్నారు. ఒకటీ రెండు ముగ్గుల పుస్తకాలు కూడా ముందేసుకుంటున్నారు. కొందరు గురువుల దగ్గర, చరిత్రల దగ్గర నిల్చుంటున్నారు. పరిశోధకులు విషయ సేకరణ చేసుకుంటున్నారు. పెద్దలంతా దేవుడి పుస్తకాల దగ్గర దేవులాడుకున్నారు. జీవితానుభవాన్ని రంగరించిన బుక్స్ వైపు కొందరు పరుగులు పెడుతున్నారు. రిటైర్ ఉద్యోగులు జేబులో పెన్షన్‌ డబ్బుల్ని మళ్లీ లెక్కపెట్టుకుని- ఒకటీ అరా పుస్తకాలు కొంటున్నారు. ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొంటున్నారు. గృహిణిలు డిస్కౌంట్‌ ఇవ్వమని కొసురుతున్నారు. ఇవ్వకుంటే, కొనాల్సిన పుస్తకాల్లో ప్రియారిటీ చూసుకుంటున్నారు. సీ ప్లస్ ప్లస్, జావా చదివి చదివీ బోర్ కొట్టింది. అందుకే ఐటీ ప్రొఫెషనల్స్‌ ఈసారి కల్చర్, సోషల్ సర్వీస్, ఆత్మకథలను చదివేందుకు ఇష్టపడుతున్నారు. అభిమానంతో రెండో పేజీలో సంతకం చేసి కానుకగా ఇచ్చినా- ఇంకా ఏవో కొత్త పుస్తకాల కోసం సాహిత్యాభిమాన జర్నలిస్టులు సాయంకాలాలు కాస్త టైం కేటాయించి బుక్స్ కొంటున్నారు.

అనువాద గ్రంథాల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. సచిన్ ఆత్మకథ గురించి ఎక్కువ మంది వాకబు చేస్తున్నారు. హ్యారీ పోటర్‌, పంచతంత్రం పిల్లలకు అదో రంగుల ప్రపంచం. అట్లాస్ ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు! అమృతం కురిసిన రాత్రి – ఇంట్లో ఉన్నా మళ్లీ ఒకసారి చదవాలనిపిస్తుంది. కాళోజీపై కుతూహలం ఎంతకూ చల్లారదు! సలాం హైదరాబాద్ పుస్తకానికి మళ్లీ సలాం? అంపశయ్య- ఒక్కసారి చదివితే తనివి తీరదు! పసిపాపను ఎత్తుకున్నట్టుగా- రెండు చేతుల్లో బరువుగా, భద్రంగా- జివెల్స్ ఆఫ్ నిజాం పుస్తకం! పెద్ద వజ్రాల హారం మెడలో దిగేసుకున్నంత బడాయి! కొత్త పాఠకులు ఉన్నారనడానికి ఈ మాటలే ఉదాహరణలు!

భగవద్గీత ఎప్పటికీ సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇ-మెయిల్, ఇ-బుక్‌-ఇంటర్నెట్- ఇవి ప్రభంజనంలా వచ్చినా- పుస్తకం తన ఉనికిని, తన సొగసును, తన స్థానానీ ఎప్పటికప్పుడు చాటుకుంటునే ఉంది. చల్లటి సాయంకాలం మంచి పుస్తకం చదువుతుంటే వచ్చే ఆనందమే వేరు! చందమామ పుస్తకం కనిపిస్తే వయసుతో సంబంధం ఉండదు! ఎవరు పట్టుకున్నా ఒక్క కథైనా చదవితీరాల్సిందే. పరోపకారి పాపన్న కథలు, పట్టువదలని విక్రమార్కుడు చెట్టుమీద నుంచి శవాన్ని దించి అంటూ మొదలయ్యే బేతాళుడి కథలు! చదవి ప్రేరణ పొందినవాళ్లు ఎంతోమంది! గురవయ్యలా మోసం చేయొద్దని- పాపన్నలా పరులకు ఉపకారం చేయాలని మనకు మనం ఎన్నిసార్లు అనున్నామో! ఎయిటీస్‌, నైంటీస్‌లో డిటెక్టివ్ నావెల్స్ కి భలే క్రేజ్‌ ఉండేది!

అక్షరాలు గుండెల్లో నాటుకుని, మెదడు పొరల్లో తీపి అనుభూతుల్ని పంచే ఏ పుస్తకమైనా గొప్ప పుస్తకమే. ప్రతీ పుస్తకంలో సామాజిక స్పృహను వెతుక్కోవాలని రూలేం లేదు! అమృతం కురిసిన రాత్రి పుస్తకంలోంచి కొటేషన్లు ఏరకుని డిబేట్‌లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిన వాళ్లు ఎంతోమంది. పుస్తకాలు చదివేవారికి గురువు అవసరం లేదు. మిత్రుడి సాయం అక్కర్లేదు! సలహాదారులను వెతుక్కోవాల్సిన పనిలేదు! పుస్తకమే అన్నీ చెప్తుంది! పుస్తకమే ముందుకు నడిపిస్తుంది! పుస్తకమే ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది. సుఖంలో దుఃఖంలో ఏకాంతంలో నిశ్శబ్దంలో రణగొణధ్వనుల కాలుష్యంలో పుసక్తం వికాసం వైపు పరుగులు తీయిస్తుంది.

