నేత కార్మికుల ఉపాధి భరోసా కోసం మహిళలందరికీ బతుకమ్మ చీరలు

నేత కార్మికుల ఉపాధి భరోసా కోసం మహిళలందరికీ బతుకమ్మ చీరలు

Saturday August 26, 2017,

2 min Read

పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో చీరలు పంపిణీ చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పేద మహిళలందరికీ చీరలందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బతుకమ్మ కానుకగా ఇచ్చే చీరల నాణ్యతను సీఎం పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేశారు.

image


తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగను జరుపుకుంటారు. ఇది రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండుగ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవానే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తారు. కానీ బతుకమ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారి ద్వారానే కొనుగోలు చేస్తున్నది. దీని ద్వారా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబరం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. మరమగ్గాలను ఆధునీకరించే పని వేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. యార్న్, కెమికల్స్ ను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నది. దీని ద్వారా నేత కార్మికులకు లాభం జరుగుతుంది. ఈ చర్యల వల్ల నేత కార్మికులు దుర్భర పరిస్థితి నుంచి బయటపడతారని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో కోటి 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయారుచేయడానికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఈ చీరలు సెప్టెంబర్ రెండో వారంలో జిల్లా కేంద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రేషన్ షాపులకు పంపుతారు. రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో మహిళలందరికీ పంపిణీ చేస్తారు. సదరు మహిళ షాపుకు రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లిగానీ, తండ్రిగానీ వచ్చి తీసుకునిపోవచ్చు. రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.