కల నుంచి కార్యాచరణవైపు నందితా శెట్టి పయనం

నందిత శెట్టి..! భారతీయ యువతకు స్ఫూర్తిదాయక మైన వ్యక్తి. ఈమె, భారతదేశ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు.. బోస్టన్ లోని విశిష్టమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి స్వదేశం చేరారు. ఆమెకు, బొస్టన్ లోని హార్వర్డ్ యూనివర్శిటీ అనుబంధ మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలో అద్భుతమైన పరిశోధన అనుభవం ఉంది. అయితే.. తన దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో నందిత ఉత్కృష్టమైన ఉద్యోగాన్ని వదిలేసి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి.. దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ లో తన పేరును నమోదు చేసుకున్నారు. భారత పునర్నిర్మాణం దిశగా సంస్థ స్థాపనకు ఒప్పించారు.

కల నుంచి కార్యాచరణవైపు నందితా శెట్టి పయనం

Wednesday April 01, 2015,

5 min Read

నందిత తన మనోభావాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు.

నందితా శెట్టి

నందితా శెట్టి


ప్ర : మీ విద్యార్హతల గురించి చెప్పండి

జ : ప్రధానంగా నాకు ఆరోగ్యపరిరక్షణ అంశంపై ఆసక్తి ఎక్కువ. అయితే.. నేను ఒక్కదానికే పరిమితం కాకుండా.. రకరకాల అంశాలను అధ్యయనం చేశాను. మెడికల్ ఎలెక్ట్రానిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక, నేను బెంగళూరులోని ఫిలిప్స్ మెడికల్ సిస్టమ్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరాను. ఏడాది తర్వాత, ఆ ఉద్యోగం విసుగనిపించింది. దాంతో టెక్సాస్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో ఆర్&డి, మెదడు అంశాలపై చాలా ఆసక్తిని కనబరిచేదాన్ని. నా పిజి పూర్తయ్యాక, బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్శిటీ అనుబంధ, మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలో న్యూరోమేజింగ్ పరిశోధకురాలిగా పనిచేశాను. చిత్రాలు, కంప్యూటర్ ఆధారిత విధానాలను ఉపయోగించుకుని, మెదడు అభివృద్ధి, పనితీరులను పరిశోధించేదాన్ని. పిల్లల్లో మెదడు పగటి కలలు కనడంలో పిల్లల మెదళ్ళకు, పెద్దవారి మెదళ్ళకు ఉన్న తేడా ఏంటో అర్థం అయ్యేది. ఎంజిహెచ్ లో, కటింగ్ ఎడ్జ్ ఇమేజింగ్ టెక్నాలజీ లాంటివి కనుకొన్న ప్రపంచ అత్యుత్తమ శ్రేణి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఇక్కడ పనిచేసిన అనుభవం, సమస్యలను చూసే కోణం, నా ఆలోచన తీరును పూర్తిగా మార్చేసింది. ఎంజిహెచ్ లో ఐదేళ్ళు పనిచేశాక, మరోసారి విసుగు మొదలైంది. ప్రస్థానాన్ని మరో దిశగా కొనసాగించాలని అనిపించింది. వెంటనే, గ్రామీణ ప్రాంత సమస్యల మూలాలను కనుగొని.. వాటి పరిష్కారం కోసం నాదేశానికి తిరిగి వచ్చాను. ఉత్తర ప్రదేశ్ లోని మారు మూల ప్రాంతంలోని ఓ గ్రామంలో పర్దాడ పర్దాడి ఎడుకేషనల్ సొసైటీలో ఓ సంవత్సరం పాటు వాలంటీరుగా పనిచేశాను. ఆ తర్వాత, హార్వర్డ ప్రొఫెసర్ ఒకరు... ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించిన బయోటెక్ ఇన్విక్టస్ ఆంకాలజీలో చేరాను. ఇక్కడ బిజినెస్ డెవలెప్ మెంట్ మేనేజర్ గా పనిచేశాను. ఏడాది తర్వాత, 2013లో, స్టాన్ ఫోర్డ్ ఐనైట్ పరిచయంతో.. కథ సరికొత్త దిశకు తిరిగింది.

ప్ర : మిమ్మల్ని బోస్టన్ నుంచి భారత్ కు రప్పించిన కారణాలేంటి.? పారిశ్రామికరంగం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది..?

