హెల్త్కేర్ రంగంలో డీల్స్ క్రాకింగ్ స్పెషలిస్ట్ రూపానాధ్
అమెరికా యూనివర్సిటీలో పీహెచ్డీ పట్టా పొందిన రూపానాథ్ప్రస్తుతం ముంబై ఏంజిల్స్లో ఏంజిల్ ఇన్వెస్టర్గా వ్యవహరిస్తున్నరూపహెల్త్కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న రూపభారత్లో హెల్త్కేర్ రంగానికి ఎంతో ఫ్యూచర్ ఉందంటున్న డాక్టర్ రూపహెల్త్కేర్, వెల్నెస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సలహాలిస్తున్న రూప
Thursday July 09, 2015,
6 min Read
రూపానాథ్... జియోనోమిక్స్ అండ్ మాలిక్యులార్ బయోలజీలో యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ, హెల్త్ సైన్స్ సెంటర్, అమెరికా నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. జియోనమిక్స్, హెల్త్ కేర్ రంగాలంటే ఆమెకు అమితమైన అభిమానం. రూప కెరీర్ను ఒక్కసారి పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తుంది. మన కలలను ఎలా సాకారం చేసుకోవాలి, ఆ ప్రయాణంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానికి డా.రూప స్టోరీ.. ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ.
పీహెచ్డీ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు శాన్ఫ్రాన్సిస్కోలో బే ఏరియా బయోటెక్లో ఆమె పనిచేశారు. 2006లో ఆక్టిక్స్ బయోలాజిక్స్ ఇన్ కార్పొరేషన్ను ప్రారంభించారు. ఈ సంస్థ క్యాన్సర్లో కొత్త వైద్య పద్ధతులను అధ్యయనం చేస్తూ ఉంటుంది. భారత్లో కార్యకలాపాలను, మేధో సంపత్తిహక్కులు, ఔషధ అభివృద్ధి ప్రక్రియలను రూపొందించుకున్నారు. కంపెనీ స్టార్టప్ ఖర్చుల కోసం కావాల్సిన నిధుల అప్లికేషన్స్ను ఆమె సిద్ధం చేసుకున్నారు. భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రూ.10 కోట్లను ఈ సంస్థకు కేటాయించింది. అలాగే ముంబైలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్లినికల్ డెవలప్మెంట్ సంస్థలను కూడా ముంబైలో ఏర్పాటు చేసేందుకు ఆమె సహకరించారు. ఈ సంస్థలు స్ఫూర్తిదాయకంగా పనిచేసేందుకు డాక్టర్ రూప తన ప్రయత్నాలను నిరంతరాయంగా కొనసాగించారు.
డాక్టర్ రూప ప్రస్తుతం ముంబై ఏంజిల్స్లో యాక్టివ్ ఇన్వెస్టర్. ఈ సంస్థ టెక్నాలజీ, హెల్త్కేర్, రిటైల్ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. సింగపూర్కు చెందిన విదెండా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలో అడ్వైజర్, మెంటర్గా చేరారు. అలాగే సింగపూర్కు వ్యాపారాలను తరలించాలని భారత కంపెనీలకు ఆమె సలహాలు కూడా ఇస్తున్నారు.
ముంబై ఏంజిల్స్ సంస్థకు హెల్త్కేర్ పెట్టుబడులకు సంబంధించి డాక్టర్ రూప సలహాలు అందిస్తున్నారు. వీటితోపాటు సాంకేతిక వ్యవహారాల బాధ్యతలను పరిశీలిస్తున్నారు. భారత్లో మంచి నెట్వర్క్ కలిగిన ఆసియాటిక్ కార్మిక్ లైఫ్ సైన్సెస్, క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ముంబై ఏంజిల్స్ తరఫున పెట్టుబడులు పెట్టారు డాక్టర్ రూప. ఒకవేళ మీరూ హెల్త్కేర్, వెల్నెస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే డాక్టర్ రూప సలహాలు తీసుకోవచ్చు. ఈ రంగానికి సంబంధించి వివిధ విషయాలపై తన అంతరంగాన్ని యువర్స్టోరీతో ఆవిష్కరించారు డాక్టర్ రూప.
యువర్స్టోరీ: పీహెచ్ డీ చేసే సమయంలో మీకు జినోమిక్స్పై ఎందుకంత ఆసక్తి కలిగింది?
