మహిళల హక్కులకోసం పోరాడుతున్న లలితా కుమారమంగళం

‘‘వివిధ సహాయాల కోసం వచ్చే నిస్సహాయ మహిళలకు నా ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయి’’ అంటారు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం. మహిళా సాధికారిత, అత్యాచారాలు, కుటుంబ హింస వంటి అనేక అంశాలపై కుమారమంగళం తన అనుభవాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు.

మహిళల హక్కులకోసం పోరాడుతున్న లలితా కుమారమంగళం

Wednesday May 20, 2015,

4 min Read

మగవాడి దృక్పథంలో ముందుగా మార్పురావాలి. పోలీస్ స్టేషన్లలో పాతుకుపోయిన అవినీతి వల్ల వేలాదిమంది మహిళలు అక్కడికెళ్ళి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు అంటారు కుమారమంగళం.

‘‘సమాజంలో ఇంచుమించు ప్రతి మహిళ ఏదో ఒక విధమయిన హింసకు గురవుతూనే ఉంది. అది గృహహింస, అత్యాచారం లేదా అదనపుకట్నం కోసం వేధింపులు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇలాంటివి చాలా చూశానంటారు ఆమె.

గత ఏడాది లలితా కుమారమంగళం లేవనెత్తిన అంశం పెద్ద చర్చకే దారితీసింది. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయడం వల్ల వారి జీవితాన మార్పులు వస్తాయనేది ఆమె ఆలోచన. లైంగిక వ్యాధులు, హెచ్‌ఐవీ, మహిళల అక్రమ రవాణా అనేవి తగ్గుతాయని ఆమె వివరించారు.

లలితా కుమారమంగళం, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

లలితా కుమారమంగళం, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్


కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడ్డం ఆమెకి చిన్నప్పటి నుంచీ అలవాటు. రోజురోజుకీ మహిళలపై పెరిగిపోతున్న దాడులు, అత్యాచారాలు తగ్గుముఖం పట్టాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలి. అలా చేసినప్పుడే మహిళలకు కాసింత భద్రత దొరుకుతుంది. పోలీసుల్లోనూ జవాబుదారీతనాన్ని పెంచాలంటారు లలిత కుమారమంగళం.

‘‘మహిళలు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా వారిని స్వయంగా కలవడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మహిళలు ముఖ్యంగా బాధ, హింసకు గురయినవారు తమ మాటలు ఎవరైనా వింటే బాగుండుననుకుంటారు. మా ఇంటి తలుపులు ఈ విషయంలో ఎప్పుడూ తెరిచే ఉంచుతాను. ఎందుకంటే ఏ మహిళకు ఎప్పుడు ఏ సాయం కావాలో వారికి తెలీదు.

లలిత తమిళనాడులో పుట్టారు. తండ్రి మోహనకుమారమంగళం రాజకీయ నాయకులు. ఈమె తాత పి.సుబ్బరాయన్ మద్రాసు ప్రెసిడెన్సీకి సీఎంగా చేశారు. లలిత తల్లి కళ్యాణి ముఖర్జీ పశ్చిమబెంగాల్ సీఎం అజయ్ ముఖర్జీకి మేనత్త. అంతేకాదు ప్రముఖ రాజకీయవేత్త రంగరాజన్ కుమార మంగళానికి సోదరి కూడా.

న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో ఎకనామిక్స్ చదువుకున్న లలిత మద్రాసు వర్శిటీనుంచీ ఎంబీయే పట్టా పుచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఆమె పోటీచేశారు. అయితే రెండు ఎన్నికల్లో విజయం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. సోదరుడు కుమారమంగళం చనిపోవడంతో ఎన్నికలకు వెళ్ళకతప్పలేదు. వివిధ వ్యాపకాలతో బిజీగా ఉండే లలితా కుమారమంగళం ప్రకృతి పేరుతో ఓ స్వచ్ఛంధసంస్థను కూడా నడుపుతున్నారు.

