పైసా పెట్టుబడి లేకుండా కంపెనీ పెట్టారు..! ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు..!!

పైసా పెట్టుబడి లేకుండా కంపెనీ పెట్టారు..! ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు..!!

Tuesday February 16, 2016,

3 min Read

స్టార్టప్ అనగానే ఐఐటీలు, ఐఐఎంలు, టాప్ బిజినెస్ స్కూల్సే గుర్తుకొస్తాయి. మరి ఒక సాధారణ కాలేజ్ లో చదివినవారు స్టార్టప్ కంపెనీ ప్రారంభించగలరా? ప్రారంభించినా విజయవంతంగా నడపగలరా? సాధ్యం కాదు అనేదే అందరి అభిప్రాయం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ముగ్గురు ఢిల్లీ విద్యార్థులు. ఒకవైపు కాలేజీకి వెళ్తూనే మరోవైపు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే స్టార్టప్ కంపెనీ లాంచ్ చేశారు. అనుకున్నట్టే లక్షలు గడిస్తున్నారు.

image


ద టెస్టమెంట్. ఢిల్లీలోని ఇంద్రప్రస్త యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో ప్రారంభమైన స్టార్టప్. నిషాంత్ మిట్టల్, అవినాష్ ఖన్నా, కుమార్ సంభవ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ దాని వ్యవస్థాపకులు. మొదట్లో ఐడియా చెప్పగానే కాలేజీలో ఒకరేంజిలో ఫోకస్ అయ్యారు. జాతీయ మీడియాలోనూ వార్త వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి ఫండింగ్ కూడా చేస్తానన్నాడు. కానీ తీరా ప్లాన్ రివర్సయింది. పెట్టుబడి పెడతానన్న సదరు మనిషి పత్తాకు లేడు. ఇంకేముంది. చేతిలో చిల్లిగవ్వా లేదు. కాలేజీలో అందరిముందు తుస్సున గాలిపోయింది. ఒక దశలో ఐడియాకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామనుకున్నారు. వేరే ప్రాజెక్టు ఆలోచన కూడా వచ్చింది. కానీ సంకల్ప బలం ఐడియాను దాటనిస్తే కదా.

అసలేంటీ టెస్టమెంట్

టెస్టమెంట్ అబ్రివియేషన్ చెప్పాలంటే.. శిక్షణ , నైపుణ్యాభివృద్ధి సంస్థ. అంటే ఈ నెట్వర్కులో చేరిన విద్యార్థులకు తమకు నచ్చిన రంగాల్లో శిక్షణనివ్వడం. మానవవనరులు అవసరమైన కంపెనీలకు మ్యాన్ పవర్ అందించడం. అలా టెస్టమెంట్ అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయింది. చేరినవారందరికీ ఉద్యోగాలు రావడంతో మరింత మంది గ్రూప్ లో చేరారు. కంపెనీలు కోరడమే ఆలస్యం, వారికి మ్యాన్ పవర్ అందిస్తూ నమ్మకాన్ని మరింతగా పెంచుకుంది టెస్టమెంట్. చాలా కంపెనీలకు మ్యాన్ పవర్ సమస్యే లేకుండా చేసింది. కాలం గడిచేకొద్దీ మరిన్ని రంగాల్లో సేవలు అందించడం మొదలుపెట్టింది. మార్కెట్లో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్లింది. జీరోనుంచి మొదలై కోట్లకు పడగలెత్తింది. ప్రస్తుతం 60 మంది ఉద్యోగులు 10 నగరాల్లో పనిచేస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరం నుంచి 400 శాతం వృద్ధిరేటు సాధిస్తోందని వ్యవస్థాపకుడు నిషాంత్ చెప్పారు. పొయిన ఏడాది 30 లక్షల ఆదాయం వచ్చిందట. ఈ ఏడాది కోటి 20 లక్షలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 శాతం మార్జిన్ తీసుకుంటూ సర్వీస్ చేస్తున్నారు. ఫోర్డ్, జనరల్ మోటార్స్, మారుతి సుజుకి, యూబీఎం, మెస్సీ లాంటి పెద్ద కంపెనీలన్నీ టెస్టమెంట్ క్లయింట్లే. ఉబర్, క్వికర్, ట్రిప్డా,అర్బన్ క్లాప్,స్వజల్, జీమాస్ లాంటి కంపెనీలకు సైతం సేవలందిస్తోంది. మార్కెట్ లో నిలబడటం ఎలా అన్నఅంశంలో సలహాలతో పాటు, అప్పటికే ఉన్న ఉద్యోగులకు శిక్షణనివ్వడంలో ముందుంది టెస్టమెంట్.