రూప: నేను నా ఇంటర్ను ముంబైలోని రూపారెల్ కాలేజ్ పూర్తి చేశాను. ఆ కాలేజీలో చదివిన విద్యార్థులు మెడిసిన్ లేదంటే ఇంజినీరింగ్ వైపు వెళ్లారు. నాకు ఆ రెండు రంగాలన్నా ఇష్టం ఉండేది కాదు. 14 ఏళ్ల వయసున్నప్పుడు నేను ‘జురాసిక్ పార్క్’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో డీఎన్ఏ, క్లోనింగ్ అంశాలు నన్ను ఆకర్షించాయి. ఈ కాన్సెప్ట్లు అప్పుడు చాలా కొత్తవి. లైఫ్ సైన్సెస్పై నాకు ఆసక్తి కలగడానికి కారణం ‘జురాసిక్ పార్కే’. ఇక ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదవడం నా అదృష్టం. ఎందుకంటే ఆ కాలేజీలోని లెక్చరర్లు లైఫ్ సైన్సెస్, జెనిటిక్స్, బయో కెమిస్ట్రీ సబ్జెక్టులపై మంచి అవగాహన కలిగి ఉన్నారు. వీటికి సంబంధించి అన్ని విషయాలను చక్కగా వివరించారు. అప్పటి బోధనల కారణంగానే నేను పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నాను. నా కల పీహెచ్డీని పూర్తిచేసేందుకు నేను అమెరికా వెళ్లాను.
యువర్స్టోరీ: పీహెచ్డీ అనుభవం ఎలా ఉంది ?
రూప: పీహెచ్డీ పూర్తి చేయడం చాలా చాలా కష్టమైంది. ఆరేళ్లపాటు ప్రతిరోజు నేను 16 గంటలపాటు కష్టపడ్డాను. మనం అనుకున్నది సాధించాలనుకుంటే కొన్ని సార్లు సుదీర్ఘకాలం పాటు కష్టించాల్సి ఉంటుంది. చాలాసార్లు వెనక్కి వచ్చేయాలని అనుకున్నాను. అంత కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఆ మైండ్సెట్ నుంచి బయటకు వచ్చి, పట్టుదలతో ముందుకు సాగాను.
యువర్స్టోరీ: మీకు చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టమా?
రూప: మాది మహారాష్ట్రలో సంప్రదాయ కుటుంబం. నేను పుట్టింది నాగ్పూర్లో. పెరిగింది మాత్రం ముంబైలో. నా చిన్నతనంలో నేను ఎక్కువగా జూహూ బీచ్లోనే గడిపినట్టు గుర్తుంది. ఆ బీచ్లో ఉదయం పూట కొంగలు రావడం నాకు ఇప్పటికి మర్చిపోలేని జ్ఞాపకం. మరోవైపు నాగపూర్లోని తాతగారింటి లైబ్రరీలో పదివేలకు పైగా పుస్తకాలుండేవి. అన్ని యూకేకు సంబంధించినవే. వేసవి సెలవుల్లో నేను ఎక్కువగా ఆ లైబ్రరీలోనే గడిపేదాన్ని. అందులో ఉన్న పుస్తకాలన్నింటిని చదివినట్టు నాకు గుర్తు. చిన్నప్పటి నుంచి నేనొక పుస్తకపు పురుగును. నన్ను పుస్తకాలవైపు నడిపించింది తల్లిదండ్రులు, తాతయ్యే.
యువర్స్టోరీ: పీహెచ్డీ తర్వాత ఏం చేశారు ?
రూప: పీహెచ్డీ చేస్తున్నప్పుడే గుర్తించాను. అకాడమిక్స్ నా లక్ష్యం కాదని. ఇండస్ట్రీల్లో పనిచేయాలన్నది నా కోరిక. అందుకే జినోమిక్స్ స్టార్టప్లో చేరాను. అప్పుడే ఓ అద్భుత ఘటన జరిగింది. ఆ సమయంలో నాకు కొడుకు పుట్టడంతో రెండేళ్లపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది. ఈ ఖాళీ సమయాన్ని ఎందుకు వినియోగించుకోకూడదని. నేను ఏం చేయాలనుకుంటున్నానో.. దాన్ని ఈ సమయంలో పూర్తి చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. విశ్రాంతి తర్వాత ఆక్టిక్స్ బయోలజిక్స్ సీఈవోతో చర్చించాను. అది 2005 సంవత్సరం. భారత్లో కంపెనీ ప్రారంభిస్తే సహకరిస్తానని ఆయనకు చెప్పాను. అప్పుడే నా ఆంట్రప్రన్యూర్షిప్ మొదలైంది. మనలో ఉన్న కోరికను బయటపెడితే.. బయటి ప్రజలు ఎవరైనా అద్భుత అవకాశాలు ఇవ్వొచ్చు. అవి మన కెరీర్కు రాచమార్గాలు కావొచ్చు.
