మహిళలపై వేధింపులకు చెక్ పెట్టే 'సేఫ్సిటీ' యాప్
దేశంలో ప్రతీ 20నిమిషాలకో మహిళపై అత్యాచారంరేప్ కేసుల్లో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంటెక్నాలజీ సాయంతో మహిళలకు రక్షణ కల్పించే ప్రయత్నంఒక్క యాప్తో సకల ఇబ్బందులకూ చెల్లుచీటీ
Monday July 06, 2015,
6 min Read
మనదేశంలో మహిళా వేధింపులు రోడ్సైడ్ రోమియోలు, బస్సుల్లో వేధింపులు, కాలేజీల్లో ర్యాగింగ్లు, ఈవ్టీజింగ్లు ఎన్ని మార్గాలున్నాయో అవన్నీ మనదేశంలో జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం లాంటిది వచ్చినా అది సరిగా అమలు కావడం లేదు.
‘‘తాజా సర్వేల ప్రకారం మనదేశంలో ప్రతి 20 నిముషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. అమెరికా, ఆఫ్రికా ల తర్వాత ఈ విషయంలో మనదేశం మూడోస్థానంలో ఉందని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నివేదికే చెబుతోంది. అయితే ఇలాంటి రేప్ కేసులన్నీ నమోదు కావడం లేదు. అలాగే వీధుల్లో ఎంతమంది మహిళలు వేధింపులు, హింసకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అంటారు ఎల్సా మేరీ డిసిల్వా.
2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం మన దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అవాంఛనీయ ఘటనల్ని తెరమీదకు తెచ్చింది. ఈ ఘటన ముగ్గురు మహిళల్ని బాగా కదిలించిందనే చెప్పాలి.
ఉమెన్ మిషన్
ఎల్సా మేరీ డిసిల్వా, సూర్యా వెలమూరి, సలోని మల్హోత్రాలు ముగ్గురు ఓ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగేనాటికి వారు స్వీడన్లో ఉన్నారు. తమ కంపెనీకి సంబంధించిన కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్టుకి పనిచేస్తున్నారు. ఓ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో వారు పార్టిసిపేట్ చేశారు.
అనంతరం వారు ఢిల్లీకి తిరిగి వచ్చారు. అప్పటికే నిర్భయ ఉదంతంతో దేశంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి.
‘‘నిర్భయ సంఘటన దేశంలో ప్రతి మహిళనూ కదిలించింది. మహిళల కోసం ఏదైనా చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించాం. పురుషాధిక్య సమాజంలో పెరిగిపోతున్న హింసపై దృష్టి పెట్టాలనుకున్నాం’’ అంటారు ఎల్సా. అదే టైంలో సేఫ్సిటీ ఆలోచన తెరమీదికి వచ్చిందంటారు. మహిళలపై జరుగుతున్న హింసల్ని అంతా ఖండించాలి. ఫిర్యాదుచేయాలి’’ అంటారు ఎల్సా.
సేఫ్సిటీ
ఎల్సా, సూర్య, సలోనీలు ఐదురోజుల్లో సేఫ్సిటీ రూపకల్పన పూర్తిచేశారు. ఈ సేఫ్సిటీ యాప్లో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. జియోగ్రాఫిక్ ఇన్ఫోసిస్టమ్ (జీఐఎస్) తో పాటు మేపింగ్ /జియోస్పేటియల్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సదుపాయాలను ఇందులో పొందుపర్చారు. బాధితులు తమకు ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయో యాప్ ద్వారా తెలియజేయవచ్చు. బాధిత మహిళలు ఎక్కడ ఉన్నారో లొకేషన్తో సహా యాప్ నిర్వాహకులకు, సహాయ సిబ్బందికి తెలియచేస్తుంది. వెంటనే సహాయ సిబ్బంది వారికి ఏవిధంగా సహాయం చేయగలరో ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుంటారు.
సేఫ్సిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే చాలు. విద్య, ఉద్యోగం, వ్యక్తిగత అవసరాల కోసం బయటకు వెళ్లే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు. అత్యాచారం, లైంగిక దాడులు, హింస, ఈవ్టీజింగ్, అసభ్య ప్రవర్తన వంటి సంఘటనలను సమయం, ప్రాంతం ఆధారంగా యాప్ ద్వారా తెలియచేయవచ్చు. బాధిత మహిళలు సంబంధిత వ్యక్తుల ఫోటోలు, వారి చేష్టలకు సంబంధించిన వాటిని యాప్లో పంపించవచ్చు.