మహిళల స్థితిగతులు, గౌరవప్రదమయిన జీవితం లభించాలంటే ముందుగా మారాల్సింది మగవాళ్ళ ప్రవర్తనే అంటారు కుమారమంగళం. yourstory.com తో ఆమె ఎన్నో విషయాలు పంచుకున్నారు.

జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా మీముందున్న సవాళ్ళు, కర్తవ్యాలేంటి అని అడిగినపుడు... "మహిళలపట్ల మగవారి దృక్పథంపైనే సమాజ గతి ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల అణచివేత ధోరణితో మహిళలు ముందుకు రాలేకపోతున్నారు. కుటుంబంలోని స్త్రీలు అణకువగా, క్రమశిక్షణగా ఉండాలని మన పెద్ధలు భావించారు. ఇప్పటికీ ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. స్వతంత్ర భావాలు, విద్య, సామాజిక గౌరవం మహిళలకు ఉండాలి. ఇప్పుడిప్పుడే మగవారి మైండ్‌సెట్ మారుతోంది. ఆడపిల్లలకు విద్య అనవసరం అనే భావన మనవారిలో చాలాకాలం పాటు ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే ఈ భావనా తొలగుతోంది. ప్రతి ఇంట్లో ఆడపిల్లల విద్యపై అవగాహన పెరగాలి. మగపిల్లలతో సమానంగా విద్య నేర్పించాలి. వివిధ వృత్తిపరమయిన విషయాల్లో మహిళలకు అవగాహన, శిక్షణ కలిగించాలి"-లలితా కుమారమంగళం

image


బీజేపీ అధికార ప్రతినిధి స్థాయి నుంచి మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా మారాక లైఫ్‌స్టయిల్‌లో వచ్చిన మార్పులపైనా ఆమె వివరించారు. " ప్రధానమంత్రి మోడీ ప్రతిపాదన తర్వాత నాకు ఈ పదవి లభించింది. అంతకుముందు నేను బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండేదాన్ని. నేనెప్పుడూ ఓ ప్రత్యేకమయిన బాధ్యతల కోసం ఎదురుచూస్తుంటాను. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో ఎకనామిక్స్ (ఆనర్స్) పూర్తిచేసిన నేను మద్రాసు యూనివర్శిటీ నుంచి ఎంబీయే చేశాను. దక్షిణాదికి చెందిన నేను 13 ఏళ్ళ నుంచీ ఇక్కడే ఉంటున్నాను. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మా నాన్నగారు మంత్రిగా కూడా పనిచేశారు. నా చిన్నప్సుడే విమాన ప్రమాదంలో నాన్నగారు చనిపోయారు. నా స్కూల్ డేస్ తర్వాత ఎంబీయే పూర్తిచేసి అశోక్ లేలాండ్‌లో పనిచేశారు. 1991లో ట్రావెల్ ఇండస్ట్రీలోకి వచ్చాను. హెచ్‌ఐవీ ఎయిడ్స్ రోగుల సహాయం కోసం ఓ స్వచ్ఛంధ సంస్థను కూడా స్థాపించాను. మహిళా కమిషన్‌లోకి వచ్చాక మహిళా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కలిగిందని" చెప్పారు లలితా కుమారమంగళం

తనను బాధించిన సంఘటనల గురించి చెబ్తూ "మా నాన్నగారి మరణం తర్వాత నేను బాగా బాధపడింది మా అన్నయ్య గురించి. వాజి్పేయు మంత్రిమండలిలో చురుకైన పాత్ర పోషించిన మా అన్నయ్య అకస్మాత్తుగా చనిపోవడం నన్ను బాగా ఇబ్బందిపెట్టింది. నా పదవినీ, నా హోదాని ఎప్పుడూ విచ్చలవిడిగా వాడాలని అనుకోను. మనకున్న పవర్‌తో ప్రజలకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నించాల"ని చెప్పారామె. తనను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులుగా... తన అత్తయ్య సీపీఐ ఎంపీ పార్వతీ కృష్ణన్ అంటే ఎంతో ఇష్టమని చెబ్తారు. పురుషాధిక్య సమాజంలో ఆమె మూడుసార్లు ఎంపీ కాగలిగారామె. అత్తయ్య నుంచీ తానెన్నో విషయాలు నేర్చుకున్నానంటారు. అలాగే ఎంపీ గీతాముఖర్జీని కూడా ఎంతగానో గౌరవిస్తానంటారు. అలాగే తానంటే ఏంటో తనకు బాగా తెలుసు. ఇతరులను పోటీగా తీసుకుని టెన్షన్ పడడం ఇష్టం ఉండదంటారు లలితా కుమారమంగళం. ఇంట్లో తానే పెద్ద రోల్‌మోడల్ నంటారు.

