ఒకప్పుడు జేబులో ఐదు వందల్లేవు.. ఇప్పుడు రెండున్నర కోట్ల జాక్ పాట్

ఐపీఎల్-10 వేలంలో అత్యధిక ధర పలికిన హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్

ఒకప్పుడు జేబులో ఐదు వందల్లేవు.. ఇప్పుడు రెండున్నర కోట్ల జాక్ పాట్

Tuesday February 21, 2017,

2 min Read

గల్లీ క్రికెటర్ స్థాయి నుంచి రంజీ క్రికెటర్ గా ఎదిగిన హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్ ఐపీఎల్ వేలంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. కళ్లు చెదిరే ధర దక్కించుకుని అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. 22 ఏళ్ల యువ హైదరాబాదీ కెరటం ఐపీఎల్-10 వేలంలో జాక్ పాట్ కొట్టాడు. ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లాంటి భారత క్రికెటర్లను వేలంలో పాడుకోవడానికి ఫ్రాంచైజీలు ముఖం చాటేసిన వేళ.. సిరాజ్ కు మాత్రం రెండు కోట్ల 60 లక్షల కళ్లు చెదిరే ధర లభించింది. ఒకే ఒక రంజీ సీజన్ అనుభవం కలిగిన సిరాజ్ ను భారీ మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. కర్ణ్ శర్మ తర్వాత ఐపీఎల్-10 వేలంలో అత్యధిక ధర పలికిన రెండో దేశవాళీ క్రికెటర్ సిరాజ్.

image


సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్.. 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ తన కుంటుబాన్ని పోషిస్తున్నాడు. తల్లి షబానా బేగం. గృహిణి. మాసాబ్ ట్యాంక్ దగ్గర ఫస్ట్ లాన్సర్ లో ఓ చిన్న అద్దె ఇల్లు వీరి నివాసం. అకాడమీలకు వెళ్లి కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. గల్లీ క్రికెట్ తో కెరీర్ ప్రారంభించాడు. ఆరంభంలో అందరిలాగే బ్యాట్ పట్టాడు. ఆ తర్వాత బౌలింగ్ పై ఇంట్రస్ట్ పెంచుకున్నాడు. టెన్నిస్ బాల్ క్రికెటర్గా అందరినీ ఆకట్టుకున్నాడు. చక్కని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లతో అబ్బుర పరిచాడు. అతని ప్రతిభను గుర్తించిన చార్మినార్ క్రికెట్ క్లబ్.. తమ జట్టు తరపున ఆడే అవకాశాన్ని కల్పించింది.

బౌలింగుకు ఎప్పటికప్పుడు మెళకువలు నేర్చుకుంటూ లీగ్స్ లో వికెట్ల పంట పండించిన సిరాజ్.. 2015-16 రంజీ సీజన్లో తొలిసారి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2015 నంవబర్ లో సర్వీసెస్ పై రంజీ అరంగేట్రం చేశాడు. తొలి రంజీ సీజన్ లోనే 41 వికెట్లు పడగొట్టి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. ఆ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా నిలిచాడు. అదే రంజీ సీజన్లోనే ముంబైపై రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇరానీ ట్రోఫీలో రెస్టాప్ ఆఫ్ ఇండియా తరపున ఆడే అవకాశం లభించింది.

హైదరాబాద్ రంజీ జట్టులో కీ రోల్ పోషిస్తూ ప్రధాన బౌలర్ గా ఎదిగిన సిరాజ్… భారత జట్టు తలుపు తట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. గల్లీ క్రికెట్ స్థాయి నుంచి ఐపీఎల్ స్టేజ్ కు చేరిన సిరాజ్.. టీమిండియాలో చోటు సంపాదంచడమే తన లక్ష్యం అంటున్నాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీని ఔట్ చేయాలని ఉందంటున్నాడు.

అన్నట్టు ఇంతకాలం ఆటోనడిపి ఇంటిని పోషించిన నాన్నకు మంచి ఇల్లు కొనివ్వాలనుకున్నట్టు చెప్పాడు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయకుండా ఆటలేంట్రా అని ఎప్పుడూ ఆవేదన చెందే అమ్మ కళ్లలో.. ఇప్పుడు కనిపిస్తున్న ఆనందాన్ని ఎంతిచ్చినా కొనలేం అంటున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్, డేవిడ్ వార్నర్ తో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకోవడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడీ హైదరాబాదీ యువకిశోరం.