జ : నిజానికి అదొక హఠాత్పరిణామం. నేను చేసే ప్రతి పనినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. అయితే.. నా ప్రతి పనీ.. నేరుగా రోగులు లేదా ప్రజలపై ప్రభావం చూపాలని కోరుకుంటాను. అభివృద్ధి రంగాల్లో పనిచేయాలన్న ఆలోచన ముందు నుంచీ ఉండేది. అందుకే.. ఎక్కడ, ఎప్పుడు అవకాశం దొరికినా.. అభివృద్ధి రంగాల్లో నాకు తోచినంత పని చేసే దాన్ని. ఉత్తర ప్రదేశ్ లోని అనూప్ షార్ కేంద్రంగా పనిచేసే పర్దాడ పర్దాడి ఎడుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు వీరేందర్ (శ్యామ్)సింగ్ తో.. ఎంఐటి_ఇండియా క్లబ్ లో ఓసారి మాట్లాడ్డం తటస్థించింది. అప్పుడు ఆయనతో మాట్లాడిన అరవై నిమిషాల్లో.. దుపాంట్ దక్షిణాశియా విభాగపు హెడ్.. రిటైరయ్యాక స్వగ్రామానికి తిరిగొచ్చి.. సమాజపు మారుతున్న అవసరాలను తీర్చే విధంగా.. విధివిధానాలు, లక్ష్యాలు నిర్దేశించుకుని స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన విధానం.. నన్ను ఉత్తేజ పరిచింది. అప్పుడే నేను ఆ సంస్థలో ఏడాదిపాటు వాలంటీర్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. శ్యామ్ తో సమావేశమయ్యాక నాలుగు నెలలకు, బోస్టన్ లో నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి.. ఉత్తర ప్రదేశ్ లోని సమస్యాత్మక జిల్లాను చేరుకున్నాను. అక్కడి మారుమూల గ్రామంలో జీవిస్తూ.. సమాజాన్ని పేదరికం ఎంతలా వేధిస్తుందో తెలుసుకోగలిగాను. స్థానికులతోను, విద్యార్థులతోను కలిసి పనిచేయడం, నా పని ప్రభావం వారిపై కనిపించడం.. నాకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేసింది.

ప్ర : స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ లో చేరాలన్న ఆకాంక్ష ఎలా కలిగింది..?

జ : పర్దాడా పర్దాడీ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఏడాది సేవను అందించాక, ఢిల్లీకి చెందిన ఇన్విట్టస్ ఆంకాలజీ - బిజినెస్ డెవలప్ మెంట్ (BD) లో చేరాను. సైన్స్ కు సంబంధం లేని ఆ పనిని నేను చాలా ప్రేమగా చేశాను. రకరకాల టోపీలు ధరించి, సహోద్యోగులతో తెరిపి లేని మేథోమధన సదస్సుల్లో పాల్గొనడం ఎంతో ఉత్తేజ భరితంగా సాగేది. ఆ ఏడాది మధ్యలో స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ లో అవకాశం లభించింది. నా నైపుణ్యానికి కొంతైనా సానపట్టే అవకాశంగా దాన్ని భావించాను. నా మేధస్సును ఎలాగైతే పదును పెట్టాలనుకున్నానో అదేవిధంగా దాని ప్రణాళిక ఉంది. ఇదే స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసేందుకు దోహదం చేసింది.

ప్ర : ఆ తర్వాత మీరేమి చేశారు..?

జ : స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్.. నాలోని భిన్న పార్శ్వాలను, విభిన్న అనుభవాలను రంగరించి, సరికొత్తగా, నిర్మాణాత్మకంగా ఆలోచించడం ఎలాగో నేర్పింది. కార్యక్రమ వర్గీకరణ ఎంతో భిన్నమైనదని చెప్పాలి. అది ప్రతి ఒక్కరి ఆలోచనా రీతులను, విభిన్న కోణాల్లో తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. మొదట్లో కోర్సు వివరాలు చూడగానే.. మనం వేరే సబ్జెక్టులు ఎంచుకొంటే సరిపోతుందేమో అన్న భావన వచ్చింది. అయితే.. కోర్సులో చేరాక, ఎప్పుడూ అలా అనిపించలేదు. స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన నిష్ణాతులైన ఎంబిఏ అధ్యాపకులతో మాకు బోధనను ఇప్పించారు. దీంతో విషయాల మీద మంచి పరిజ్ఞానం ఏర్పడింది. వ్యాపర రంగంలోకి దిగాలని భావించే వారికోసం.. కోర్సులో భాగంగా రూపొందించిన ప్రణాళిక అద్భుతంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసిది.

