స్టార్టప్ లకు కొండంత అండగా ఉంటాం- రాజీవ్ బన్సల్
జనానికి ఉపయోగపడే యాప్స్ తయారు చేయండని పిలుపు
Friday November 18, 2016,
3 min Read
చాలా మంది అనుకుంటారు. ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ ప్రజలతో ఆరోగ్యకరమైన చర్చల్లో పాల్గొనరని! కానీ ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది- ఆ భావన పూర్తిగా తప్పు అని! ఢిల్లీలో యువర్ స్టోరీ నిర్వహించిన ఐదో మొబైల్ స్పార్క్స్ సమ్మిట్ కు హాజరైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సల్.. వేదిక మీద డిజిటల్ ఇండియాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను సభ ముందుంచారు. ఆంట్రప్రెన్యూర్లు, మొబైల్ ఈకో సిస్టమ్ ప్రతినిధులతో కిక్కిరిసన సదస్సును ఉద్దేశించి అరగంట పాటు విలువైన ప్రసంగం చేశారు. ఇక భవిష్యత్ అంతా స్మార్ట్ ఫోన్లదే నన్న రాజీవ్ బన్సల్.. ఇండియన్ మొబైల్ ఈకో సిస్టమ్ కు బంగారం లాంటి భవిష్యత్తు ఉందని చెప్పారు.
రాజీవ్ బన్సల్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
1. పెరుగుతున్న భారత డిజిటల్ పరిధి:
ఇండియా స్టేక్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలతో భారత్ దూసుకెళ్తోంది. మొబైల్ రంగానికి చెందిన కొందరు ఆంట్రప్రెన్యూర్లకు మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్ టెక్, మొబైల్ యాప్ డెవలప్ మెంట్, ఆధార్ సంబంధిత విభాగాల్లో అద్భుత అవకాశాలు రాబోతున్నాయి.
2. ఇండియాలో 100 కోట్ల మొబైల్ ఫోన్లు:
భారత్ లో ప్రస్తుతమున్న వంద కోట్ల మొబైల్ ఫోన్లలో 30 శాతం స్మార్ట్ ఫోన్లే. వచ్చే మూడు నాలుగేళ్లలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను స్మార్ట్ ఫోన్లు దాటేస్తాయి. స్మార్ట్ ఫోన్లు 70 శాతం, ఫీచర్ ఫోన్లు 30 శాతం ఉంటాయి.
3. ప్రపంచం కోసం మేకిన్ ఇండియా:
ప్రతీ ఏడాది 15 కోట్ల స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి. అందులో ఎక్కువ శాతం మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో అమ్ముడవుతున్నాయి. మూడేళ్లలో 50 కోట్ల స్మార్ట్ ఫోన్లు తయారు చేసుకోబోతున్నాం. భారత్ తోపాటు ఇతర దేశాల్లోనూ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వ్యాప్తి పెరుగబోతుంది.
4. భవిష్యత్ కరదీపిక మొబైల్:
డెస్క్ టాప్ ల నుంచి ల్యాప్ టాప్ ల దాకా.. ట్యాబ్లెట్ల నుంచి మొబైల్ ఫోన్ల వరకు.. అన్నీ సైజు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో వాటి పవర్, స్పీడ్ , కెపాసిటీ పెరుగుతోంది. ఈ ట్రెండ్ ను బట్టి చూస్తే .. భవిష్యత్తు అంతా మొబైల్ ఫోన్ దే అని చెప్పాలి.
5. ఇంటర్నెట్ వ్యాప్తి:
125 కోట్ల భారతావనిలో 45 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ కు యాక్సెస్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ నంబర్ చిన్నదే కావొచ్చు. కానీ ఏటా 10 కోట్ల మంది ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. మరో మూడు నాలుగేళ్ల వరకు ఇదే ట్రెండ్ ఉంటుంది. గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ యూజర్లు 10 కోట్ల నుంచి 100 కోట్లకు పెరిగారు. ఈ దశాబ్దంలో కూడా ఇంటర్నెట్ వినియోగదారులు గణనీయంగా పెరుగుతారు.
6. భారత్ నెట్:
దేశంలోని 6,60,000 గ్రామాలకు గాను రెండున్నర లక్షల గ్రామాలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ కార్యక్రమం కింద గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేస్తున్నది. 2018 డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత మీకు చేతినిండా పని ఉంటుంది. లక్షలాది కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల కోసం యాప్స్, ఇతర మొబైల్ సేవలు అందించడానికి ఆంట్రప్రెన్యూర్లకు ఇదొక సువర్ణావకాశం.
7. మొబైల్ ఫోన్లలో భారతీయ భాషలు:
మన దేశంలో సగానికి పైగా జనాభా ఇంగ్లిష్ మాట్లాడలేరు. కాబట్టి మొబైల్ ఫోన్ యూజర్లకు ముఖ్యంగా గ్రామీణుల కోసం భారతీయ భాషల్లో మొబైల్ అప్లికేషన్లు అందుబాటులోకి తేవాలి. ప్రపంచంలో
మహా అయితే ఆరేడు భాషలు మాట్లాడే వాళ్లు ఉంటారు.
కానీ ఇండియాలో పరిస్థితి వేరు. మనకు 22 ప్రధాన భాషలున్నాయి. 2017 జూలై 1 నుంచి ఇండియాలో తయారయ్యే ప్రతీ మొబైల్ ఫోన్ లో ఇంగ్లిష్, హిందీతోపాటు ఒక స్థానిక భాషలో ఇన్ పుట్ లాంగ్వేజీ ఉంటుంది. ఫోన్లలో సమాచారాన్ని 22 భాషల్లో చదువుకునే వెసులుబాటు ఉంటుంది.
8. ఆధార్ విప్లవం:
మన దేశంలో 107 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో భారత్ లో 70 కోట్ల నుంచి 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉంటారు. వారిలో 50 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాటిని ఆధార్ తో అనుసంధానం చేస్తే.. ఇక ఆవిష్కర్తలకు ఆకాశమే హద్దు.
9. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్:
బ్యాంకింగ్ సిస్టమ్ అనేది.. మనీ లెండర్ల నుంచి పోస్టు బ్యాంకులకు, ఏటీఎంల నుంచి క్రెడిట్ కార్డులకు, నెట్ బ్యాంకింగ్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ కు విస్తరించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ ద్వారా వీటన్నింటినీ ఏకీకృతం చేయబోతున్నాం. అంటే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లు కూడా మొబైల్ ద్వారా ట్రాన్జాక్షన్స్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఆధారంగా ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
ఆంట్ర ప్రెన్యూర్లతో రాజీవ్ బన్సల్ షేర్ చేసుకున్న సాంకేతిక అంశాలు:
- డిజిటల్ లాకర్:
- ఐఓటీ: వేలకొద్దీ సెన్సార్లు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ తోపాటు మరిన్ని కీలక రంగాలకు ఐఓటీ ద్వారా సేవలు
- డిజిటల్ అక్షరాస్యత:
20 గంటల కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ తో దేశ పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా స్థానిక భాషల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం, నెట్ బ్రౌజింగ్, బేసిక్ నేవిగేషన్ పై శిక్షణ అందిస్తాం.
చివరగా ఆంట్రప్రెన్యూర్లతో ఐటీ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సల్ ముఖాముఖి నిర్వహించారు. విలువైన సమాచారాన్ని షేర్ చేసుకున్నారు.
ఎప్పుడైనా సరే ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు. సైబర్ సెక్యూరిటీ విషయంలో సగటు భారతీయుడి కన్నా కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువగా అప్రమత్తంగా ఉంది- రాజీవ్ బన్సల్