2016 -17 నాటికి ఐదు కోట్ల రూపాయల ఆదాయం పొందడమే లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. 2015లో 10 పెద్ద కంపెనీల్లో ఆరు వేలమందికి ఉద్యోగాలొచ్చేలా చేసింది. దేశంలోని ఇరవై నగరాలకు సేవలను విస్తరించింది. అంటే దాదాపు దేశంలో ప్రతి నగరంలోనూ ద టెస్టమెంట్ ఉందన్నమాట. శిక్షణ ఇవ్వడం, మేనేజ్ మెంట్, ఆన్ బోర్డ్ ట్రైనింగ్ కోసం టెస్టమెంట్ సొంతంగా కొన్ని టెక్నిక్స్ సృష్టించింది. 

ప్రస్తుతం ఢిల్లీతోపాటు మంబై, బెంగళూరులో ఆఫీసులు తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు . ఇందుకోసం 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది కంపెనీ. దేశంలోని 90 శాతం పార్ట్ టైం మ్యాన్ పవర్ అసంఘటితంగా ఉంది. వీరిని ఏ ఏజెన్సీలూ పట్టించుకోవడం లేదు. 90 శాతం మందికి సరైన శిక్షణలేదు. ఇదే- కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల స్టార్టప్ లు, పెద్ద కంపెనీల అవసరాలు తీరడం లేదు. అలాంటి వారిలో నైపుణ్యాన్ని డెవలప్ చేయడమే ద టెస్టమెంట్ లక్ష్యం. 13 ఏళ్లుగా మార్కెట్ లో పాతుకుపోయిన టీమ్ లీజ్ లాంటి పెద్ద సంస్థకు కూడా గట్టిపోటీనిస్తోందీ చిన్న కంపెనీ. ఎందుకంటే టెస్టెమెంట్ కు ఉన్న బలమైన టెక్నికల్ టీం మిగతా సంస్థలకు లేకపోవడమే కారణం.

పెట్టుబడి పెట్టలేదు. పైగా ఇంద్రప్రస్థ యూనివర్సిటీ లాంటి సాధారణ విశ్వవిద్యాలయంలో చదువుకునేవారికి పెద్ద కంపెనీల్లోకి వెళ్లి పెట్టుబడులు పెట్టమని కోరేంత సీన్ కూడా ఉండదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు. అయినా విజయం సాధించాం- నిషాంత్.

టెస్టమెంట్ చాలా కింది స్థాయినుంచి వచ్చింది. హార్డ్ వర్కునే నమ్ముకుంది. ఇప్పటికీ చాలా స్టార్టప్ లు వెంచర్ క్యాపిటల్ మీదనే ఆధారపడ్డాయి. బయటినుంచి డబ్బురానిదే కంపెనీలు నడవవన్నది చాలామంది అభిప్రాయం . అయితే అవన్నీ భ్రమలు మాత్రమే అని నిరూపించింది ద టెస్టమెంట్. 

1997-2007 మధ్యకాలంలో స్థాపించిన 900 కంపెనీల్లో కనీసం 756 కంపెనీలు పెద్దగా పెట్టుబడులు ఆకర్షించలేక పోయాయి. అలాంటి పరిస్థితుల్లో విజయం సాధించడం అంటే విషయమే మరి. అంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే కోట్లకొద్ది డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మంచి బిజినెస్ మోడల్ ఉండి, దాన్ని సాకారం చేసుకోవాలన్న చిత్తశుద్ధి, కష్టపడే తత్వం ఉంటే చాలు. వెంచర్ క్యాపిటల్ పెద్దగాలేని కంపెనీలే లాభదాయకం. అలాంటి స్టార్టప్ లే ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి. ఎక్కువ మూలధనంతో ప్రారంభమైన స్టార్టప్ లు నష్టపోయే ప్రమాదమే ఎక్కువ.

చివరిగా ఒకమాట:

తక్కువ డబ్బుకే సేవల్ని అందించడానికి స్టార్టప్ కంపెనీలు సిద్ధంగా ఉండాలి. లేకపోతే పరాజయం తప్పదు. మార్కెట్ లో ధరల యుద్ధం నడుస్తోంది. దాంతో పోరాడి విజయం సాధించాలి.