‘‘కొన్నికొన్నిసార్లు లొకేషన్లో ఉన్న మహిళలు చాలా రిస్క్లో ఉంటారు. అటువంటప్పుడు ఫోన్ చేసి తమ ఇబ్బందులను తెలియచేయడం కష్టంగా మారవచ్చు. అందుకే మేం మిస్డ్కాల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. 09015 510 510 నెంబర్కు మిస్ట్కాల్ ఇస్తే వెంటనే కాల్ డిస్కనెక్ట్ అయి మా కస్టమర్కేర్కు సమాచారం అందుతుంది. వెంటనే మా సిబ్బంది పోలీసులకు సమాచారం పంపిస్తారు’’ అని చెబుతున్నారు సేఫ్సిటీ నిర్వాహకులు ఎల్సా.
మీ భద్రత మీ చేతుల్లోనే
మహిళలు ఎక్కడైనా భద్రతతో నిర్భయంగా బతకాలన్నదే మా ఉద్దేశ్యం. వచ్చిన సమాచారాన్ని పదిమందికి అందచేయడం చాలా ముఖ్యం. అందుకే మేం యాప్కోసం ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ పెట్టాం. అంతేకాదు ఎస్ఓఎస్ టెక్నాలజీ కూడా వాడుతున్నాం. చిన్న సిగ్నల్స్ ద్వారా తమ ఇబ్బందులను తెలియచేయవచ్చు.
‘‘మీరు హోటల్లో ఉన్నా, రెస్టారెంట్లో టిఫిన్ తింటున్నా, సినిమా చూస్తున్నావాటి గురించి మీ మిత్రులను గానీ, వెబ్సైట్లో గానీ సమీక్షలు కోరుకుంటారు. అయితే మేం ఇలాంటి విషయాలను కూడా యాప్ ద్వారా మహిళలతో షేర్ చేసుకుంటాం‘‘ అంటున్నారు ఎల్సా.
సమాజంలో పెరిగిపోతున్న హింసను రూపుమాపేందుకు, గౌరవప్రదంగా, భయం లేకుండా మహిళలు జీవించేందుకు మా యాప్ ఎంతో తోడ్పడుతుందంటున్నారు ఎల్సా. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి అన్ని విషయాలను ప్రభుత్వ విభాగాలకు, స్వచ్ఛంద సంస్థలకు మేం తెలియచేస్తాం అంటున్నారు ఎల్సా. అంతేకాదు హింసకు వ్యతిరేకంగా తమవంతు సేవలు అందించేందుకు సాధారణ పౌరులకు కూడా అవకాశం ఇస్తున్నాం అని చెబుతున్నారు.
అనూహ్య స్పందన
సేఫ్సిటీ అనేది విస్తృతమైన నెట్వర్క్ కలిగిన మంచి ఫ్లాట్ఫాం లాంటిది. ఈ యాప్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మా నెట్వర్క్ భారత్తో పాటు నేపాల్లోనూ అందుబాటులో ఉంది. అలాగే యూరోపియన్ దేశాలు, అమెరికా, ఆఫ్రికా దేశాలనుంచి కూడా కొన్ని నివేదికలు వస్తున్నాయి అని చెబుతున్నారు ఎల్సా.
మనదేశంలో 50 నగరాల నుంచి 4వేలకు పైగా ఫిర్యాదులు మాకు అందాయి. అలాగే నేపాల్ నుంచి 5వందల ఫిర్యాదులు అందుకున్నాం. ఇప్పటివరకూ తమకు అందిన ఫిర్యాదులకు సంబంధించి డేటాబేస్ తయారుచేస్తున్నాం. ఈ రిపోర్టులను అధికారులకు అందచేస్తాం. ఈ తరహా సంఘటనలు ముందుముందు జరగకుండా ఉండేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందంటున్నారు ఎల్సా.
సవాళ్ళు, సమస్యలు
‘‘కేవలం ఒక యాప్ వల్ల, కొన్ని సంస్థల వల్ల సమాజంలో విప్లవాత్మకమయిన మార్పులు వస్తాయని తాము భావించడం లేదంటున్నారు ఎల్సా. ప్రతి పౌరుడి మైండ్సెట్ మారాలంటున్నారు. మనకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి అందరికీ తెలియచేయడం వల్ల సమాజంలో మహిళల పట్ల హింస, వేధింపులు తగ్గుతాయంటున్నారు.