డిజిటల్ యుగంలో పుస్తకాభిమానులను సేద తీరుస్తోందీ ఈ ఈవెంట్. కాగితం ఉపయోగం బాగా తగ్గిపోయింది. ఎక్కడైనా ఉపయోగిస్తున్నామంటే అది ఒక్క పూస్తకం విషయంలోనే. కిండిల్, నూక్ లాంటి ఎన్నో ఈ బుక్స్ ప్రవేశింయాయి. ఈ నేపధ్యంలో మనలాంటి దేశాల్లో పుస్తక ప్రియులు ఉన్న సంగతిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లాంటివి చెబుతున్నాయి

“యుద్ధనపూడి సులోచన రాణి అభిమానిని నేను. ఆహుతి నవల కోసం చాలా సార్లు ప్రయత్నించా.” ఇక్కడ దొరికింది. శేషాద్రి

ఇది ఒక శేషాద్రి అంతరంగం మాత్రమే కాదు. ఇక్కడకొచ్చిన వారిలో చాలా మంది భావన ఇలానే ఉంది. ఇలాంటి నవల్లేకాదు, కొన్ని అపురూపమైన గ్రంధాలను ఇంటిలో భద్రపరుచుకోడానికి ఈఫెయిర్ కి క్యూ కట్టారు.

“తెలంగాణ ఉద్యమం గురించి ఇన్ని పుస్తకాలున్నాయన్నసంగతి ఇక్కడికొచ్చాకే తెలిసింది.” వెంకట్

వెంకట్ అమెరికాలో సెటిల్ అయిన నిజామాబాద్ వాసి. ఆయన హైదరాబాద్ వచ్చారు. బుక్ ఫెయిర్ గురించి తెల్సు కొని ఇక్కడకొచ్చారు. ఇక్కడున్న సాహితి సర్వస్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

image


పదిరోజుల్లోనే పదివేల డాలర్లు

పదివేల కోట్లు అంటే అక్షరాలా మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోందని అంచనా. మొదటి మూడురోజుల్లోనే దాదాపుగా ఇందులో డెబ్బైశాతం అమ్మకాలు జరిగాయి. బ్రాండ్ నేమ్ తో అమ్ముడు పోయే పుస్తకాలే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విరివిగా ప్రచారం చేయడంతో నగరంలో పుస్తక ప్రియులతో సుదూర ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు బుక్ ఫెయిర్ కు చేరుకుంటున్నారు. 5 రూపాయిల ఎంట్రీ ఫీజు పెట్టి టికెట్స్ కట్ చేస్తున్నారు. ఈ టికెట్లు ఒక్క ఆది వారం 50 వేలు దాటాయి. పుస్తకాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వడంతో జనం మరింత ఎగబడి కొంటున్నారు.

“ఓ మంచి పుస్తకం, ఓ గొప్ప స్నేహితుడితో సమానం”

ఈ మాట ఏ సందర్భంలో, ఏ మహానుభావుడు వాడాడో తెలియదు కానీ, స్నేహాలన్నీ డిజిటల్ గామారిపోయిన నేటి తరానికి పుస్తకం నిజంగానే ఓ గొప్ప స్నేహితుడిగా మారుతోంది. దీనికి నిదర్శంగా ఈ బుక్ ఫెయిర్ కనిపిస్తోంది. ఇప్పటికీ పుస్తక ప్రియుల సంఖ్య తగ్గలేదనడానికి ఈ ఈవెంట్ రుజువు చేస్తోంది. 100నుంచి 200రూపాయిల మధ్య ఉన్న పుస్తకాలు ఇప్పటి వరకూ లక్షల్లో అమ్ముడు పోయినట్లు సమాచారం. ఏ పుస్తకమైనా 50రూపాయిలే అంటూ పాత పుస్తకాలను అమ్మే స్టాల్స్ కూడా భారీగా అమ్మకాల్ని చేశాయి.

“రచయితలు, పబ్లిషర్ చెట్ల పేర్లు చెప్పుకొని పుస్తకాయల్ని అమ్ముతున్నారు .”

