హౌస్ షిఫ్టింగ్ను సులువు చేసిన లాట్ ట్రక్స్
మహా నగరాల్లో ఇల్లు మారాలంటే చాలా కష్టం.. ఖరీదైన సామాన్లకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా, తక్కువ వ్యయంతో కొత్త చోటికి తరలించడం అంత ఈజీ కాదు. కానీ బెంగళూరులో మాత్రం సామాను తరలింపు చాలా ఈజీగా మారిపోయింది. అందుకు కారణం లాట్ ట్రక్స్. తక్కువ ఖర్చుతో.. సురక్షితంగా సామానును తరలిస్తుందీ కంపెనీ..
Monday May 04, 2015,
2 min Read
ఇండియాలో ట్రాన్స్పోర్ట్ డెలివరీ మార్కెట్ చాలా పెద్దది. కానీ ట్రక్ డ్రైవర్లు, కస్టమర్లకు మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది. తమ చుట్టూ ఉన్న మార్కెట్ను క్యాష్ చేసుకోవడంలో ట్రక్ ఓనర్లు విఫలమవుతుంటే... తమకు అనుకూలంగా, విశ్వసనీయంగా ఉండే డ్రైవర్లు దొరక్క కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. పలు స్టార్టప్ కంపెనీలు పోర్టర్, బ్లాహోర్న్, షిప్పర్ ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే షిఫ్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో భరత్ నారాయణ్, గౌతమ్, రామ్ నారాయణ్ అనే ముగ్గురు యువకులు లాట్రక్స్.కామ్ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీని బెంగళూరులో ప్రారంభించారు.
అరగంటలో మీ ముందుకు
లాట్ ట్రక్స్ అనేది వెబ్సైట్ ఆధారంగా నడిచే ఓ సంస్థ. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు కస్టమర్లు కోరుకున్న చోటికి ట్రక్స్ను క్షణాల్లో పంపుతుంది. స్టార్టప్ టెక్నాలజీతో నమ్మదగిన డ్రైవర్లు కస్టమర్ల సరుకులను సురక్షితంగా గమ్యానికి చేసుకుందీ సంస్థ. ఎవరైనా ఇల్లు మారినా, కార్యాలయాలు ఖాళీ చేసినా... ఇంకెలాంటి సందర్భమైనా.. గృహోపకరణాలు, ఇతర సామగ్రిని తరలించేందుకు సొంతంగా భారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆ వాహన గమ్యస్థానం చేరేవరకు అనుక్షణం సమాచారం తెలుసుకునేలా ఆ వాహనాలను జీపీఆర్ఎస్ అనుసంధానం చేశారు.
"కస్టమర్ల సరుకులను తరలించేందుకు సరైన వాహనాలు లేకపోవడం, స్థిరమైన ధర నిర్ణయించకపోవడం, కస్టమర్-డ్రైవర్ మధ్య సమాచారలోపం, బిల్లింగ్ సమస్యలు వంటి వాటిని మేం గ్రహించాం. టెక్నాలజీ ద్వారా ఈ సమస్యలను అధిగమించొచ్చని మేం భావించాం. కాలం గడుస్తున్నకొద్దీ సామనుల డెలివరీలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకోగలిగాం. అందుకే లాట్ (లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్) పేరుతో ప్రయాణాన్ని మొదలుపెట్టాం" అని లాట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన భరత్ చెప్పారు.
యాప్ ద్వారా బుకింగ్, ప్రాసెసింగ్ మధ్య సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించింది లాట్. ఆర్డర్ బుక్ అయిన 30 నిమిషాల్లో ప్రాసెస్ను ప్రారంభించడం వీరి కృషికి నిదర్శనం. ఈ గ్యాప్ను 10 నిమిషాలకు తగ్గంచాలన్నదే ఈ ముగ్గురి యువకుల తపన. డబ్బుల విషయంలో ట్రక్స్ ఓనర్లు, కస్టమర్లకు మధ్య వివాదాలే తలెత్తేవి. లాట్ మాత్రం గమ్యస్థానం దూరం ఆధారంగా సరుకు బరువు (కిలో చొప్పున) ఆధారంగా ధరను నిర్ణయించింది.
సుశిక్షిత డ్రైవర్లు
ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. వేర్వేరు భాషలు, సంప్రదాయాలు కలిగిన ప్రజలతో కమ్యునికేషన్ ఎవరికైనా కష్టమే. ఈ నేపధ్యంలో కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మసలుకునేందుకు తమ డ్రైవర్లకు కమ్యునికేషన్లో శిక్షణ కూడా ఇస్తున్నది లాట్ సంస్థ. ప్రస్తుతానికైతే సామగ్రిని గమ్యానికి చేర్చిన తర్వాత నగదు మొత్తాన్నే తీసుకుంటున్నది. త్వరలోనే ఆన్లైన్ పేమెంట్ను కూడా కల్పించనుంది.
500కిపైగా ట్రక్కులు
లాట్ మినీ (టాటా ఏస్-800 కిలోల సామర్థ్యం), లాట్ మ్యాక్స్ (టాటా 407-205 టన్నుల సామర్థం)పేరిట సుమారు 500కు పైగా ట్రక్కులున్నాయి లాట్ సంస్థకు. సంస్థను ప్రారంభించిన కొద్దికాలంలోనే రెండువేల మందికిపైగా కస్టమర్లకు సామాన్ల తరలింపులో సహకరించింది. స్మార్ట్ ఆఫీక్స్, ఆఫీస్మార్ట్.ఇన్, లాన్సాల్ ప్రైవేట్ లిమిటెడ్, తత్వా ఆర్గానిక్స్ వంటి పెద్ద సంస్థలు లాట్ కస్టమర్లే. ఇతర ప్రధాన రిటైలర్లు, ఉత్పత్తిదారులతో కూడా లాట్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికైతే బెంగళూరులోనే ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహస్తున్నది. భవిష్యత్లో మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశాలున్నాయని భరత్ చెప్తున్నారు.
"మా సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి మేం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. బెంగళూరులో షిఫ్టింగ్ ప్రక్రియను స్మూత్గా మార్చేశాం. బెంగళూరులో అనుకున్నది సాధించిన తర్వాత ఇతర నగరాలపై దృష్టిపెడతాం" అని భరత్ చెప్పారు.