దివాలా తీసిన వ్యక్తే ఇప్పుడు ధైర్యం చెబుతున్నాడు..

దివాలా తీసిన వ్యక్తే ఇప్పుడు ధైర్యం చెబుతున్నాడు..

Thursday April 14, 2016,

4 min Read


మీకో విషయం తెలుసా..? భూటాన్ పేద దేశం.. చిన్నదేశం కూడా. అయినా… ప్రపంచంలో దానికంటే సంతోషకరమైన కంట్రీ మరోటి లేదట. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సూచీలో తొలిస్థానం ఆ దేశానిదే. అంటే డబ్బుకీ, సంతోషానికి సంబంధం లేదనే కదా దానర్థం. అందుకే అలాంటి సంతోషాన్ని పంచే పనిలో బిజీగా ఉన్నారు అవిస్, వాణి అనే దంపతులు.

అప్పుడు అవీస్ వయసు 19, వాణి వయసు 20. ఎక్కడో పరిచయమయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. అవీస్ బెంగళూరులో బిజినెస్ జర్నలిస్టుగా పనిచేశారు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో 1996లో చెన్నై వెళ్లారు. అక్కడే అవీస్, వాణి వివాహం చేసుకున్నారు. పీఆర్ కంపెనీ స్థాపించి ఆరేళ్లపాటు విజయవంతంగా నడిపారు. వర్క్ షాపులు నిర్వహించారు. సీఈఓలతో వరుస భేటీలు. బడా కంపెనీల పీఆర్, బ్రాండింగ్ బాధ్యతలు. అనతి కాలంలోనే విజయవంతమయ్యారు. కంపెనీని అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలనుకున్నారు. హాంకాంగ్ కు చెందిన ఒక పెద్ద కంపెనీ పీఆర్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. అందులోంచి 60 శాతం ఆదాయం కంపెనీకి వచ్చేది.

ఒకసారి రండి అని హాంకాంగ్ కంపెనీ పిలిచింది. అక్కడికి వెళ్లారు. సేవలకు మెచ్చి పిలిచారనుకున్నారు. ఎందుకంటే వారి నుంచి ఒక్క కంప్లైంట్ కూడా లేదు కాబట్టి. తీరా వెళ్తే విషయం అది కాదు. కంపెనీని తమకు అమ్మేయాలని… కొంత డబ్బుతో పాటు, హాంకాంగ్ లో ఉద్యోగం ఇస్తామన్నారు. వారి ఆఫర్ చాలా అవమానకరమనిపించింది. పైగా చాలా తక్కువ మొత్తం ఇస్తామన్నారు. ఒక భారతీయ కంపెనీకి అదే ఎక్కువన్నారు. బాధనిపించింది. తొక్కలో హాంకాంగ్ కంపెనీ అనుకుని చెన్నై ఫ్లయిట్ ఎక్కేశాడు. హాంకాంగ్ కంపెనీకి కోపం వచ్చింది. అవీస్ కు పీఆర్ బిజినెస్ ఇవ్వడం మానేసింది. ఫలితంగా ఉద్యోగుల జీతాలు, ఖర్చులు పెరిగాయి.

image


2004 వచ్చేసరికి పరిస్థితి దిగజారింది. కంపెనీని మూసేయాలనుకున్నారు. కేవలం రెప్యుటేషన్ వర్క్ కే పరిమితం కావాలనుకున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నారు. అయితే అప్పటికే బాగా ఆలస్యమయ్యింది. కంపెనీని మూసేద్దామనుకున్నప్పుడు 40 మంది ఉద్యోగులు.. ఆరు ఆఫీసులు.. 38 మంది క్లైంట్స్... అన్నీ పీఆర్ సంబంధిత పనులే ఉండేవి. ఒక్కసారి కంపెనీ మూసేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం కాలేదు. అయినా తప్పలేదు. బెంగళూరు, చెన్నైలో రెండు ఆఫీసులు మాత్రం ఉంచుకున్నారు. మొత్తం 40 మంది ఉద్యోగులూ జాబ్స్ మానేయడంతో.. ఉన్న ఆఫీసులకు కొత్తవారిని నియమించుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత పూచీకత్తుతో తెలిసినవారి దగ్గర అప్పులు చేయాశారు. ఎందుకంటే బ్యాంకుల నుంచి అప్పు పుట్టలేదు.

2007లోకి ఎంటరయ్యేసరికి పరిస్థితి మరింతగా దిగజారింది. అప్పులు పేరుకుపోయాయి. అప్పటికే సంపాదించినదంతా ఊడ్చుకుపోయింది. పూట గడవడమే కష్టంగా మారింది. ఉద్యోగులకు జీతాలిన్వడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో- ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు వెళ్లాల్సివచ్చింది. ఒకరి అప్పు తీర్చడానికి మరొకరి దగ్గర అప్పు చేయాల్సివచ్చింది.

2008 నాటికి చేతిలో మిగిలింది 2 వేల రూపాయలు మాత్రమే. అప్పు మాత్రం ఐదు కోట్లు. అప్పుడే అబ్బాయి హైస్కూల్ చదువు పూర్తయ్యింది. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఆశ అడియాశ అయింది. కూతురికి 13 ఏళ్లు వచ్చాయి. జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిన ఫీలింగ్.

image


ఎక్కడ నుంచి మొదలుపెట్టారో.. ఎక్కడ ఆగిపోయారో తెలియలేదు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన. మానసికంగా కుంగిపోయి- అవీస్ బరువు 20 కిలోలు పెరిగాడు. సిగరెట్లకు బానిసయ్యారు. డయాబెటిక్ అని తేలింది. 40 ఏళ్లుకూడా బతకడని డాక్టర్ చెప్పాడు. బాకీలు తీర్చాలంటూ కేసులు వేశారు. కూతుర్ని కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారు. మోసగాడు అన్నారు. ఆ మాటలన్నీ విని బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకుని అద్దంలో చూసుకుని ఏడ్చేవాడు అవీస్.