ఓషో బుక్ అయిన కవర్ పేజీ ఉంది. లోపల ఓషో ఇంగ్లీష్ బుక్ కు ట్రాన్స్ లేషన్ అని ఎవరో రచయిత పేరుంది. మంచి కవర్ పేజీ పెట్టి, నేషనల్ బుక్ ట్రస్ట్ పేరుండటంతో జనం కూడా దాన్ని ట్రస్ట్ చేసి పుస్తకాన్ని కొంటున్నారు. ఇలా పుస్తకాల్ని అమ్మడానికి వివిధ రకాల ట్యాక్టీస్ లను ఉపయోగిస్తున్నారు. మొత్తానికి అమ్మకాలు అయితే అనుకూలంగానే కనిపిస్తున్నాయి. బుక్ ఫెయిర్ కు ముందు ప్రభుత్వం కల్పించిన ప్రచారానికి ఆశించిన ఫలితం లభించినట్లైంది.

image


స్టార్టప్ లకు స్పూర్తి కలిగించే పుస్తకాలు

స్టార్టప్ అంటే ఎన్నో ఓటములను దాటుకొని విజయ తీరాలకు చేరుకోవాలి. దీనికి బాగా మనో ధైర్యం కావాలి. స్టీవ్ జాబ్స్ పుస్తకాలు ఈసారి ఎక్కువగా అమ్ముడు పోయాయి. దీంతో పాటు యంగ్ జనరేషన్ కు స్పూర్తినిచ్చే స్వామి వివేకానంద పుస్తకాల కోసం ఎక్కువ మంది మాట్లాడుకోవడం మనం బుక్ ఫెస్ట్ లో చూడొచ్చు. స్టార్టప్ ఈకో సిస్టమ్ పై ప్రభావితం చూపిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ షిప్ టెక్నిక్స్ లాంటి బుక్స్ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని దుకాణ దారులు అంటున్నారు.

image


రచయితల వేదిక

చాల మంది రచయితలు, రచయిత్రిలు బుక్ ఫెయిర్ వేదికగా కలుసుకుంటున్నారు. సినిమా రచయిత భాస్కర భట్ల, విరసం నేత వరవర రావు లాంటి ఎంతో మంది బుక్ ఫెయిర్ లో కనిపిస్తుండటం, వారి పుస్తకాలను చదివే రీడర్స్ కు పట్టరాని సంతోషం కలిగింది. వారిని కలిసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఓ పుస్తకాభిమని చెప్పుకొచ్చారు. ఏటికేడు కొత్తగాకనిపించే బుక్ ఫెయిర్ ఈసారి రచయితల రాకతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

“మరుగునపడుతోన్న నవల్ని, పుస్తకాలని మరోసారి పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ ఫాం ఎంతో మంది పుస్తక ప్రియుల మన్నలు అందుంకుంటోంది.”

సాహిత్యం ఎంత గొప్పదో ఈ హైదరాబాద్ బుక్‌ ఫెయిర్ చాటిచెప్తోంది. లోగో తయారీ నుంచి అనేక భాషల పుస్తకాల సేకరణ దాకా – ఒక యజ్ఞంలా భావించారు. విశ్వపుస్తక మేళాకు ఇదొక పునాది! ఎన్నో స్టాళ్లు- అనేక భాషలు- భగవద్గీత దగ్గర్నుంచి సచిన్ ఆత్మకథ దాకా! ఇది ఉంది- అది లేదని లేదు!

తన పుస్తకాన్ని ఎవరు కొన్నారో, ఎవరు కొనలేదో, ఎవరు చదివారో, ఎవరు పేజీలు తిప్పేశారో మామూలు టైంలో తెలియదు! ఆ దృశ్యాలన్నీ ఇలాంటి బుక్ ఫెయిర్‌లో దగ్గరుండి చూడొచ్చు. వేలమంది పాఠకుల స్పందన చూడొచ్చు. అభినందనలు, ఆప్యాయ పలకరింపులు అన్నీ ఆస్వాదించొచ్చు. అల్టిమేట్‌గా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్‌ అంటారు కథకులు

పాఠకులు తగ్గుతున్నారు- ఇలాంటి అపోహ పోవాలి. పోవాలంటే ఇలాంటి బుక్ ఫెయిర్‌లు భవిష్యత్తులో మరిన్ని జరగాలి. ముఖ్యంగా సాహిత్యం మీద ఫోకస్ చేయాలంటున్నారు రచయితలు

పుస్తకం హస్తభూషణం అన్నారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో- కానీ మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెప్తుంటారు! ఎందుకంటే ఎన్ని శతాబ్దాలు గడిచినా ఒక మంచి పుసక్తం విలువ తరగదు. పుస్తకం చేతిలో ఉంటే హేళనగా చూసే రోజులు పోయాయి! ఇంటర్నెట్ మాయాజలం ఎంతున్నా- నాలుక తడిని వేలికి తీసుకుని పేజీలు తిప్పేస్తుంటే లోకాన్ని చుట్టివచ్చినంత సంబరం! విజ్ఞానాన్ని పంచే పుస్తకాలన్నీ వర్ధిల్లాలి!