జాతీయ మహిళా కమిషన్‌కి ఉన్న అధికారాలను సక్రమంగా వినియోగిస్తే సరిపోతుందంటారు లలితా కుమారమంగళం. దురదృష్టవశాత్తూ మనదేశంలో మహిళా శిశుసంక్షేమశాఖ అంటే చిన్నచూపు. ఆ శాఖ పరిధిలోని జాతీయ మహిళా కమిషన్‌ని అంతగా పట్టించుకోవడం లేదు. సామాజిక బాధ్యతను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాటించాలి. ముఖ్యంగా శిశుమరణాలు తగ్గించడం, మహిళలపై వేధింపులు లేకుండా చూడాలి. అలాగే మోడీ ప్రభుత్వం చేపడుతున్న మహిళా పథకాలపై తన అభిప్రాయం చెప్పారామె. "గతంతో పోలిస్తే మోడీ ప్రభుత్వం మహిళా సాధికారిత పట్ల స్పష్టమయిన అభిప్రాయం కలిగి ఉంది. భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం ఎంతో ఉన్నతమయింది. మహిళల భద్రతకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. పెట్రోలియం ధరల పెరుగుదలపై ఉన్న శ్రద్ధ సామాజిక బాధ్యతపై ఉండడం లేదు. రాజకీయ నేతలు ఈ విషయం ఆలోచించాలి."

"స్వచ్ఛంధ సంస్థ కార్యకలాపాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. రాజకీయాల గురించి నేను ఆలోచించడంలేదు. ఇప్పటికే నేను 28 దేశాల్లో పర్యటించాను. 2002 నుంచి నేను వివిధ దేశాలకు వెళ్ళి వస్తూనే ఉన్నాను. బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నా పాత్రని సమర్ధంగా పోషించాలని భావిస్తున్నాను"- లలితా కుమారమంగళం

ఇక పిల్లల విషయానికొస్తే... పెద్దమ్మాయి లాయర్ . సెర్బియాలో పనిచేస్తోంది. మా చిన్నమ్మాయి జర్నలిస్టు. ఓ స్వచ్ఛంద సంస్థలోనూ పనిచేస్తోంది. ఢిల్లీలో ఉంటోంది. మహిళా సాధికారిత గురించి ఈవిడకు స్పష్టపమైన అభిప్రాయాలున్నాయి. విద్యారంగం, ఆర్ధికరంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వాలి. బ్రూణ హత్యలు జరగకుండా చూడాలని చెబ్తారు.

"ఎంతోమందికి నా జీవితం పాఠం లాంటిది. ఎందుకంటే మా తండ్రిగారు ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ప్రజాభిమానం ఉన్న నేతగా ఎదిగారు. నాకు పదిహేనున్నర ఏళ్ళు ఉన్నప్పుడే మా నాన్నగారు కాలం చేశారు. అయితే తండ్రి లేని బాధను మా అమ్మ నామదిలోకి రానీయలేదు. మా తల్లే లేకుంటే ఇప్పుడు మేం లేము. ఆమె ఎన్నో ఆధునిక భావాలున్న మహిళ. ఆడపిల్లలు ఎప్పుడూ ప్రగతి పథాన నడవాలంటారు మా అమ్మ. ఈ తరం అమ్మాయిలకు ధైర్యం కూడా ఎక్కువే."- లలితా కుమారమంగళం