ఢిల్లీ విషయానికి వస్తే కన్నాట్ప్లేస్, రోహిణి, ఓక్లా లో మహిళలపై హింస, వేధింపులు ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
కన్నాట్ప్లేస్లో మహిళలను టచ్ చేయడం, తమ చేష్టల ద్వారా అసభ్యంగా ప్రవర్తించడం వంటివి ఎక్కువగా ఉంటాయి. రోహిణి ప్రాంతంలో చైన్స్నాచింగ్లు, ఓక్లాలో కామెంట్లు చేయడం, మహిళల్ని సెల్ఫోన్ ఇమేజెస్ తీయడం వంటివి కనిపిస్తుంటాయి. ఇందులో పోలీస్ పెట్రోలింగ్ ద్వారా చైన్ స్నాచింగ్ కేసులను అరికట్టవచ్చు. మిగిలినవి ఆయా ప్రాంతాల్లో వేధింపులు చేసే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా నిర్మూలించవచ్చు.
కొంతమంది మహిళలకు తమను వేధిస్తున్నారనే విషయం చాలా కాలానికి గానీ అర్థం కాదు. తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును వెంటనే అవగాహన చేసుకోవడం. తమ హక్కులు, చట్టం ద్వారా తమకున్న రక్షణల గురించి సేఫ్సిటీ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాం అంటున్నారు ఎల్సా. ఇందుకోసం మా సేఫ్సిటీ టీం వర్క్షాపులు, సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాం అని చెబుతున్నారు ఎల్సా.
వివిధ వర్క్షాపులు, నివేదికల వివరాలను అందరికీ తెలియచేస్తోంది. మా వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని అంతా పొందవచ్చు. వర్క్షాపులు పెట్టమని అడిగితే మురికివాడలు, మధ్యతరగతి కుటుంబాల ఉన్నచోట కూడా మేం నిర్వహిస్తున్నాం.
సేఫ్సిటీ దగ్గరున్న డేటాకు ఎంతో విశ్వసనీయత ఉంది. వివిధ ప్రభుత్వ సంస్థలు ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు గోవా పోలీసులు నిరంతరం సేఫ్సిటీతో సంప్రదిస్తూనే ఉన్నారు. ప్రతి పదిహేనురోజులకు మా నివేదికలు వారికి అందచేస్తున్నాం.
మేం వర్క్షాపులు పెట్టినప్పుడు ఓ అమ్మాయి ఎంతో తెగువ చూపింది. పీవీఆర్ సినిమా హాళ్లో ఓ ఉద్యోగి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, త్రీడీ గ్లాసెస్ ఇచ్చేటప్పుడు అతని ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని కంప్లైంట్ చేసింది. దీంతో మేం ఆ ఫిర్యాదును పీవీఆర్ యాజమాన్యానికి పంపించాం. సంబంధిత హెచ్ఆర్ విభాగం వారు అతనిపై చర్యలు తీసుకున్నారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారని వివరించారు ఎల్సా.
- ద్వారకా ప్రాంతంలో కొంతమంది లా విద్యార్దులు ఆ ప్రాంతంలో మహిళల భద్రతకు సంబంధించి కొంత సర్వేచేసి ఆ డేటాను మాకు అందచేశారు. లా పరీక్షల అనంతరం వారు ఈ సర్వేలు చేపట్టారు.
- ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్ధులు ఢిల్లీలో సురక్షిత ప్రాంతాలు, ప్రమాదకరమయిన ప్రాంతాలుగా విభజిస్తూ ఒక డేటాను రూపొందించారు. ఈ డేటా మహిళలకు, ముఖ్యంగా మాకు ఎంతో ఉపయోగపడుతోందంటున్నారు ఎల్సా.
- లాల్కువాన్లో పోలీసుల సాయంతో మేపింగ్ సేఫ్టీకి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తెచ్చారు.
బ్రేక్త్రూ అనే ఎన్జీవో సంస్థ ఢిల్లీలో సేఫ్టీకి సంబంధించిన విషయాలతో ఓ డేటాను మాకు అందచేసింది. కొత్తగా ప్రచారం చేయడానికి కూడా తన సంసిద్ధతను వ్యక్తంచేసింది.
లైంగిక వేధింపులు, మానసిక హింస కు సంబంధించి నజ్గోపాల్ ఇండియాతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
టెక్నాలజీ సోషల్మీడియా
మారుతున్న సాంకేతిక విలువలు సమాజంలో చైతన్యాన్ని పెంచుతున్నాయంటున్నారు సేఫ్సిటీ నిర్వాహకులు. దీనికి తోడు సోషల్మీడియా సాయంతో ఎంతోమంది మహిళలు తమకు ఎదురవుతున్న వేధింపులను సమాజం దృష్టికి తెస్తున్నారు. మీరు నివసిస్తున్న వీధిలో మీకు వేధింపులు ఎదురవుతుంటే ఆ సమయం, ఆ లొకేషన్ వివరాలను అందరికీ షేర్ చేయాలి. ఇది మిగతా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి మిల్స్ ముంబైలో ఎంతోమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అయితే ఓ జర్నలిస్టు రేప్ తర్వాత గానీ ఆ విషయాలు బయటికి రాలేదు. పోలీసులకు కూడా అప్పటివరకూ ఆయా విషయాలు తెలియలేదు.
