రూ. 4,500కే కంప్యూటర్

కంప్యూటర్ నాలెడ్జ్ పెంచడమే రీన్యూ ప్రధాన లక్ష్యంఅతితక్కువ ధరలో సిస్టం అందిస్తున్న ముకుంద్ బృందం

రూ. 4,500కే కంప్యూటర్

Friday July 24, 2015,

3 min Read

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. చిన్నప్పటి నుంచీ వింటున్నాం ఈమాట. మరి దేశంలో కంప్యూటర్ పరిజ్ఞానం గురించి మాట్లాడాల్సి వస్తే? దానికి సమాధానం వెతికే ముందు సాధారణ అక్షరాస్యత గురించి ఏం మాట్లాడాలి? కంప్యూటర్ సంగతి పక్కన పెడితే- లిటరసీ విషయంలోనే సాధించాల్సింది ఎంతో ఉంది! మరి అలాంటప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం గురించి మాట్లాడటం ఎంతవరకూ సమంజసం?

కంప్యూటర్ కంపల్సరీ

image


కానీ తప్పదు. కంప్యూటర్ మనిషి దైనందిన వ్యవహారంలో మమేకమైం ఉంది. దాని అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగం, ఉపయోగాల గురించి అవగాహన కంపల్సరీ. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో అది మరీ అవసరం. ప్రస్తుతం మనదేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇంత పాపులేషన్ ఉన్న దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రజలందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాలు కూడా కంప్యూటర్ నాలెడ్జిని అందిపుచ్చుకోగలిగితే ఫలితాలు ఊహకందవు. ఆ లక్ష్యంతోనే రీన్యూ అనే సంస్థను ప్రారంభించారు ముకుంద్.

ఇలా మొదలైంది

ముకుంద్ సూరత్ ఎన్ఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఐఐఎమ్-కలకత్తా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకున్నారు. ఆ తరువాత కొన్ని పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. కానీ అవేమీ తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి. ఆ చేసేది సమాజంలో ఓ కొత్త మార్పుకు నాంది కావాలి. ఈ ఆలోచనల్లోంచి ప్రారంభమైంది “రీన్యూ”. 2009లో దాన్ని ప్రారంభించారు. సంస్థ ప్రధాన లక్ష్యం కంప్యూటర్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.

పాతవి సేకరించి కొత్తగా

కంప్యూటర్ నాలెడ్జ్ సంగతి పక్కన పెడితే- అసలు కంప్యూటర్ కొనడం అనేది అట్టడుగు వర్గాలకు తలకు మించిన భారం. మరి ఏం చేయాలి? వాళ్లకు అందుబాటులో ఉండేద ధర కల్పించాలంటే మార్గమేంటి? దీనికి పరిష్కారం వెతికారు ముకుంద్. పెద్ద సంస్థలు, ఎమ్ఎన్సీలు, కార్పొరేట్ కంపెనీల నుంచి పాత కంప్యూటర్లను సేకరించారు. అలా తీసుకున్న వాటికి అవసరమైన రిపేర్లు చేస్తారు. వాటిని తక్కువ ధరకు అమ్ముతారు. ఇప్పటికే “రీన్యూ” ఎన్నో కంప్యూటర్లను నాణ్యతలో రాజీపడకుండా చిరు వ్యాపారులకు, విద్యార్థులకు, ఎన్జీవోలకు అందించింది.

ప్రతీ ఇల్లే లక్ష్యం

డిజిటల్ రంగంలో ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. అది రీన్యూ ద్వారానే జరగాలి. అదే మా లక్ష్యం అంటారు ముకుంద్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ లో కంప్యూటర్లు 9.5 శాతం మందికి మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతీ పది ఇళ్లకు ఒక్కటి మాత్రమే ఉందన్నమాట. దీన్ని ఓ సవాలుగా తీసుకున్నారు ముకుంద్.

తాహతు లేనివారే ప్రియారిటీ

ఇప్పటికీ కంప్యూటర్ అంటే అదో విలాస వస్తువు అనే భావన చాలామందిలో ఉంది. మనదేశంలో కంప్యూటర్ కొనడం అంటే సాధారణ ప్రజలకు ఒక రకంగా తాహతుకు మించిన ఖర్చే అనుకోవచ్చు. ఇలాంటి వారికోసమే శ్రమిస్తోంది “రీన్యూ”. మార్కెట్లో వేలాది రూపాయలు పెట్టి కొనలేనివారి కోసమే “రీన్యూ” ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. పాఠశాలలు, చిన్న పరిశ్రమలు, విద్యార్థులు-తల్లిదండ్రులు, ఎన్జీఓలకు కంప్యూటర్లు అందివ్వడమే ప్రియారిటీగా పెట్టుకుంది. కంప్యూటర్ విద్యకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేని చిన్నచిన్న విద్యా సంస్థలకు మంచి సిస్టమ్స్ అందిస్తుంది. డెస్క్ టాప్ ల్యాప్ టాప్, సర్వర్లను ఎన్నో ఎన్జీవోలకు తక్కువ ధరకే అందించింది రీన్యూ.

కంప్యూటర్ @ రూ. 4,500

దాదాపు దేశంలోని 67 శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ కార్యకలాపాలన్నింటినీ కంప్యూటరీకరించాయి. ఉద్యోగులు, జీతాలు, బిల్లులు, స్టాక్, ట్యాక్స్ వ్యవహారాలు ఇలా అన్నింటినీ ఆన్ లైన్ కి మార్చేశాయి. ఇలాంటి ఎన్నో కంపెనీలకు “రీన్యూ” తమ కంప్యూటర్లను అందజేసింది. వాళ్లందరికీ అత్యాధునిక కంప్యూటర్లు, బ్రాండ్ న్యూ సిస్టమ్స్ అవసరం లేదు. అందువల్లే “రీన్యూ” ఎమ్మెన్సీల నుంచి పాత కంప్యూటర్లను సేకరించి, వాటిని మరమ్మతులు చేసి తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అలాంటి ఒక కంప్యూటర్ ధర కేవలం రూ.4500/-బేసిక్ రేట్ అక్కడి నుంచి మొదలవుతుంది.

image


గుడ్ లక్ ముకుంద్

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న “రీన్యూ” బృందంలో ప్రస్తుతం 8 మంది సభ్యులున్నారు. వీరిలో ఏడుగురు టెక్నీషియన్లు కాగా ఒకరు మార్కెటింగ్, ఇతర వ్యవహారాలు చూస్తారు. త్వరలోనే సేవలను ఇతర నగరాలకు కూడా విస్తరించడానికి ముకుంద్ ప్రణాళికలు రచిస్తున్నారు. వీరి లక్ష్యం అనుకున్నట్టుగా సాగితే త్వరలోనే భారత్ కూడా 100 శాతం కంప్యూటర్ వినియోగం ఉన్న దేశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.