ఆరోగ్య రంగంలో అందనంత ఎత్తుకు చేరిన ధీరవనితలు

ఆరోగ్య రంగంలో అందనంత ఎత్తుకు చేరిన ధీరవనితలు

Wednesday July 22, 2015,

3 min Read

ఫార్మా రంగంలో వీళ్లంతా తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ వంటి మ్యాగ్జైన్లు వీళ్ల పోరాట పటిమ, కార్యదక్షణ, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. రంగం ఏదైనా.. తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్లలో కిరణ్ మజుందార్ షా, ప్రీతారెడ్డి, స్వాతి పిరమల్, వినితా గుప్త ఉన్నారు. అత్యంత ప్రభావశీలురైన మహిళలుగా కూడా వీళ్లను ప్రపంచం కీర్తించింది. 
image


కిరణ్ మజుందార్ షా : బయోటెక్ లిమిటెడ్ సిఎండి

కిరణ్ మజుందార్ షా సక్సెస్‌ఫుల్ టెక్నోక్రాట్. టైం మ్యాగజైన్ వంద మంది ప్రభావిత వ్యక్తుల్లో స్థానం దక్కించుకున్న గొప్ప మహిళ. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన 2012 టాప్ 10 ఫవర్‌ఫుల్ ఉమెన్ సీఈఓల్లో కిరణ్ మజుందార్ ఒకరిగా నిలిచారు. బయోటెక్నాలజీ రంగంలో షా ఓ సంచలనం.

కర్ణాటక విజన్ గ్రూప్ ఆన్ బయోటెక్నాలజీకి ముజుందార్ షా ఛైర్మన్. అలాగే ఐర్లాండ్‌లోని బోర్డ్ ఆఫ్ సైన్స్ ఫౌండేషన్‌ కూడా ఈమె ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అంతేకాదు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ అడ్వైజరీ కౌన్సిల్‌లోనూ షా సేవలందించారు. ఇండియాలో బయోటెక్నాలజీ అభివృద్ధి వెనుక మజుందార్ షా పాత్ర ఎంతో ఉంది.

మజుందార్ షాను ఎన్నో అవార్డుల వరించాయి. నిక్కీ ఆసియా ప్రైజ్, 2009లో రీజనల్ గ్రోత్ అవార్డ్, 2009 డైనమిక్ ఆంట్రప్రెన్యూర్, ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లతో పాటు 1989లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అవార్డులను షా సొంతం చేసుకున్నారు.


image


డాక్టర్ ప్రీతా రెడ్డి : అపోలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్

డాక్టర్ ప్రీతా రెడ్డికి ఆమె తండ్రే ఆదర్శం. 1989లోనే ప్రీతా ఆపోలో హాస్పిటల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత గ్రూఫ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఆమె ఒకరయ్యారు. ఇప్పుడు దేశంలోనే పేరు పొందిన చైన్ హాస్పిటల్స్‌లో అపోలో ఒకటిగా మారింది. కేవలం నగరల్లోనే కాదు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ వైద్య సేవలందిస్తోంది. 1983 నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మందికిపైగా పేషెంట్లు అపోలో నుంచి సంతృప్తికర వైద్య సేవలు పొందారు.

అపోలో గ్రూపులో ప్రీతా రెడ్డి కీలక ఆపరేషన్స్ చూసుకుంటారు. అలాగే వైద్యులతోనూ ఆమెకు మంచి సంబంధాలున్నాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల గురించి ప్రీతా నిత్యం ప్లాన్ చేస్తుంటారు

నేషనల్ క్వాలిటీ కౌన్సిల్‌లోనూ ఆమె ఫౌండింగ్ మెంబర్. ఈ కౌన్సిల్ ఇండియాలోని హాస్పిటల్స్‌లో కనీస సౌకర్యాలు ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన నియమ నిబంధనలు, విధివిధానాలను ఇస్తుంది. విప్రో బిజినెస్ లీడర్‌షిప్ కౌన్సిల్‌లోనూ ప్రీతా రెడ్డి మెంబర్‌గా ఉన్నారు.