యువర్ స్టోరీ: విద్యావేత్త అయిన మీకు వ్యవస్థాపక రంగ అనుభవం ఎలా అనిపించింది?
రూప: ఈ రంగాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోనే ఇది గొప్పదైన అనుభవం. కిందిస్థాయి నుంచి సంస్థను ఎలా ప్రారంభించాలన్న విషయాన్ని అక్కడ నేర్చుకున్నాను. నాది వన్ పర్సన్ ఆర్మీ. మార్కెటర్గా పనిచేయడం, సైంటిస్టుల నుంచి అకౌంటెంట్ల వరకూ అందరినీ నియమించుకోవడం నా పనే. దురదృష్టవశాత్తూ నా భర్త అమెరికాలోనే ఉండిపోవడంతో నేను కూడా తిరిగి అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇండియా-అమెరికా చక్కర్లు కొడుతూ ఉన్నాను.
యువర్స్టోరీ: ముంబై ఏంజిల్స్ సంస్థలో ఏంజెల్ ఇన్వెస్టర్గా ఎలా మారారు ?
రూప: 2010లో నేను ఇండియాకు పూర్తిగా షిఫ్టయ్యాను. 2006లో నేను ప్రారంభించిన సంస్థ, డీసీజీఐ నిబంధనల కారణంగా మూసేయాల్సి వచ్చింది. ఏం చేయాలా అని అప్పుడాలోచించాను. ఆ సమయంలో నా భర్త ముంబై ఏంజిల్స్ గ్రూప్తో కలిసి పనిచేస్తుండేవారు. కొన్ని సమావేశాల్లో తనతోపాటు పాల్గొనాల్సిందిగా ఆయన నన్ను కోరేవారు. అప్పుడు నాకు అనిపించేది.. టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మీటింగ్స్లో బయో, హెల్త్కేర్ రంగానికి చెందిన వ్యక్తికి ఏం పనుంటుందని. అయితే ఆ అనిశ్చితికి స్వస్తీ చెప్పి, సమావేశాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ముంబై ఏంజిల్స్కు హెల్త్కేర్ డీల్స్ను విశ్లేషించడం మొదలుపెట్టాను. భారత్లో అప్పుడప్పుడే హెల్త్కేర్ రంగం వేళ్లూనుకుంటుండటం నన్ను ఆకర్షించింది. అందుకే ముంబై ఏంజిల్స్కు డీల్స్ను విశ్లేషించిపెట్టాను. యోగాస్మోగా అనే సంస్థకు పెట్టుబడులు పెట్టించాను. ఆ సంస్థ మంచి లాభాలను ఆర్జించింది. హెల్త్కేర్, వెల్నెస్, ఫిట్నెస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టించడాన్ని నేను ప్రోత్సహించాను.
యువర్స్టోరీ: మీ వారు సంజయ్ నాథ్తో మీ అనుబంధం ఎలాంటిదో చెప్పండి ?
రూప: అలాంటి భర్త లభించడం నాకు నిజంగా అదృష్టం. నా కెరీర్ ఆరంభంలో ఆయన నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. బిట్స్ పిలానీ నుంచి బయటకు వచ్చి, 21 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సంస్థను ప్రారంభించారు. పీహెచ్డీ పూర్తిచేయకముందు నుంచి, ఆరేళ్లపాటు మేం ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్ అంటే సహచర్యం, నిజమైన భాగస్వామ్యం. పీహెచ్డీ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు నేను డిప్రెషన్కు లోనయ్యాను. పీహెచ్డీ నుంచి వైదొలగాలని అనుకున్నాను. ఆ సమయంలో సంజయ్ ఎంతో మద్దతుగా నిలిచారు. పీహెచ్డీని కొనసాగించేలా చూశారు. కొందరు మహిళలను వారి భర్తలు పీహెచ్డీలు చేయకుండా అడ్డుకున్న విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే భార్యలు ఎక్కువ చదువుకుంటే పురుషులకు అవమానమని ఫీలవుతారు. అది పాతచింతకాయపచ్చడి ఆలోచన. అయితే కొందరు మంచి భర్తలు కూడా ఉన్నారనుకోండి. అలాంటి వారంటే నాకు ఎంతో గౌరవం. అదృష్టవశాత్తూ నాకు అలాంటి భర్తే దొరికారు. ప్రతి విజయవంతమైన మహిళ వెనుక.. మంచి మద్దతు ఇచ్చే భర్త ఉంటారన్నది నా ప్రగాఢ విశ్వాసం.
