ఫుడ్‌తో పాటు ఫ్రెండ్స్‌ను కూడా అందించే 'ఫీస్ట్'

ఫుడ్‌తో పాటు ఫ్రెండ్స్‌ను కూడా అందించే 'ఫీస్ట్'

Sunday September 20, 2015,

2 min Read

మీరు తెలియని ఒక కొత్త ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. కానీ మీకు ఎవరూ అక్కడ తెలియదు. ఆ ఊళ్లో ఎవరైనా ఉంటే బావుండు అని అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం ఓ హైదరాబాద్ కంపెనీ ఓ వినూత్నమైన విందును, సరికొత్త అనుభూతిని పరిచయం చేయబోతోంది. ఇంతకీ ఏంటి కాన్సెప్ట్ ?

image


ఓనమ్ పండుగను కేరళీయులు ఎలా చేసుకుంటారు ? ఆ రోజు వాళ్లకు ఎంత ముఖ్యం ? వాళ్లింట్లో చేసుకునే స్పెషల్స్ ఏమిటో తెలుసుకుని, రుచి చూడాలని అనుకున్నామనుకోండి. అయితే ఇందుకోసం ఏదైనా రెస్టారెంటుకు వెళ్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అదే టైంలో ఎవరైనా కేరళీయులు మన ఊళ్లోనే ఉండి.. మనల్ని వాళ్ల ఇంటికి అతిధిగా పిలిస్తే బావుంటుంది కదా.. ? మంచి ఆహారంతో పాటు వాళ్లతో రిలేషన్ కూడా ఏర్పడి మన సర్కిల్ పెరుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచననే చేసింది ఫీస్ట్ (FEAZT).

image


ఏంటి ఈ మోడల్

అద్భుతంగా వంట చేయడం వచ్చి తమ చేతి వంటలను ఇతరులకు పరిచయం చేయాలనుకునే వాళ్లు ఎవరైనా వీళ్ల దగ్గర హోస్టులగా చేరొచ్చు. అలా చేరిన వాళ్లు అతిధులను తమ ఇంటికి భోజనానికి పిలవొచ్చు. గెస్టులు - హోస్టుల మధ్య దీన్నో వేదికలా మార్చారు. హోం డెలివరీలకు, రెస్టారెంట్ల మోడళ్లకు ఇది పూర్తిగా భిన్నం. కొత్త రుచులతో పాటు కొత్త మనుషుల గురించి తెలుసుకుని, కొత్త స్నేహాలు చేద్దామనుకునే వాళ్లకు ఇదో వినూత్న వేదిక. ఇదో రకంగా నిష్ సెగ్మెంట్.

ఫీస్ట్‌ను హోస్ట్ చేసే వాళ్లు తమ మెనూ సహా తమ స్పెషాలిటీస్ ఏంటో సైట్లో వివరిస్తారు. దానికి ఇష్టపడిన అతిధులు సైట్లోకి లాగిన్ అయి వాళ్లకు రిక్వెస్ట్ పంపాలి. గెస్ట్ ఓకె చేసిన తర్వాత విందు భోజనానికి రెడీ అయిపోవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ. 400 నుంచి ఫుడ్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఒకే మెనూ ఉండకుండా నిత్యం హోస్టులు కూడా తమ మెనూ మారుస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ కొత్త వారిని యాక్సెప్ట్‌ చేసి.. ఎక్కువ మందిని ఈ వేదికకు పరిచయం చేయాలనేదే కంపెనీ ఆలోచన.

ఇప్పటి వరకూ ఫీస్ట్ దగ్గర 20 మందికిపైగా హోస్టులుగా ఉన్నారు. అది కూడా వీళ్లలో వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు. అయితే తమ కంపెనీ విధానాలకు సెట్ అయ్యే వాళ్లనే హోస్టులుగా తీసుకుంటున్నట్టు ఫీస్ట్ చెబ్తోంది. 2014 జూలైలో ప్రారంభమైన కంపెనీ ఇప్పటి వరకూ 110 ఫీస్ట్‌లను ఆఫర్ చేసింది. దాదాపు 900 మంది ఫుడ్‌ సహా కొత్త అనుభూతిని ఆస్వాదించారు. కంపెనీ దగ్గర 400 మందికిపైగా సభ్యులు యూజర్లుగా రిజిస్టర్ అయ్యారు. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరులో సేవలను అందిస్తున్నారు.

కేవలం ఆహారం మాత్రం ఇవ్వడం తమ ఉద్దేశం కాదని.. అతిధికి ఒక అనుభవాన్ని ఇవ్వడం తమ లక్ష్యమని కంపెనీ కోర్ టీమ్ ప్రతినిధి చైతన్య వివరించారు.

ఈ మధ్య కొత్త కాన్సెప్టులను కూడా పరిచయం చేస్తున్నారు. ఫుడ్‌తో పాటు సినిమాను కూడా ఆఫర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని థీమ్స్ ప్రారంభించబోతున్నట్టు చెప్పారు.

image


టీంలో ఎవరెవరు

గోపీకృష్ణ కిషోర్ సంస్థ సిఈఓగా వ్యవహరిస్తున్నారు. ఒరాకిల్‌లో పనిచేయడంతో టెక్నాలజీ అనుభవం ఉంది. కోర్ టీం సభ్యుడు చైతన్య కూడా ఒరాకిల్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ప్రాజెక్టులో చేరారు. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం ఫీస్ట్‌లో పనిచేస్తోంది. రాధాకృష్ణ అనే ప్రైవేట్ ఇన్వెస్టర్‌ నుంచి సీడ్ ఫండింగ్ అందింది.

రెవెన్యూ మోడల్ ఏంటి

గెస్ట్, హోస్ట్‌కు ప్లాట్‌ఫాం క్రియేట్ చేసినందుకు కొంత కమిషన్‌ను వసూలు చేస్తున్నారు. ఈ కమిషన్ 5 నుంచి 8 శాతం మధ్య ఉంది. రెండేళ్లలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామని ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆశించిన స్థాయి కంటే హిట్స్‌ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. మరింత బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు చైతన్య వివరించారు.

website