వీళ్లు లక్షల జీతాలు వదులుకుని అమెరికా నుంచి హిమాచల్ ఎందుకు వచ్చారో తెలుసా..?

వీళ్లు లక్షల జీతాలు వదులుకుని అమెరికా నుంచి హిమాచల్ ఎందుకు వచ్చారో తెలుసా..?

Wednesday January 04, 2017,

3 min Read

సంధ్య గుప్త, సరిత్ శర్మ ఇద్దరూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ చేశారు. అమెరికా మిన్నెపొలిస్ లో రీసెర్చ్ సైంటిస్టులుగా పదిహేనేళ్లు చేశారు. నైన్ టు ఫైవ్ వర్క్. జీవితం చప్పగా వుంది. ఇంకేదో చేయాలని మనసు తపన పడుతోంది. నలుగురికీ పనికొచ్చేది ఏదైనా తలపెట్టాలనే సంకల్పం బలంగా నాటుకుంది. సైంటిస్టులుగా పదిహేనేళ్ల కెరీర్ చాలనుకున్నారు. ఇవాళ రేపు ఇంజినీరింగ్ చేసినవాళ్లంతా సోషల్ సర్వీస్ నుంచి పూర్తిగా డిటాచ్ అయ్యారు. వాళ్లు, వాళ్ల కెరీర్, సంపాదన ఇదే పరమార్ధంగా మారింది. అందుకే ఆ స్వార్ధపూరిత జీవితం నుంచి బయటపడాలని భావించారు. సెకండ్ థాట్ లేకుండా ఉద్యోగాలకు గుడ్ బై కొట్టి ఇండియాకు వచ్చేశారు.

హిమాలయాల్లోని దక్షిణ భాగంలో ధౌలాధర్ ఏరియాలో పాలంపూర్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో బాహ్యప్రపంచానికి ఎడంగా ఉంటుంది కాండ్ బరీ అనే కుగ్రామం. అంతకు ముందు ఈ ఊరి గురించే తెలియదు వారికి. అమెరికాలో చల్లటి వాతావరణానికి అలవాటు పడటంతో ఆ గ్రామమైతేనే బెటర్ అని నిర్ణయించుకున్నారు. అక్కడే సెటిల్ అయిపోవాలని పెట్టేబేడా సర్దుకుని వచ్చారు.

image


సంధ్య, సరిత్ శర్మకు ఐదేళ్ల కూతురుంది. ఆమెను స్కూల్లో జాయిన్ చేయాలి. చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎక్కడా బడి నచ్చలేదు. ఎక్కడ ఇంక్వైరీ చేసినా ఒకరకమైన భయం కనిపించింది. టీచర్ కనిపించగానే పిల్లలు పారిపోతున్నారు. ఏదైనా చెప్తే గజగజ వణికిపోతున్నారు.

వెతకగా వెతకగా చివరికి ఒక ప్రభుత్వ పాఠశాల ఫరవాలేదు అనిపించింది. అక్కడ పిల్లలు కాస్త నయం. ఆడుతూ పాడుతూ ఏదో నేర్చుకుంటున్నారు. అక్కడ జాయిన్ చేయిస్తే బెటర్ అనుకున్నారు. మొత్తానికి అడ్మిట్ చేయించారు. అమ్మానాన్న ఇద్దరూ మధ్యాహ్నం టైంలో స్కూల్ కి వెళ్లడం.. అమ్మాయి ఎలా చదువుతోందని గమనిచండం లాంటివి చేసేవాళ్లు.

ఒక నాలుగేళ్లు గడిచాయి. అప్పడర్ధమైంది.. ప్రైమరీ, హైస్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలావుందనేది. ముఖ్యంగా సైన్స్, మేథ్స్ నేర్చుకునే విషయంలో పిల్లలు ఎంత పూర్ గా వున్నారో బోధపడింది. అప్పడే నిశ్చయించుకున్నారు.. ఈ రెండు సబ్జెక్టుల పట్ల విద్యార్ధుల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని. సైన్స్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మేథ్స్ ఫార్ములేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలను తమదైన శైలిలో పిల్లలకు విడమరిచి చెప్పాలని భావించారు.