యువర్స్టోరీ: మీకున్న అనుభవాన్ని బట్టి వ్యాపార ప్రపంచంలోని మహిళల గురించి మీరు పరిశీలించిందేమిటి?
రూప: పురుషులతో పోలిస్తే, విభిన్న పనులు చేయడంలో మహిళలే ముందుంటారు. పనులను పూర్తిచేయడంలో మహిళలు సిద్ధహస్తులు. మహిళలు నాయకత్వం వహిస్తున్న కంపెనీలను చూడండి.. మీకే తెలుస్తుంది. మహిళలు వారి జీవితాన్నిచక్కగా సమన్వయం చేసుకుంటారు. మిగతావారిలా ఎక్కువ సమయం కేటాయించలేకపోయినప్పటికీ, మంచి ఫలితాలు రావడంలో మహిళల సాయం ఎంతో ఉంటుందని ఎన్నో సర్వేల్లో తేలింది. ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు. ఉపయోగపడే పని ఎంత చేసామన్నదే ముఖ్యం. ఉపయోగపడే పనిలో మహిళల కన్నా ఎవరూ ఎక్కువ చేయలేరు. వారికున్న సామర్థ్యాలపట్ల మహిళలు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థలో పెరిగిన కారణంగా కొందరు మహిళలు అభద్రతాభావంతో ఉంటారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు పట్టిన తర్వాత మహిళలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, ఆ పని చేసి తీరాలి. పురుషులు కూడా పెటర్నిటీ బ్రేక్ కావాలంటే మొహమాటం లేకుండా తీసుకోవాలి. మనను మనం తిరిగి ఉత్తేజితులను చేసుకునేందుకు విశ్రాంతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా విశ్రాంతి తీసుకున్న వ్యక్తులు జీవితంలో విజయవంతులైన ఎన్నో స్టోరీలను నేను చూశాను. అమెరికాలో చాలా కంపెనీలు సుదీర్ఘకాలంపాటు మెటర్నిటి, పెటర్నిటీ సెలవులను ఇస్తాయి. ఇండియా కంపెనీలు కూడా ఆ విధంగానే ముందుకెళ్లాలి.
యువర్స్టోరీ: ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రలో మీకు ఎలాంటి ఉత్సాహం కలుగుతుంది?
రూప: భారత్లో హెల్త్కేర్ ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం నాకు ఇష్టం. ఇప్పుడు భారత్ హెల్త్కేర్ టైమ్ బాంబ్పై కూర్చుని ఉంది. మన జీవనశైలీలో ఇప్పుడు ఎన్నోమార్పులు చోటుచేసుకుంటున్నయి. గతంలో కంటే ఇప్పుడు యుక్తవయసులోనే ప్రజలు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్లో సరైనన్ని వనరులు లేవు. తాగడానికి శుభ్రమైన నీరు లేని సమయంలో మల్టీ డాలర్ కంపెనీ పెట్టి ఉపయోగమేమిటి? నేను వినియోగదారుల రంగానికి వ్యతిరేకం కాను. కాని కొన్ని రంగాలపై వ్యవస్థాపకులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. నా వ్యక్తిగత సంపద ఎక్కువగా హెల్త్కేర్, వెల్నెస్, ఎనర్జీ రంగాల్లోనే పెట్టుబడి పెడుతున్నాను. మనం అనుభవించినదాని కన్నా మన పిల్లలు ఎక్కువ భద్రత, మెరుగైన జీవితాన్ని అనుభవించాలన్నదే నా ఆశ. హెల్త్కేర్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు సాయం చేయడాన్ని ఎంతో సంతోషిస్తాను.