ప్ర : మీ ప్రయత్నం గురించి మరింత చెప్పండి...?

జ : నేను పనిచేస్తున్న స్టార్టప్ నేరుగా స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందే. తరగతి గదిలో ఓ నిమిషం పాటు వినిపించిన టీమ్ ప్రాజెక్టే తర్వాతి రోజుల్లో పూర్తి స్థాయి వెంచర్ గా రూపాంతరం చెందింది. నేనిప్పటికే చెప్పినట్లు త్వరలో ఆహార రంగానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నాను. ఇది ఆహారపు అలవాట్లు, భోజనానంతరం తృప్తికి సంబంధించిన సరికొత్త విధానాలతో రాబోతోంది. త్వరలోనే దీన్ని ఎన్.సి.ఆర్. పరిధిలో ప్రారంభించాలనుకుంటున్నాము. స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రాజెక్టులో నాకు మెంటర్ గా ఉన్న ఆ సంస్థ పాత విద్యార్థి రోహన్ రాజ్ ఘరియా, అప్పట్లో నా సహాధ్యాయిగా ఉన్న వసంత్ కామత్ లు.. ప్రస్తుత నా ప్రాజెక్టుకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

ప్ర : మీ అంతిమ లక్ష్యం ఏంటి..?

జ : స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ తర్వాత నా ఆలోచన సరళి మెరుగైంది. నా పనితరు, ఆలోచనల సరళిలు ప్రజలను ఉత్తేజ పరచాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నాను. నా అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేను. అయితే నేను చేయదలచుకున్న ప్రతి పనినీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. అర్థవంతంగా చేయాలని భావిస్తున్నాను.

ప్ర : స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించే వారికి మీ సలహా ఏంటి..?

జ : స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ చేసిన ఎవరినైనా అడగండి. కచ్చితంగా నా భావాలతోనే ఏకీభవిస్తారు. ఆ ప్రోగ్రామ్ మిమ్మల్ని.. మీ ఆలోచనా సరళిని సమున్నతంగా నిలుపుతుంది. మీ ఆలోచనను క్లాస్ రూమ్ నుంచి వ్యాపారం దిశగా ఎలా మళ్ళించాలి..? అసలు మీరు వ్యాపార సంస్థగా ఎలా ఎదగాలి.. ? లాంటివన్నీ కోర్సు రూపంలో విశ్లేషిస్తారు. స్టాన్ ఫోర్డ్ ఐనైట్ తో అనుబంధం.. ఓ అద్భుతమైన అనుభూతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇక్కడ నేనొక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రోగ్రామ్ లో భాగంగా.. తరగతి గదులు, సెషన్స్ కే కాదు.. అసైన్ మెంట్లు, ప్రాజెక్టు వర్క్ లకూ.. కచ్చితంగా అత్యధిక సమయాన్ని కేటాయించేందుకు సిద్ధపడితేనే.. అక్కడ సత్ఫలితాలు సాధ్యపడతాయి.

స్టాన్ ఫోర్డ్ ఐనైట్ గురించి :

స్టాన్ ఫోర్డ్ ఐనైట్ ప్రోగ్రామ్ ఈనెలలో బెంగళూరులో ఉంటుంది. మార్చి 6వ తేదీనుంచి మే 24 వరకు, ప్రతి శుక్రవారం సాయంత్రం, శని, ఆదివారాల్లో పూర్తిగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది టెక్నికల్ ప్రొఫెషనల్స్ ను, నవ్య ఆవిష్కర్తలను, కొత్త వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. గతంలో మేనేజ్ మెంట్ విద్యకు సంబంధం లేని గ్రాడ్యుయేట్లకు, పోస్ట్ డాక్టొరల్ స్కాలర్స్, ఇంజనీర్లు, సైంటిస్టులను కూడా లక్ష్యంగా చేసుకొని బెంగళూరు స్టాన్ ఫోర్డ ఐనైట్ కార్యక్రమం రూపొందించారు. ప్రోగ్రామ్ లో చేరే కొందరికి నిబంధనలను అనుసరించి ఫెలోషిప్స్ కూడా అందిస్తారు. స్టాన్ ఫోర్డ్ ఐనైట్, బెంగళూరులో చేరేందుకు ఆసక్తి కలవారు, తొలి విడతలో 2014 అక్టోబర్ 7వ తేదీ లోగా, రెండో విడతలో అక్టోబర్ 21వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

(ఈ కథనాన్ని స్టాన్ ఫోర్డ్ ఐనైట్ సహకారంతో అందిస్తున్నాము. )