సోషల్మీడియా సాయంతో మేం ఇలాంటి విషయాలను అందరికీ తెలియచేస్తున్నాం. ఫేస్బుక్, వాట్పప్ల ద్వారా మా యాప్గురించి విస్తృత ప్రచారం చేస్తున్నాం. మహిళలు తమకు జరిగిన అన్యాయాలను యాప్ ద్వారా తెలియచేస్తున్నారు. మీడియా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మేం ముందుకెళుతున్నాం అంటున్నారు ఎల్సా.
సేఫ్సిటీ టీం
ఎల్సా ఈ సేఫ్సిటీ కోసం ఫుల్టైం వర్క్ చేస్తుండగా సలోని, సూర్యలు తమవంతుగా సేవలు అందిస్తున్నారు. ఎల్సా ముంబై. ఢిల్లీలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. మరో యాభై మంది నిబద్ధత కలిగిన వాలంటీర్లు వివిధ ప్రాంతాల్లో సేఫ్సిటీ కోసం పనిచేస్తున్నారు.
ఎల్సా ముంబైలో ఉంటున్నారు. ఆమె ఏవియేషన్ ప్రొఫెషనల్. గత 20 ఏళ్ళుగా జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఆమె పనిచేశారు.
‘‘మనం నివసించే పట్టణాలు, మహానగరాలు మహిళలకు భద్రత కలిగించేవిగా ఉండాలి. అలా లేనప్పుడు అవి ఎంత అభివృద్ధి చెందినా సమాజానికి ఉపయోగపడవు’’ అంటారు ఎల్సా.
ఇక సూర్య విషయానికి వస్తే ఆమె ఫ్యామిలీ ఎప్పుడూ నగరాలు తిరుగుతూ ఉంటుంది. ఆమె తండ్రి జాబ్ అలాంటిది మరి. ఆమె మాస్టర్స్ ప్రోగ్రాం కోసం 2004 లో ఆస్ట్రేలియా వెళ్ళింది. 10 ఏళ్ళుగా ఆమె జాబ్ చేస్తోంది.
‘‘మొబైల్ యాప్ను మరింత మందికి చేరువ చేయాలని ఎల్సా టీం భావిస్తోంది. ఈ ఏడాది లక్ష వరకూ తమకు ఫిర్యాదులు అందుతాయని ఆమె చెబుతోంది. ఈ ఫిర్యాదులను పోలీసులకు, ప్రభుత్వానికి అందచేసి మహిళలకు సేఫ్టీ కల్గించడమే లక్ష్యం అంటోంది ఎల్సా. వర్క్షాపులు నిర్వహించడం, సెక్షన్8 ద్వారా యాప్ని రిజిస్టర్ చేసి స్వచ్ఛంధ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించాలని ఆమె భావిస్తోంది.
సేఫ్టీయే ముఖ్యం
మహిళలు సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారా లేదా అనడానికి అక్కడున్న పరిస్థితులే నిదర్శనం అంటారు ఎల్సా. ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మహిళలు నిర్భయంగా తమ పనులు తాము చేసుకునే స్వేచ్ఛ కలిగించాలి. తల్లిదండ్రులు కూడా తమ ధోరణిని మార్చుకోవాలి. మగ పిల్లలు ఆడపిల్లల్ని, తమ తోబుట్టువుల్ని చూసినట్టుగా చూసేలా పెంచగలగాలి అంటారు ఎల్సా. మహిళలు తమ అనుభవాలను, తమ ఆవేదనను [email protected] ద్వారా ఎప్పుడైనా పంచుకోవచ్చంటున్నారు ఎల్సా.
సూర్య కూడా అదే అంటున్నారు. ‘‘నా కొడుకుని కూడా నేను మహిళల్ని గౌరవించేలా పెంచుతున్నాను. పురుషులు, పిల్లలు కూడా ఇలాంటి సంస్కృతికి అలవాటు పడేలా చేయాలి’’ అంటారు సూర్య. మహిళల భద్రత సామాజిక బాధ్యత అంటారు సేఫ్సిటీ టీం. నిజమే కదా.