వ్యాపారాల్లోనే కాదు సామాజిక సేవలోనూ ఆమె ముందున్నారు. సేవ్ చైల్డ్ హార్ట్ పేరుతో పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. సేవ్ చైల్డ్ హార్ట్ కార్యక్రమంలో భాగంగా సుమారు 50వేల మంది పిల్లలకు అపోలో ద్వారా ఆపరేషన్లను నిర్వహించారు.

ప్రీతారెడ్డి చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. అలాగే మద్రాస్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందారు. ఈమెకు ఫైన్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉంది.

image


డాక్టర్ స్వాతి : పిరమిల్ ఎంటర్‌ప్రైసెస్

స్వాతి పిరమిల్ ఇండియన్ ఫేమస్ డాక్టర్, ఇండస్ట్రియలిస్ట్. అత్యంత ప్రభావశీలురు, శక్తివంతమైన 25 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న గొప్ప మహిళ డాక్టర్ స్వాతి. ఈమెను పద్మశ్రీ కూడా వరించింది. ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు సహాయం అందిస్తున్నారు. చౌక ధరలలో కొత్త ఔషధాలను కనుగొని లక్షలాది మంది పేద ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నారు. పిరమిల్ సంస్థకు స్వాతి కో డైరెక్టర్. పిరమిల్ కంపెనీ పేద రోగులకు చౌక ధరల్లో మందులు అందిస్తోంది. 1956 మార్చి 28న స్వాతి జన్మించారు. 1980లో ముంబై యూనివర్శిటీ నుంచి ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

కాన్సర్, షుగర్ వ్యాధులపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం ఇప్పటి వరకు 200 పేటెంట్స్ కలిగి ఉంది. 14 కొత్త ఔషధాలు పరీక్ష దశలో ఉన్నాయి. పిరమిల్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో తయారీ కర్మాగారాలున్నాయి. గత రెండు దశాబ్దాలుగా స్వాతి డయాబెటిస్, కీళ్ల జబ్బులు, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నారు.

డాక్టర్ స్వాతిని తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు వరించాయి. మే 2012న ఆమె పద్మశ్రీ ఆవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాజీవ్ గాంధీ అవార్డ్ ఆఫ్ ఔట్ స్టాండింగ్ విమెన్ అచీవర్ అవార్డ్ కూడా స్వాతి సొంతం చేసుకున్నారు. హార్వర్డ్ బోర్డ్ ఆఫ్ ఓవర్‌సీస్‌లో స్వాతి మెంబర్‌ కూడా కావడం విశేషం.

image


వినిత గుప్త : లుపిన్ ఫార్మిసూటికల్స్ సీఈఓ

ముంబై యూనివర్శిటీ నుంచి వినిత గుప్త ఫార్మసీ పూర్తి చేశారు. ఆ తర్వాత జేఎల్ కెలాగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. యూఎస్, యూరప్‌లలో ల్యుపిన్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు వినిత చూసుకుంటారు. వినిత ఆధ్వర్యంలో ల్యుపిన్.. గ్లోబల్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగింది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో ల్యుపిన్ బలపడింది. ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గానూ ఎదగడంలో వినిత గుప్త పాత్ర కీలకం. 


మహిళలు తక్కువగా కాలుమోపే ఫార్మా రంగంలో.. ఇలాంటి వాళ్లు అడుగుపెట్టి ఓ ట్రెండ్ సృష్టించారు. తాము అనుకోవాలే కానీ... ఎలాంటి రంగంలోనైనా రాణించడం తమకు సాధ్యమని నిరూపించారు. ఎంతో మంది ఔత్సాహిక మహిళలు.. ఇలాంటి వినూత్నమైన, విభిన్నమైన వాటిలో వచ్చి తమ సత్తా చాటి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని యువర్ స్టోరీ కోరుకుంటోంది.