రెండు సబ్జెక్టులు బేసిక్స్ నుంచి మొదలుపెడితే గానీ పిల్లలకు బోధపడదని భావించారు. గాలి, నీరు, శబ్దం, కూడికలు, తీసివేతలు.. ఇలాంటివన్నీ ప్రయోగాత్మకంగా విడమరిచి చెప్పడం మొదలుపెట్టారు. ప్రతీ పాఠశాలకు వెళ్లడం.. తమదైన స్టయిల్లో బోధన చేయడం. అలా 2014 నుంచి ఆవిష్కార్ పేరుతో చదువులో వెనుకబడి ఉన్న పిల్లలకు మేథ్స్, సైన్స్ ప్రాక్టికల్ గా చెప్తున్నారు.

image


ప్రస్తుతానికి ఆవిష్కార్-30 పాఠశాలల్లో కలిపి సుమారు వెయ్యి మంది విద్యార్ధులతో సైన్స్ మాథ్స్ ఫెయిర్స్, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తోంది. రెసిడెన్షియల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 13 రెసిడెన్షియల్ క్యాంపుల్లో సుమారు 270 కార్యక్రమాల దాకా చేపట్టారు. ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తుంటారు. ప్రత్యామ్నాయ బోధనా పద్దతులను పెంపొందించడానికి ఇవి ఎంతో దోహదపడతాయనేది వారి కాన్సెప్ట్.

దళిత అమ్మాయిల విద్యాప్రమాణాలు మెరుగు పరిచే నారీ గుంజన్ అనే పాట్నా బేస్డ్ ఆర్గనైజేషన్ తో కూడా టై అప్ అయ్యారు. వాళ్లతో కలిసి ఎన్నో రెసిడెన్షియల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు. అందులో అమ్మాయిలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చాలామంది విద్యార్ధినిలు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి బడి మానేస్తున్నారు. అలాంటి వాళ్లకు దైనందిన జీవితంలో గణితం, సైన్స్ ఉపయోగపడేలా తర్ఫీదునిస్తున్నారు.

బేసిక్ కాన్సెప్ట్ తర్వాత ఫోటోటైప్ కాన్సెప్టులోకి మారారు. బేసిగ్గా దంపతులిద్దరూ ఇంజినీర్లు కాబట్టి.. పిల్లలకు ఆ తరహాలో విద్యా బోధన చేస్తున్నారు. అంటే న్యూస్ పేపర్ తో కుర్చీ చేయడం.. ఐస్ క్రీం పుల్లలతో బ్రిడ్జ్ తయారు చేయడం లాంటివి నేర్పిస్తున్నారు. ఇలాంటి అసెస్మెంట్ రియలిస్టిక్ గా మారుస్తుందనేది వాళ్ల నమ్మకం.

image


ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఒక క్లాస్ జరుగుతోంది. మధ్యలో ఒకమ్మాయి లేచి వాష్ రూంకి వెళ్లింది. టీచర్ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లింది. అడగకుండా ఎందుకు వెళ్లావని టీచర్ కోప్పడింది. దానికి ఆ అమ్మాయి.. మీరు ఇంట్రస్టింగ్ లెసన్ చెప్తుంటే మధ్యలో డిస్ట్రబ్ చేయడం ఎందుకని వాష్ రూంకి వెళ్లివచ్చాను టీచర్ అని చెప్పింది. ఆ మాటలకు టీచర్ అబ్బురపడింది. ఇదీ ఆవిష్కార్ సాధించిన ప్రగతి.

నారీ గుంజన్ తో పాటు కర్మ్ మార్గ్, క్రాంతి, పుష్ప్ నికేతన్, సాంత్వన అనే ఆర్గనైజేషన్లతో కలిసి పనిచేస్తోంది ఆవిష్కార్.

ఫ్యూచర్ ప్లాన్స్

వచ్చే ఏడాదికి 12వ తరగతి వరకు పలు రకాల కాన్సెప్టులను తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలతో కలిసి మరిన్ని స్టూడెంట్స్, టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు.

ఆ తర్వాత సొంతంగా ఒక క్యాంపస్ పెట్టాలని, పెద్ద టీం ఫామ్ చేసి దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక క్యాంపులు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.