30 వేల మంది విద్యార్థులకు దగ్గరైన ఎడ్యుకేషన్ యాప్ 'ఫ్లింట్'
అహ్మదాబాద్ సంస్థ ఎడ్టెక్ వినూత్న ఉత్పత్తిటీచర్లు, విద్యార్ధులే యూజర్స్40 విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్ధులుటెక్నాలజీ అంటే వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లేనా అని ప్రశ్నటెక్నాలజీకి కొత్త అర్థం ఫ్లింట్
Tuesday May 19, 2015,
3 min Read
సమాచారం అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సెల్ఫోన్లే. ఆవెంటే మనసులో తట్టేది వాట్సాప్. ఇప్పుడు స్టార్టప్ సంస్థలు ఏవైనా ఆలోచించేది ఒకటే... వాట్సాప్ అంతటి సక్సెస్ అవ్వాలి. కస్టమర్ల సంఖ్యలో వాట్సాప్ స్థాయికి చేరుకోవాలి. అంత టైం యూజర్లు వెచ్చించేలా ఆకట్టుకోగలగాలి. విద్యారంగంలో ఫ్లిన్ట్ కూడా అలాంటి ఒక ప్రోడక్టే. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేవిధంగా విద్యార్ధులు, టీచర్ల మధ్య ఒక నిర్వహణా వ్యవస్థలాంటిది ఫ్లిన్ట్.
అహ్మదాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ సంస్థ ఎడ్టెక్. నలుగురు స్నేహితులు, హరీష్ అయర్, హరీన్ దేశాయ్, ధినాల్ రాజ్గురు, తారక్ యాగ్నిక్ దీన్ని ప్రారంభించారు. హరీష్ అయర్కు విద్యారంగంలో 17 ఏళ్ల అపార అనుభవం ఉంది. గతంలో కాన్సెప్ట్స్ ఎడ్యుసర్వ్ ప్రైవేట్ లి. కంపెనీని నిర్వహించారు కూడా. ఈ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నిర్వహించే అంతర్జాతీయ పరీక్షలకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించేందుకు అధీకృతమైనది. హరీన్ దేశాయ్ సినాప్స్ ఇన్ఫోటెక్ వంటి సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్త. దీనికి ముందు ఈయన రిలయన్స్ సంస్థలో ఏడేళ్లపాటు సేవలందించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల నిర్వహణలో ధినాల్ రాజ్గురుకు 20ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఈయన కాన్సెప్ట్స్ ఎడ్యుసర్వ్లో డైరెక్టర్ కూడా. తారక్ యాగ్నిక్ మార్కెటింగ్లో దిట్ట. ఈయన సిటి ఫైనాన్షియల్, బార్క్లేస్ ఫైనాన్షియల్కు సేవలందించారు.
మార్కెటింగ్
ప్రస్తుతం అనేక స్కూల్స్, కాలేజ్లలో టెక్నాలజీ అంటే... పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రదర్శనకే పరిమితమవుతోంది. దీనితోపాటు మహా అయితే యానిమేషన్లు, వీడియోలు చూపించడం అంతే. టీచర్లు కూడా ఈ వీడియోలు చూస్తూ ఉండిపోతున్నారు. అంటే ఒకవైపు మాత్రమే సమాచారం పంచుకునే అవకాశం చిక్కుతోంది. పవర్ పాయింట్ స్లైడ్స్ చూపేటపుడు కూడా... టీచర్లు చెప్పుకుంటూ పోతుంటే, విద్యార్ధులు సైలెంట్గా వింటున్నారంతే. రెండు వైపుల నుంచి ఆ టాపిక్లో జాయిన్ అవగలిగితేనే... దానికి పరమార్ధం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఫ్లిన్ట్ టీం... ఓ యాప్ రూపొందించింది. దీంతో క్లాస్రూమ్లో ఆ టాపిక్పై డిస్కస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
"ఏ విద్యా సంస్థలో అయినా టీచర్లు, ఫ్యాకల్టీపై భారం ఎక్కువగానే ఉంటుంది. రోజువారి కార్యాచరణ, లెక్చర్లు, పరీక్షలు, పోటీ తత్వం... ఇలాంటి వాటన్నిటికీ కలిపి... రోజులో 40 నుంచి 60 నిమిషాలు సమయం మాత్రమే ఉంటుంది. గురువుగా తమ బాధ్యతను నెరవేర్చేందుకు పాఠాలతో పాటే... మరిన్ని వనరులపై వివరాలివ్వాల్సిన అవసరం టీచర్లకు ఉంటుంది. విద్యార్ధులు తమకు అప్పగించిన బాధ్యతలు, నేర్చుకున్నవాటిని ఇతరులతో పంచుకోవడం, తిరిగి గుర్తుచేసుకోవడం చేస్తూ ఉండాలి. టీచర్లు విద్యార్ధుల డౌట్లను ఎప్పుడైనా క్లారిఫై చేయగలగాలి. ఇందుకు తగిన విధానమే ఫ్లిన్ట్" అంటారు తారక్.
