క్లాస్ రూం చదువులను మారుస్తూ.. కోట్లు కూడబెడ్తున్న ఎడ్యుకేషన్ స్టార్టప్స్

పిల్లలున్న ప్రతి తల్లితండ్రులూ మొట్టమొదట ఆలోచించేది వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడం గురించే. మరి అందుకు ప్రధానంగా కావాల్సింది నాణ్యమైన విద్య. పట్టణాల వరకైతే నాణ్యమైన బోధనకు ఇబ్బంది ఉండదు. 70శాతం వరకూ గ్రామీణ ప్రాంతమే ఉన్న భారత దేశంలో నాణ్యమైన విద్య అంటే ఓ కలే. భారత దేశంలో ఉన్న ఈ లోపాన్నే తమ విజయానికి మెట్లుగా మార్చుకుని స్టార్టప్‌లు మిలియన్ డాలర్లతో సరికొత్త వ్యాపార విప్లవానికి తెరతీస్తున్నాయి.

క్లాస్ రూం చదువులను మారుస్తూ.. కోట్లు కూడబెడ్తున్న ఎడ్యుకేషన్ స్టార్టప్స్

Monday September 21, 2015,

2 min Read

డిజిటల్ హంగులతో విద్యార్ధులకు సులభమైన, ఆధునిక పద్ధతుల్లో విద్యను బోధించడమే కాదు... కోట్ల రూపాయల వ్యాపారాన్ని కూడా ఆర్జిస్తున్నాయి. కొత్త స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార రుణాలను అందించేందుకు యునిటస్ సీడ్ ఫండ్ (USF) ముందుకొచ్చింది. కేవలం విద్యారంగం నుంచే ఈ ఏడాది ఇప్పటి వరకు 17 శాతం దరఖాస్తులు వచ్చాయంటే....ఈ రంగంలో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఇది 13శాతం వృద్ధి అని USF చెబ్తోంది. ఒక్క ఏప్రిల్‌లోనే విద్యారంగానికి సంబంధించి కొత్త స్టార్టప్‌లు ఏకంగా 260 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. నాణ్యమైన విద్యకు సంబంధించి భారత దేశంలోని లోపాలనే మెట్లుగా చేసుకుని కొత్త ఔత్సాహిక వ్యాపారవేత్తలంతా ఈ రంగంపై కర్చీఫ్ వేసేస్తున్నారు.

డిజిటల్ క్లాస్ రూమ్

డిజిటల్ క్లాస్ రూమ్


స్టూడెంట్స్, టీచర్స్‌తో పాటు పేరంట్స్

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ విప్లవం పెరిగిపోవడంతో ఈ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోవడమే కాదు.. లాభాల విషయంలోనూ సదరు కంపెనీలు లక్షలను కళ్ల జూస్తున్నాయి. దేశంలో నాణ్యమైన విద్య అందించలేని ప్రాంతాలను ఎంచుకుంటున్న కంపెనీలు అక్కడి స్కూళ్లతో అవగాహన కుదుర్చుకుంటున్నాయి.

ఉపాధ్యాయులు, విద్యార్ధులు, అవసరమైతే వారి తల్లితండ్రులను ఆన్ లైన్ ద్వారా ఒకే వేదిక మీదకు చేర్చి అత్యాధునిక పద్ధతుల్లో విద్యను బోధించడం, సలహాలు ఇవ్వడం, ఉన్నత విద్యకు సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ కంపెనీల ప్రధాన వ్యాపార మార్గం.


యాప్స్‌తో చదువులు

విద్యార్ధులు ఎక్కువగా భయపడే మేథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టి పెడుతూ సులభ సూత్రాలు, గేమింగ్ పద్ధతులు, డాష్ బోర్డుల ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. ఈ క్రమంలో బోధనకు సంబంధించి ఆధునిక టెక్నాలజీతో కూడిన సరికొత్త యాప్‌లను కూడా తయారు చేస్తున్నాయి. LabInApp, Simplilearn, Toppr, Embibe, GetSetSorted, Vedantu, Fedena, Curiositi లాంటి స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా ఇప్పటికే తమ వ్యాపారాన్ని ప్రారంభించి గణనీయమైన ఫలితాలను పొందుతున్నాయి. ఇందులో Simplilearn ఏకంగా వంద కోట్ల రూపాయలు, Toppr సంస్థ 65 కోట్ల రూపాయలను, ఎంబైబ్ రూ.25 కోట్లను, వేదంతు రూ.30 కోట్లను పెట్టుబడిగా పొందాయి.

విద్యారంగంలో ఉన్న ఈ డిమాండ్‌ను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యునిటస్ సీడ్ ఫండ్(USF)... వ్యాపార సలహాలను అందించే కంపెనీ Sylvantతో అవగాహన కుదుర్చుకుంది. దీని ద్వారా ఈ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించిన వారికి మెంటార్‌లు గా వ్యవహరించడమే కాదు... ఔత్సాహికులకు భవిష్యత్తు గురించి ప్రచారం కూడా ప్రారంభించాయి. వీరి కృషి ఫలించి విద్యారంగంలో స్టార్టప్‌ల కోసం ఏకంగా 106 దరఖాస్తులు వచ్చాయి. తాము ఆశించిన దాని కన్నా ఇది రెట్టింపు సంఖ్య అని USF చెబ్తోంది. ఇందులో దక్షిణ భారత దేశం వాటా 52 శాతం కాగా, ఐటీ సిటీ బెంగళూరు నుంచి భారీగా 26 దరఖాస్తులు వచ్చాయి. విద్యారంగంలో స్టార్టప్‌ల భవిష్యత్తుకు ఈ స్పందనే నిదర్శనం అని USF విశ్లేషిస్తోంది. రాబోయే రోజుల్లో విద్యారంగంలో స్టార్టప్‌ల ఏర్పాటు విప్లవంలా మారవచ్చని సంస్థ అంచనా వేస్తోంది.

సవాళ్లు అధిగమిస్తూ...

అయితే డిజిటల్ రంగంలో కొన్ని అవరోధాలను కూడా అంచనా వేసింది. స్కూళ్లు, విద్యాసంస్థలను తమ వైపు ఆకర్షించడం, తరగతి బోధనకు అలవాటు పడ్డ భారత్‌లో డిజిటల్ ఎడ్యుకేషన్ ను అలవాటు చేయడం ప్రధాన సవాలుగా భావిస్తున్నారు. అయితే ఇవి చిన్న చిన్న సమస్యలే అని టెక్నాలజీకి అనుగుణంగా పదేళ్లలో భారత్‌లో వచ్చిన మార్పును చూసుకుంటే వీటిని అధిగమించడం తేలికే అంటూ కంపెనీ ధీమాగా చెబుతోంది.


Image credit - Shutterstock