కష్టాల కడలి నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. జోష్యులను కూడా సంప్రదించారు. అదృష్టాన్ని ప్రసాదించాలంటూ మొక్కని దేవుడు లేడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని కొందరు… ఉద్యోగం చేయమని మరికొందరు సలహాలిచ్చారు. అన్నీ ప్రయత్నించి చూశాడు. ఏడాదిపాటు ఉద్యోగం కూడా చేశాడు. ఎన్నో కేసులు పెండింగులో ఉన్నాయి. తీర్చాల్సిన అప్పులు మెడమీద ఉన్నాయి. ఉద్యోగంతో వచ్చే జీతం ఏమూలకు సరిపోతంది..? ఇదే సమయంలో వాణి తండ్రికి కేన్సర్ అని తేలింది.

అన్ని కష్టాల్లోనూ మౌనమే అవిస్ మంత్రమయ్యింది. వివేకానందుని పుస్తకాలు ముందేసుకున్నాడు. ఒకచోట ఒకమాట నచ్చింది. 

"నిద్రలోనూ, గుహలోనూ ఉండే ప్రతి వ్యక్తీ మౌనంగా, ప్రశాంతంగా ఉంటాడు. అలా కాకుండా- చుట్టూ గందరగోళం ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నవాడే అసలైన మనిషి.. అప్పుడే అతని జీవితానికి అర్థం పరమార్థం దొరుకుతాయి"

ఈ సూక్తులు బాగా నచ్చాయి. స్ఫూర్తినిచ్చాయి కూడా.

image


అవీస్ కు జీవితంపై నమ్మకం కుదిరింది. పొగతాగడం మానేశాడు. షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది. 20 కిలోలు తగ్గాడు. మనసు కుదట పడింది. ఆలోచనలు చురుగ్గా కదులుతున్నాయి. అప్పటికే సర్వం కోల్పోయాడు. ఇక పోగొట్టుకోడానికి ఏమీ లేదు. ముందు ఆనందంగా ఉండాలి. ఆ తర్వాతే ఏదైనా అనుకున్నారు. భార్యా పిల్లలకు అదే చెప్పాడు.

ఏ డబ్బుతో అయితే లగ్జరీ లైఫ్ అనుభవించారో- అదే లగ్జరీ లైఫ్ ను డబ్బు లేకున్నా పొందాలనకున్నారు. సంతోషం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పైసల్లేకుంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. జబ్బు చేస్తే అయ్యో పాపం అంటారు. అదే డబ్బు లేకుంటే డుబ్బుకు కూడా కొరగారు. ఆ విషయాన్ని తెలుసుకోడానికి ఇద్దరికీ ఎక్కువ టైం పట్టలేదు.

వ్యక్తిగత అనుభవాలతో ఫాల్ లైక్ ఎ రోజ్ పెటల్ అనే పుస్తకం రాశారు అవీస్. డబ్బులేకపోయినా ఆనందంగా ఎలా ఉండొచ్చో… వివరించే ప్రయత్నం చేశారు. ఒక కారణం కోసం జీవించడం- డబ్బు సంపాదించడం కన్నా ముఖ్యమైనదని పుస్తకంలో చెప్పాడు. 

image


అవీస్ రాసిన పుస్తకం ఫాల్ లైక్ ఏ రోజ్ పెటల్ పబ్లిష్ అయ్యింది. లక్ ఏంటంటే.. అది హాట్ కేకులా అమ్ముడు పోయింది. తన న్యాయావాది సలహాతో.. సంతోషంగా ఉండటం ఎలా అన్న అంశంపై పలు సంస్థల్లో ఉపన్యాలివ్వడం మొదలుపెట్టారు. మంచి పేరొచ్చింది. ప్రతి లెక్చర్ కు కొంత డబ్బు ముట్టింది. ఆ స్ఫూర్తితోనే “ బ్లిస్ క్యాచర్స్ “పేరుతో ఒక సంస్థను నెలకొల్పారు. సాయం చేయడానికి కొంతమంది స్నేహితులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ధికంగా కోలుకుంటున్నాడు అవిస్. ఉన్నత విద్యకోసం తన కుమారుడిని విదేశాలకు పంపాడు. బ్లిస్ క్యాచర్స్ సంస్థ బాగా నడుస్తోంది. అవీస్ దాదాపు 179 మంది దగ్గర అప్పులు చేశారు. ఒక్కొక్కరి అప్పునూ తీరుస్తూ వస్తున్నాడు.

ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి సాధించే సత్తా ఉంటుంది. అది బ్లూటూత్ లాంటిది. దాన్ని యాక్టివేట్ చేస్తేనే ఉపయోగం. వాస్తవాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలి. అప్పుడే విజయం సొంతమవుతుందంటున్నారు అవీస్. జీవిత భాగస్వామి సహకారం ఉంటే ఎన్ని కష్టాలనైనా దాటొచ్చని, వ్యాపారరంగంలో అడుగుపెట్టేవారు ముందుగా కుటుంబాన్ని ఆ రకంగా సిద్ధం చేయాలని సలహానిస్తున్నారు అవీస్.