ఎలా పనిచేస్తుంది ?
ఏ సంస్థ అయినా ఫ్లింట్ చేతులు కలిపితే... టీచర్లు, స్టూడెంట్లకు ప్రత్యేక కోడ్లు ఇస్తారు. దీనితో లాగిన్ కావచ్చు. టీచర్ ఎవరైనా ఓ టాపిక్ని పోస్ట్ చేస్తే.... స్టూడెంట్స్ దానిపై డిస్కస్ చేయడం కానీ, కామెంట్ చేయడం గానీ చేయచ్చు. ఆ టాపిక్ ఓ లింక్ మాదిరిగానో, వీడియో, డాక్యుమెంట్, ఇమేజ్... ఇలా ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు. యాప్ని దుర్వినియోగం చేయకుండా... కామెంట్ చేసే అవకాశం ఇవ్వాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ టీచర్కి ఉంటుంది. న్యూస్ సంబంధిత లింక్స్ పోస్ట్ చేసినపుడు కామెంట్ అవసరమవుతాయి. అదే సమయంలో ఏదైనా లెస్సన్ సంబంధించినపుడు కామెంట్స్ని బ్లాక్ చేయచ్చు. మొబైల్ లేకపోయినా... పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఈ డిస్కషన్లో భాగస్వాములు కావచ్చు.
ఏమేం ఉంటాయ్ ? ఆదాయం ఎలా ?
ఇతర యాప్స్ మాదిరిగా కాకుండా కంట్రోలింగ్ విభాగమంతా సంస్థ లేదా టీచర్ దగ్గరే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ద్వారా గత టాపిక్లను కూడా చూడొచ్చు. అలాగే ఏదైనా టాపిక్పై ఎంతమంది కామెంట్ చేశారు, ఎవరు పార్టిసిపేట్ చేశారో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంతమందికే పరిమితం చేయాలనే నిబంధన లేకపోవడం విశేషం.
ఫ్లింట్ని ఉపయోగించున్నందుకు గానూ ఒక్కో సంస్థ ఏటా ₹రూ. 15వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే యూజర్ల విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు ఉండవు. ఏటా 5వేలు మాత్రమే ఛార్జ్ చేసేలా మరో మినీమోడల్ యాప్ కూడా లభ్యమవుతుంది. ఇది కోచింగ్ సెంటర్లు, చిన్న తరహా విద్యా సంస్థలకు ఉపయోగంగా ఉంటుంది. అయితే టీచర్లు, స్టూడెంట్లు మాత్రం ఉచితంగానే ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.
ప్రారంభించిన ఏడాదిలోపే ఫ్లింట్ 40విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం విశేషం. అహ్మదాబాద్, బరోడా, సూరత్, ఆనంద్, ముంబై, హైద్రాబాద్, ఉదయ్పూర్లకు చెందిన 30వేల మంది విద్యార్ధులు ఇప్పుడు ఈ యాప్ని ఉపయోగిస్తున్నారు. లక్ష డాలర్ల ఏంజిల్ ఫండింగ్తో సహా... ఇప్పటికే 3లక్షల డాలర్ల పెట్టుబడులు సేకరించిందీ సంస్థ. మరింతగా విస్తరించేందుకు పెట్టుబడుల అన్వేషణలో ఉంది ఫ్లింట్ టీం.